కార్తీక్
"చూడండి, ఈ బాబు మానసికంగా ఎదుగుదల చాలా తక్కువగా ఉంది. దీనికి ఏమి వైద్యం లేదు. అందుకే ఈ వయసులో రావలసిన ఆటపాట ఆలస్యంగా వస్తున్నాయి. కానీ శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నాడు" అంటూ పిల్లల వైద్యుడు చెప్పిన మాటలకి పిల్లవాడు కార్తీక్ తల్లి రాధ బుర్ర తిరిగిపోయింది.
తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఏమి వినపడలేదు. ఆటోలో ఇంటికి వచ్చేసి మంచం మీద పడుకుని ఆలోచనలలో మునిగిపోయింది.
పుట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు! అందాల చందమామలా ఉన్నాడు. కార్తీక పౌర్ణమి నాడు పుట్టాడు. అందుకే పున్నమి చంద్రుడిలా ఉండేవాడు. గిరజాల జుట్టు, తెల్లటి రంగు, పొడవైన వేళ్లు, కాళ్లు, చేతులు – అబ్బా! తలుచుకుంటేనే ముద్దొచ్చేలా ఉండేవాడు.
పుట్టి ఏడాది పైగా అయినా ఆ వయసు వాళ్లకు ఉండవలసిన లక్షణాలు లేకపోవడంతో డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్లింది రాధ. అప్పుడు తెలిసిన నిజం!
రాధ అత్తగారు రోజు సాధిస్తూనే ఉంది. “పిల్లవాడు ఏమిటి ఇలా ఉన్నాడు? ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పిల్లలు మా ఇంట్లో పుట్టలేదు” అంటూ గోల చేసేది. పాపం రాధ ఏమి కనిపెట్టుకోలేకపోయింది. కానీ అనుభవంతో అత్తగారు కనిపెట్టింది.
“ఇప్పుడు ఏమంటుందో ఏమో... భర్త ఈ విషయం ఏ విధంగా తీసుకుంటాడో?” అని ఆలోచిస్తూ రాధ ఏడుస్తూ పడుకుంది.
రాత్రి భోజనాల సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ విషయం ఏడుస్తూ చెప్పింది. ఎవరు ఏమి మాట్లాడలేదు. రాధ అత్తగారు మాత్రం పెద్దగా ఏడుపు మొదలుపెట్టింది.
“వీడు ఇలా అయితే మటుకు ఏమిటి? రెండో కాన్పులో మంచి పిల్లాడు పుడతాడు. దానికి ప్రయత్నిస్తే సరిపోతుంది” అంటూ అక్కడికక్కడ జడ్జ్మెంట్ పాస్ చేసి గదిలోకి వెళ్లిపోయింది.
రాధ భర్త గోపాల్ మౌనంగా అన్నం తినేసి గదిలోకి వెళ్లిపోయాడు.
రాధ వంటిల్లు అంతా సర్దుకుని వచ్చేసరికి గోపాల్ మొహం మీద చేతులు పెట్టుకుని పడుకున్నాడు.
“ఏవండీ, పడుకున్నారా?” అని రాధ అడిగేసరికి,
“లేదు” అని సమాధానం చెప్పాడు. కానీ గొంతు ఏదో తేడాగా ఉంది.
రాధ దగ్గరికి వచ్చి చేతులు తీసి చూసేసరికి, గోపాల్ ఏడుస్తూ కనబడ్డాడు. అలా భార్యాభర్తలిద్దరి మధ్య మాటలు ఏమీ లేకుండా, ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు.
ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో పిల్లల పెంచడం చాలా కష్టంగా ఉంది తల్లికి. అందులో ఇలాంటి ప్రత్యేకమైన పిల్లవాడు అయితే! ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది?
కార్తీక్ వయసు పెరిగేకొద్దీ ఇంటికి వచ్చిన చుట్టాలు –
“మీ పిల్లవాడు ఇంకా నడవడం లేదా?”
“మీ పిల్లవాడికి మాటలు వచ్చాయా?” అంటూ ప్రశ్నించేసరికి పాపం రాధ సమాధానం చెప్పలేకపోయింది.
అందరూ పిల్లవాడి గురించి గుసగుసలు చెప్పుకోవడం విని ఆమె చాలా బాధపడేది.
రోజు సమయానికి పాలు తాగి పడుకోవడం తప్ప వేరే లక్షణాలు ఏమీ కనబడలేదు కార్తీక్ లో.
పక్కనున్న పార్కులో పిల్లలందరూ ఆడుకుంటుంటే కార్తీక్ మాత్రం బెంచ్ మీద కూర్చుని కిందకు దిగేవాడు కాదు. అందరూ అదోరకంగా చూసేవారు.
ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. మాటలు సరిగా రాలేదు. మనం ఏదంటే అదే –
“ఒరేయ్ కార్తీక్” అని పిలిస్తే తను కూడా “ఒరేయ్ కార్తీక్” అంటాడు.
రాధ అత్తగారు మాత్రం ఏనాడు కార్తీక్ని దగ్గరకు తీసుకోలేదు. ఏడుస్తున్నప్పుడు ఎప్పుడూ సముదాయించలేదు.
మామూలుగా చంటి పిల్లలు ఎవరైనా ఏడుస్తుంటే తల్లి దగ్గరగా లేకపోతే ఎవరైనా సరే గబుక్కుని దగ్గరకు తీసుకుంటారు. వీడు కూడా చంటి పిల్లాడే. కానీ వాడు ఏం పాపం చేశాడో, ఇలాంటి జన్మ వచ్చిందని రాధ బాధపడేది.
ఒక రోజు రాధ అత్తగారు పిడుగులాంటి వార్త తీసుకొచ్చింది.
“సిటీలో ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేకమైన పాఠశాల ఉందని విన్నాను. అలాంటిదాంట్లో కార్తీక్ జాయిన్ చేయమని. అన్నీ వాళ్లే చూస్తారని, ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారని.”
గోపాల్ కి భోజనాల సమయంలో చెప్పింది.
“మనమేం చేసినా వీళ్ళలో మార్పు రాదు. వీళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చే వాళ్లు ఉంటారు” అంటూ పదే పదే చెప్పడంతో గోపాల్ రాధ వైపు చూశాడు.
భర్త పరిస్థితి అర్థం చేసుకుని మర్నాడు పిల్లవాడిని తీసుకుని ఆ స్కూల్ దగ్గరికి వెళ్లింది రాధ.
ఆ స్కూల్ బిల్డింగ్ పాత బిల్డింగ్ లా ఉంది. పాపం అందరూ ఇలాంటి పిల్లలే.
“ఇక్కడే హాస్టల్ ఉంది. పిల్లవాడిని ఇంటికి తీసుకువెళ్లడానికి వీలులేదు. తాము ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి తమ పనులు తాము చేసుకునేలా, కొంచెం జ్ఞానం వచ్చేలాగా తయారు చేస్తాము” అని ప్రిన్సిపాల్ చెప్పాడు.
రాధ “ముందు హాస్టల్ చూసి వస్తాను” అంది.
క్లాస్ రూములన్ని తిరుగుతూ ఉండగా కనబడిన దృశ్యాలను చూసి ఆమె మనసు పాడైపోయింది.
కొన్ని క్లాస్ రూములలో పిల్లలకు బట్టలు సరిగా లేవు. గదుల్లో అదోరకమైన వాసన. కొంతమంది పిల్లలు తాడుతో కిటికీలు కట్టేసి ఉన్నారు.
ఒకరిద్దరు ఉపాధ్యాయులు దెబ్బలు కొడుతూ కూడా కనిపించారు. ఈ పిల్లలకు తాము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. ఎదుటివాళ్ల మాటలు అర్థం కాదు. వీళ్ళ ప్రపంచమే వేరు.
ఇది చూసి మనసు ముక్కలైపోయి ఇంటికి తిరిగి వచ్చేసింది రాధ.
రెండు మూడు పాఠశాలలు చూసినా పరిస్థితి అలాగే ఉంది. దూరంగా ఉన్న పాఠశాలకు పంపించడం, హాస్టల్లో జాయిన్ చేయడం – ఏ మాత్రం ఇష్టం లేదు రాధకి.
కార్తీక్ వయసు పెరుగుతోంది కానీ మార్పు ఏమీ కనబడలేదు
స్నేహితురాలి సలహాతో ఒక మంచి టీచర్ని కుదుర్చుకుని శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది రాధ. అయినా కార్తీక్ దృష్టి అంతా టీవీలో వచ్చే మ్యూజిక్ ప్రోగ్రాముల వైపు మరలేది.
ఒకవేళ టీవీ కట్టేస్తే ఏడవడం ప్రారంభించేవాడు. కానీ టీవీలో వచ్చే పాటలకు కాళ్లు చేతులు కదపడం చూసిన రాధ, ఒక మ్యూజిక్ టీచర్ని పెట్టి పాటలు నేర్పించడం మొదలుపెట్టింది.
చదువు మీద శ్రద్ధ లేదు. కానీ పాటలంటే శ్రద్ధ పెరిగింది కార్తీక్కి. వయసు పెరిగినా ఏది మంచి, ఏది చెడు తెలియదు. వీధులలో వినాయక చవితి సంబరాలు జరిగితే తల్లి చూడకుండా వెళ్లిపోయేవాడు కార్తీక్.
ఎక్కడ చూసాడో ఏమో కానీ పుట్టినరోజు పండుగలకి “హ్యాపీ బర్త్డే” పాట పాడడం నేర్చుకున్నాడు.
ఇలా కార్తీక్ కి పదిహేను సంవత్సరాలు వచ్చాయి. తన బట్టలు తానే వేసుకోలేడు. పెద్ద పిల్లవాడిగా మారుతున్నాడు.
“ఎన్ని రోజులు ఇలా? నా తర్వాత ఎవరు చూస్తారు?” అని ఆలోచిస్తూ బాధపడేది రాధ.
ఈలోగా అత్తగారు ప్రతిరోజు సాధిస్తూనే ఉండేది – రెండోసారి ప్రయత్నించమని.
“అమ్మో! ఒకవేళ నిజంగా ప్రయత్నిస్తే రెండోసారి కూడా ఇలాంటి పిల్లాడే పుడితే? అప్పుడేం చేయాలి? ఇలాంటి పిల్లవాడిని పెంచడం అంటే మాటలు కాదు. చాలా మానసిక ధైర్యం కావాలి. ఆర్థికంగా, శారీరకంగా కూడా తట్టుకునేలా ఉండాలి” అని అనుకుంటూ మరోసారి ప్రయత్నానికి అవకాశం లేకుండా ఆపరేషన్ చేయించుకుంది రాధ.అందుకే కార్తీక్ మీద మరింత శ్రద్ధ పెట్టింది
మ్యూజిక్ టీచర్ చెప్పే ప్రతి పాటను శ్రద్ధగా విని నేర్చుకోవడానికి అలవాటు పడిపోయాడు కార్తీక్. టీచర్ కూడా ఛాలెంజ్గా తీసుకుని శ్రద్ధగా సినిమా పాటలు చెప్పడం ప్రారంభించింది.
తర్వాత కార్తీక్ని చిన్న చిన్న పాటల పోటీలకు తీసుకెళ్లడం మొదలుపెట్టింది సంగీత మాస్టారు.
కాలం ఎప్పటికీ ఒకలాగే ఉండదు. ప్రతి సమస్యకి ఏదో ఒక సమయంలో పరిష్కారం భగవంతుడే చూపిస్తాడు. దానికి ఓర్పు చాలా అవసరం. పరిస్థితులకు తట్టుకుని నిలబడడం కూడా అవసరం.
ఆ ఊర్లో ప్రముఖ టీవీ ఛానల్ వాళ్లు తెలుగు పాటల పోటీలకు సెలక్షన్ ప్రారంభించారు. కార్తీక్ కూడా ఆ పోటీలో సెలెక్ట్ అయ్యాడు.
హైదరాబాద్లోని రవీంద్రభారతి అంతా ఆహుతులతో నిండిపోయింది. వేదిక మీద ఒకపక్క న్యాయమూర్తులు, మరోపక్క సంగీత వాయిద్యాలు, ఇంకో పక్క పాటల పోటీలో పాల్గొనే కళాకారులు కూర్చుని ఉన్నారు.
సాధారణంగా పాటలు పాడే పిల్లల తల్లిదండ్రులు ఆహుతుల్లో కూర్చుంటారు. కానీ కార్తీక్ తల్లిదండ్రులు మాత్రం కార్తీక్ పక్కనే కూర్చోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రత్యేకత ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.
కార్యక్రమం ప్రారంభమైంది. పిల్లలందరూ పాడుతున్నారు. కార్తీక్ వంతు వచ్చింది. కార్తీక్తో పాటు తల్లిదండ్రులు కూడా వేదికపైకి వచ్చి నిలబడ్డారు.
“నీ పేరు, ఊరు చెప్పు” అని అనౌన్సర్ అడిగాడు.
అదే మాట మళ్లీ తిరగేసి చెప్పాడు కార్తీక్.
న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. అప్పుడు రాధ మైక్ చేతిలోకి తీసుకుని కార్తీక్ కథంతా పూసగుచ్చినట్లు చెప్పింది.
ఆ తర్వాత కార్తీక్ నోటి వెంట వచ్చిన పాటలు ఆహుతులందరికీ కన్నీళ్లు తెప్పించాయి.
అందరూ అభినందనలు చెప్పారు. కార్తీక్ మాత్రం ఏదో మాయలోకంలో ఉన్నట్లే ఉన్నాడు.
పాటలో తప్పొప్పులు ఎలా ఉన్నా, ఒక విభిన్నమైన వ్యక్తిని ఇంత స్థాయికి తీసుకువచ్చిన కార్తీక్ తల్లిదండ్రులను జడ్జీలు ఎంతగానో అభినందించారు.
అందులో ఉన్న ఒక ప్రముఖ సినిమా సంగీత దర్శకుడు తన ట్రూప్లోకి కార్తీక్ని తీసుకుంటానని సభాముఖంగా ప్రకటించాడు.
రాధ ఆనందానికి అంతులేదు.
ప్రపంచంలో దేవుడు అందర్నీ ఒకేలా పుట్టించడు. కొంతమంది మామూలువాళ్ల కంటే భిన్నంగా ఉంటారు. అంతేకానీ వాళ్లు తక్కువకారు.
వాళ్లని చేరదీసి, మానసిక ధైర్యం ఇచ్చి, ఏదో ఒక రంగంలో నిష్ణాతులను చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది.
చీకట్లో ఏడుస్తూ కూర్చోక, ఒక చిరుదీపం వెలిగించే ప్రయత్నం చేస్తే ఆ కాంతి కొంతమందికైనా వెలుగు తీసుకొస్తుంది.
అలాంటి వ్యక్తులను సమాజం చిన్నచూపు చూడకూడదు. అవసరమైతే చేయూతనివ్వాలి. అప్పుడే వాళ్లు ప్రతిభావంతులవుతారు.
✍️ రచన : మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
📍 కాకినాడ
📞 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి