నారాయుడు
అది ఒక పెద్ద మండువా ఇల్లు. ఆ కాలంలో ఎక్కువగా మండువా ఇళ్లు కట్టేవారు. సింహద్వారం దాటి లోపలకు అడుగుపెట్టగానే ఆ పక్క ఈ పక్క గదులు మధ్యలో వెలుతురు గాలి ధారాళంగా ప్రవేశించడానికి నలుచదరంగా పైన పైకప్పు లేకుండా ఉండి కింద కూడా అదే మాదిరి గుంట, కురిసిన వర్షం బయటకు వెళ్ళిపోవడానికి డ్రైనేజీ సిస్టం చూడడానికి ఎంతో అందంగా ఉండి పైకప్పు అంతా మట్టి పెంకులతో కట్టిన అందమైన లోగిలి.
ఎప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో తెలియదు మన హీరో.. ఇప్పుడు చెప్పడానికి పెద్దలు కూడా ఎవరూ లేరు. నల్లటి శరీరం తల పైన తలపాగా పైకి బిగ కట్టిన పంచి ఒంటిమీద తువ్వాలు గుడ్డ కూడా లేని శరీరం పైకి సినిమా యాక్టర్ మాడాలా కనిపించిన మనసు శరీరము ఆ ఇంటి కోసమే త్యాగం చేసిన మా నారాయుడు మా మధు నా పంతుల వారి ఇంట్లో పుట్టిన వారి అందరికీ పల్లిపాలెం గ్రామ కాపురస్తులందరికీ సుపరిచితమే.
ఎందుకు నారాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పడం. కొద్దో గొప్పో పొలం ఉండి పెరటి నిండా పశు సంపద ఉండి గుట్టుగా గౌరవంగా కాలక్షేపం చేసే మా మధునా పంతుల వారు ప్రతి ఏటా ఒక పాలికాపుని సంవత్సరం కాలానికి కుదుర్చుకునేవారు. అలా వాడి పనితనం మనకు నచ్చితే మనం ఇచ్చే జీతం వాడికి నచ్చితే ఇంకొక సంవత్సరం మళ్లీ కుదుర్చుకునేవారు.
కానీ సదరు నారాయుడు జీవితకాలమంతా ఆ యజమాని దగ్గరే పని చేసి అసువులు బాసిన నారాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ యజమాని ఏమిచ్చే వారు సదరు ఈ వ్యక్తి ఏమి పుచ్చుకునే వాడో ఎవరికీ తెలియదు. బ్రతికనంతకాలము ఆ ఇంటిని అంటిపెట్టుకునే ఉన్నాడు. బహుశా నాకు తెలిసినంతవరకు ఇంత కాలము పనిచేసిన పాలి కాపు ఎవరు ఉండరేమో.
నారాయుడు అడ్రసు కేరాఫ్ రెడ్డి సామాజిక వర్గం అయినా పల్లిపాలెం గ్రామo అయినా బ్రతుకంతా ఆ అగ్రహారంలోనీ ప్రెసిడెంట్ గారి ఇంట్లో అనడం కంటే కామ రాజు గారి ఇంట్లో ఇంకా చెప్పాలంటే ఆయుర్వేద నిలయంలో కొంతకాలం పశువుల కాపరిగా చనిపోయే వరకు జీవితాన్ని గడుపుకున్న మా నారాయుడుని ఎలా మర్చిపోగలం. కడుపుని పుట్టిన కొడుకులు తన మీద ఆధారపడిన కుటుంబం ఉంటే ఆ పేరు ఆ మనవలకో మనవరాలుకో పెడితే అది ఈ తరం వరకు ప్రజల నోళ్ళల్లో నానుతూ ఉండేది. కడుపుని పుట్టిన వాళ్ళు ఉండడానికి అసలు పెళ్లి మాటే లేదు. కన్నవాళ్ళు లేకపోయినా కన్నతల్లిలా ఆదరించే కుటుంబం ఉంది.
నిత్యం బాగోగులు చూసే మనసున్న మారాజు ఉన్నాడు. ఆయనే కామరాజు తాతయ్య ఆయన భార్య సాక్షాత్తు సీతాదేవి లాంటి గౌరమ్మ తల్లి. ఈ దంపతులకు అందరూ ఇద్దరు పిల్లలు అనుకుంటారు కానీ దేవుడిచ్చిన పిల్లాడు ఇంకొకడున్నాడు అతనే నారాయుడు.
ఎందుకంటే రెండు పూటలా కడుపు నింపి నలతగా ఉంటే మాత్ర నలిపి ఇచ్చి కట్టుకోడానికి బట్ట ఇచ్చి ఇంకేం కావాలి. జన్మ ఒకటే ఇవ్వలేదు. అంతా ఉత్త ప్రేమ కాదు.పుత్ర ప్రేమ. చూడండి చివరికి బజారు నుండి కొని తెచ్చిన చిరు తిండి లేదా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు మా వాళ్లే పోరటి పెట్టిన ప్రత్యేకమైన తినుబండారాలు కూడా మర్చిపోకుండా వాటా పెట్టేది నారాయుడికి గౌరమ్మ తల్లి తన పిల్లలతో. అదే వారసత్వాన్ని కంటిన్యూ చేసింది ఆ తర్వాత ఇంటి బాధ్యతలు చేపట్టిన కోడలు. తనకంటే చిన్న వాళ్ళని తనకంటే పెద్దవాళ్ళని యజమాని అయిన సరే యజమానురాలైనా సరే ఏక వచనం తో సంబోధించే నారాయుడు వయసు అప్పటికి ఏమో నాకు తెలియదు.
కానీ ఆయుర్వేద మందులు ముమ్మరంగా తయారు చేసే రోజుల్లో కల్వం లో మందులు నూరడానికి ఆ మందులు కొట్టులో గృహప్రవేశం చేశాడు ఈ నారాయుడు ఆ రాజు గారి దగ్గర. ఒక చోట అడుగుపెట్టిన వేళా విశేషం తన జీవితమంతా అదే ప్రాంగణంలో గడిపాడు. అయితే పదవి మటుకు మారింది. మందులు కొట్టు నుంచి పశువులు కాపరిగా మారిపోయాడు. ఎప్పుడు యజమాని ఆ పశువుల పాకవైపు చూడలేదు. అంత బాధ్యత తన మీద పెట్టిన యజమాని నమ్మకాన్ని వమ్ము చేయలేదు మన హీరో. అంత నమ్మకంగా ఉండేవాడు. పశువులకు ఇంత గడ్డి పెట్టు అని యజమాని ఎప్పుడూ చెప్పలేదు. ఏ వేళకు ఆవేళ ఆ మూగజీవులకు అన్నీ తానే సమకూర్చేవాడు. ఆ తరం మనిషి కదా శుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చేవాడు.
అలా ఆ ఇంటితో అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది నారాయుడికి.ఆమధ్య గోదావరి పుష్కరాలకి మన సదరు నారాయుడికి కూడా పేరు మర్చిపోయాను కానీ చెప్పగా విన్నాను తర్పణాలు ఇచ్చినట్లుగా చెప్పారు. అంటే అంత అనుబంధం ఉంది నారాయుడితో .
ఎప్పుడూ చనిపోయిన జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి మన స్నేహితులు గురించి బంధువుల గురించి మాట్లాడుకుంటాం. ఫోటోలు పెట్టుకుంటాం. దానాలు చేస్తాం ధర్మాలు చేస్తాం. కానీ ఇలాంటి ప్రతి రక్తపు బొట్టు ఆ ఇంటి కోసం త్యాగం చేసినా అంటే జీతం ఇచ్చేవారు లెండి అదే వేరే సంగతి. నిస్వార్థంగా పనిచేయడం అందరికీ రాదు.
ఒళ్ళు దాచుకోకుండా పనిచేసే సేవకులు చాలా తక్కువ మంది ఉంటారు. సైనికుడికి ఒళ్ళు దాచుకోవడానికి అవకాశం లేదు. మన చేతి కింద పనిచేసే వాళ్ళకి ఆ అవకాశం ఉంది. సేవకుడి అభిమతం అది కాదు. నిస్వార్ధంగా సేవ చేయడమే. నారాయుడి యజమాని రాజు . రాజ్యం లేని రాజు . అయితే నారాయుడు ఒక బంటు. రామ బంటు కాదు గాని రాజుగారి బంటు. కామ రాజు గారి బంటు.
దెయ్యాలు జుట్టు విరబోసుకున్నట్లు ఉన్న కొమ్మలతో ఉన్న పెద్ద చింత చెట్టు ఆ మూల పెద్ద గడ్డిమేటు ఈ మూల పశువుల పాక, చుట్టూ సిమెంట్ తో కట్టిన చప్టా తో కొత్త నుయ్యి, వారగా కొబ్బరి చెట్లు మధ్యలో పశువులు ఎంతో అందంగా ఉండే ఆ పెరట్లో ఎప్పుడూ ఉండేవాడు మా నారాయుడు. ఎలా మర్చిపోగలం.
ఆ పశువులు కాపరి పరమాత్మ దగ్గరికి చేరిపోయిన ఇంకా మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం ప్రతిరోజు. ఇది మన నారాయణ కదా కమామిషు. అందరికీ తెలిసిన విషయ మైన ఒకసారి గుర్తు చేసుకోవడంలో తప్పులేదు.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి