దొంగలు
ఒకప్పుడు దొంగతనం అంటే రాత్రి చీకట్లో జరిగే పని అర్థం
ఇప్పుడు పగలు రాత్రి తేడా లేదు— కానీ కనపడదు! మన చేతిలోని ఫోన్ద్వారా, మన కళ్ల ముందే, మన ఖాతాలోని సొమ్ము జారిపోతుంది. మొబైల్ లేకపోతే నిమిషం గడవదు. ఆదమరిస్తే దానంత కష్టం లేదు. మన సొమ్ము పరాయి సొత్తు అయిపోతుంది. మన సమాచారం పరుల పాలైపోతుంది.
మునుపు దొంగతనాలు రాత్రిపూట జరిగేవి. దొంగల భయంతో తాళాలు వేసుకుని నిద్రపోయేవాళ్లం. కానీ ఈ కొత్త దొంగకి తాళాలతో పనిలేదు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు జోలికి రాడు. దర్జాగా ఏసీ గదిలో, లేదంటే పొలం గట్ల మీద కూర్చుని — పార్ట్టైం జాబ్లా దొంగతనం చేస్తాడు.
తాళాలు వేసినవే ఉంటాయి, కానీ బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలు గోడలు దాటి పారిపోతాయి. మనం చేయగలిగేది గగ్గోలు పెట్టడమే తప్ప, వాటిని ఆపడం కష్టమే.
తాళం లేకుండా సొమ్ము ఎలా తీస్తున్నాడు? అదే — సాంకేతికత!
ఒకప్పుడు బ్యాంకులో ఉన్న సొమ్ము మన చేతికి రావాలంటే బ్యాంకుకి వెళ్లాలి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ సొమ్ము ఇచ్చే యంత్రాలు, మొబైల్లో ఉన్న చిన్న చిన్న యాప్లు — ఇవన్నీ సౌకర్యం కోసం. కానీ ఈ సౌకర్యం మధ్యలో మాయగాళ్లు దూరి ఖాతాదారులకి అన్యాయం చేస్తున్నారు.
ఫోన్లో తీయగా మాట్లాడతాడు. బ్యాంకు అధికారిలా నటిస్తాడు. “మీ OTP చెప్పండి”, “మీరు లక్కీ డ్రాలో గెలిచారు” అంటాడు. మనం చెప్పగానే, మన ఖాతాలో విలువలేని అంకెలు మిగులుతాయి.
ఇప్పుడు మోసం అంతా విస్తరించింది. లైఫ్ సర్టిఫికెట్లు కూడా వదలలేదు. పాపం ఒక రిటైర్డ్ ఉద్యోగి — ఆన్లైన్లో లింక్ అని చెప్పి పంపిన దొంగ లింక్ క్లిక్ చేయగానే, కష్టపడి దాచుకున్న సొమ్మంతా పోయింది.
“కూటి కోసం కోటి విద్యలు” అన్నట్టు, ఇప్పుడు దొంగలకు కూడా కోటి విధానాలు. ఎవరో లాటరీ వచ్చిందంటారు; ఇంకొకరు “ఇంకమ్ ట్యాక్స్ రీఫండ్ ఆర్డర్” వచ్చిందంటారు. ఏదో ఒక రూపంలో సొమ్ము కాజేయడమే వృత్తి.
ఇది దొంగతనం కాదు — ఇది సాంకేతిక దొంగతనం.
సమాచారం దోచుకునే చోరుల యుగం ఇది.
ఫోన్ మోగితే ఇప్పుడు ఆనందం కాదు — భయం. ఎవరి నుంచి ఫోన్ వచ్చిందో తెలియకపోతే స్పందించకపోవడమే ఉత్తమం. ఎవరు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసుకున్న తర్వాతే సమాధానం ఇవ్వడం తెలివి.
రోజుకో తరహా మోసం, రోజుకో కొత్త రూపం.
సాంకేతికత మనకు సౌకర్యం ఇచ్చింది — కానీ జాగ్రత్త తప్పితే సొమ్ము, సమాచారం, నిద్ర — అన్నీ పోతాయి.
ఇప్పుడు ఫోన్ కాల్లు మాత్రమే కాదు — సందేశాలూ కూడా మోసగాళ్ల ఆయుధాలే.
“మీ ఖాతా నిలిపివేయబడింది”, “మీ ATM కార్డు బ్లాక్ అవుతోంది”, “లింక్పై క్లిక్ చేయండి” — ఇవన్నీ కనిపించడానికి అధికారిక మెసేజ్లా ఉంటాయి. కానీ ఒక్క క్లిక్తో మన డేటా దొంగల చెంతకు వెళ్తుంది.
ఇంటర్నెట్ వాడకమంటే సౌకర్యం, కానీ అవగాహన లేకపోతే అది ప్రమాదం.
మనకు తెలుసు అనుకున్నవే ప్రమాదకరంగా మారుతున్నాయి.
పాస్వర్డ్లు, OTPలు, పర్సనల్ డీటెయిల్స్ — ఇవి ఎప్పుడూ పంచుకోకూడని వ్యక్తిగత తాళాలు.
అవి ఎవరికైనా ఇచ్చినంత మాత్రాన, మన ఖాతా తలుపు తెరుచుకున్నట్టే.
సైబర్ దొంగలు ఇప్పుడు సైకాలజీ కూడా నేర్చుకున్నారు.
మానవ మనసు ఎక్కడ బలహీనమవుతుందో బాగా తెలుసు.
“మీరు లక్కీ విన్నర్”, “మీ ఖాతాలో అదనపు బోనస్”, “మీ సొమ్ము రెట్టింపు అవుతుంది” — ఇలాంటి ఆశ చూపే మాయమాటలే మనలో చాలామందిని బలి చేస్తున్నారు.
సాంకేతికత మనకు శక్తినిచ్చింది — కానీ అదే సాంకేతికతను ఉపయోగించి మోసం చేయడం కూడా సులభమైంది.
మన సమాచారాన్ని కాపాడుకోవడమే రక్షణ.
ఎటువంటి లింక్ క్లిక్ చేసే ముందు రెండుసార్లు ఆలోచించాలి.
బ్యాంకు అధికారుల పేరుతో ఎవరు ఫోన్ చేసినా, అధికారిక నెంబర్కి తిరిగి కాల్ చేసి నిర్ధారించుకోవాలి.
బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ OTPలు, పాస్వర్డ్లు అడగవు — ఇది గుర్తుంచుకోవాలి.
మనకు తెలిసిన నెంబర్ అయినా, మనకు తెలియని అభ్యర్థన అయితే, ఆగి ఆలోచించడం మంచిది
ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్తగా ఉంటేనే, ఈ సైబర్ దొంగల జాలం నుండి బయటపడగలము.
ఎంత సాంకేతికత పెరిగినా — మన అవగాహన, మన అప్రమత్తతకంటే పెద్ద రక్షణ లేదు.
ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు — ప్రతి పౌరుడి కర్తవ్యం కూడా.
మన పిల్లలకు ఫోన్ వాడకం నేర్పుతున్నప్పుడు, ఫోన్ మోసాల గురించి కూడా నేర్పాలి.
మన పెద్దలకు డిజిటల్ సౌకర్యం అందిస్తున్నప్పుడు, మోసాల దారులు కూడా చూపించాలి.
మన ఖాతా, మన సమాచారం, మన సొమ్ము — ఇవన్నీ మన చేతిలోనే ఉన్న తాళాలు.
తాళాలు మన దగ్గర ఉంటేనే సురక్షితం.
తాళాలు పరుల చేతికి వెళ్తే, మన సొమ్ము కూడా పరులదే!
సాంకేతిక యుగం మన జీవితాన్ని సులభం చేసింది — కానీ దానికీ చీకటి వైపు ఉంది.
అది తెలియకపోతే మోసం అవుతాం;
తెలుసుకుంటే రక్షితులమవుతాం.
“జాగ్రత్తే జవాబు” — ఇదే కొత్త తాళం, కొత్త భద్రత.
తాళం గడియలు ఇప్పుడు ఇనుముతో కాదు — అవగాహనతో వేయాలి.
మన మనసు తాళం వేసుకుంటేనే, మన ఖాతా తాళం సురక్షితం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి