రుచిలో రారాజు _అతిధి మర్యాదలో మహారాజు
అల్లుడు గుమ్మంలోకి అడుగుపెట్టాడో లేదో, ఆ క్షణమే మర్యాదలు మొదలవుతాయి మా గోదారోళ్లింట్లో. అల్లుడైనా, ఆత్మీయ అతిథులైనా—ముందుగా వండి పెట్టేది కరకరలాడే మినప గారెలే. మినుము తింటే కండబలం పెరుగుతుందన్న నమ్మకం ఒకటి; పిండి వంటలలో అది మహారాజులాంటిదన్న విశ్వాసం మరొకటి. అందుకే పెద్దలు— “తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి” అని అలా నిశ్చితంగా చెప్పేవారు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్న వాళ్లకే కాకుండా పరలోకంలో ఉన్న వాళ్లకి కూడా ఈ గారెలు అంటే మహా ప్రీతి. ఏ పితృకార్యమైనా గారెలు లేకుండా ఉండదు. ఎర్రగా నూనెలో వేగిన గారె ముక్క విరుచుకుని, అల్లపు చెట్నీతో నంజుకుని తింటే స్వర్గమే కనపడుతుంది. తినేవాళ్లకి స్వర్గం కనబడుతుంది గానీ, పాపం వండే వాళ్ల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. ఒకప్పుడు యంత్రాలు వంటింట్లోకి ప్రవేశించని కాలంలో, రుబ్బురోలుతో కుస్తీపట్టి, చెమటలు కక్కుతూ, పీకల లోతు నీళ్లలో నానబెట్టిన మినప గుండును కర్కశంగా తోలువలచి, కసి కొద్దీ రుబ్బురోలు పత్రాన్ని తిప్పుతూ, ఇనప గుండులాంటి మినప గుండును పాలనురుగు రంగులో ఉన్న మినప రుబ్బుగా మార్చేవారు. రుబ్బు తయారయ్యాక హమ్మయ్య అనుకునేవారు. పిండి రుబ్బుతూ అడుతూ పాడుతూ ...