రమణమ్మ మామిడి తోట
తెల్లవారుజామున 5:00 అయింది.
ఆ ఐదుగురు అన్నదమ్ములు గట్టు దిగి వ్యవసాయం చేసే రైతులు కాదు గాని, ఆస్తి ఉండి కూలివాళ్లని పెట్టి వ్యవసాయం చేస్తూ, పశువులను పెంచుకుంటూ ఉండే ఊర్లో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబీకులు.
అలాంటి అన్నదమ్ములు ఉదయమే లేచి పొలాలకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం ఒక అలవాటు. ఆరోజు ఎప్పటిలాగే పొలం వెళుతున్న అన్నదమ్ములను చూసి ఆ ఊరి మోతుబరి రైతు వెంకటరెడ్డి ఎదురొచ్చి –
"ఏవండీ మావయ్య గారు, ఈ స్థలం ఇలా వదిలేసారేటండి? ఇందులో మామిడి మొక్కలు పెంచండి. ఈ మట్టి అందుకు బాగా పనిచేస్తుంది" – అని ప్రతిరోజు సలహా ఇచ్చేవాడు.
ఆ అన్నదమ్ములకు అందరికీ పొలం అనుకుని నాలుగు ఎకరాల మెరక ఉండేది. అందులో పిచ్చి మొక్కలు మొలిచిపోయి, ఎవరు అందులోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉండేది.
ఆ రైతు చెప్పిన మాటలను వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు.
"మాకు ఇప్పటికీ నలభై ఏళ్లు దాటిపోయాయి. ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. ఒకవేళ మామిడి మొక్కలు వేసి అవి కాపు కాసే సమయానికి మనం ఉంటామా ఏమిటి?" – అనుకునేవారు.
అన్నదమ్ముల పరిచయం
ఆ అన్నదమ్ముల్లో పెద్దవాడు పెద్ద సుబ్బారావు. ఆయన యానంలో మన్యం మహాలక్ష్మి వారి సంస్థానంలో పన్ను వసూలు అధికారిగా పనిచేసేవాడు.రెండవవాడు గవర్రాజు – ఆ ఊరికి పంచాయతీ బోర్డు గుమస్తా.
మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు – చిన్న సుబ్బారావు, కామరాజు, అచ్యుతరామయ్య – ఆయుర్వేద వైద్యులు.ఇలా వారు ఉమ్మడి కుటుంబంలో కాలక్షేపం చేస్తూ ఉండేవారు.
ఐదుగురు అన్నదమ్ముల కన్నతల్లి రవణమ్మ డబ్బైఏళ్లు దాటినప్పటికీ ఎంతో ఓపిగ్గా అటు ఇటు తిరుగుతూ కోడళ్ళకి ఇంటి పనులు సహాయం చేస్తూ ఉండేది.
ఆవకాయ – మామిడి కోరిక
వేసవికాలం వచ్చేటప్పటికల్లా ఆవకాయ కోసం ఎక్కడెక్కడకో తిరిగి కాయ తెచ్చుకోవాల్సి వచ్చేది. ఉమ్మడి కుటుంబం కాబట్టి చాలా పెద్ద మొత్తంలో ఆవకాయలు పెట్టవలసి వచ్చేది. డబ్బు, శ్రమ రెండూ ఎక్కువ.
అయినా ఊరగాయ లేకపోతే ఆ రోజుల్లో ఎవరికి ముద్ద దిగేది కాదు. ఇంక మామిడిపళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు!
ఇంకా రవణమ్మ గారికి మామిడిపండు అంటే ప్రత్యేకమైన ఇష్టం. వేసవికాలం వెళ్లిపోయే వరకు ప్రతిరోజూ మామిడిపండు లేకుండా అన్నం తినేది కాదు.
ప్రతి వేసవికాలంలోనూ రవణమ్మ గారు "మనకు అంత స్థలం ఉంది, నాలుగు మామిడి మొక్కలు పెంచుకోలేకపోయాము. మీకు దేనికి శ్రద్ధ లేదు రా!" అంటూ రోజు సాధిస్తూనే ఉండేది.
పెద్ద సుబ్బారావు ఆలోచన
పొలంలో రైతు వెంకటరెడ్డి మాటలు, ఇంటిదగ్గర రవణమ్మ మాటలు – ఈ రెండింటినీ భరించలేక చివరికి పెద్ద సుబ్బారావుకి ఒక మంచి ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి ఆ స్థలాన్ని శుభ్రం చేయించి, వర్షాకాలం వచ్చిన తర్వాత బాగా దున్నించి సిద్ధం చేశాడు.
"సరే, పొలం రెడీ అయింది. రేపు కడియం వెళ్లి మామిడి మొక్కలు తీసుకుని రండి రా!" అంటూ తమ్ముళ్లను పంపించాడు.
కడియం ప్రయాణం
అప్పట్లో కడియం వెళ్లాలంటే ఎడ్లబండిపై వెళ్లడమే. అలా తిప్పలు పడి నలుగురు అన్నదమ్ములు తమ బంధువుల ఇంటికి చీకటి పడే వేళ చేరుకున్నారు.
బంధువులు మర్యాదలు అన్నీ చేసిన తర్వాత, అసలు విషయం బయటపెట్టారు అన్నదమ్ములు.అవతల వాళ్ళు ఒకటే నవ్వు.
"ఏమిటి? మామిడి తోటలు వేస్తారా? వాటిని పెంచడం మీ వల్ల అయ్యే పని కాదు. కూలివాళ్లని పెట్టి పెంచాలంటే మీ జీవితాలు సరిపోవు!" – అంటూ హేళనగా మాట్లాడారు.
అయినా వారి మాటలను లెక్కచేయకుండా అన్నదమ్ములు మామిడి మొక్కల నర్సరీలోకి వెళ్లారు.
ఒకటా రెండా కాకుండా సుమారు వందకు పైగా మొక్కలు కావాలి. అలా తిరిగి తిరిగి మొక్కలను కొనేసేటప్పటికి సాయంకాలం అయ్యింది.
మరుసటి ఉదయం ఆ మొక్కలన్ని ఎడ్లబండిపై వేసుకొని సాయంకాలానికి ఇంటికి చేరుకున్నారు.
రవణమ్మ ఆనందం
ఆ మామిడి మొక్కల్ని చూడగానే రవణమ్మకి ఏనుగు ఎక్కినంత సంబరం వచ్చింది.
"దేవుడి దయతలిస్తే ఈ మొక్కలన్నీ బతికి బట్టకడితే బోల్డంత మామిడికాయలు మన కుటుంబానికి వస్తాయి. మనం ఎవరికైనా ఇవ్వచ్చు కూడా!" – అంటూ హడావుడి చేసింది.
"ఒరేయ్ పెద్దోడా, నువ్వు నాలుగు రోజులపాటు ఇంటిపట్టునే ఉండి మన కుర్రాళ్ల చేత మొక్కలన్నీ నాటించు!" – అని ఆదేశించింది.తల్లి అంటే చాలా భయం, భక్తి – ఆ అన్నదమ్ములందరికీ.
మొక్కలు నాటడం
ఈ నాలుగు ఎకరాల మెరక పొలం అన్నదమ్ముల ఇంటికి దగ్గర్లోనే ఉండేది. అప్పట్లో ఇంట్లో మలవిసర్జనశాలలు ఉండేవి కాదు. అందరూ చింతచెట్ల దగ్గరకి చెంబులు పట్టుకొని వెళ్లేవారు.
ఆ చింతచెట్లు దగ్గరకి వెళ్లాలంటే ఈ మెరక దాటుకోవాల్సిందే.
అలా మరుసటి ఉదయం పాలేర్ల చేత మామిడి మొక్కలన్ని నాటించడం మొదలు పెట్టారు అన్నదమ్ములు.
"అన్ని వరుసగా నాటకండి. ఈ స్థలాన్ని ఐదు భాగాలుగా చేసి, అన్ని రకాల మామిడి మొక్కలు అన్నిచోట్లనూ వచ్చేలా నాటండి" – అని సలహా ఇచ్చింది రవణమ్మ.
ఆవిడ ముందుచూపే ఎక్కువ.మొక్కలు లేత ఆకులతో పొట్టిగా ఉండి చూడడానికి ముచ్చటగా ఉండేవి.
అందులో పాపయ్యరాజు, గోవా, చెరుకురసం, చిన్నరసం, నీలం, పంచదార కలశ, బుడతలు, బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి, ఎర్రకాయలు – ఇలా రకరకాల మొక్కలు నాటించింది రవణమ్మ.
ఊరి వెటకారం – రవణమ్మ ధైర్యం
ఇలా మొక్కలు నాటుతుంటే దారిపొడవునా వెళ్ళేవాళ్ళు ఏదో ఒక వెటకారం చేసేవారు –
"బ్రాహ్మణులు వ్యవసాయం చేస్తున్నారని! ఇన్ని మొక్కలు పెంచడం మీ వల్ల అవుతుందా?"ఆ మాటలు రవణమ్మకి మనసుకు బాధ కలిగించేవి.
అందుకే ఆ మొక్కలను ఎలాగైనా పెంచి పెద్ద చెట్లుగా చేయాలని ఆవిడ సంకల్పించుకుంది.
మొక్కలు నాటడం అయిపోయిన తర్వాత ఆ తోట అంతా చూసి రవణమ్మకి ఎక్కడలేని ఆనందం కలిగింది.
"ఒరేయ్ పెద్దోడా, ఈ వర్షాకాలం పరవాలేదు గాని కార్తీకమాసంలో ఒక పెద్ద నుయ్యి మాత్రం తవ్వించాలి ఇక్కడ. నువ్వది మాత్రం అశ్రద్ధ చేయకు" – అని చెప్పింది.
ప్రతిరోజూ ఉదయం కొడుకులతో పాటు రవణమ్మ తోటలో తిరిగి మొక్కలన్నీ జాగ్రత్తగా చూసేది – ఒక చంటి పిల్లాడిని తల్లి చూసినట్టుగా.
వర్షాలు బాగా కురవడంతో మొక్కలు తొందరగానే పట్టి, తలలు ఎత్తి వర్షపు గాలికి అటూ ఇటూ ఊగేవి.
అది చూసి రవణమ్మకి – "స్కూలుకి వెళ్తున్న చిన్నపిల్లాడు ‘టాటా’ చెబుతున్నట్లుగా– అనిపించేది.
తోట సంరక్షణ సమస్య
మొక్కలకు నీళ్లు పోస్తాం, పశువుల పంట వేస్తాం – బాగానే ఉంది. కానీ చుట్టూ పక్కల ఉన్న ఇంటివాళ్లందరికీ పశువులు ఉన్నాయి. మరి వాటి నుండి ఈ తోటను ఎలా కాపాడుకోవాలి?
అదే పెద్ద సమస్యగా అనిపించింది రవణమ్మకి
చుట్టూ ప్రహరీ గోడ కడదామంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా కర్రలతో, ముళ్ళకంచెలతో ఒక గోడలా కట్టించి ఏదో సంతృప్తి పొందింది రవణమ్మ.
నుయ్యి – నీటి కష్టం
కార్తీకమాసం రాగానే ఓ మంచి ముహూర్తంలో తోటలో పెద్ద నుయ్యి త్రవ్వించారు రవణమ్మ కొడుకులు.ప్రతిరోజూ తెల్లవారుజామున తల్లి–కొడుకులు అందరూ కలిసి తోట దగ్గరకి వెళ్లేవారు. ఇద్దరు నీళ్లు తోడుతుంటే, ముగ్గురు ఆ మొక్కలకు నీళ్లు పోసేవారు.ఆ తోటలో ఒక్కో భాగానికి తన కొడుకుల పేర్లు పెట్టుకుంది రవణమ్మ.
మొదటి భాగం మొక్కలను "పెద్దోడా" అని, చివరి భాగం మొక్కలను "అచ్యుతం" అని పిలిచేది.
"ఒరేయ్ పెద్దోడా, నీకు దాహం తీరిందా?"
"ఒరేయ్ అచ్యుతం, నీకు ఇంకా ఆకలేస్తుందా?"
అలా ప్రేమగా పలకరించేది.
"చూడరా, అచ్యుతం గాడు ఎలా తల ఊపుతున్నాడో!" – అంటూ ఆనందపడేది ఆ ముసలమ్మ.
ఎమిటో, ఆవిడకి ఆ పిచ్చి ప్రేమ ఆ మొక్కలంటే!
కోడళ్ళ మీద కోపం
ఒకరోజు రవణమ్మ–కొడుకులు తోట నుంచి వచ్చేసరికి కోడళ్ళందరూ పెరట్లో కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.
అలా నాలుగు రోజులు చూసింది.రవణమ్మకి ఒళ్ళు మండిపోయింది
"ఏమిటి? మేమంతా కష్టపడుతుంటే వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. రేపు కాయలు కాస్తే వీళ్ళు తినరా!" – అనుకుంది.అలా ఒకరోజు బాంబులాంటి వార్త పేల్చింది.
మరుసటి రోజు నుంచి కోడళ్ళు ఒకరోజు, కొడుకులు ఒకరోజు – మొక్కలకు నీళ్లు పోవాలని హుకుం జారీ చేసింది.కానీ రవణమ్మ ప్రతిరోజూ వారికీ సహాయం చేసేది.
కష్టాల మధ్య సంరక్షణ
అప్పట్లో ఎరువులు వేయడం ఉండేది కాదు. పెరడు నిండా పశువులు ఉండేవి కాబట్టి, ప్రతిరోజూ ఆ పశువుల పేడనే మొక్కల్లో వేయించేది.
అలా ఒకరోజు తోటలోకి వెళ్ళేసరికి రెండు మామిడి మొక్కలు కింద పడిపోయి కనిపించాయి.చంటి పిల్లాడు కింద పడితే ఎట్లా బాధపడతామో, అట్లానే బాధపడింది రవణమ్మ.మరలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, కంటికి రెప్పలాగా చూసుకోసాగింది.
"ఏవండీ రమణమ్మ గారు! వ్యవసాయం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మామిడిపళ్ళు ఎప్పుడు పెడుతున్నారు?" – అంటూ ఊరి ప్రజలు వెటకారంగా మాట్లాడితే,
"చూడండి! మీరే కాదు, మా వంశీకులు మూడు తరాల వాళ్ళు ఈ మధుర ఫలాలు తింటారు. చూస్తూ ఉండండి!" – అని ధైర్యంగా సమాధానం ఇచ్చేది.
తోట పెరిగిన సంతోషం
అలా ఐదేళ్లు గడిచిపోయాయి. ఎంతో ప్రేమతో నాటిన మామిడి మొక్కలు బతికి బట్టకట్టి ఆకులు, కొమ్మలతో పెద్ద చెట్లుగా మారాయి.
రవణమ్మ శీతాకాలం వచ్చేటప్పటికి ఎక్కడైనా పూత కనబడుతుందేమో అని ఆశగా చూసేది.ఒకరోజు పాపయ్యరాజు గోవా చెట్టుకి చిటారు కొమ్మన పూత కనబడింది.
ఇంకేముంది! ఆవిడ ఆనందానికి హద్దుల్లేవు. ఇంటికి పరుగెత్తి అందరితో చెప్పే వరకు మనసు ఆగలేదు.
రవణమ్మ – తోట తల్లిగా
రవణమ్మకి అప్పటికే మూడు పదుల సంఖ్యలో మనవలు ఉన్నారు.క్రమేపీ తోటలోని చెట్లు పూతతో నిండు గర్భిణీలా కనబడ్డాయి రవణమ్మకి.అంత పెద్ద తోటకి నీరు తోడటం, మొక్కలను పెంచడం నిజంగా కష్టమైన పని.
కుటుంబంలో పెద్దవాళ్ళు ఆస్తి సంపాదించి వారసులకు ఇవ్వడానికి కష్టపడతారు. కానీ మామిడి తోట పెంచి వారసులకు ఇవ్వడానికి కష్టపడిన వారు రవణమ్మలాంటివారు చాలా అరుదు.
పూత – – కాయలు
తోట పూతతో మెరిసిపోయినప్పటికీ కొంత పూత మంచుకి మాడిపోయేది. మిగిలిన పూత చిన్న కాయ గా మారి రోజురోజుకీ ఎదుగుతూ ఉండేది.రవణమ్మ కుటుంబమంతా ఆనందపడేది.అప్పటికి రవణమ్మకి డబ్బై ఐదు ఏళ్లు వచ్చేసాయి.ఒపిక లేకపోయినా, ఒక బకెట్ నీళ్లు అయినా పోయకుండా ఉండేది కాదు.
ఒకరోజు తోటలో నీళ్లు తోడుతూ అలాగే కూలిపోయింది రవణమ్మ.కర్మకాండకి వచ్చిన బంధువులందరూ ఆ తోట చూసి ఆశ్చర్యపడ్డారు.తోటల పెంపకంలో రవణమ్మ ఆ ఊరి వారికి ఆదర్శమైంది. అదే బాటలో చాలామంది తోటలు పెంచారు.
తోట – వంశానికి వారసత్వం
ఆ తోటలో పండిన మొదటి కాయలు తింటూ కుటుంబ సభ్యులు ఆనందపడుతూనే, మరోపక్క బాధపడేవారు –
"ఇంత శ్రమపడి పెంచిన మామిడి తోటలో కాసిన పండు ఒక్కటి కూడా రుచి చూడకుండా చనిపోయింది రవణమ్మ!"
అప్పటి నుంచి ఆ తోటలో పండిన మామిడి పళ్ళను మొదట ఒక బీద బ్రాహ్మణునికి ఇచ్చి, నమస్కారం చేసి తినే ఆచారం ఏర్పడింది.
ఆ తోట ఇచ్చిన మధురఫలాలను రవణమ్మ వంశీకులు రెండు–మూడు తరాల వాళ్ళు కడుపునిండా తింటూ, కావాల్సిన వారికి ఇస్తూ, దూరప్రాంతాల్లో ఉన్న బంధువులకు పంపిస్తూ ఆనందం పొందారు.
రచయిత అనుభవం
ఈ కథ కొంత కల్పితమైనప్పటికీ, ఆ మధురఫలాలు ఇచ్చే మామిడి తోటను పెంచిన వారు మా ఐదుగురు తాతలు.
ఆ ఫలాలను తింటూ మధురానుభూతి పొందిన వారిలో నేను కూడా ఒకడిని.
మామిడి పిందిగా పప్పుతో, కాయగా ఆవకాయగా, పండుగా తీపి మామిడిపండుగా – ఇలా అనేక రూపాల్లో ఉపయోగపడిన ఆ మామిడి చెట్టు ఇచ్చిన మధురఫలాలను ఎలా మర్చిపోతాం?
✍️ రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ – 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి