అడవిలో మెరిసిన పద్మం
అడవిలో మెరిసిన పద్మం.
" ఈ అడవిలో ఈ* తార*ని ఎక్కడని వెతికి పట్టుకోవాలి? తారలo టే నక్షత్రాలు అవి ఆ ఆకాశంలో ఉంటాయి. మరి ఈ తార నక్షత్రము కాదు సినిమా తార కాదు. మరి అడవుల్లో నివసించే ఒక సాధారణ గిరిజన స్త్రీ ఈ ఫోటో ఒక్కటే ఆధారం. ఏదో నర్సరీలో పని చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఆడవికి దగ్గరగా ఉండే గ్రామ సచివాలయంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందమో చూద్దాం అనుకుంటూ సచివాలయంలోకి అడుగు పెట్టాడు ఆ మండల ఎమ్మార్వో .
సాధారణంగా ఏదైనా శవ పంచాయితీ కోసం వచ్చే ఎమ్మార్వో గారు ఏమిటి ఇలా కబురు కాకరకాయ లేకుండా వచ్చేసారని కంగారు పడుతూ ఆ విలేజ్ సెక్రటరీ అసలు విషయం విన్న తర్వాత నవ్వుకుని ఆ పక్కన ఉన్న అడవి దగ్గర ఉన్న నర్సరీ దగ్గరికి ఎమ్మార్వో గారిని తీసుకుని బయలుదేరాడు.
ఎమ్మార్వో ని వచ్చారని తెలిసి ఆ నర్సరీ అధికారి పరుగున వచ్చాడు. విలేజ్ సెక్రటరీ చేతిలో ఉన్న ఫోటోలు చూసి దూరంగా పనిచేస్తున్న తారని పిలిపించాడు .
తీరా ఆ తారను చూసేటప్పటికి ఎమ్మార్వో కి, విలేజ్ సెక్రటరీ కి మతిపోయింది. ఎక్కడో అడవుల్లో సాధారణంగా బతికే ఒక గిరిజన స్త్రీ. ఒంటినిండా బట్టలు కానీ ,కాళ్లకు చెప్పులు కానీ లేవు. ఆ భాష పూర్తిగా అర్థం కావటం లేదు. ముడి వేసుకున్న జుట్టు, ముక్కుకి పెట్టుకున్న నత్తు, కాళ్ళకి కడియాలు మెడలో ఏవో పూసలు ఇది ఆవిడ అవతారం. వయసు సుమారు యాభై సంవత్సరాలు ఉంటాయేమో.
తీరా ఎమ్మార్వో గారు చెప్పిన మాట వినేసరికి ఆ విలేజ్ సెక్రటరీకి ,ఆ నర్సరీ అధికారికి నోట మాట రాలేదు. చాలా ఆనందం వేసింది నర్సరీ అధికారికి . తార ఇప్పుడు మరుగున పడిన మాణిక్యం కాదు. ఇన్నాళ్లు తార అంటే ఎవరో ఎవరికీ తెలియదు. ఈనాడు దేశం అత్యున్నతమైన గౌరవo పొందే వ్యక్తుల్లో ఒకరైపోయారు. ఆ విషయం ఆమెకి ఎలా చెప్పాలో ఆమె భాషలో చెప్పాడు. కానీ ఆమె ముఖంలో ఒక చిరునవ్వు మెరిసి ఆ తర్వాత కన్నీళ్లు వచ్చాయి .
ఇదేమిటి ఈ మండలంలో మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ వ్యక్తి గురించి నాకు తెలియలేదు. కనీసం దగ్గరలో ఉన్న విలేజ్ సెక్రటరీ కూడా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఎక్కడో ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ వారికి ఈమె ఎలా తెలిసింది.
ఈవిడ వెనక ఏదో కథ ఉంది. ఆ కన్నీళ్లు వెనక ఏదో కష్టం ఉంది అని అనుకుంటూ ఆ నర్సరీ యజమానిని తార గురించి అడిగాడు.
తార నిజానికి ఈ నేల మీద ఉండిపోయింది కానీ ఇది ఆకాశంలో మెరిసే నక్షత్రమే . ఇది అడవిలోని మొక్కలకు తల్లి . ఈ తార తల్లిదండ్రులు గిరిజన తండాకు చెందిన వాళ్ళు. అడవిలోనే కాపురం ఉంటూ పుల్లలు కొట్టుకుంటూ పక్క ఊరిలో జరిగే సంతలో అమ్ముకుంటూ దొరికిన జంతువులు పళ్ళు తింటూ ఏదో అలా కాలక్షేపం చేస్తుండేవారు. తార చిన్నప్పటినుంచి తార తెలివైన పిల్ల. తల్లి తండ్రి అడవిలోకి వెళ్ళిపోతే ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఆ చుట్టుపక్కల ఉండే చెట్లతోటి మొక్కల తోటి ఆటలాడుకుంటూ ఉండేది.
ఎవరైనా పుల్లల కోసం చెట్లు నరుకుతుంటే వాళ్లతోటి దెబ్బలాడుతుండేది. ఆ వృక్షాలు నేలకు ఒరిగిపోతుంటే తనకి దెబ్బలు తగిలినట్లుగా బాధపడేది. ఖాళీ ప్రదేశం కనబడితే చాలు ఎక్కడ మొక్క దొరికిన అక్కడ నాటుతూ అక్కడ చుట్టుపక్కల ఉండే సెలయేళ్లలోని నీటిని మోసుకొచ్చి వాటికి పోస్తూ అవి పెరుగుతుంటే చూస్తూ ఆనందపడుతూ ఉండేది. పుట్టేటప్పటికీ చుట్టుపక్కల ఎవరూ మనుషులు కనపడలేదు అమ్మ నాన్న తప్ప వాళ్లేమో ఇంట్లో ఉండరాయే
అందుకే ఆ మొక్కల తోటి స్నేహం అలవాటయింది అనుకుంటాను. గాలికి మొక్కలు ఊగుతుంటే తనని ఆడుకోడానికి రమ్మని పిలిచినట్లుగా వెళ్లి వాటితోటి ఆడుకుంటుండేది. చెట్లు తోటి ఆడుకోవడం ఏమిటి అంటే నేను చెట్లు కొమ్మల తోటి ఉయ్యాలాటాడుకుంటున్నాను. అంటే చెట్లు నాతో పాటు ఆడుకుంటున్నాయి అని అంటుండేది తల్లిదండ్రులతోటి. చెట్లు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ దండాలు పెట్టుకుంటూ ఉండేది. దాన్ని దృష్టిలో అది ఒక గుడిగా భావించేదేమో. ఏమో దాని భావన ఎవరికీ తెలీదు. చెట్టు చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కనబడితే అంటే ఏదో పండు ఫలము కనబడితే అమ్మ నాకు తాయిలం పెట్టింది అంటూ ఆనందపడేది. అలా చెట్లతో మమకారం పెంచుకుంది.
పొద్దు పొడిచేసరికి తల్లి తండ్రి అడవిలోకి వెళ్ళిపోతే మళ్లీ పొద్దు గూకేసరికి వచ్చేవారు.. ఉదయం లేస్తూనే ఆ కోయ భాషలో ఆ చెట్లను పలకరించడం నీళ్లు తెచ్చి పోయడం కింద శుభ్రంగా తుడవడం ఎవరైనా చెట్లు కొట్టడం మొదలుపెడితే దెబ్బలాడ్డం ఇలా చెట్టును ముట్టుకుంటే అరిచి గొడవపెట్టేసేది. అలా తారతో పాటే ఆ మొక్కలు కూడా పెరుగుతూ వచ్చేయి.
వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తారని ఒంటరిగా వదలడం ఇష్టం లేక పెళ్లి చేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టారు. తానందుకు ఒప్పుకోలేదు.ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎవరూ వీటి బాగోగులు చూడరు.
అడవుల నరుకుతుంటే అడ్డుకునే వాళ్ళు లేకే కదా అడవులన్నీ మాయమైపోయాయి అని బాధపడుతూ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలన్నీ ఇష్టం లేదని చెప్తూ అడవికి కొంచెం దూరంలో ఉన్న నర్సరీలో కూలి పనికి కుదిరింది. అప్పుడే ఆకుల తొడుగుతున్న మొక్కలను చూసి ఆనందపడిపోయింది తార . రోజు అందరికంటే ఉదయం ముందుగా వచ్చి తనకు అప్పచెప్పిన పనిని శ్రద్ధగా చేస్తూ మొక్కల్ని అలా ఆనందంగా పెంచుకుంటూ వచ్చింది.
అది ఒక జీతం వచ్చే వృత్తిగా కాకుండా బాధ్యతగా పనిచేస్తున్న తారని చూసి ఆ నర్సరీ అధికారికి ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. అంతకుముందు అడవిలో ఈమె జీవన విధానం తెలిసిన నర్సరీ అధికారి అడవిలో అన్న ఖాళీ ప్రదేశం చూపించి నర్సరీ లో ఉన్న మొక్కలు ఇచ్చి నాటించడం మొదలుపెట్టాడు.
చిన్నప్పటినుంచి మొక్కలంటే ప్రాణం గనుక ఇష్టమైన పని దొరికిందని సంబరపడుతూ అడవినీ పెంచడం ప్రారంభించింది.
తార పనిలో కనబరుస్తున్న ఉత్సాహం చూసి కొంతమంది పని వాళ్ళని కూడా తారకి సహాయంగా ఇచ్చాడు ఆ నర్సరీ అధికారి. తార తల్లిదండ్రులు పెద్ద వాళ్ళు అయిపోవడం తార తెస్తున్న జీతం మీదే ఆధారపడడం వలన తార పెళ్లి గురించి మళ్లీ ఏ మాట ఎత్తలేదు వాళ్ళు. దానికి తోడు పెళ్లి చేస్తే ఒకళ్ళో ఇద్దరికో పిల్లలకు తల్లి అవుతుంది.
కానీ ఇప్పుడు వేలాది ఎకరాల్లో ఉన్న మొక్కలకి తల్లి అయింది. మొక్క మాట్లాడలేకపోవచ్చు. కానీ దానికి కూడా ప్రాణం ఉంటుంది. అందుకే మనం ప్రతిరోజు దానికి దాహార్తి తీరుస్తాం. ఎరువులు వేస్తాం. పశువుల నుండి రక్షిస్తాం. చంటి పిల్లల పెంచినప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా చూస్తాము అలాగే మొక్కలు కూడా.
ఇన్నాళ్లు ప్రకృతి పెంచిన చెట్లు తోటి మాలాంటి ఎందరికో జీవనం గడిచిపోయింది. భవిష్యత్తులో కొన్ని తరాలకి స్వచ్ఛమైన గాలిని అడవి మీద ఆధారపడి బ్రతికే మార్గాన్ని నా బిడ్డ కల్పిస్తోంది అని మనసును సమాధానం పరుచుకుని తార పెళ్లిమాట ఎత్తలేదు తార తల్లిదండ్రులు .
ఒకసారి నర్సరీ కి వెళ్ళిన వచ్చిన తారకి అడవి అంటుకుని తల్లి తండ్రి తో పాటు చాలా పెద్ద పెద్ద వృక్షాలు కాలిపోవడం గమనించి పాపం చాలా రోజులు ఎవరితో మాట్లాడకుండా తనలో తానే బాధపడుతూ ఉండిపోయింది. చెట్లు అంటే ఆవిడ ఉద్దేశం తల్లి లాంటిదని. గాలి ఆహారం గూడు ఇవన్నీ కూడా అడవి తల్లి ఇస్తుందని చిన్నప్పుడు తల్లి చెప్తుండేది. ఆమె పెంచిన అడవి చూస్తుంటే ఇది మానవమాత్రులకు సాధ్యమేనా అని అనిపిస్తుంది .
ఒకరోజు తార గొప్పదనం ఆ నోట ఈ నోట అడవికి పక్కన ఉండే నగరంలో ఉన్న యూట్యూబ్ రాకేష్ కి తెలిసింది. ఇంకేముంది ఇంతవరకు అడవిలో ఉన్న తార ఆకాశంలో ఉండే తారలాటిదని నగరవాసులు తెలుసుకున్నారు. లైకులు కొట్టారు. ప్రభుత్వానికి ఆ తారకు అవార్డులు ఇవ్వాలని రీల్స్ పెట్టారు.
తార గొప్పదనం అడవి పెరిగిన విధానం రహస్యంగా అటవీ శాఖ మంత్రి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ o ఆ నివేదిక చూసి ఆశ్చర్యపోయింది.
మనం అధికారం లో ఉండి అడవిని పెంచలేకపోతున్నాం. పైగా అడవులు నరికే వాళ్ళు ఏమి చేయలేకపోతున్నాం. ఒక నిరక్షరాస్యరాలు అడవిలో ఉండే గిరిజన యువతి ఏ స్వార్ధం లేకుండా ఇంత పెద్ద అడవిని పెంచడం మామూలు విషయం కాదు. ఎంతో విశాలమైన మనసు ఉండాలి. ప్రకృతి అంటే ప్రేమ ఉండాలి. అడవి ఉపయోగం తెలిసి ఉండాలి.
ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధనలు చేసి గడ్డాలు పెంచుకుని అడవిని పెంచలేకపోతున్నారు శాస్త్రజ్ఞులు. మరి తారకు మొక్కల గురించి ఏం తెలుసు. మొక్కల మధ్య పుట్టింది మొక్కల మధ్య పెరిగింది . కేవలం మొక్క అంటే అభిమానం తప్ప ఏ ఫలితం ఆశించలేదు . ఈ తార మొక్కలని తన చెల్లెలుగా అక్కలుగానే భావించింది. వాటితో ఆటలాడుకుంది ,పాటలు పాడుకుంది. చెట్లను నరుకుతుంటే బాధ పడింది. సువిశాలమైన అడవిని పెంచడానికి అహర్నిశలు కష్టపడింది అని తార గురించి అత్యున్నత పురస్కార సభలో చెబుతూ తారని వేదిక మీద ఆహ్వానించడం జరిగింది.
"అది మామూలు సభ కాదు. దేశంలో అత్యున్నత వ్యక్తులైన రాష్ట్రపతి ప్రధాన మంత్రి ఇతర మంత్రులు ఇతర ఉద్యోగులు వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన మేధావులు శాస్త్రజ్ఞులు సంగీతజ్ఞులు సాధారణ కళాకారులు కవులు పండితులు గాయకులు ఉన్న సభ.
దేశ విదేశాల మీడియా అంతా ఈ తార ఎవరు? అని ఒక్కసారి తన కెమెరా కళ్ళని అటువైపు తిప్పే యి.
ఒకసారి కెమెరా కూడా ఆశ్చర్యపడింది. మెరిసిపోయే బట్టలు లేవు .ముఖానికి అలంకరణ లేవు. ఖరీదైన పెర్ఫ్యూమ్ వాసనలు లేవు .కాళ్ళకి ఖరీదైన చెప్పులు లేవు. అతి సాదాగా అడవిలో పెరిగిన అమాయకపు గిరిజన యువతి లాగా నడుచుకుంటూ వస్తున్న తారను చూసి అందరూ ఆశ్చర్యపడిపోయారు.
అందరూ గొప్పగా తనకేసి చూస్తుంటే తాను చేసిన పనిలో ఏమి గొప్పదనం ఉందో తెలియని యువతి ఆ తార. చెట్లు అంటే ఇష్టమని నాలుగు చెట్లు పెంచింది. అదే తనకు తెలిసిన విద్య. ఈ అవార్డు కానీ దాని విలువ కానీ అక్కడ కూర్చున్న వ్యక్తుల విలువ కానీ తనకేమీ తెలీదు. తనతో పాటు ఎంతోమంది మేధావులు శాస్త్రజ్ఞులు కళాకారులు కవులు గాయకులు పండితులు కలిసి తీయించుకున్న పేపర్ లో వచ్చిన ఫోటో నర్సరీ అధికారి చూపిస్తుంటే ఆమె మొహం లో ఏం మార్పు లేదు. ఈ డబ్బు ఏం చేద్దాం ?అని అడిగితే చుట్టూ ఉన్న మొక్కల కేసి చూపించింది తార.
అలా ప్రకృతి పుట్టి పెరిగిన తార ఆ పండు వెన్నెల్లో ఆడుకుంటూ పెరిగిన మొక్కలతో మాట్లాడుకుంటూ పెరిగిన తార పేరు ముందు పద్మశ్రీ వచ్చి నిలిచింది.
కానీ ఎప్పటిలాగే ఆమె మొక్కలు మధ్య జీవిస్తోంది.ఆ వనానికి తారావనమని పేరు వచ్చింది . ఆ అడవిలో వృక్ష దేవత గుడి ఆ గుడిలో తార బొమ్మ ఇంకేం కావాలి? జీవితానికి. సాధారణంగా గుడిలో దేవతలు ఉంటారు. కానీ ఈ గుడిలో దేవత లాంటి వృక్షాలకి అమ్మ ఉంది. అలా తార వృక్షాల మధ్య జీవితం గడుపుతూ వచ్చింది.
ఈ కథకి స్ఫూర్తి 2021 వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వరించిన కర్ణాటక రాష్ట్రము నకు చెందిన తులసి గౌడ జీవితమును ఆధారంగా చేసుకుని వ్రాయడం జరిగింది. తులసి గౌడ ఆదివాసీ జాతికి చెందిన ఒక స్త్రీ అయినప్పటికీ తన జీవితాన్ని వృక్షములకే అంకితం చేశారు. అందుకునే అడవి తల్లి అని కూడా అంటారు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి