శ్రీరామచంద్రుడు
సకల గుణాభిరాముడు
భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై దశావతారాలు ఎత్తి
ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. అయితే త్రేతా యుగంలో శ్రీరాముడుగా మానవ రూపంలో జన్మించి రాక్షస సంహారం చేసి
లోకాన్ని రక్షించాడు. శ్రీరాముని జీవితమే ఒక మహా కావ్యంగా వ్రాసిన వారు వాల్మీకి మహర్షి. ఆదికవి వాల్మీకి 24 వేల శ్లోకాలతో రామాయణం రచించి సీతారాముల కథను
లోకానికి తెలియజేశాడు.
రామాయణం భారతజాతి గర్వించదగ్గ ఉత్తమమైన కావ్యం.
ఈ ఆదికావ్యాన్ని చదివితే శ్రీరామ చంద్రమూర్తి గొప్పదనం మనకు తెలుస్తుంది. శ్రీరామచంద్రమూర్తి ఆదర్శవంతమైన పురుషుడు ఎందుకైనాడో మనకు తెలుస్తుంది. ఆదర్శవంతుడు అంటే అనుసరించదగినవాడు అని అర్థం.
శ్రీరామచంద్రుని గుణగణాలను పరిశీలిస్తే ఎల్లప్పుడూ సత్యము మాట్లాడేవాడు మృదుభాషి నిగర్వి ఎవరినైనా తానే ముందుగా పలకరించేవాడు పరుషంగా మాట్లాడేవాడు కాదు.. అన్నదమ్ములతో తల్లితండ్రులతో భార్యతో ప్రజలతో వివిధ సందర్భాలలో ప్రవర్తించిన తీరును బట్టి శ్రీరామచంద్రమూర్తి ఆదర్శవంతుడైన పురుషుడని ప్రజలు వెయ్యినోళ్ల కీర్తించేవారు.
అయోధ్య నగరానికి రాజైన దశరథ మహారాజుకి పుత్ర కామేష్టి యాగ ఫలితంగా అవతార మూర్తి అయిన శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు. దానినే శ్రీరామనవమి పండగగా మనం జరుపుకుంటున్నాం. ఆగమ శాస్త్ర ప్రకారం మహనీయులు పుట్టినరోజు నాడే కళ్యాణం కూడా జరిపించడం మన ఆచారం.
ఇక బాల్యంలోనే శ్రీరామచంద్రుడు సకల శాస్త్రాలు సకల విద్య లు నేర్చుకుని విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణ చేసి సీతా స్వయంవరంలో శివధనుర్భంగం చేసి జానకిని ధర్మపత్నిగా స్వీకరించాడు.
తండ్రి దశరధుడు శ్రీరామచంద్రుని అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుని చేయడానికి సంకల్పించాడు. కాల మహిమ ఎవరు చెప్పగలం .
పినతల్లి కైకేయి వరాలు తీర్చడం కోసం 14 సంవత్సరమలు వనవాసం చేయవలసి వచ్చింది. పితృవాక్య పరిపాలన
కోసం వనవాసం చేసిన మహనీయుడు. ఇచ్చిన మాట తప్పని
పితృ వాక్య పరిపాలకుడు.
పితృసేవ పిత్రాజ్ఞ పాలన మించిన ధర్మం ప్రపంచంలో మరొకటి లేదు అంటాడు కైకేయి తో రాముడు ఒకానొక సందర్భంలో . పు
శ్రీరామచంద్రుడు పితృ వాక్య పరిపాలపకుడు కాకుండా మాతృభక్తి కూడా చెప్పుకోదగ్గది. జన్మనిచ్చిన కౌసల్యతో పాటు పిన తల్లులైన కైకేయి సుమిత్రలను కూడా సమానంగా ప్రేమించేవాడు. అయోధ్య రాజ్యాధిపతనికానివ్వకుండా తన కోరికతో అడవుల పాలు చేసిన కైకను ఎన్నడు పరుషంగా మాట్లాడలేదు. అంతేకాకుండా తన సోదరులైన భరత శత్రుఘ్ను లను లక్ష్మణుని కైకేయిను నిందించవద్దని హితవు చెబుతాడు.
శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు . పర స్త్రీలను కన్నెత్తి చూసేవాడు కాదు .ఆ కాలంలో బహుభార్యత్వం తప్పులేదు. సాక్షాత్తు శ్రీరామచంద్రుని తండ్రిగారైన దశరథుడికి ముగ్గురు భార్యలు .అయినా రామచంద్ర మూర్తి ఏ సందర్భంలోనూ కూడా ఏకపత్నివ్రతం వీడలేదు.ఒకానొక సందర్భంలో సీతాదేవి లేకుండా శ్రీరామచంద్రుడు యాగము చేయవలసి వచ్చినప్పుడు స్వర్ణ సీతను తయారు చేయించి యాగం పూర్తి చేసిన మహా వ్యక్తి. భార్య మీద అమితమైన ప్రేమ కలవాడు.
సీతాపహరణం సమయంలో అరణ్యంలో తిరుగుతూ కనబడిన చెట్టు పుట్టను సీత జాడ గురించి అడుగుతూ మతిభ్రమించిన వారి వల్లే తిరుగుతూ కొన్ని సందర్భాలలో మూర్చపోతూ తల్లడిల్లి పోతాడు. భార్య వియోగం తో తల్లడిల్లిపోయాడు. అయినప్పటికీ పర స్త్రీని కన్నెత్తి చూడలేదు
రామలక్ష్మణుల మీద ప్రేమతో వెంటబడిన రాక్షస స్త్రీ
శూ ర్పణఖ ను ముక్కు చెవులు కోయించి తిరిగి పంపుతారు.
శ్రీరామచంద్రమూర్తి తన సోదరుల మీద అమితమైన ప్రేమ కలిగి ఉండేవాడు. లక్ష్మణునితో అమితమైన స్నేహం కలిగి ఉండేవాడు. విశ్వామిత్ర యాగ సంరక్షణ రామలక్ష్మణులు ఇద్దరు
కలిసి చేసి విశ్వామిత్ర అనుగ్రహానికి పాత్రులు అవుతారు. శివధనుర్భంగం జరిగిన తర్వాత నలుగురు అన్నదమ్ములకు ఒకే వేదికపై వివాహం జరుగుతుంది. పినతల్లి కోరిక ప్రకారం రామచంద్ర మూర్తి అరణ్యవాసం చేయవలసి వచ్చినప్పుడు
లక్ష్మణుడు కూడా రాముని వెంట వెళ్తాడు.
వనవాసమునకు వెళ్లే ముందు సీతాదేవితో రాముడు ఇట్లా అంటాడు భరత శత్రుఘ్నులు నాకు అత్యంత ప్రియులు. నీవు కూడా వారిని నీ సోదరులు వలె ప్రేమించు. పుత్ర సమంగా ఆదరించు. దీనిని బట్టి అన్నదమ్ముల మీద శ్రీరామచంద్రమూర్తికి ఎంత ప్రేమ ఉందో అర్ధం అవుతుంది. శ్రీరాముడు అరణ్యవాస
సమయంలో చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు భరతుడు సేనా సమేతుడై ప్రజలను కూడా వెంటబెట్టుకుని రాముడు దగ్గరకు వస్తాడు. సైన్యముతో వచ్చిన భరతుని చూసి లక్ష్మణుడు అపోహ పడతాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణా
భరతుని హృదయo నాకు తెలుసు. నేను అరణ్యాలు పాలయ్యానని బాధాతప్త హృదయంతో నన్ను చూడడానికి వస్తున్నాడు. అంతేకానీ నా మీద దండయాత్రకు కాదు అని సున్నితంగా హృదయంలోని మాటను తెలియజేశాడు.
భరతుడు రామచంద్ర మూర్తిని అరణ్యవాసం విడనాడమని శతవిధాలా ప్రయత్నించి విఫలమవుతాడు. చివరికి రామచంద్ర మూర్తి పాదుకులు తలపై పెట్టుకుని అయోధ్యకు తీసుకుని వెళ్లి
రాజ్యపాలన సాగిస్తాడు. రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చ పోయిన సందర్భంలో రాముడు విలపించిన తీరు చూస్తే లక్ష్మణుడు మీద రామచంద్ర మూర్తికి గల ప్రేమ అర్థమవుతుంది.
నాకోసం సర్వస్వం అర్పించి అరణ్యములు వెంట నన్ను అనుసరించి వచ్చిన లక్ష్మణుడి తో నేను కూడా యమపురికి
వె డతాను అని విలపిస్తాడు. తదుపరి హనుమంతుని చేత సంజీవిని పర్వతమును తెప్పించి లక్ష్మణుని రక్షిస్తాడు.
సీతాన్వేషణ సమయంలో తారసపడిన పక్షిరాజు జటాయువు ద్వారా రావణాసురుడు గురించి సమాచారం తెలుసుకొని గాయపడిన జటాయువు తన తండ్రి స్నేహితుడిగా తెలుసుకుని
తన చేతిలో ప్రాణాలు వదిలిన జటాయువుకు కృతజ్ఞతా పూర్వకంగా అంతిమ సంస్కారం చేస్తాడు శ్రీరామచంద్రమూర్తి.
ఆ పక్షిరాజు ఎంత అదృష్టవంతుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి చేతుల మీదుగా సురలోకం చేరిన మహానుభావుడు.
వానర రాజులైన వాలి సుగ్రీవుల యుద్ధంలో తన సహాయం కోరిన సుగ్రీవుడికి సహాయం చేసి యుద్ధంలో వాలిని చంపి
సుగ్రీవుడిని కిష్కిందకు పట్టాభిషేకం చేసి స్నేహం యొక్క విలువ
తెలియజేశాడు.
సీతాదేవి జాడ కనిపెట్టిన ఆంజనేయ స్వామి మీద అమితమైన వాత్సల్యం ప్రేమ కలిగి ఉండేవాడు. ఆంజనేయ స్వామి రామ బంటుగా ప్రసిద్ధి పొందాడు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. వారిద్దరి అనుబంధం గురించి ఏ కవులు వర్ణించలేరు. నిరంతరము ఆంజనేయ స్వామి రామనామ స్మరణలో మునిగి ఉంటాడు.
రామ రావణ యుద్ధం జరిగి అయోధ్యకు రామచంద్ర మూర్తి పట్టాభిషిక్తుడైన తర్వాత ప్రజా రంజకంగా పరిపాలించాడు.
అందుకే ఈనాటికి కూడా రామరాజ్యమనే మాట వాడుకులోకి ఉంది. గూడచారుల ద్వారా రాజ్యంలోని ప్రజల మనోభావాలు తెలుసుకునేవాడు. అలాగే ఒకానొక సందర్భంలో చాకలి వాడి మాటలు తెలుసుకుని సీతాదేవిని అరణ్యానికి పంపిస్తాడు.
అందుకే శ్రీరామచంద్రమూర్తి సకల గుణభిరాముడుగా కీర్తించబడ్డాడు. లోకానికి ఆదర్శమూర్తి అయినాడు. రాముడు ధర్మానికి ప్రతీక అంటారు. ధర్మాచరణలో రాముడే మనకు ఆదర్శం .
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి