అమ్మ ఇలాగే ఉంటే బావుంటుంది
అమ్మ ఇలా ఉంటే బాగుంటుంది.
ఉదయం 5:00 అయింది. కాలింగ్ బెల్ అదేపనిగా మోగుతుంటే నిద్రలోంచి మెలకువ వచ్చి వీధి తలుపు తీయగానే చేతిలో బ్యాగు పట్టుకుని గుమ్మoల్లోకి అడుగుపెట్టిన కూతురు సుజాతను చూసి ఆశ్చర్యపడింది సుజాత తల్లి అరుణ. సుజాత డైరెక్ట్ గా తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసింది ఏమిటి? మళ్లీ అల్లుడు గారితో దెబ్బలాడి వచ్చేసి ఉంటుంది. పెళ్లయిన మూడేళ్లలో ఇలా రావడం నాలుగోసారి. ప్రతిసారి అల్లుడు వచ్చి బ్రతిమాలి తీసుకెళ్లడం మామూలు అయిపోయింది అనుకుంటూ సుజాతనేమీ అడక్కుండా "అమ్మా సుజాత మొహం కడుక్కుని రా కాఫీ పెడతా ను తాగి పడుకుందువు గాని అంటూ చెప్పిన తల్లికి ఏమి సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకుని పడుకుండిపోయింది సుజాత.
ఇంతలో అరుణ భర్త రామారావు లేచి ఎవరు బెల్లు కొట్టింది అంటూ ప్రశ్నించేసరికి మన అమ్మాయి వచ్చిందండి అని అరుణ సమాధానమిచ్చి వంట గదిలోకి వెళ్ళింది. అయినా ఇలా సమయం సందర్భం లేకుండా అమ్మాయి ఎందుకు వచ్చిందని మనసులో అనుకుని ఓహో మళ్లీ అల్లుడు కథ మామూలే అనుకుని రామారావు బాత్రూంలోకి వెళ్లిపోయాడు.
సుజాత కి పెళ్లి అయ్యి మూడేళ్లయింది. భర్త సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు హైదరాబాదులో. సురేష్ కూడా మంచి కుటుంబం నుంచి వచ్చిన కుర్రవాడు. కష్టo సుఖం తెలుసున్న వ్యక్తి. పెళ్ళికి ముందు సుజాతకి తనకున్న బాధ్యతలన్నీ విపులంగా చెప్పాడు సురేష్. ఊర్లో ఉన్న తల్లి తండ్రి, పెళ్లి కావలసిన చెల్లి ,చదువుకుంటున్న తమ్ముడు గురించి విపులంగా చెప్పాడు. అప్పుడు అన్నింటికీ తల ఊపి ఇప్పుడు మొగుడు గొంతెమ్మ కోరికలు తీర్చలేదని చీటికిమాటికి సురేష్ తో దెబ్బలాడుతూ ఉంటుంది సుజాత. సుజాత గారాబంగా పెరిగిన పిల్ల. పెళ్లంటే చాలా రకాలుగా ఊహించుకుంది సుజాత. ఒక కారు, అందమైన ఇల్లు , అందులో భార్యాభర్తలిద్దరూ తప్ప ఎవరూ ఉండకుండా ఉండాలని, అందుబాటులో నౌకర్లు ,ప్రతి ఏటా టూర్లకు వెళ్లాలని ,సెలవు రోజుల్లో షికారులకి ,హోటళ్లకు తిరగాలని మనసు పడినవన్నీ కొనుక్కోవాలని ఊహించుకుంది.
సినిమాలో చూపించిన విధంగా సంసారం ఉండాలనీి ఊహించుకుంది. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. అందుకని తట్టుకోలేకపోతోంది. హైదరాబాదులో కాపురం పెట్టిన వెంటనే ఉద్యోగం మానేస్తానని చెప్పింది. అంత సంసారాన్ని తన ఒక్కడి సంపాదనతో గడపడం కష్టమని చెప్పిన వినిపించుకోకుండా ఉద్యోగం మానేసి కూర్చుంది. అయినా సురేష్ అలాగే గంపెడు సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎందుకో తెలియదు సురేష్ తల్లిదండ్రులు చెల్లెలు తమ్ముడు అంటే సుజాతకి ఇష్టం ఉండదు.
ఎప్పుడూ పట్టుమని పది రోజులు అత్తవారింట్లో ఉన్న రోజులు కూడా లేవు. ఒకవేళ సురేష్ తల్లిదండ్రులు వచ్చినా సుజాత వాళ్లతోటి ఆప్యాయంగా మాట్లాడదు . అందుకే సురేష్ తల్లిదండ్రులు ఎప్పుడు రారు. సురేష్ ఒక్కడే నెలకు ఒకసారి తల్లి తండ్రిని చూసి వస్తుంటాడు. అంటే సుజాత దృష్టిలో ఎంతసేపు భర్త తన తోటే ఉండాలని కోరిక. బాధ్యతలు మరిచిపోయి ఉండడం మంచి పద్ధతి కాదని ఎన్నిసార్లు భర్త చెప్పిన వినిపించుకోకుండా దెబ్బలాడి పుట్టింటికి వచ్చేస్తూ ఉంటుంది సుజాత.
సుజాత అలిగి పుట్టింటికి వచ్చినప్పుడల్లా సురేష్ జరిగిన విషయం అంత అత్తగారికి మామగారికి చెప్పి సుజాతను మళ్ళీ బతిమాలి తీసుకెళ్తుంటాడు. ఇది పాపం సురేష్ వ్యవహారం.
సుజాతకు నిద్రలోంచి లేచి హాల్లోకి వచ్చేటప్పటికి ఉదయం 9 గంటలు అయింది. అప్పటికే తల్లి తండ్రి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. సుజాతను చూడగానే ఏమ్మా బాగున్నావా అంటూ పలకరించాడు తండ్రి రామారావు. "మొహం కడుక్కుని రావే కాఫీ తాగుదువు గాని అంటూ తల్లి చెప్పేసరికి తండ్రి కి ఏమి సమాధానం ఇవ్వకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది సుజాత.
బాత్రూంలో నుంచి సుజాత తిరిగి వచ్చేటప్పటికి తల్లి అరుణ క్యారేజీ పట్టుకుని రామారావు గదిలోకి వెళ్లి క్యారేజీ ఇచ్చిన తర్వాత రామారావుకి టాటా చెబుతూ వీధి గుమ్మం వరకు సాగనంపింది. సుజాతకు ఒళ్ళు మండిపోయింది. రిటైర్మెంట్ వయసులో తండ్రిని ఇలా సాగనంపడం అవసరమా అనుకుంది. సుజాత టిఫిన్ కాఫీ పూర్తి చేసి మళ్లీ తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చి పక్కనే పడుకుని ఫోన్లో మాట్లాడుకోసాగింది. మధ్యలో తండ్రి రెండు మూడు సార్లు ఫోన్ చేయడం గమనించింది సుజాత. వయసు పెరిగే కొద్దీ వీళ్ళిద్దరూ బుద్ధులు మారిపోతున్నాయి అనుకుంటూ మనసులో తిట్టుకుంది సుజాత.
సాయంకాలం 6 గంటలకు రామారావు ఆఫీస్ నుండి తిరిగి మూ వచ్చేటప్పటికి సుజాత తల్లి అరుణ ఎదురు వెళ్లి చేతిలో కాలేజీ అందుకుని మంచినీళ్ల గ్లాస్ అందించింది. రామారావు స్నానం చేసి వచ్చేటప్పటికి ఉప్మా రెడీ చేసింది. రామారావుకి ఆఫీసు నుండి రాగానే టిఫిన్ చేయడం అలవాటు.
రామారావు సుజాతతో మాట్లాడదామని ప్రయత్నించిన సరిగా సమాధానం రాకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు. రాత్రి 9 గంటలకు ఈటీవీ వార్తలు చూసి పడుకోవడం అలవాటు రామారావు కి. అలా పడక గదిలోకి వెళ్లిన రామారావు కూడా తల్లి అరుణ వెళ్లి గది తలుపులు వేసుకుంది. అదేమిటి తను ఎప్పుడు వచ్చినా తన పక్కనే పడుకునే తల్లి ఇలా చేసింది ఏమిటి? అని ఒక్కసారిగా సుజాతకి దుఃఖం వచ్చింది.
అలా వారం రోజులు గడిచే యి. సురేష్ దగ్గర నుంచి ఫోన్ కూడా రాలేదు. అరుణ రామారావు సుజాత వచ్చిన వెంటనే సురేష్ కు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. "ప్రతిసారి నేను వచ్చి బతిమాలి తీసుకెళ్తున్నాను. తనకి ఇంకా చిన్నతనం పోలేదు. మీరు కూడా గట్టిగా చెబుతున్నట్లు లేదు. ఇది జీవితం. అనుకున్నది అనుకున్నట్టుగా ఎవరికి జరగదు. నాకు బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు తను పంచుకోకుండా తన గొంతెమ్మ కోర్కెలు తీర్చలేదని ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉంటుంది. నేను పెళ్లికి ముందు ఏమీ దాచకుండా అన్ని తనతో చెప్పాను. అప్పుడు అన్నింటికీ తల ఊపి ఇప్పుడు ఇలా మధ్యలో అలుగుతుంటే నేను ఎన్ని రోజులు ఓపిక పట్టగలను అంటూ కొంచెం బాధతోను కొంచెం కోపంతోను అల్లుడు చెప్పేసరికి ఎలాగైనా కూతురికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
ప్రతిరోజు ఉదయం తల్లి తండ్రి కలిసి వాకింగ్ కి వెళ్లడం, వచ్చిన తర్వాత కలిసి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేయడం ,తండ్రి ఆఫీస్ కి వెళ్లే వరకు తల్లి తండ్రి కూడా కూడా ఉండి కావలసిన అందించడం ,ఆదివారం వస్తే ఇద్దరూ కలిసి సినిమాలు వెళ్లడం, తిరిగి వచ్చేటప్పుడు హోటల్లో భోజనం చేసి రావడం కనీసం సుజాత ఇంట్లో ఉందని విషయం మర్చిపోయి ఆనందంగా ప్రవర్తించడం చూస్తే సుజాతకి ఏదో కోల్పోయినట్లుగా అనిపించింది. భర్తతో దెబ్బలాడి వచ్చిన సుజాతకి ఏదో విలువ తగ్గిపోయినట్లుగా అనిపించింది పుట్టింట్లో.
ఉదయం నుంచి తల్లి తండ్రి ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ కూతురు అసలు ఇంట్లో ఉందనే విషయం మర్చిపోయా ప్రవర్తించే వాళ్ళు. సురేష్ తో జరిగిన గొడవ గురించి కూడా ఏమీ అడగలేదు. అయితే సుజాత ఎప్పటిలాగా సురేష్ వచ్చి బతిమాలిని తీసుకెళ్తాడని ఊహించింది. కనీసం సురేష్ దగ్గర్నుంచి ఫోన్ కూడా రాలేదు.
ఒకరోజు ఉండబట్టలేక తల్లిని అడిగింది సుజాత" ఏమిటమ్మా నన్ను అసలు పట్టించుకోవడం లేదు. ఏం జరిగిందని కూడా అడగడం లేదు. ఎప్పుడు ఎక్కువగా నాన్న తోటే కాలక్షేపం చేస్తున్నావు అని అడిగేసరికి సుజాత తల్లి అరుణకి వెంటనే నవ్వొచ్చింది. "చూడమ్మా ఆయన నా భర్త. నా భర్త బాగోగులు చూడవలసిన బాధ్యత నాది. మాకు కూడా వయసు మీరి పోతోంది. ఎవరి టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. బ్రతికినన్నాళ్లు హాయిగా ప్రశాంతంగా ఇద్దరం కలిసి మెలిసి జీవితాన్ని అనుభవించాలని మా ఉద్దేశం. బ్రతికినన్నాళ్లు దెబ్బలాడుకుంటూ ఒకరినొకరు సాధించుకుంటూ దెప్పిపొడుచుకుంటూ కాలక్షేపం చేస్తే జీవితంలో భార్యాభర్త అనే బంధం యొక్క తీపిదనం ఏమీ ఉండదు. భార్యాభర్త అన్న తర్వాత అభిప్రాయ బేధాలు వస్తాయి అయినంత మాత్రాన ఎవరో ఒకరు తగ్గి సర్దుబాటు చేసుకుంటూ పోవాలి. భార్య అనేది నిత్యం భర్తకి ఒక తలనొప్పిగా తయారవ్వకూడదు.
అయిందానికి కాని దానికి భర్తని సాధించకూడదు. అలాగే భర్త కూడా భార్య మీద అధికారం చలయించకూడదు. భార్య మాటే ఎప్పుడూ చెల్లాలని ఉడుము పట్టు పట్టకూడదు. ప్రతి మగవాడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి.
ఆ బాధ్యతల్లో భార్య కూడా చేదోడు వాదోడుగా ఉండాలి. భర్త తరపువారిని తన కుటుంబంలో కలుపుకుని ప్రశాంతంగా జీవించాలి. అప్పుడే భర్త ప్రశాంతంగా ఉండగలడు.
భర్తకి ప్రశాంతత లేకుండా నిత్యం దెబ్బలాడుతుంటే అది అతని ఆరోగ్యo మీద ప్రభావం చూపుతుంది. భర్త ఆరోగ్యం పాడైతే బాధపడవలసింది మొట్టమొదట భార్యే కదా. అలాగే భార్యకు వర్తించే సిద్ధాంతాలన్నీ భర్త కూడా వర్తిస్తాయి. మాటిమాటికి భార్యలను సాధించడం తిట్టడం కొట్టడం డబ్బు తీసుకురమ్మని వేధించడం లాంటివి చేయకూడదు. అటువంటి చోట భార్య ఉండక్కర్లేదు. ఇటువంటి బాధలు నీకు లేవని నాకు తెలుసు. కానీ నీకు ఉన్నది ఒకటే. నీ భర్త ఎల్లప్పుడూ నీ చుట్టూనే తిరగాలని అతని కుండే బాధ్యతల్నిపక్కన పెట్టాలని నీ ఉద్దేశం .
ఆ మధ్య ఒక మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి పెళ్లి సంబంధం వస్తే ఆడపిల్ల వారు వాళ్ళ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా అని మధ్యవర్తిని అడిగారట. డస్ట్ బిన్ అంటే ఎవరు పెళ్ళికొడుకు తల్లి తండ్రి. అలా ఉంది ఆడపిల్లల వాళ్ళ పరిస్థితి. నవ మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు వాళ్ళు ఇచ్చిన బిరుదు. నీ తల్లిదండ్రులు అటువంటి వాళ్ళు కాదు. నేను అల్లుడు గారితో అన్ని వివరంగా మాట్లాడాను. ఊరు నుంచి మీ అత్తగారిని మామగారిని ఆడపడుచుని మరిదిని వెంటనే తీసుకొచ్చేయమని అల్లుడు గారికి సలహా ఇచ్చాను.
ఒక బాధ్యత గల తల్లిగా చెప్తున్నాను నువ్వు ఖచ్చితంగా వాళ్ళని చూడాలి. నా కుటుంబానికి చెడ్డ పేరు రావడం నేను సహించను. ఇది నాన్న మాట కూడా. చూడు నేను చదువుకున్నాను విడాకులు ఇచ్చేసి నా కాళ్ళ మీద నేను నిలబడతాను అంటూ చెప్పద్దు. ఒంటరి ఆడదాన్ని సమాజం బ్రతకనివ్వదు. అయినా నీకు సమస్యలు ఏవి లేవు. అహంకారం తప్పితే అంటూ చెప్పిన తల్లి మాటలకి బోరున ఏడ్చింది సుజాత. ఇంకో మాట కూడా చెప్తాను విను. భర్తను వదిలేసిన స్త్రీకి పుట్టింట్లో గౌరవం ఉండదు. ఈ చిన్న వయసులో నీకు అది తెలియదు. వయసు పెరిగే కొద్ది మనసు ఒక తోడును కోరుకుంటుంది. అందరి తల్లిదండ్రుల లాగే నేను అల్లుడు గారితో దెబ్బలాడను. చూడు కొడుకులు బాధ్యతలు వదిలేసి తిరిగితే ఆ తల్లిదండ్రుల పడే మానసిక క్షోభ వర్ణనాతీతం. అది ఏ ఆడదానికైనా శాపంగా మారుతుంది
ఒకవేళ అల్లుడు దగ్గర నుంచి నువ్వేమైనా బాధలనుభవిస్తుంటే చెప్పు అని అడిగేసరికి లేదు అని తల అడ్డంగా ఊపింది సుజాత. మరి ఇంకే మిటి? ఎ ప్పుడు సినిమాకి షికార్ కి తీసుకెళ్లట్లేదా? పదిహేను రోజులకు ఒకసారి వెడతాం అని చెప్పింది సుజాత.
రోజు ఎవరైనా తీసుకెళ్తారా అమ్మ అలా తీసుకెళ్తే జీతాలు సరిపోతాయా మనం ఆడంబరాలకి కోరికలకి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే మన మధ్య తరగతి వాళ్ల జీవితాలు ఎలా గడుస్తాయి రిటైర్మెంట్ వయసులో.
ప్రణాళికాబద్ధంగా జీవితం నడపాలి. లేదంటే ముసలి వయసులో చాలా బాధపడవలసి ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు తెలియదు అంటూ తల్లి చెప్పేసరికి సుజాత ఏమి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి ఆలోచనలో పడింది. ఇన్నాళ్ళు తను ప్రవర్తించిన తీరులో తప్పు ఏమిటో తల్లి మాటలతో తెలుసుకుంది. మర్నాడు ఉదయం లేచి బ్యాగ్ తీసుకుని తన ఇంటికి బయలుదేరింది. కూతురిలో వచ్చిన ఈ మార్పుకి సుజాత తల్లి తండ్రి ఎంతో సంతోషించారు.
నిజ జీవితంలో ఇటువంటి ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు. లక్షలు ఖర్చుపెట్టి చదువులు చెప్పించి తర్వాత పెళ్లిళ్లు చేసి కాపురానికి పంపిన తర్వాత చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కాపురాలు పాడు చేసుకున్న పిల్లలు ఎంతోమంది. తప్పు పూర్తిగా ఆడపిల్లలది అని చెప్పలేం. మగవాడికి ఉన్న బాధ్యతలు భార్య కూడా ఆనందంగా పంచుకున్నప్పుడు మగవాడికి ఏమీ ఇబ్బంది ఉండదు.
పుట్టింటి వాళ్ళను ఒకరకంగానూ అత్తింటి వాళ్లను ఒకరకంగానూ చూసే వాళ్లు చాలామంది. మొగుడు కావాలి కానీ అత్తవారు పనిచేయరు. యిలా ఉన్నాయి నేటి పరిస్థితులు. ఈ కథలో చెప్పిన విధంగా తల్లిదండ్రులు ఎక్కడ ఉండరు. కానీ కావాలని కూతురు కాపురం కూడా పాడు చేయరు. అల్లుడు తప్పు లేనప్పుడు కూతురి కాపురం సరిదిద్ద వలసిన బాధ్యత తల్లిదే. తల్లులు మేల్కొని కూతురుకు సర్దిచెప్పి కాపురాలు సరిదిద్ధినప్పుడు ఆ తల్లి బాధ్యతగల తల్లి అవుతుంది. కొందరి అమ్మాయిల జీవితాలు చూసి మనసు బాధపడి వ్రాసినది ఈ కథ.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి