బాలు మళ్లీ జన్మించు



ముగ్దమోహన రూపం. పాటంటే ప్రాణం. భాషలో ఉచ్చారణకే ప్రాధాన్యం. భావం పలికించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పుట్టింది పండితారాధ్యుల వంశం. ఏ నోములు నోచిందో తల్లి శకుంతలమ్మ ఆ ఇంట్లో నారద తుంబురులే జన్మించారు బాలుడుగా. ఆరాధించే త్యాగరాజస్వామి కొడుకుగా పుట్టాడు ఆ సాంబయ్య గారింట్లో.

చిన్నతనంలో సాంబయ్య గారి ఇంట్లో జరిగిన సాహిత్య గోష్టులు విని బాలసుబ్రమణ్యం గారికి భాష పట్ల అభిమానం పెరిగింది. నాటకాల పట్ల మమకారం పెరిగింది. పాడాలనే కోరిక పెరిగింది. 
కళాశాల విద్య స్థాయి దాటి సాంకేతిక విద్య నేర్చుకోమంటే సరిగమల వైపు మొగ్గు చూపిందా గళం.

పుట్టింది ఎక్కడో నెల్లూరు జిల్లాలో అయినా తన గొంతులో ఒకటా రెండా 40 వేల పాటల పాడి విశ్వం అంతటికి చిరపరిచితుడు అయ్యాడు మన బాలసుబ్రమణ్యం. ఆరాధ్య గాయకుడయ్యాడు. భాషతో నిమిత్తం లేదు. ఎన్ని భాషలలో పాటలు పాడాడో లెక్కలేదు. ప్రతి దేవాలయము బాలు గొంతులోని సుప్రభాతం తోటే భక్తి పాటల తోటే తలుపులు తెరుచుకుంటాయని చెప్పడం అతిశయోక్తి కాదు. 

ఒక మతమునకు సంబంధించిన పాట అయినా ఒక భాషకు సంబంధించిన పాట అయినా ఆయన గొంతులో అది సుస్వరాల మూట.

అది అనుకరణ అంటే అనుకరణ కాదు. చలన చిత్రంలో నటించే నాయకులు గొంతులో తను పరకాయ ప్రవేశం చేసి పాట పాడడం ఆయన విశిష్ట లక్షణం. నిజంగా ఆ నటుడే ఆ పాట పాడాడని మనం అనుకుంటూ ఉంటాం. ఆ పాటకి పరవశించిపోతాం. ఎంత కష్టతరమైన పాట అయినా పాడి ఆ పాటకు అర్థం చెప్పగల సత్తా ఉన్న వ్యక్తి బాలసుబ్రమణ్యం.

 అందుకే ఏ దివిలో విరిసిన పారిజాతమో మన భువిలో మనకు ఆరాధ్య గాయకుడయ్యాడు. ఆ సుస్వరాల కోయలని దగ్గరకు తీసుకుని చలనచిత్ర రంగంలో వెన్ను తట్టి ప్రోత్సహించాడు కోదండపాణి. ఆ కొత్త గొంతుని ఆదరించింది సినిమా రంగం ప్రేక్షక లోకం. ఆయన గొంతుని ఆదరించని సంగీత దర్శకుడు లేడు. ప్రముఖ సంగీత దర్శకులు అందరూ తప్పులు సరిదిద్ది భుజం తట్టి భయం పోగొట్టి ముందుకు నడిపించిన మహనీయులే. ఆ గొంతులో విషాదమైన చిలిపి పాటైన సుస్వర సంగీత ప్రధానమైన పాటైన అవలీలగా పాడే సత్తా సంపాదించుకున్న బాలు భారతదేశం గర్వించదగ్గ గాయకుల్లో ఒకడని చెప్పడంలో సందేహం లేదు.

ఆయన గొంతులో పాడిన పాట ఏ పాట కాపాటే ఆణిముత్యం. అలా 1966వ సంవత్సరం నుంచి 2o20 సంవత్సరం వరకు సుమారు 40 వేల పాటలు అన్ని భాషలలోనూ పాడి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మ శ్రీ అవార్డులని ఇరవై ఐదు నంది అవార్డులను ఇంకా ఎన్నో అవార్డులను రివార్డులను తన సొంతం చేసుకుని భారతదేశ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం మన జాతి గర్వించదగ్గ గొప్ప గాయకుడు.

శంకరాభరణం అనే సంగీత ప్రధానమైన సినిమాతో సినీ కళామతల్లి మెడలో వేశాడు సుస్వరాల హారం. శంకర నాద శరీరాపర అంటూ గళం ఎత్తి పాడుతుంటే నిజంగా ఆ పాత్రలోని శంకర్ శాస్త్రి పాడినట్లుగానే ఉంది. ఆ సినిమా కోసం సంగీత స్వరాలు నేర్చుకుని పాటలు పాడి జాతీయస్థాయిలో బహుమతులు సంపాదించి చలనచిత్ర రంగంలో శంకరాభరణం సినిమాని ఒక అత్యుత్తమ స్థాయిలో నిలబడింది అనడానికి ఆ సినిమా కథతో పాటు నటుల నటనాచాతుర్యం దర్శకుడు ప్రతిభ సంగీత దర్శకుడు తో పాటు బాలు గారి గొంతు కూడా ఎంతో సహాయం చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు .

 అక్కడి నుంచి అన్ని సంగీత ప్రధానమైన చిత్రాలు తీసిన మహాదర్శకుడు కే విశ్వనాధ్ గారి సినిమాలో పాటలు అన్ని సంగీత ప్రధానమైనవే. శత దినోత్సవాలు జరుపుకున్న సినిమాలకి బాలు గారి పాట కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

 పాటలు అందరూ పాడతారు సంగీత దర్శకుడు నేర్పిస్తాడు. ఆ బాణీలో అందరూ పాడుకుంటూ వెళ్లిపోతారు. భాషలో ఉచ్చారణకి భావానికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిన మహా వ్యక్తి బాలు. బాలు గారు తన గొంతులో సుస్వరాలు పలికించడమే కాదు అద్భుతమైన పాత్రలలో కూడా తన విశ్వరూపం చూపించాడు. మిధునం సినిమాలోని అప్పదాసు పాత్ర లో తన నటన కౌశల్యం నిజంగా ఒక పదవీ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయుడు తన విరామ జీవితాన్ని ఇలాగే గడుపుతాడా లేకపోతే ఇలా గడపాలా అనిపించింది ఆ పాత్ర చూస్తే. ఎన్నో సినిమాలు నటించి ఉండొచ్చు కానీ ఈ పాత్ర ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రని ప్రేక్షకులు అందరూ మెచ్చుకున్నారు. వయసు ఏడు పదులు దాటిన విసుగు విరామం లేకుండా స్వరాభిషేకo లాంటి ఈటీవీ వారి కార్యక్రమాల్లో అన్ని గంటలు సేపు ఆ వేదిక మీద నిలబడి పాటలు పాడి ప్రతి పాటకు సందర్భం అర్థం చెప్పి పాట అప్పటికప్పుడు కొత్త బాణీలో పాడి ప్రేక్షకుల గుండెలను దోచుకున్న బాలు గారు నిజంగా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి.

గొంతులో సుస్వరాలు పలికించడం నటనతో ప్రేక్షకులను మెప్పించడo తోటి ఆగలేదు బాలసుబ్రమణ్యం గారు. పాడుతా తీయగా వంటి ఉత్తమ పాటల పోటీ కార్యక్రమం ఈటీవీ ద్వారా ప్రారంభించి ఎన్నో వేల కొత్త కోయిలను చలనచిత్రం రంగానికి పరిచయం చేసిన మహానుభావుడు.

 మైకు కూడా పట్టుకోలేని ముక్కుపచ్చలారని ఆ పసిబిడ్డలనీ లాలించి బుజ్జగించి భాషలో తప్పులు సరిదిద్ది వెన్నుతట్టి ప్రోత్సహించి తాను చిన్న పిల్లవాడిలా మారి వాళ్లతో స్నేహం చేసి ప్రతిభ వెలుపలకు తీసి లోకానికి కొత్త గళాలని పరిచయం చేసిన బాలు నిజంగా అభినందనీయుడు. పాడుతా తీయగా కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత తెలుగు భాషలో పాటలు పాడుతున్నప్పుడు ముఖ్యంగా పదాన్ని ఏ విధంగా ఎలా పలకాలి దాని భావం ఏమిటి అని గాయకుడికి విడ మరిచి చెప్పిన మహానుభావుడు బాలు. ఈ వేదిక మీద చిన్నారులందరూ ముందు భాష సరిగా పలకడం నేర్చుకోవడం చాలా అద్భుతమైన విషయం. 

భావం తెలియని పిల్లలు తప్పు పాడడం సహజం. తప్పు సరిదిద్దకపోవడం పెద్దలు చేస్తున్న తప్పు. అందుకు భిన్నంగా ఒక పెద్దన్నయ్యగా పిల్లలందరికీ తప్పొప్పులు సరిదిద్ది ఎంతోమందిని ఆ చిత్ర సీమకు పరిచయం చేసిన బాలు నిజంగా చిర స్మరణీయుడు. సుమారు రెండు దశాబ్దాలు క్రిందట ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనాటి వరకు సాగుతుందంటే ఆ మహానుభావుడు చేతి చలవని చెప్పచ్చు. పాడుతా తీయగా కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఎంతోమంది సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారని చెప్పడం లో సందేహం లేదు. చిన్నారులు పాటలు పాడినప్పుడు ఆ పాట వ్రాసిన వారి పేరు సంగీత దర్శకుడు పేరు కూడా చెప్పించడం చాలా గొప్ప విషయం. 
ఇంతటి మహాద్భుతమైన కార్యక్రమం విజయవంతమై ప్రజల మన్ననలు పొందింది అంటే దాని వెనుక బాలు గారి కృషి ఎంత ఉందో మనం చెప్పక్కర్లేదు. ఆయన శతస్కోపు మెడలో వేసుకుని సూది మందు వేసే డాక్టర్ కాడు. రాగాలతో రోగాలు నయం చేసే సుస్వరాల మాంత్రికుడు. 

పాటలు పాడడమే కాదు తెరమీద నటుడుగా వీరంగం చేయడమే కాదు ఎంతోమందికి గాత్ర దానము చేయడమే కాదు బుల్లితెర మీద వ్యాఖ్యాతగా సంగీత దర్శకుడుగా పలు రంగాలలో కృషిచేసిన మన బాలు జూన్ 4 1946వ సంవత్సరం లో శకుంతలమ్మ సాంబమూర్తి దంపతుల కడుపున జన్మించడం భారతదేశం చేసుకున్న అదృష్టం. ఆయన ప్రతిభ చూసి ఆయన భూలోకంలో ఉండదగిన మనిషి కాదని స్వర్గలోకం తీసుకెళ్లిపోయాడు దేవుడు. ఇది నిజంగా మనందరి దురదృష్టం. ఒక మనిషి లాంటి మనిషి మళ్లీ పుట్టడు. ఏ మనిషి విజ్ఞానం ఆ మనిషిదే. ఎవరి ప్రతిభ వారిదే. 

బాలు మళ్లీ జన్మించు. తెలుగు పాటను బ్రతికించు. తెలుగు భాష గొప్పదనాన్ని నీ గళ o లో పలికించు. పాటను నమ్ముకుని చలనచిత్రం రంగంలో అడుగుపెట్టే గాయకులందరకి ఆదర్శమూర్తి వై దారి చూపు. నిజంగా బాలు గారు ఈ లోకం విడిపోవడం మనందరి దురదృష్టం .ఆ మహా మూర్తికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట