దేవుడి సొమ్ము

దేవుడి సొమ్ము 

" రామా రెడ్డిగారు . మూడు సంవత్సరాల నుంచి ఇదే మాట! . ఏ ఏడాది శిస్తు పూర్తిగా ఇవ్వరు. ఇలాగైతే ఎలాగండి!  అంటూ కోపంగా అరిచాడు వినాయకుడి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హనుమంతరావు. 

ఆ మాటలకు రామా రెడ్డి  నవ్వుతూ  పంటలు పండక పోతే ఏం చేయమంటారండి ! మేము మటుకు దేవుడు సొమ్ము ఉంచుకుంటామా! మీరు కూడా చూసి చూడనట్టు పోవాలి అన్నాడు.  సదరు  రెడ్డి గారికీ  ప్రతి ఏటా ఇదే మాట చెప్పడo అలవాటైపోయింది. 

రెడ్డి గారి మాటలకి " ప్రతి ఏటా ఒక కారు మారుస్తున్నాడు. పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు. కానీ దేవుడు సొమ్ములు కట్టడానికి మటుకు పంటలు పండలేదు అంటున్నాడు  అని మనసులో బాధపడ్డాడు హనుమంతరావు. 

ఆ గ్రామంలో వినాయకుడు దేవాలయం అది పురాతన మైనది స్వయంభు ఆలయం. రోజు వందలాది భక్తులు వచ్చి కోరిన కోర్కెలు తీర్చుకోడానికి మొక్కులు మొక్కుతుంటారు. ప్రతిరోజు అక్కడ గణపతి హోమం , నిత్య పూజలు, అన్నదానం జరుగుతూ ఉంటుంది.  

ఎప్పుడో పూర్వకాలంలో ఎవరో భక్తులంతా కలిపి దానంగా 25 ఎకరాలు దేవుడికి ఇచ్చారు. ఆ భూమి అంతా ఆ ఊర్లో పలుకుబడి ఉన్న రెడ్డి  గారు కౌలుకు చేస్తుంటారు. ఆ దేవుడికి వచ్చే ఆదాయం చూసి గవర్నమెంట్ వారి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఆధీనంలోకి గుడిని తీసుకొచ్చారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేలం లో ఆ భూమిని రెడ్డి గారే ఎవరిని ముందుకు రానీకుండా వేలంపాటలో పాల్గొని ఆ భూమిని కౌలుకు తీసుకుంటూ ఉంటాడు. కానీ కౌలు మాత్రం ఏదో సాకులు చెప్పి దేవుడికి బకాయిలు పెడుతుంటాడు.

అది ప్రముఖ దేవాలయం కావడంతో ప్రతిరోజు ఎంతోమంది వీఐపీలు దర్శనానికి రావడం స్వాగతం చెప్పడానికి సకల మర్యాదలు చేయవలసి రావడం ఇవన్నీ తలనొప్పిగా ఉంటాయి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి. గవర్నమెంట్ వారి లెక్కల ప్రకారం వీటికి అయ్యే ఖర్చు ఎక్కడ చూపించడానికి లేదు . ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చినా ఇటువంటి ఖర్చులు తట్టుకోవడానికి అడ్డదారులు తొక్కవలసి వస్తుంది.

 హనుమంతరావుకి ఇవన్నీ మొదట్లో కష్టంగా అనిపించిన  రాను రాను అలవాటైపోయింది.  దానికి తోడు ప్రతి ఏటా దేవాలయానికి సంబంధించిన బడ్జెట్ దేవాదాయ శాఖకి సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని శాంక్షన్ చేయించుకోవడానికి, ప్రతి ఏటా వచ్చే ఆడిటర్ల సకల మర్యాదలకు దేవుడు సొమ్ము ముట్టుకోవడానికి వీల్లేదు.  ఇవన్నీ తట్టుకోవాలంటే చేయకూడని పనులు చేస్తుంటారు.
దేవుడు ఎప్పుడూ మాట్లాడడని ఒకపక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు రెండో పక్క కౌలుదారులు, మూడోపక్క దేవాదాయ శాఖ దేవుణ్ణి ఎవరూ పట్టించుకోరు. దేవుడు ఆదాయం ఎంతుంది. భూమి ఎక్కడుంది. ఎన్ని ఆభరణాలు ఉన్నాయి. ఈ లెక్కలన్నీ పుస్తకాల్లో ఉంటాయి. కౌలు దా ర్లు సంవత్సరాలు తరబడి కౌలు ఇవ్వకపోయినా గట్టిగా అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఎన్నో దేవాలయాలు నిత్య దూపదీప నైవేద్యాలు లేక అలా జీర్ణావస్థలోనే ఉన్నాయి. 

అలా కొంత కాలం గడిచింది. హనుమంతరావు ఎప్పటిలాగే చేతులు తడిపి బడ్జెట్ శాంక్షన్ చేయించుకున్నాడు. ఆడిట్ వాళ్ళకి సకల మర్యాదలు జరిపి ఆడిట్ పూర్తి చేయించుకున్నాడు. కానీ ఆడిటర్ రిపోర్ట్ లో  ఎక్కడ కౌలుదార్ల బాకీ పడిన సొమ్ము గురించి గానీ, కనపడని ఆభరణాలు గురించి గానీ ఎక్కడ రాయలేదు. గుండెలు నిండా ఊపిరి పీల్చుకున్నాడు హనుమంతరావు.

ఎప్పుడూ గుడి మొహం చూడని రామారెడ్డి ఈమధ్య ప్రతిరోజు గుడికి రెండు పూటలా వచ్చి దర్శనం చేసుకోవడంతో పాటు వీలున్న పడాల గణపతి హోమం చేయించుకోవడం ఇంట్లో ఆస్తమాను ఏదో ఒక పూజ చేస్తూ ఉండడం, అన్నదానం పేరు చెప్పి ఎంతోకొంత సొమ్ము కడుతూ ఉండడం , ఇంటిలో యాగాలు చేస్తుండడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి అర్థం కాలేదు రెడ్డిలో వచ్చిన ఈ మార్పుకి 

ఆ తర్వాత ఊరు వాళ్ళు ద్వారా తెలిసింది రెడ్డి గారి పెద్ద కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడని. అది తెలిసిన హనుమంతరావు చాలా బాధపడ్డాడు. కొద్దిరోజులకి రామారెడ్డి చేతిలో ఒక పెద్ద బ్యాగ్ పట్టుకుని గుడి ఆవరణలో ఉన్న ఆ దేవాలయం ఆఫీసులోకి అడుగు పెట్టాడు. పెరిగిపోయిన గడ్డం, పీక్కుపోయిన కళ్ళు ,  మొహంలో అలసటతో ఆఫీసులోకి అడుగు పెట్టిన రామారెడ్డి తన చేతిలోనీ బ్యాగ్ లోంచి సొమ్ము తీసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టేబుల్ మీద  పెట్టి "దేవుడు బాకీ ఏ కోర్టులు వసూలు చేయక్కర్లేదు ఆయనే వసూలు చేసుకుంటాడు.జీవితాంతం మరిచిపోలేని శిక్ష కూడా వేస్తాడు. ఎవరైనా ఇది తెలుసుకుని ప్రవర్తిస్తే కనీసం శిక్ష నుండి తప్పించుకోవచ్చు అని కన్నీళ్లు కార్చాడు. ఆ మాటలకి హనుమంతరావు గుండెల్లో రాయి పడింది.ఆ మాటలకి హనుమంతరావు ఒక్క క్షణం శ్వాస ఆపేశాడు.చాలా కాలంగా ‘దేవుడు’ అనే పదాన్ని హనుమంతరావు ఒక విధానంగా ఆఫీసు పత్రాల్లో, బడ్జెట్ల లెక్కల్లో మాత్రమే చూస్తున్నాడు. కాని ఆ రోజు, మొదటిసారి — ఆ గుడి లోపల వెలిగే దీపం వెనుక ఉన్న దైవాన్ని గుండెతో చూస్తున్నట్టు అనిపించింది.

రామారెడ్డి కళ్లలోని నీళ్లు, శబ్దంలేని శిక్ష — ఆ రోజు గాలిలో తేలిన దేవుని శబ్దంలా వినిపించాయి.

ఆ రోజు నుండి హనుమంతరావు తన కర్తవ్యాన్ని  గణపతికి ఒక ‘సేవ’గా చూడటం మొదలెట్టాడు.

అవును దేవుడుకి బాకీ పడిన సొమ్ములు దేవుడే వసూలు చేసుకుంటాడు. మనిషిలో మార్పు తీసుకొస్తాడు. తన తప్పు తెలుసుకునేలా చేస్తాడు. అది ఇవాళ కావచ్చు రేపు కావచ్చు కొన్ని రోజులు కావచ్చు. జరుగుతున్న పరిణామాలన్నీ దేవుడు శిక్షలు ,దేవుడు చర్యలు అని నమ్మితే మనిషిలో కచ్చితంగా మార్పు వస్తుంది.  ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిన భూమి మీద ఆదాయం దేవుడికి చెందకుండా  దేవుడు పుట్టించిన మనిషి తన స్వార్ధంతో మింగేస్తుంటే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట