చేతి వ్రాత
"
ఏవండీ ఆ గూట్లో ఉన్న డైరీలు దుమ్ము కొట్టుకు పోతున్నాయి. బయట పడేస్తాను. ప్రతిసారి దులుపుకోవడం కష్టంగా ఉంది అంది సుధాకర్ భార్య రమ్య ఇల్లు దులుపుతూ.
" నేను వాటిని ప్రతి ఆదివారం చదువుకుంటున్నాను గా! ఎందుకు పడేయడం? నీకు అంత కష్టంగా ఉంటే నేను దుమ్ము దులుపుకుంటాను. నువ్వు అక్కడ వదిలేసేయ్ అన్నాడు కోపంగా సుధాకర్.
" ప్రతిసారి ఇదే మాట చెబుతున్నారు. ఒకసారి కూడా దులిపిన పాపాన పోలేదు అoది రమ్య.
" సరేలే అలా వదిలేసేయ్. తర్వాత చూద్దాం అన్నాడు చిరాకుగా సుధాకర్ .రమ్య ఏమీ చేయలేక విసురుగా వంటింట్లోకి వెళ్లిపోయింది.
"
ఏమిటో రమ్య అర్థం చేసుకోదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రాణప్రదంగా దాచుకున్న డైరీ లని పడేస్తాను అంటుంది ఏమిటి ? దాని విలువ తనకేం తెలుసు! కొన్ని కోట్లు ఖర్చుపెట్టిన అలాంటి వాటిని మళ్లీ తీసుకురాలేము సుధాకర్ అనుకుంటూ ఒకసారి గతంలోకి వెళ్లిపోయాడు.
రామయ్య రవణమ్మల ఏకైక పుత్రుడు సుధాకర్. రామయ్య ఒక చిన్న రైతు. రవణమ్మ అప్పటి రోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సి పాసయ్యి టీచర్ గా పనిచేస్తూ ఉండేది . వాళ్ళిద్దరు కాపురం ఆ పల్లెటూర్లో ఒక మూడు గదులు ఉన్న పాడుబడిన బంగాళా పెంకుల కొంప.
లేక లేక పుట్టిన సుధాకర్ ని చాలా ప్రేమగా పెంచుతూ ఆ పిల్లాడు చదువు కోసం కష్టపడుతుంటారు ఆ దంపతులు. ఉన్న ఊరిలో చదువు అయిపోయిన తర్వాత పక్క ఊరు కాలేజీలో హాస్టల్ లో పెట్టి చదివిస్తూ ఉంటారు సుధాకర్ ని. సుధాకర్ చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవాడు. చదువుతోపాటు ఆటలు పాటలు అంటే కూడా చాలా ఇష్టం పైగా తల్లిదండ్రులు అంటే చాలా అభిమానం. సెలవులకు ఇంటికి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి కన్నీళ్లు వచ్చేవి సుధాకర్ కి. ఎప్పటికైనా తల్లిదండ్రులు ఇద్దరినీ కష్టం లేకుండా చూడాలని సుధాకర్ సంకల్పం.
అలా సుధాకర్ కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం సంపాదిస్తాడు భాగ్యనగరం లో. ఆ తర్వాత కొద్ది కాలానికి రమ్యనిచ్చి పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకుంటారు రామయ్య రమణమ్మలు.
ఎన్నిసార్లు ఆ దంపతులను ఉన్నా ఊర్లో ఇల్లు అమ్మేసి సుధాకర్ తన దగ్గరకు తీసుకెళ్దాం అనుకున్నా సున్నితంగానే తిరస్కరించేవారు. అలా తల్లిదండ్రులు ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక వారానికి ఒకసారి వెళ్లి వస్తుండేవాడు.
అలా కొద్ది కాలానికి రామయ్య హార్ట్ ఎటాక్ తో చనిపోవడంతో రవణమ్మ ఒంటరివి అయిపోయింది. అయినప్పటికీ ఆ ఇల్లు వదిలి రానంటుంది. అలా చనిపోయిన రామయ్య మీద బెంగతో కొద్ది కాలానికి రమణమ్మ కూడా కాలం చేస్తుంది. వరుసగా ఇటువంటి సంఘటనలు జరగడంతో సుధాకర్ బెంబేలెత్తిపోతాడు.
ఆ పల్లెటూర్లో ఉన్న ఇల్లుని అమ్మేసి సామాన్లు ఖాళీ చేస్తుంటే ఏ ఒక్కటి కూడా పని చేసేది కనపడలేదు సుధాకర్ కి. విరిగిపోయిన కుర్చీలు , కోళ్లు విరిగిపోయిన మంచాలు, చిల్లు పడిన గిన్నెలు ఇంకా బట్టలు సరే సరి అవన్నీ పాత సామాన్లు వాడికి ఇచ్చేసాడు.
ఇంకా గదిలో మూలగానున్న పాత ట్రంకు పెట్టి తీస్తుంటే సంవత్సరాలు వారీగా డైరీలు కనబడ్డాయి. ఈ డైరీలు ఎవరివి ? నాన్నకు డైరీ రాసేంత చదువు లేదు. అయితే అమ్మవే అనుకుని డైరీ మొదటి పేజీ చూసాడు. అక్షరాలన్నీ నల్లయింకుతో గుండ్రంగా అందంగా ముత్యాలలా మెరిసిపోతున్నాయి. ప్రతి పేజీలో సుధాకర్ గురించి ఏదో ఒక మాట.
ఆ మొదటి పేజీలో ఇలా ఉంది:
"నా బిడ్డ సుధాకర్ తొలి అడుగులు మొదలుపెట్టిన క్షణం నుంచీ, ప్రతి నవ్వు, ప్రతి కన్నీరు – ఈ పేజీల్లో పదిలంగా నిలిపి ఉంచాలని నేను నిశ్చయించుకున్నాను. ఒక తల్లి హృదయంలో దాగిన ప్రేమకి ప్రతిబింబమే ఈ డైరీలు."
ఆ మాటలు చదివిన సుధాకర్ చేతుల్లోనివి వదిలేశాడు. కళ్లూ వర్షంగా మారాయి. అతని ఊపిరి ఆగిపోయినట్టయింది. అమ్మ వ్రాత అలా ఉండేది! నల్ల ఇంకుతో ముద్దైన అక్షరాలు, ఒక్కో వాక్యమూ ఒకో జ్ఞాపకం. ఆ డైరీలు చేతికి పట్టుకోగానే దూరమైన కాలం తన దగ్గరికి చేరినట్టు అనిపించింది.
ప్రతి డైరీలో తల్లిదండ్రుల ప్రేమ, ఆశలు, భయాలు, ఆశీర్వాదాల ముద్రలు.పల్లె పండుగలు, మొదటి స్కూల్ డే, జ్వరంతో ఒరిగిన రాత్రులు – అన్నీ ఆ డైరీల్లో ఉన్నాయి. ఒక్కో పేజీ తిప్పడమంటే – ఒక్కో యుగాన్ని తిరిగి చూడటమే.
"ఇవి పాత కాగితాలు కావు. ఇవి నా తల్లి గుండె చప్పుడు. ఆమె గది గోడల కన్నీళ్లు. వాటి విలువ నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువగా అర్థమవుతోంది. మనం ఈ జీవితం ఎందుకో పరుగెడతాం... కానీ ఒక్కసారి వెనక్కి చూసుకుంటే – మన గతమే మన భవిష్యత్తుకి అడ్డుగా నిలుస్తుంది. వదిలేస్తే ఇక మిగలదేవీ ఉండదు." అనుకున్నాడు సుధాకర్.
కొన్ని లక్షలు ఖర్చు చేసిన అమ్మ చేతి రాతమాత్రం సంపాదించలేము. అవును ఎలా వస్తుంది. ప్రతి బిడ్డకి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలను చూస్తే తల్లిదండ్రులను చూసినట్లుగా ఫీల్ అవుతారు. పూర్వకాలంలో ఫోటోలు చాలా తక్కువ ఉండేవి.
అలాంటి కాలంలో తల్లిదండ్రుల చేతి వ్రాత ఒక తీయటి జ్ఞాపకంగా బిడ్డలు దాచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మనసు బాగోలేనప్పుడు, పాత సంగతులు గుర్తు చేసుకోవడానికి ఆ డైరీలో రాసిన తల్లిదండ్రుల జ్ఞాపకాలను చదువుతుంటే అందమైన చేతిరాతను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అని ఆ ట్రంకు పెట్టి తో సహా అమ్మ జ్ఞాపకాలన్నీ తనతో పాటు తీసుకొచ్చేశాడు సుధాకర్. అమ్మా నాన్న జ్ఞాపకాలుగా మిగిలిన ఇల్లుని అమ్మేసాడు. ఇక మిగిలింది ఈ డైరీలు, తల్లిదండ్రుల పెళ్లినాటి ఫోటో ఇంతే. అప్పటినుంచి వాటిని అపురూపంగా గూట్లో ఉంచుకుని ప్రతి ఆదివారం చదువుతుంటాడు.
గతమంతా ఒకసారి గుర్తుకొచ్చి కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయాడు సుధాకర్.
ఇంతలో అటుగా వచ్చిన రమ్య "నేను ఏదో మామూలుగా మాట్లాడాను. ఆ డైరీలు కున్న విలువ నాకు తెలుసు. తల్లిదండ్రుల జ్ఞాపకాలు పిల్లలకు ఎప్పటికీ అమూల్యమైనవే. ఈరోజు నుంచి వాటిని మన దేవుడి గూట్లోకి మార్చేస్తాను. రోజు దేవుడితో పాటు ఒక పువ్వు వాటి మీద పెట్టండి అని చెప్పింది రమ్య.
అవును తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఉపయోగించిన వస్తువులు అన్ని దానంగా ఇచ్చేస్తారు. అవి పోగా మిగిలినవి ఇదిగో ఇలా డైరీలు, ఉత్తరాలు, ఫోటోలు మనకు చాలా అపురూపమైనవి. ముఖ్యంగా డైరీలు , ఉత్తరాలలో వాళ్ల మనోగతం అర్థం అవుతుంది. చేతి వ్రాత చూస్తే మనిషిని చూసినట్లు ఉంటుంది.
చాలామంది తల్లిదండ్రుల ఫోటోలు ఉంటాయి కానీ వాళ్లు సొంతంగా తమ చేతితో రాసిన అక్షరాలు ఉన్న ఉత్తరాలు కానీ డైరీలు కానీ ఉండవు. కానీ నిజానికి ఇది చాలా అపురూపమైన జ్ఞాపకం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి