సాఫ్ట్వేర్ వ్యవసాయం
సాప్ట్ వేర్ వ్యవసాయం.
" ఏరా నీకు ఇంకా ఎన్ని రోజులు సెలవు ఉంది? అంటూ ప్రశ్నించాడు రామయ్య దసరా పండక్కి ఇంటికి వచ్చిన తన కొడుకు రమేష్ నీ. దసరా పండగ వెళ్లిపోయి అప్పుడే నాలుగు రోజులు అవుతుంది అయినా రమేషు ఊర్లోనే ఉండిపోవడం చూసి. ఎప్పుడు పండగ మర్నాడు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయేవాడు సెలవు లేదంటూ! మరి ఈసారి ఏమైంది? ఉద్యోగంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా! అనుకుని ఆలోచనలో పడ్డాడు రామయ్య.
" లేదు నాన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసా ను. మన సొంత ఊళ్లోనే ఉండి నీతో పాటుగా వ్యవసాయం చేసుకుంటారు ను అంటూ సమాధానం చెప్పిన కొడుకుని అయోమయంగా చూశాడు రామయ్య. అదేమిటి రా బంగారు లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేసుకోవడం ఏమిటి? నీకు గాని మతి పోయిందా! వ్యవసాయం అంటే మాటలా! చిన్నప్పటినుంచి నా బాధలు చూస్తున్నావు కదా! అంటూ చెప్తున్న తండ్రి మాటలు వినిపించుకోకుండా లేదు నేను ఇంకా ఉద్యోగం చేయలేను. నావల్ల కావడం లేదు. షిఫ్ట్ డ్యూటీ ఉద్యోగాలు చేయలేను. రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా ఆలస్యం అయిపో తోంది. దానికి తోడు కుర్చీలో కదలకుండా కూర్చుని ఆ కంప్యూటర్ వైపు చూస్తూ పనిచేయడంతో కళ్ళు కాళ్ళు కూడా వాచిపోతున్నాయి. ఏదో ఆకలి తీర్చుకోవడానికి బయట దొరికిన తిండి తినడం దాని మూలంగా ఆరోగ్యం పాడైపో తోంది.
ఆ ట్రాఫిక్ లో పడి ఇంటికి వచ్చేటప్పటికి డేటు మారిపో తోంది. దానికి తోడు నిద్ర పట్టదు. ఉదయం తొందరగా లేవలేము. శరీరానికి ఎక్కడ ఎక్సర్సైజ్ ఉండటం లేదు. పొట్ట బాగా పెరిగిపోతోంది. ఆ ఏ సి రూముల్లో కూర్చోవడం మూలంగా మాటిమాటికి జలుబు వచ్చేస్తోంది. దానికి తోడు రోజు రెండు మూడు మీటింగులు టార్గెట్లు.అనవసరంగా సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయ్యాను. టీచర్ ట్రైనింగ్ అయ్యి ఉపాధ్యాయుడిగా కొనసాగి ఉంటే ఏ విధమైన సమస్య ఉండేది కాదు. హాయిగా సొంతింటిలో ఉండేవాడిని. ఏదో మోజు కొద్ది పరిగెత్తేను కానీ. రంగంలోకి దిగిన తర్వాత తెలిసింది . దానికి తోడు ఈ మధ్యన సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి ఏం బాలేదు. ఎప్పుడు పీకేస్తారో తెలియదు అంటూ బాధపడుతూ చెప్పుకొచ్చిన కొడుకు రమేష్ మాటలకి అయోమయంగా చూశాడు రామయ్య.
రమేష్ చెప్పిన మాటలలో కొంత నిజo కూడా ఉందనిపించింది రామయ్యకి. అయినా వ్యవసాయం గురించి వీడికి తెలియక అలా అనుకుంటున్నాడు.యూట్యూబ్ లో పెట్టే వీడియోలు చూసి పిల్లలు ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత తెలుస్తుంది.
అయినా ఉన్న ఒక్క పిల్లవాడిని తనలాగా కష్టపెట్టడం ఇష్టం లేక కదా ఈ చదువు చదివించింది. చిన్నప్పటినుంచి ఎంతో గారాబంగా పెంచి ఉన్నత చదువులు చదివించిన రమేష్ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఏం చేయాలో తోచక రమేష్ మాటలకి సరే రా అలాగే నీ ఇష్టప్రకారం కానివ్వు అని చెప్పి రచ్చబండ దగ్గరికి వెళ్ళిపోయాడు రామయ్య. రామయ్య కి రాత్రిపూట ఒక గంట సేపు ఆ స్నేహితులతో రచ్చబండ దగ్గర కాలక్షేపం చేయడం అలవాటు.తండ్రి ఇంత తొందరగా ఒప్పుకున్నందుకు రమేష్ ఆనందంతో మంచం ఎక్కాడు
రామయ్యకి ఏకైక వారసుడు రమేష్. రమేష్ చిన్నప్పట్నుంచి చదువులో శ్రద్ధ చూపిస్తుండడంతో ఉన్న ఇరవై ఎకరాల్లో ఎకరం పొలం అమ్మేసి అమెరికాలో ఎమ్మెస్ చేయిస్తాడు. కొద్దిరోజులు అమెరికాలో ఉండి బెంగళూరు నగరానికి వచ్చి రెండు సంవత్సరాలయింది. రమేష్ ఇంకా పెళ్లి కాలేదు. ఎన్ని సంబంధాలు చూసిన ఏదో ఒoక పెట్టి ఒప్పుకోవటం లేదు. రామయ్య సొంత ఊర్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటాడు.ఇన్నాళ్లు రామయ్య రమేష్ కి పెళ్లి కాలేదని దిగులుగా ఉండేది. ఇప్పుడు చదువుకున్న కుర్రాడు ఉద్యోగం వదిలేస్తున్నాడని మరో బెంగ పట్టుకుంది. అయినా పిల్లలకు కొంత వయసు వచ్చిన తర్వాత స్నేహితుడు లాగా చూడాలి . అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి అనేది రామయ్య సిద్ధాంతం.
మర్నాడు ఉదయమే గది తలుపులు ఎవరో గట్టిగా కొడుతుండడంతో వాచీలో టైం చూసుకున్నాడు రమేష్. అబ్బా ఐదు గంటలు అయింది అంతే ఇంత ఉదయాన్నే ఎవరు లేపుతున్నారు అనుకుంటూ తలుపు తీసి ఎదురుగా ఉన్న తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి తండ్రి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు
పదరా పొలం వెళ్లాలి పశువులకి దాణా పెట్టి పాలు తీసుకొద్దాం అంటూ తండ్రి చెప్పిన మాటలకి ఒక్కసారిగా మత్తు వదిలిపోయింది. ఏమిటి ఇంత పొద్దున్నే నా అన్నాడు తండ్రితో. లేదు ఇప్పటికే ఆలస్యం పద పద అని తొందర పెట్టాడు రామయ్య.ఇదే బెంగళూరులో అయితే ఉదయం 9 గంటలకు లేచావాడినీ అనుకొని తప్పక తండ్రి వెంట బయలుదేరాడు రమేష్
ఊరంతా ఇంకా చీకట్లు అలుముకునే ఉన్నాయి. అసలే శీతాకాలం మంచి బిందువులు తల మీద పడుతున్నాయి. ఒకపక్క చలి గాలి కొడుతుంటే అలా గట్ల మీద రెండు కిలోమీటర్లు నడిచి పొలంలోని పశువులు పాక దగ్గరికి చేరారు ఇద్దరు.
పశువులు పాక దగ్గరికి చేరిన వెంటనే రామయ్య రమేష్ ని ఆ పశువుల పాకంతా శుభ్రం చేయమన్నాడు. పాకలో కడిగి పెట్టేటప్పుడు ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టు అయింది రమేష్ కి.
అయినా తమాయించుకుని పని పూర్తి చేసి పశువులకు దానా పెట్టి గడ్డి వేసి చేతులు కడుక్కుని బయటకు వచ్చి తండ్రి ఇచ్చిన పాలము oత పట్టుకుని తండ్రి కొడుకులు ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చింది రమేష్ కి. రాను పోను నాలుగు కిలోమీటర్లు నడక. అబ్బ కాళ్ళ లాగేస్తున్నాయి అనుకుంటూ అరుగు మీద చతికిల పడ్డాడు రమేష్.
" ఒరేయ్ రమేష్ తొందరగా స్నానం చేసి టిఫిన్ తిని మళ్లీ మనం పొలం వెళ్లాలి. ఇవాళ కలుపు మొక్కలు తీయడానికి మనుషులు వస్తున్నారు. మనం అక్కడ దగ్గరుండి పని చేయించుకోవాలి అంటూ చెప్పిన తండ్రి మాటలకు సరే అని స్నానాల గదిలోకి పరిగెత్తాడు రమేష్. స్నానం అయిందనిపించి తన రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చిన కొడుకుని చూసి ఆ ప్యాంటు షర్టు ఏమిటిరా పొలానికి లుంగీ పంచ కట్టుకొని రా అవసరమైతే గట్టు దిగి మనం కూడా పని చేయాలి కదా అని చెప్పిన తండ్రి మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక బట్టలు మార్చుకుని వచ్చి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
రమేష్ తల్లి ఒక కంచంలో పెరుగు వేసిన చద్దన్నo ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకొచ్చి పెట్టింది. అదేంటమ్మా టిఫిన్ ఏమి చేయలేదా. లేదురా ఈమధ్య ఇంట్లో టిఫిన్ చేయడం లేదు. చద్దన్నంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందట అని చెప్పిన తల్లి మాటలు ఒళ్ళు మండి పోయినా తల్లి మాటల్లో నిజం ఉందనిపించింది.
అంతేకాదు నీకు టిఫిన్ తింటే మళ్లీ తొందరగా ఆకలేసేస్తుంది. నువ్వు చేసేది వ్యవసాయం కదా శరీరానికి బలం ఎక్కువ అవసరం అంటూ తల్లి చెప్పి వెళ్ళిపోయింది. అవును
ఈమధ్య బెంగళూరు సిటీ లో కూడా కొన్ని హోటల్లో చద్దన్నం కూడా అమ్ముతున్నారు అనుకున్నాడు రమేష్.
అబ్బా మళ్లీ ఆ రెండు కిలోమీటర్ల నడవాలి అనుకుని వీధిలోకి అడుగుపెట్టిన రమేష్ కి తండ్రి స్కూటర్ తీస్తూ కనిపించాడు. మన పాక వరకు స్కూటర్ వెళ్ళిపోతుంది అక్కడినుంచి పొలం గట్ల మంట తిరగాలి అంటూ చెప్పాడు రమేష్ తండ్రి. తండ్రి కొడుకులు ఇద్దరు పొలం చేరుకునేటప్పటికీ కూలీలు అప్పటికే వచ్చి పని మొదలు పెట్టారు. మధ్యలో తండ్రి కొడుకు పశువులు పని చూస్తూ పొలం చుట్టూ తిరుగుతూ అలుపు సొలుపు లేకుండా పనిచేస్తుంటే సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. ఇంతలో పాలేరు ఇంటి దగ్గర నుంచి క్యారేజీ పట్టుకొచ్చాడు.
కూలీలతో పాటు ఆ చెట్ల కింద కబుర్లు చెప్పుకుంటూ క్యారేజీ తింటుంటే చిన్నప్పుడు కార్తీక మాసంలో జరిగే వనసంతర్పణ గుర్తుకొచ్చింది. కొంతసేపు విశ్రాంతి. మళ్లీ బరిలోకి దిగారు కూలీలు. అలా పొద్దు వాలే వరకు వంచిన నడుము ఎత్తకుండా పనిచేసే వెళ్లిపోయారు కూలీ లు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పశువులకు దానా పెట్టి పాలు తీసుకుని ఇంటికి బయలుదేరేటప్పటికీ చీకటి పడింది.
ఇంటికి వచ్చేటప్పటికి రమేష్ కి బాగా అలసటగా అనిపించింది. ఎండలో ఎక్కువ సేపు అలవాటు లేకపోవడం వల్ల మొహం మాడిపోయి వాడిపోయి బాగా నీరసంగా అనిపించింది.స్నానం చేసేసి అన్నం తినకుండానే అలా మంచం మీద వాలిపోయాడు. రమేష్ పరిస్థితి చూసి తల్లి నాలుగు ముద్దలు అన్నం కలిపి పెట్టేసింది. తండ్రి రమేష్ ను చూసి తనలో తానే నవ్వుకున్నాడు.
అలా ఆరు నెలలు గడిచే యి. ఏ ఒక్కరోజు పొలం వెళ్లకుండా కుదరదు. సెలవు అనేది లేదు. శరీరానికి రెస్ట్ లేదు. రోజు ఏదో ఒక పని. వరి నాట్లు కలుపుతీత ఎరువు వేయడం కోత కోయడం కుప్ప నూరుపు ధాన్యం కాపలా రోజు పశువుల చాకిరి కొబ్బరి తోటకు నీళ్లు అరటి మొక్కల సంరక్షణ ఇలా ఒకదాని తర్వాత ఒకటి రైతుకి ఖాళీ అనేది ఉండదు. ఇక వేసవికాలం వచ్చిందంటే మామిడి తోట పనులు. పొలంలో మెరక తీసే పనులు. అసలు ఏమిటో రైతు జీవితం అనుకున్నాడు రమేష్.
రమేష్ కి ఎందుకో చాలా బాధగా అనిపించింది. తీసుకున్న నిర్ణయం ఎందుకో రాను రాను మంచిది కాదనిపిస్తోంది. నెల తిరిగేటప్పటికీ జీతం వచ్చేసేది . దానికి తోడు శనివారం ఆదివారం సెలవులు. కావలసినంత విశ్రాంతి. ఇక్కడ 365 రోజులు పనులే. పైగా ఈ పనులకి శారీరక శ్రమ ఎక్కువ . ఇక్కడికి వచ్చిన తర్వాత 10 కేజీలు తగ్గిపోయాను. అయినా కావాలనే వచ్చాను.
ఇప్పుడు ఈ మాట అంటే తిట్టిపోస్తారు అనుకుని తనలోనే బాధపడసాగాడు రమేష్. పైగా రమేష్ ఉద్యోగం మానేసిన దగ్గర నుంచి పెళ్లి సంబంధాలు రావడం మానేసాయి
ఒకరోజు రమేష్ తండ్రి కొడుకుని పిలిచి ఎలా ఉందిరా కొత్త జీవితం అని అడిగాడు. రమేష్ ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. రమేష్ పరిస్థితి తండ్రి కి అర్థమైంది. పైగా ఇక్కడ వచ్చిన తర్వాత రమేష్ బాగా నీరస పడిపోయాడు అనుకునీ చూడు రమేష్ ఇవాళ రైతు జీవితం చాలా బాధాకరంగా ఉంది. భూముల రేట్లు అయితే పెరుగుతున్నాయి కానీ దాని మీద వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే పండించే పంటకి గిట్టుబాటు ధర లేదు. దానికి తోడు ప్రకృతి ఎప్పుడు అనుగ్రహిస్తుందో ఎప్పుడు ఆగ్రహిస్తుందో తెలియదు. చేతి కొచ్చిన పంట నేల పాలైన రోజులు ఎన్నో.
అయినా వేరే పని చేయలేక రైతు ఆ పొలాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాడు. రైతుకు విశ్రాంతి అనేది లేదు. మూడు వందల అరవై ఐదు రోజులు పొలం గట్టు మీద ఉంటాడు. దానికి తోడు పొలంలో పనిచేసే కూలీలు కూడా దొరకటం లేదు. ఒకవేళ దొరికిన పని చేయించడం అనేది కూడా చాలా కష్టంగా ఉంది. అందుకే అందరూ యంత్రాలు మీద ఆధారపడిపోతున్నారు. అయినా వరదలు, అకాల వర్షాలు పంటల తెగుళ్లు ఇవన్నీ రైతు నడ్డి విరిచేస్తున్నాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన ఏం ఫలితం ఉండటం లేదు.
సంవత్సరాల తరబడి బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ అయితే చేస్తున్నారు గాని పూర్తిగా అప్పులు తీర్చలేక పోతున్నారు రైతులు. కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దేశానికి వెన్నెముకని బిరుదు ఉన్న రైతుకి కడుపునిండా అన్నం ఉండటం లేదు. ఇంకా పశువుల సంగతి కూడా అంతే. వాటి కూడా రోగాలు పెరిగిపోయాయి. అందుకునే చాలా మంది రైతులు పశువులను పెంచడం మానేశారు.
మీలాంటి యువకులు యూట్యూబ్లో వీడియోలు చూసి రోడ్డు పక్కనున్న అందంగా కనిపించే పొలాలు చూసి సినిమాల్లో చూపించే సీనరీలు చూసి గోదావరి ఒడ్డు చూసి గోదావరి నీళ్లు చూసి ఏవేవో ఊహించుకొని అప్పులు చేసి వ్యవసాయంలోకి దిగి బాధలు పడుతున్నారు. నిజానికి ఒక సంవత్సరం నష్టం వస్తే మూడు సంవత్సరాల వరకు రైతులు లేవలేరు. దానికి తోడు పల్లెటూర్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోయింది. ఈ బాధలు పడలేక రైతుల అయిన కాడికి పొలాలు అమ్ముకుంటున్నారు. కష్టపడిన రైతుకి కడుపు నిండడం లేదు. పంట వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఆడతాయి. ఆ తర్వాత పరిస్థితి మామూలే. మాలాంటి మధ్య వయస్కులు ఏ పని చేయలేక ఉన్నదానితోటే జీవితం గడుపుతున్నాం.
దేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ప్రకృతి ముందు అందరూ బలహీనులే అని చెప్పినా తండ్రి మాటలకి ఆలోచనలో పడ్డాడు రమేష్. అయినా ఈ ఊరు వచ్చిన దగ్గర్నుంచి ఎంతసేపు పొలంలోనే ఉంటున్నాం కానీ ఒక సినిమా లేదు షికార్ లేదు చేతిలో డబ్బు లేదనుకుని బాధపడుతూ ఒక నిర్ణయానికి వచ్చాడు.
మర్నాడు ఉదయం లేచి బట్టల సర్దుకుని నాన్న నేను బెంగళూరు వెళుతున్నాను అంటూ చెప్పి బయలుదేరిన కొడుకు నీ ఎందుకు ఏమిటి అని ప్రశ్నించలేదు తండ్రి రామయ్య. ఏదైనా సరే పిల్లలకి అనుభవంలోకి వస్తే కానీ ఏది తెలియదు అని రమేష్ తల్లి తోటి రామయ్య చెప్పడం వినబడింది రమేష్ కి. తప్పు తనదే కాబట్టి ఏవి మాట్లాడకుండా మౌనంగా బయలుదేరాడు రమేష్.
నిజమే రైతుకి నెల నెల వచ్చే ఆదాయం ఉండదు. దేవుడి దయవల్ల పంట చేతికి వస్తే గాది నిండుతుంది. జేబు నిండు తుంది. వ్యవసాయంలో ఉండే కష్టాలు ఈ కథలో చదివి ఎవరు వ్యవసాయం చేయడం మానేయకూడదు. పంట పండించకపోతే మనం కడుపు నింపుకోవడానికి కడుపు నింపే మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది లేదు పరిశోధన చేసి కనిపెట్టుకోవాలి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి