మా పల్లె దీపావళి
అది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని మారుమూల పల్లెటూరు. ఊరు మారుమూలన ఉన్న ప్రజల మనసులు ఆత్రేయ గోదావరి అంత విశాలం. గోదావరి జలాలంత స్వచ్ఛమైన హృదయాలు. బంధాలకి బాంధవ్యాలకి ఉమ్మడి కుటుంబాలకి ఎక్కువ విలువను ఇచ్చే గ్రామం. మామూలుగానే ఎప్పుడు వచ్చే పోయే బంధువులతో పిల్లలతో కళకళలాడుతూ ఉండేది ఆ గ్రామంలోని అగ్రహారం. ఇంకా పండగలు వస్తే చెప్పాలా.
ఇంతకీ ఆ ఊరి పేరు ఏమిటో చెప్పలేదు కదూ. అదేనండి పల్లిపాలెం గ్రామం. ఏ పండగ వచ్చినా ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉండేది .అయితే దీపావళి పండక్కి దీపాలు తెచ్చే వెలుగుతో పాటు ప్రతి ఇంట్లోనూ తయారు చేసే బాణసంచా వెలుగులు చాలా ముచ్చటగా ఉండేవి. కన్నులకు ఆనందాన్ని ఇచ్చేవి.
ఈ గ్రామంలో సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రతి అరుగు మీద
బాణసంచా తయారు చేసేవారు. తారాజువ్వలు ,చక్ర కాయలు, నల్ల మందు తో తయారుచేసిన టపాకాయలు ,చిచ్చుబుడ్లు , పిచ్చుకలు ,మతాబులు సిసింద్రీలు . సుమారు నెలరోజులు దగ్గరుండి వీటి తయారీకి ప్రయత్నాలు ప్రారంభించేవారు.. ఇంటి పెద్దలు వీటి తయారీలో చాలా మంచి నైపుణ్యం సంపాదించి ఉండేవారు. కుర్ర కారు సిసింద్రీలు తయారు చేసేవారు.
ఇవి కాకుండా శివకాశిలోతయారైనబాణసంచాకాకరపువ్వొత్తులు విష్ణు చక్రాలు భూ చక్రాలు అగ్గిపెట్టలు పాము బిళ్ళలు చంటి పిల్లల కోసం ప్రత్యేకంగా కొనేవారు.
ఆకాశంలో రివ్వున దూసుకుపోయే జువ్వల తయారీకి చీట్ల పేక ముక్కలు సంక్రాంతి పండుగ నుంచి దాచి ఉంచేవారు. ఆ రోజుల్లో అరుగుల మీద సంక్రాంతి పండక్కి చీట్ల పేక జోరుగా సాగేది. ఈ బాణ సంచాల తయారీ కావలసిన ముడి సరుకులతో ప్రతి వీధి అరుగు నిండిపోయి ఉండేది. పేకముక్కలను గుల్లలుగా తయారుచేసి వాటిలో మందు కూరి ఎండిపోయిన కొబ్బరి ఈ నెలకు జత చేసి కాస్తంత నిప్పు తగిలించగానే గాలిలోకి రివ్వున దూసుకుపోయేది ఆ తారాజువ్వ. జువ్వలతో విన్యాసాలు ,పోటీలు కొంతమంది రెండు చేతులతో రెండు జువ్వలు కాల్చేవారు. గాలిలోకి వదిలిన జువ్వ ఎంత దూరం పోయిందో చూసుకుని గర్వంగా నవ్వుకునేవారు. కోపం కొద్ది నేల మీద వదిలిన జువ్వ కొంతమందిని పరుగులు పెట్టించిన దృశ్యం ఆనందంగా ఉండేది ఆ రోజుల్లో తెలియక. పశువుల కోసం దాచుకున్న గడ్డివాములు పూరి గుడిసెలు మాడి మసైన సందర్భం కూడా లేకపోలేదు.
ఇక చక్ర కాయలు. దీనికి కావలసిన ప్రత్యేకమైన ముడి పదార్థం మందుతోపాటు పచ్చి తాటాకులు ఎండబెట్టి నలుచదరంగా తయారుచేసిన ఈ చక్ర కాయ ఒత్తి వెలిగించగానే గిర్రును తిరుగుతూ చక్రంలా గాల్లోకి లేచిపోయేది.
ఆ నేల మీద రాలే మెరుపులు చూసి కళ్ళల్లో ఆనందం తోణికిసలాడేది. చేత్తో విసిరిన పిచ్చుక శబ్దం చేస్తూ ఆ పిచ్చుకలాగే గాలిలోకి ఎగిరిపోయేది. శబ్దం తక్కువగా ఇచ్చే నల్ల మందు టపాకాయలు ఒక్కొక్కసారి చేతిలో పేలిపోయిన సందర్భం కూడా ఉండేది. టైరు పేలి పోయినంత శబ్దం. ఇంకొంచెం శబ్దం ఎక్కువ కావాలంటే పటాస్ అనే మందును వేసి తయారు చేసేవారు.
చూడ్డానికి చిన్న సైజు శరీరం దానికి శక్తినిచ్చే మందు రెండు గ్రాములు కూడా ఉండదు. నిప్పు చూపిస్తే అది కోతిలా పరిగెడుతూ ఉంటుంది అటు ఇటు. దాని జీవితం ఒక క్షణకాలం అయినా చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అందుకనే హుషారుగా ఉండే పిల్లల్ని సిసింద్రీ తో పోలుస్తారు.
అసలు దీపావళికి అసలైన అందం ముత్యాలు రాల్చే మతాబులు. ఎవరు కనిపెట్టారో ఈ మతాబుకితాబుఇవ్వకుండా ఎలా ఉండగలం. వెలుగులు అందరికీ పంచి ఇచ్చి తన గుండెకు చిచ్చు పెట్టుకున్న చిచ్చుబుడ్లు ఎలా మర్చిపోతాం. ముత్యాలు రాల్చే ఆ చిచ్చుబుడ్లు తయారు చేసే కుమ్మరి ముత్యo ని ఆత్మీయంగా సత్కరించేవారు ఆ రోజుల్లో.
రంగురంగుల అగ్గిపుల్లల వెలుగుల్లో కాకర పువ్వొత్తుల చిటపటల్లో దీపావళి ఆనందం మాటల్లో వర్ణించలేనిది.
నల్ల రంగులో ఉన్న ఒక బిళ్ళ నిప్పు తగిలించగానే పాము ఆకారంలో మారిపోయేది. కంటికి ఆనందం ఇచ్చిన ముక్కుకి రకరకాల వాసనలు తగిలి వెగటు పుట్టేది.
బజార్లో కొని తెచ్చుకున్న బాణసంచా ఇంటిలో తయారు చేసుకున్న బాణసంచా ప్రతిరోజు ఎండలో పెట్టి దాచుకోవడం
ఒక పెద్ద పని అమ్మకి. ఇది కూడా పండగ పనే. కానీ ఎండ తక్కువగా వచ్చేది. దీపావళికి ముసురులు ఎక్కువగా పట్టేవి
దీపావళి పండక్కి వచ్చే ముఖ్యమైన అతిథి లక్ష్మీదేవి. దీపాలు లక్ష్మీదేవికి ప్రతిరూపం. ఇవి అమావాస్య పండుగకు వచ్చే ప్రత్యేకమైన అతిథులు. మట్టి ప్రమిదలలో వెలిగించిన దీపం ప్రత్యేక పూజలు అందుకుని అరుగుల మీద అందంగా కూర్చునేవి. గోంగూర కాడలతో చేసిన దివిటీలు కొట్టి కాళ్లు చేతులు కడుక్కుని అమ్మ పెట్టిన మిఠాయి తిని బాణ సంచాలు కాల్చడం ప్రారంభించేవారు.
దివిటీలు ఎందుకు కొట్టేవారు ఆ రోజుల్లో తెలిసేది కాదు. దీపావళి పండుగ రోజున పితృదేవతలు తమ పిల్లల గృహాలు చూడడం కోసం ఆకాశ వీధిలో సాయం సంధ్యా సమయంలో వస్తారని వారికి ఆహ్వానంగా ఈ దివిటీలు వెలిగించడం దక్షిణ దిక్కుగా మూడుసార్లు తిప్పడం చేయాలని శాస్త్రం. ఎవరో పెద్దలు చెప్పగా విన్నాను.
ఏ పండగ వచ్చినా అమ్మకే పని. పండగ పనులతో పాటు పిండివంటలతో పాటు దీపాలకు పూజ చేసి మడిగా అరుగు మీద అలంకరించుకుని పిల్లల చేత దివిటీలు కొట్టించుకుని చేతులు కాళ్ల కుండా బాణసంచాలు కాల్పించి హాయిగా ఊపిరి పీల్చుకునే అమ్మ రుణం జన్మజన్మలకు తీర్చలేనిది.
ఇంట్లో చంటి పిల్లలు ఉంటే పొడవాటి కర్ర కు మతాబు కట్టి దానిని వెలిగించి ఆ పిల్ల దాని కళ్ళల్లో వెలుగు చూసి ఆనందపడే పెద్దల సంతోషం మాటల్లో చెప్పలేను.
ఇంత ఆనందంగా జరుపుకునే ఆ దీపావళి పండుగ ఆ ఊరికి భయంకరమైన అనుభవం మిగిల్చింది. ప్రతి దీపావళికి అది గుర్తుకొస్తూనే ఉంటుంది. తెలిసో తెలియకో లేక మొండితనమో రెండు విరుద్ధమైన పేలుడు పదార్థాలు ఒక్కచోటకు చేర్చి నూరుతుంటే ఒక భయంకరమైన మెరుపు తో పాటు పెద్ద శబ్దం వచ్చి ఒక అందాల యువకుడి ప్రాణాలు తీసుకుంది. అప్పటినుంచి దీపావళి అంటే ఒక రకమైన భయం ప్రజల గుండెల్లో మిగిల్చింది.
ఆ ఊరు దీపావళి భయంకరమైన అనుభవంతో పాటు దీపావళి పండుగకి సాహస కార్యం చేయగా వచ్చిన ఆనందం కూడా అనుభవించింది.
ఆ సాహస కార్యానికి నాయకుడు భూపతి రాజు చిన్న వెంకటపతి రాజు గారు ముద్దుగా చిట్టి రాజు గారు అని పిలుచుకునేవారు. ఎత్తయిన భారీ విగ్రహం అందమైన మీసకట్టు
అచ్చ తెలుగువాడిలా పంచ కట్టు అందమైన తలకట్టు చేతిలో ఒక కర్ర నోటిలో పొగాకు చుట్ట చూడగానే సినిమాలోని రాజుగారిలా ఉండేవారు. వయసును బాగా అనుభవించి వయసు మీరిన తర్వాత తన అనుభవాలన్నీ అరుగు మీద శ్రోతలతో పంచుకుని తాను కూడా పురాణ శ్రోతగా మారి పుణ్య కార్యాలకు చేయూతనిస్తూ సరస్వతీ నిలయం లాంటి ఆ అరుగుకి నిత్యఅతిథిగా ఉండి ఒక సంవత్సరం దీపావళికి తన సాహస కార్యానికి శ్రీకారం చుట్టారు.
ఎక్కడి నుంచి సంపాదించారో తెలియదు ఒక గేదె కొమ్ము. ఆ కొమ్ము నిండా మందు కూరి పైన ఒత్తిపెట్టి ఆ కొమ్ముని గునపానికి కట్టి సాయంకాలం ఒత్తి వెలిగించగానే దాని నుండి వచ్చే శబ్దం నేను వర్ణించలేను. దాని ఒత్తిడి లెక్క కట్టడానికి నా దగ్గర కొలమానం లేదు. సుమారు 15 నిమిషాలు ఆకాశంలో నిర్విరామంగా ఆ మెరుపులు దూసుకుంటూ పోతూనే ఉన్నాయి. ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. భయస్తులు దూరంగా పారిపోయారు. అది గాల్లోకి లేచి ఎక్కడ మీద పడుతుందో అని గుండెలు అరచేత పట్టుకుని దూరంగా నిలబడి చూశారు.
అన్నీ తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మలా ఆ రాజుగారు మాత్రం చిద్విలాసంగా నవ్వుతూనే ఉండేవారు.ఇది ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం.
ఇలా దీపావళి రాత్రి ఆనందంగా అలా గడిచిపోయేది. మరుసటి రోజు ఉదయం ఏ వాకిలి చూసినా రహదారి చూసినా కురుక్షేత్ర యుద్ధ భూమిని తలపించేది. విష్ణు చక్రాలు భూ చక్రాలు కాల్చినట్లు వాకిలి పై నల్లటి గుర్తులు, గుండెలు చీలిపోయి నేలపై పడి ఉన్న చిచ్చుబుడ్లు. ఒళ్లంతా కాలిపోయి ఎర్రగా కందిపోయిన కాకరపువ్వొత్తులు, ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు
వెలుగులు పూయించి చివరికి గుప్పెడు మట్టి మనకు మిగిల్చిన మతాబులు, గాలిలోకి ఎగిరి విన్యాసాలు చేసి చేతులు తెగి పడిపోయిన తారాజువ్వలు, బతికున్నంత కాలం భారీ చప్పుడు చేసి చివరికి అవశేషాలు మనకు మిగిల్చి పోయిన టపాకాయలు, ఆ దీపాల అందాన్ని చూసి దగ్గరకొస్తే కాలిపోతామని తెలియక మాడి మసైపోయిన పురుగుల అవశేషాలు , జిడ్డు మొహాలతో ఉన్న అరుగుల్ని శుభ్రం చేయలేక అవస్థ పడుతున్న అమ్మపరిస్థితితలుచుకున్నప్పుడల్లా ఇప్పుడు బాధనిపిస్తుంది.
ఆధునిక కాలంలో బాణసంచాల్లో కూడా విపరీతమైన మార్పులు వచ్చాయి. భారీ శబ్దాలు చేసే బాణసంచా మార్కెట్లోకి వచ్చింది. ఇంద్రధనస్సులో ఉండే రంగులను చూపించే తారాజువ్వలు మార్కెట్లోకి కనిపిస్తున్నాయి.
మట్టి ప్రమిదలలో దీపం బదులు కొందరు కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. కొవ్వొత్తులు వెలుగు అయితే ఇస్తాయి గాని అది దీపావళి కాదు. మట్టి ప్రమిదలు వాడడం వలన ఇంకొక పరమార్ధం కూడా ఉంది.
ఆ ప్రమిదలు తయారు చేసే వారికి పరోక్షంగా మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. అసలే కుల వృత్తులన్ని మట్టి కొట్టుకుపోయాయి. మనం ఆధునికతవైపు అడుగులేస్తే మచ్చుకు కూడా మట్టి ప్రమిదలు కనబడవు.
అలాంటి రోజులు పోయాయి. నాకు తెలిసినంతవరకు సిసింద్రీలు కూడా పిల్లలు ఎవరూ కట్టడం లేదు. ఆ మందు పాళ్లు చెప్పే పెద్దలు కూడా లేరు. ఆ సరదాలు లేవు. రూపాయలు ఖర్చుపెట్టి కొన్న బాణాసంచా 10 నిమిషాలు కూడా వెలుగు ఇవ్వడం లేదు. అమ్మ చేతితో తయారుచేసిన తొక్కుడు లడ్డు స్వగృహ ఫుడ్స్ వారి మిషన్ లో తయారయ్యి అందంగా పెట్టె తోపాటు మన ఇంటికి వస్తోంది దీపావళికి. ఆ రోజుల్లో దీపావళికి పది రోజులు ముందు చక్కగా జంతికలు తయారుచేసి రోట్లో స్వయంగా దంచి జల్లెడ పట్టించి తొక్కుడు లడ్డు తయారుచేస్తే దీపావళికి నాలుగు రోజులు ముందు నాలుగు రోజులు తర్వాత కూడా తినేవాళ్ళం. పండగ నాడు అమ్మ చేసిన చక్ర పొంగలి ఏమిటో తలుచుకుంటేనే ఇప్పటికీ నోరూరిపోతుంది .
ఏ పండగ అయినా సరదాగా జరుపుకోవడం మన కుటుంబం వరకే పరిమితం కాకుండా ఒక్కసారి అలా బయటకు వెళ్లి చుట్టుపక్కల ఉండే అభాగ్యులను చూసి ఒక్క స్వీట్ ముక్క వారి చేతిలో పెట్టి వారి కళ్ళల్లోకి చూస్తే కొన్ని లక్షల మతాబుల కాంతి మనకు కనబడుతుంది. అదే నిజమైన దీపావళి నా వరకు మీకూ ?
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి