ఎవరు మార్చగలరు
ఎవరు మార్చగలరు.
కథ కోసం ఆలోచిస్తూ కూర్చున్నా
చుట్టూ ఉండే ప్రకృతి పరికించి చూసా
కుటుంబ వ్యవస్థలోకి తొంగి చూసా
సమాజాన్ని పలకరించా
అవి అప్పటికే పేజీలకు కథలన్నీ చెప్పేసాయి.
మంచి మూడ్ కోసం లొకేషన్ వెతికా
అది ఊటీ యో కొడైకెనాల్లో కాదు
అది కర్మ కాలితే చేరే ప్రదేశం
నేను కధ ల కోసం వెళ్ళా
అది దుర్భేద్యమైన కోట
కోటలో రాజులు రాణులు ఉండరు.
అందరూ దొరల బిడ్డల్లా ఉన్నారు
ఆవేశంలోనూ ,ఆలోచన లేకుండా
బ్రతికేందుకు వేరే మార్గం లేక చేసిన పనికి
చట్టం వారికి ఓ గుర్తింపు ఇచ్చింది.
ఇనప చువ్వల గదిలో బందీ చేసింది
ఏ ఇనప చువ్వను లాఠీ తో కొట్టిన
ఒక కథకు జన్మనిస్తోంది.
రాయితో కట్టిన గదులన్నీ కన్నీటితో చమరుస్తున్నాయి.
ఎన్ని వేల కథల విందో ఆ గది
ఎప్పుడు ఆ గది గుండెలో తడి ఆరదు.
రో జు కన్నీళ్ళ కథలు విని విని
అలవాటైపోయిన చట్టం గుండె
ఎన్నో ఏళ్లు బందీలుగానే ఉంచేసి
చట్టం తను కల్పించిన అవకాశాన్ని మరచిపోతే
బందీల బ్రతుకులన్నీ ఆ ఇనుప చువ్వల గదిలోనే
గాంధీ జయంతి ఎప్పుడు వస్తుందని
ఆ శుభవార్త కోసం ఎదురు చూసే
ఆ కళ్ళు మధ్యలోనే మూసుకుపోయిన వైనo
బిగుసుపోయిన ఆ చేతులు ములాఖత్ గది వైపు
చూపించిన దృశ్యం చూస్తూ ఉంటే
నేను వ్రాసే తెల్ల కాగితాల పేజీలు అన్ని
నా కన్నీళ్ళతో నిండిపోయి చిరిగిపోయాయి.
ఇంతకీ ఆ బందీ చేసిన నేరం
బస్టాండ్లో నల్లటి బ్యాగు దొంగతనం.
ఆ నల్ల బ్యాగు కోర్టులో సాక్ష్యంగా ఉండి ఉండి
తిరిగి పాత సామాన్లగదిలో పడకేసింది
బందీ ప్రాణం మాత్రం గాల్లోనే కలిసిపోయింది.
గుండెనొప్పి అని పేపర్ చెప్పింది
కానీ సమాజం దొంగ కుటుంబం అని
వేలెత్తి చూపిస్తూనే ఉంది.
ఇది ఎవరు మార్చగలరు.
ఇది సమాధానం లేని ప్రశ్న.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి