ఆ ఊరు
ఆ ఊరు.
"
ఊరు ఎంత మారిపోయింది. శుభ్రమైన తారు రోడ్లు వేశారు. ఒకప్పుడుపూరి పాకలు బంగాళా పెంకుల ఇల్లులు ఉండే వీధులన్నీ అందాలభవంతులతో మెరిసిపోతున్నాయి. ఒకప్పుడు ఆ ఊరికిరావాలంటే గుర్రo బండి లేదంటే ఎడ్ల బండి తప్ప రిక్షా కూడా వచ్చేది కాదు. ప్రతి వేసవి కాలంలో అమ్మ నేను తమ్ముళ్లుఎంతో కష్టపడి ఆ ఊరు వచ్చేవాళ్ళం. వేసవి కాలంలో ఎందుకు వచ్చేవాళ్ళం?
అది మా సొంత ఊరు కాదు. మా అమ్మ పుట్టింటి వారి ఊరు. నేను పుట్టిన ఊరు. నా జన్మభూమి అన్నమాట. సెలవులు ఇవ్వగానే తాతయ్య నుండి ఆహ్వానం అందేది. నేను అమ్మ నా నలుగురు తమ్ముళ్లు అందరం కలిసి హైదరాబాదు నుండి వచ్చేవాళ్ళo. పాపం తాతయ్య ఊర్లో కొద్దిగా వ్యవసాయం చేసుకుంటూ సొంత ఇల్లు , ఆవులు గేదెలతో పాల వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. అంత పెద్ద ఆస్తిపరుడు కూడా కాదు. కానిపాపం ఎనిమిది మంది సంతానం. అందరినీ డిగ్రీ వరకు చదివించి పెళ్లిళ్లు పేరంటాలు చేశాడు. ఇక వేసవికాలం వచ్చిందంటే కూతుళ్లు కొడుకులుమనవల తోటి ఆ ఇల్లు కళకళలాడిపోయేది.
ఆ ఊర్లో ఇంచుమించుగా పెద్ద ఇల్లు మా తాత గారిది అని చెప్పొచ్చు. ఇంటి ముందు పెద్ద పందిరి సంవత్సరం పొడుగునా ఉండేది.గుమ్మ0ల్లోకి అడుగు పెడుతుంటే కుడిపక్క ఎడంపక్క పెద్ద అరుగులు అది దాటితే ఎర్రటి గచ్చువసారా వరుసగా ఆరు గదులు వెనకాల వంట కోసం ప్రత్యేకంగా ఒక ఇల్లు ఆ ఇంటిని ఈ ఇంటిని కలుపుతూ మధ్యలో పెద్ద గచ్చు వసారా అక్కడ కూడా సంవత్సరం పొడుగు నా పందిరి ఉండేది. వేసవికాలంలో కుటుంబ సభ్యులందరం కలిసి ఆ గ చ్చు వసారా మీద భోజనాలు కబుర్లు చెప్పుకుంటూ చేసేవాళ్లం. ఉదయం పూట టిఫిన్లేవీ ఉండేవి కాదు అప్పటి రోజుల్లో. అమ్మమ్మ పిల్లలకి తరవాణి అన్నం పెట్టేది తాతయ్య చూడకుండా . తాతయ్య ఆయుర్వేద వైద్యం కూడా చేసేవాడు. చద్దన్నం పిల్లలకి అరగదని భయం తాతయ్యకి. ఇంత మందికి వంట చేసి పెట్టేది అమ్మమ్మ. ఎవరిని వేలు పెట్టనిచ్చేది కాదు. పాపం ఆడపిల్లలు కోడళ్ళు ఏదో కాస్త వేసవికాలంలో విశ్రాంతి తీసుకుంటారని ఆవిడ అభిప్రాయం.
మీ ఇంటికి వెళ్తే మీరే చేసుకోవాలి గా నా చేతులతో నాలుగు రకాలు వండి పెట్టనివ్వండి అంటూ గబగబా వంట చేసేది. ఆవిడకి పది మందిని చూస్తే సంతోషం. ఆ సంతోషంలోనే బలం వచ్చేది.
ఉదయం తరవాణి అన్నం తినేసి ఊర్లోకి బయలుదేరిన పిల్లలం మా పాత స్నేహితులని చెట్టుని పుట్టని కాలువల్ని పశువుల్ని పలకరిస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఊరంతా ఎండలో బలాదూరుగా తిరుగుతూ మొహం ఎర్రగా కందిపోయి కడుపు మాడిపోతుంటే మధ్యాహ్నం 12 గంటలకి ఇంటికి చేరే వాళ్లo.
తాతయ్య చూస్తాడని నకినక్కి ఇంటి వెనకనుంచి లోపలికి వచ్చేవాళ్ళం. రాగానే పిల్లలందరికీ మళ్ళీ స్నానాలు చేయించి వెండి కంచంలో అన్నం కలిపి పెట్టి తినిపించేది పిల్లలందరికీ అమ్మమ్మ.
ఏ ఒక్కరైనా అన్నం తిననని మారం చేస్తే ఇదే ఆఖరి ముద్ద. ఇది అమ్మమ్మ ముద్ద ఇది మీరు తినకపోతే నాకు కోపం వస్తుందంటూ కంచల్లో ఉన్న అన్నం అంతా కబుర్లు చెబుతూ తినిపించేసేది. రోజు అమ్మని ఏడిపించే తమ్ముళ్లు అమ్మమ్మ చెప్పే కబుర్ల మాయలో పడి మొత్తం తినేసేవారు. అసలు అమ్మమ్మ అంటే పిల్లలకి ఎందుకు అంత అభిమానం. ఎందుకంటే పురిటి సమయంలో అమ్మ మత్తులో ఉంటే అమ్మమ్మ ఈ పిల్లల్ని తన పొత్తి ళ్లలోకి తీసుకుని ముందుగా ముద్దాడేది అమ్మమ్మ మాత్రమే. పసి గుడ్డుగా ఉన్నప్పుడు మూడు నాలుగు నెలల వరకు అమ్మమ్మ చేతిలోనే పెరుగుతారు పిల్లలు. తన అపారమైన అనుభవంతో పిల్లల్ని కంటికి రెప్పలా పెంచుతుంది అమ్మమ్మ.
ఒరేయ్ రాజు మీరందరూ మళ్ళీ ఎండలో తిరగకండి నడవలో పడుకోండి లేదంటే బయట పందిట్లో ఆడుకోండి. సాయంకాలం చల్లబడిన తర్వాత తోటలోకి వెళ్లి ఆడుకుందురు గాని అంటూ చెప్పేది మా అమ్మమ్మ సీతమ్మ. మేము అలా మధ్యాహ్నం అంతా పందిట్లో దొంగ పోలీస్ ఆడుకుంటూ తొక్కుడు బిళ్ళలు ఆడుకుంటూ ఉండే సమయంలో ఆ మండుటెండలో ఒక సైకిల్ వేసుకొని దాని వెనక ఒక ఎర్రటి డబ్బా కట్టుకునిచేతిలో ఒక రేకుతో చప్పుడు చేసుకుంటూ ఆ పందిరి ముందు ఆగేవాడు ఒక వ్యక్తి .అతని పేరు సాయిబు. చప్పుడు వినగానే తాతయ్య నిద్రలోంచి లేచి వచ్చి అందరికీ ఐస్ ఫ్రూట్ ఇప్పించేవాడు. అలా ఐస్ ఫ్రూట్ నాకుతూ ఆటలాడుకుంటూ సాయంకాలం అవగానే బయటికి బలాదూర్ తిరగడానికి పారిపోతుంటే అమ్మమ్మ పట్టుకుని జేబులో జంతికలు చేగోడీలు పెట్టి పంపించేది. జంతిక ముక్క నములుతూ చేగోడీ వేలుకు రింగులా తిప్పుకుని గిరగిరా తిప్పుకుంటూ పాత టైర్లు దొర్లించుకుంటూ కాలవల్లో స్నానానికి వెళ్ళిపోయేవాళ్ళం.
అక్కడ పొలం గట్టు మీద కూర్చున్న తాతయ్యని చూసి ఒక్క అడుగు వెనక వేస్తే ఒరేయ్ పిల్లలందరూ ఇలా రండిరా తాటి ముంజలు తిందాం అంటూ తాతయ్య ప్రేమగా పిల్లలందరికీ మంజులతో కడుపు నింపేసేవాడు. వచ్చే దారిలో మామిడి చెట్ల కింద రాలిన మామిడికాయలు బుట్టలోకి ఏరుకునీ తాటి ముంజ కాయలు గెలలు చేత్తో పట్టుకుని తాతయ్య వెనక నడిచే వాళ్ళం పిల్లలందరూ. అలా పొలంగట్ల మీద నడుస్తుంటే ఆ చల్లటి పైరగాలి ఒంటికి తగులుతుంటే మహదానందంగా ఉండేది. తాతయ్య చెప్పినట్లుగా తాటి ముంజ కాయలు గెలలు ఇంటి దగ్గర పడేసి మళ్లీ పొలంలో గడ్డిమేస్తున్న పశువుల నడ్డి మీద స్వారీ చేసేవాళ్ళం. పాపం వాటికి బాధ ఉండేదేమో ఒక్కొక్కసారి అటు ఇటు పరిగెడుతుండేవి. ఆ దెబ్బకి మేము కింద పడిపోయేవాళ్ళం. అయినా ఉడుకు రక్తం అదొక ఉత్సాహం అదొక ఆనందం. దెబ్బలు తగిలిన పట్టించుకోకుండా రక్తం కారుతున్న లెక్కచేయకుండా ఇంటికి వస్తే అమ్మమ్మ ముందుగా స్నానం చేయించేసేది.
తగిలిన దెబ్బలకు ఎవరికీ చెప్పకుండా పసుపు పూసి పాదాలు తడిమి చూసేది. ఎందుకంటే ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకున్నాయేమో అని. అలా చాలాసార్లు నా పాదాల నుంచి అమ్మమ్మ ముళ్ళు తీసేది. మళ్లీ అందరికీ రాత్రి సహా మామిడి పళ్ళ ముక్కలు నంచుతూ కబుర్లు చెబుతూ కథలు చెబుతూ అమ్మమ్మ అన్నం పెట్టేది. అమ్మమ్మ చేతితో చేసిన పప్పు పులుసు వడియాలు కొత్త అవకాయి ఇంకేముంది స్వర్గంలా ఉండేది. మేము హైదరాబాద్ నుంచి రాగానే తోటలోంచి మామిడి కాయలు తీసుకొచ్చి అమ్మమ్మ పిల్లలందరి సహకారంతో ఊరగాయలు పెట్టేసేది. ఇంచుమించుగా రాత్రి 7 గంటలకే అందరూ భోజనాలు అయిపోయేవి. ఎందుకంటే ఆ ఊరిలో కరెంటు కోత ఎక్కువగా ఉండేది. కరెంటు పోకుండా పెందరాలేళే అన్నాలు తినేయండి అంటూ తాత య్య హెచ్చరికలు జారీ చేసేవాడు.
అన్నం తినేసి వీధి లోకి వచ్చేటప్పటికి పందిట్లో ఆ చివర నుంచి ఈ చివరి వరకు మడత మంచాలు నవారు మంచాలు వేసి రెడీగా ఉంచేవాడు తాతయ్య. పిల్లలందరూ అమ్మమ్మ దగ్గరే పడుకోవాలని కథలో కబుర్లు చెప్పుకోవాలని దెబ్బలాడుకునేవాళ్ళం. రెండు మంచాలు దగ్గరగా వేసుకుని అమ్మమ్మ మధ్యలో పడుకుని అందరి మీద చేతులు వేసుకొని తన చిన్ననాటి సంగతులు అనుభవాలు తాతయ్య పెళ్లినాటి సంగతులు ఆ ఊరి కబుర్లు అలా ఎన్నో ఎన్నో చెబుతూ ఉండేది. అమ్మమ్మకి ఆ సీతాదేవి లాగే బాగా సహనం ఎక్కువ. అర్ధరాత్రి వేళ పిల్లలు ఎవరైనా పక్క తడిపేస్తే విసుక్కోకుండా కాళ్లు చేతులు కడిగి మళ్లీ బట్టలు మార్చి పడుకోబెట్టేది.
ప్రతి వేసవికాలంలోనూ తాతయ్య పశువులపాకలో ఉండే కర్రి ఆవు దూడల్ని ప్రసవించేది. అది ప్రతి ఏట కూడా అర్ధరాత్రి పూట ఈనేది. తెల్లవారులు ఆ దూడ తోటి ఆవు తోటి జాగరణ చేయడం ఒక వింత అనుభవం. తెల్లవారు లేచిన తర్వాత తాతయ్య పాలు తీసి ఇస్తే అమ్మమ్మ బెల్లం జిన్ను తయారు చేసేది. పిల్లలు ఉండగా ఆవు ఈనిందని తాతయ్య అమ్మమ్మ ఆనందపడుతూ ఉండేవారు.
ఇంచుమించుగా ప్రతి ఏటా ఉగాదికి ముందే ఆ ఊరు వెళ్లి పోయేవాళ్ళo. ఉగాదికి ఒక నెల తర్వాత ఆ ఊరిలో అమ్మవారి జాతర జరిగేది. ఈ నెలరోజుల పాటు నెత్తి మీద గరగలు పెట్టుకుని డప్పులు మోగించుకుంటూ ముందు నడుస్తుంటే ఊరంతా అమ్మవారు తిరిగేవారు.
ఇంటి ముందుకు రాగానే కాళ్ళ మీద నీళ్లు పోసి పళ్లెంలో బియ్యం పసుపు కుంకుమ ఇచ్చి ఇచ్చి దండాలు పెట్టుకునేవాళ్ల o. అలా వాళ్ళు తిరిగి ఇచ్చిన పసుపు కుంకుమ నీ చెవులకు పెట్టుకోమనేది అమ్మమ్మ . నెల రోజుల తర్వాత ఆ ఊరిలో జాతర. అబ్బో కోడిపందాలు గుండాటలు ఒకటేమిటి చాలా సందడిగా ఉండేది. అమ్మవారి గుడి దగ్గర జరిగిన తీర్థంలో బొమ్మలు కొనుక్కోవడానికి తాతయ్య డబ్బులు ఇచ్చేవాడు అంతమందికి.
తాతయ్య ఊర్లో వైద్యం చేసేవాడు. వేసవికాలం వచ్చిందంటే గ్రామస్తులు బుట్టలతో మామిడిపళ్ళు అటుకులు సున్నుండలు ఇలా ఒకటే ఒకటి ఆ రకాల పేర్లు చెప్పలేం. రాత్రిపూట తెచ్చి ఇచ్చేవారు. రాత్రిపూట ఎందుకు అనే సందేహం అందరికీ కలగవచ్చు. పాపం వాళ్ళందరూ రైతులు. రాత్రిపూట వాళ్ళకి కాస్త విరామం దొరికేది వాళ్ళకి. వాళ్లు అలా ఇచ్చి వెళ్ళగానే అమ్మమ్మ అవన్నీ మంచం దగ్గరికి పట్టుకొచ్చి పెట్టేది. కడుపు పట్టేది కాదు. మర్నాడు కడుపు నొప్పి వచ్చిందని తాతయ్య మందు అడిగితే తాతయ్య అమ్మమ్మని తిట్టేవాడు. అలా ఒక ఏడాది సరదాగా వేసవ సెలవులు గడుపుతున్న నాకు ఒక సంఘటన ఆ చిన్నతనంలో చాలా బాధనిపించింది.
ఒకరోజు మధ్యాహ్నం పందిట్లో అందరూ ఆడుకుంటూ ఉంటే ఒక జీపు వచ్చి ఆగింది. జీపులో నుంచి ఇన్షర్ట్ చేసుకుని కళ్ళకు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని కాళ్ళకి షూస్ వేసుకొని చలపతిరావు గారి ఇల్లు ఇదేనా అంటూ వచ్చాడు. అంతవరకు తాతయ్య లోపల గదిలో మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆ మాట వినపడే కిటికీలోంచి తొంగి చూసి గబగబా అద్దాల బీరువాలనుకున్న గదిలోకి వెళ్లి ఆ బీరువా వెనక దాక్కున్నాడు. అమ్మమ్మ బయటకు వచ్చి చలపతిరావు గారు లేరు బయటికి వెళ్లారు అంటూ సమాధానం ఇచ్చింది. వాళ్ళ ఆ మాట విని జీప్ ఎక్కి వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్లడం చూసి ఏదో ఒకటి అమ్మేసి ఆ బ్యాంకు వాళ్ల అప్పు తీర్చండి అనేది అమ్మమ్మ.
తాతయ్య పాపం ఏమి మాట్లాడలేకపోయాడు. ఆదాయం తక్కువ బరువులు ఎక్కువ ఏం తీరుస్తాడు పాపం అప్పు. ఎంత అప్పు ఉన్న ఏనాడు ఎవరికి ఏమీ లోటు చేయలేదు. కొద్దిరోజులకి తాతయ్య అమ్మమ్మ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేశారు. తర్వాత తాతయ్య పిల్లలందరూ కలిసి ఆ ఇంటిని పొలాన్ని అమ్మేసి అప్పు తీర్చేసి మిగిలినది తలో కాస్త పంచుకున్నారు. ఆనాటి నుంచి మాకు ఆ ఊరి తోటి రుణం తీరిపోయింది.
తాతయ్య అమ్మమ్మ పోయిన తర్వాత మళ్లీ ఎప్పుడు ఆ ఊరు వెళ్ళలేదు. ఇదిగో ఇన్నాళ్ళకి ఆ ఊరిలో పెట్టిన బ్యాంకులో నాకు మేనేజర్ గా పోస్టింగ్ వచ్చింది. అరెరే అప్పుడే ఊరు చివరికి వచ్చేసామే అనుకుంటూ కారు ఆపి కామరాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడండి అంటే ఒక పెద్ద మనిషిని అడిగాడు.
ఇలా తిన్నంగా వెళ్లి సందు తిరిగితే కొత్తగా కట్టిన బిల్డింగ్ అదే బ్యాంక్ అంటూ చెప్పా డు. ఒకప్పుడు ఆ ప్రదేశం అంతా ఖాళీగా ఉండేది. తిన్నంగా బ్యాంకు ముందు కార్ ఆపి లోపలకు వెళ్లి ఆ మేనేజర్ గారితో పరిచయం చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ రాసి హెడ్ ఆఫీస్ కి పంపించి ఆరోజు మంచిదని సీట్లో కూర్చున్నా.
వసూలు కానీ రుణాలు పాత ఫైల్స్ అన్ని తెప్పించుకుని చూస్తూ కూర్చున్న. ఏ ఫైల్ చూసినా తాతయ్య మొహమే కనపడేది. మర్నాడు నుంచి రుణ వసూలుకి ఏ ఇంటికి వెళ్లిన యజమానులు ఎవరు కనబడేవారు కాదు. అమ్మమ్మ లాగా ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళతో సమాధానం చెప్పించేవారు. రోజు ఉదయమే లేచి మార్నింగ్ వాక్ చేస్తూ ఎదురుపడిన గ్రామ పెద్దలను పలకరిస్తూ రైతులతో ప్రేమగా మాట్లాడుతూ ఆ ఊరికి వచ్చిన అయిదారునెలల్లోనే అందరి గురించి తెలుసుకున్నాను. బ్యాంకుకు వచ్చిన వాళ్ళకి నేనే స్వయంగా హెల్ప్ చేస్తూ అంతవరకు బ్యాంకు మీద ఉన్న దురభిప్రాయం పోగొట్టడానికి సర్వ విధాల ప్రయత్నం చేశా.
నేను అడుగుపెట్టిన వేళా విశేషము ,నా అదృష్టం ప్రభుత్వం వాళ్ళు రైతు రుణమాఫీ ప్రకటించి అనుకున్న సమయానికి రుణమాఫీ చేసి ప్రభుత్వం ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.
మీరు వచ్చిన తర్వాత మాకు మంచి జరిగిందంటూ ఆ ఊరి ప్రజలకు నేనంటే అభిమానం పెరిగింది.
అలా ఆ ఊరి వాళ్ళ గుండెల్లో ఒక మంచి వాడిగామిగిలిపోయా. మా తాతయ్యకు మంచి మనవడుగా ఊరి వాళ్ళ అందరి దగ్గరే మార్కులు కొట్టేశా. మూడేళ్ల పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఉన్నంత సహాయం చేసి బరువెక్కిన గుండెతో వేరొక నగరానికి ట్రాన్స్ఫర్ అయిపోయా ను. నాకు బాల్యంలో అందమైన అనుభవం ఇచ్చి ఒక బాధ్యత గల ఉద్యోగి అయిన తర్వాత ఉద్యోగ నిర్వహణలో తృప్తి మిగిల్చిన ఈ ఊరు అంటే నాకు చాలా ఇష్టం అంటూ తన వీడ్కోలు సభలో అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాడు కామరాజు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి