నిజమైన బొమ్మల బంధం
నిజమైన బొమ్మల బంధం
" అమ్మా సీత కొంచెం మంచి నీళ్లు పట్టుకురా !అoటు గదిలోంచి తల్లి వసంత వేసిన కేక విని ఒక చేతిలో మంచినీళ్లు గ్లాస్ తో, మరొక చేతిలో చంటి బిడ్డతో అడుగుపెట్టింది సీత. మంచం మీద పడుకునీ ఉన్న తల్లిని రెండు చేతులతోటి లేవనెత్తి మంచినీళ్లు గ్లాసు నోటి దగ్గర పెట్టి కొద్ది కొద్దిగా తల్లికి తాగించడం మొదలు పెట్టింది సీత.
మంచం మీద పడుకుని తల్లిని చూసినప్పుడల్లా గుండె తరుక్కు పోతుంది సీతకి. ఎలా ఉండే అమ్మ ఎలా అయిపోయింది? ఎనిమిది మంది పిల్లలు. తెల్లారి లేస్తే ఊపిరి కూడా పీల్చుకోవడానికి ఖాళీ లేకుండా ఉండేది. పాపం ఎప్పుడు చూసినా వంటింట్లోనే ఏదో ఒక పని తోటి సతమతం అవుతూ ఉండేది . పిల్లల చదువు పెళ్లిళ్లు పురుడు పుణ్యాలు అన్ని అయ్యేసరికి భర్త చనిపోవడం అనారోగ్యంతో ఇదిగో ఇలా మంచం మీద పడడం అన్నీ జరిగిపోయాయి.
వసంత ఎనిమిది మంది సంతానంలో అందరికంటే పెద్దది సీత. అప్పటి రోజుల్లో చిన్నతనాల్లో పెళ్లి చేసేవారు కాబట్టి వసంతకి పదహారు సంవత్సరాలకే సీత పుట్టింది. అందుకే తల్లి పిల్లల్ని పెంచడానికి పడ్డ కష్టాలు గురించి అన్ని సీతకి తెలుసు.
ఆర్థిక సమస్యలు, కుటుంబ భారం తండ్రి అంతగా సంపాదనపరుడు కాకపోవడం ఇన్ని సమస్యలు ఉన్నా మౌనంగా భరిస్తూ ముందుకు నెట్టుకొచ్చింది.
వసంతకి మగ పిల్లలు లేకపోవడం సీత అందరికంటే పెద్దది కావడం వలన తండ్రి పోయిన తర్వాత తల్లిని భర్త అంగీకారంతోటే తన దగ్గరికి తీసుకొచ్చింది.
వసంత స్వతహాగా చాలా తెలివైన కావడంవల్ల ఉన్న ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసి ఆ సొమ్మును బ్యాంకులో వేసుకుని వడ్డీ కూతురికిచ్చి కాలక్షేపం చేస్తూ ఉంటుంది. కన్న కూతురైన అల్లుడు పైవాడు కాబట్టి రేపొద్దున్న ఏదైనా మాట వస్తుందని భయం. వసంత ఎంత మొహమాటస్తురాలంటే ఊరిలో ఉన్న మంచం కూడా తెచ్చుకుని దానిమీద పడుకుంటుంది.
అలా మంచం మీద పడుకొని తల్లిని చూస్తే సీతకి ఇన్నాళ్లు పిల్లలంతా ఆవిడ పక్కన పసిపిల్లల్లాగా పడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి.
ఇప్పుడు ఆవిడ మంచం మీద లేవలేని స్థితిలో నాకు పసిపిల్ల అయిపోయింది అనుకుంటుంది రోజూ ఒకసారి. నిజమే పసిపిల్ల కదా . ముసలి వాళ్ళ పిల్లలతో సమానం అని చెప్తుంటారు . తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకి దేవుడిచ్చిన పసిబిడ్డలు.
నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే మనం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు సేవలు చేసి పెంచి పెద్ద చేశారు. మరి ఇప్పుడు చివరి దశలో చూడవలసిన బాధ్యత ఎవరి మీద ఉందో పదేపదే ఎవరూ గుర్తు చేయక్కర్లేదు.
నవమాసాలు కనిపించి పెద్ద చేసిన ఆ తల్లికి మనకి పేగు బంధం
మనం ఆఖరి దశలో తల్లిదండ్రులను చూడడం రుణం తీర్చుకోవడమే. దేవుడిచ్చిన బిడ్డలు తల్లిదండ్రులు. ముఖ్యంగా ఆడపిల్లలు తల్లిని అనుకరిస్తారు. చిన్నప్పుడు అన్ని పనులు తల్లిలా చేయాలనుకుంటారు. ఆడపిల్లలకి చిన్నప్పుడు తల్లి కలల రాణి.
తల్లి మంచం పక్కన కూర్చున్న సీతకి అందరికంటే చిన్నవాళ్ళైన పిల్లలిద్దర్నీ ఒకరిని చంకలోను ఒకడిని చేత్తోను పట్టుకుని పనులు చేసుకునే తల్లి ఒకసారి గుర్తు వచ్చింది. ఇప్పుడు తను చేతిలో చంటి బిడ్డని పెట్టుకుని తల్లి మంచం పక్కనే కూర్చోవాల్సి వస్తోంది.
కాలం చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. భలే మార్పు తీసుకొస్తుంది మనుషుల్లోనూ, మనసులోనూ కూడా. అప్పుడు గిరగిరా ఇల్లంతా తిరుగుతూ పనులు చేసుకునే తల్లి ఇలా మంచం మీద పడిపోవడం చూస్తే కాలం అంటే భయమేసింది సీతకి.
ఉదయం లేస్తూనే కుటుంబానికి చాకిరి చేయడంతోటి మొదలైన ఆమె జీవితం పరాధీనమైంది.. ఇప్పుడు మా ఇంటి పేర్లు వేరు కానీ మా ఇద్దరి శరీరాలు ఒకటే. రోజు పిల్లలందరికీ స్నానం చేయించే అమ్మ మంచం పక్కన కూర్చుని కన్నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటాను. అమ్మ ఎందుకు ఇలా అయిపోయింది. జీవితం అంటే ఇంతేనా! ఏదో ఉందని అనుకున్న.
కడుపున పుట్టిన పిల్లలందరికీ నుదుటన రవంత అగరబొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి మురిసిపోయి తన నుదుటన పెద్ద కుంకుమ బొట్టుతో మెరిసిపోయే అమ్మకి ఇప్పుడు వేలుతో విభూది బొట్టు పెడుతుంటే గుండెల్లో నుంచి దుఃఖం తన్నుకు వచ్చి తలుపు చాటుకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిన నన్ను ఓదార్చే పరిస్థితి లేని వసంత రెండు కన్నీటి బొట్లు కారుస్తుంది. చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తుంటే తల్లి ఎంత పనిలో ఉన్న పరుగు పరుగున వచ్చి గుండెలకు హత్తుకుని ఓదార్చ క్షణాలు ఎన్నో గుర్తుకొచ్చాయి సీతకి.
పిల్లలందరిని చంకలో ఎత్తుకుని పెరడంతా తిప్పి గోరుముద్దలు తినిపించి ఆకలి తీర్చే వసంతకి రెండు స్పూన్లు జావ తాగించడం గగనం అయిపోతోంది. చిన్నపిల్లలా వద్దని చెయ్యి అడ్డం పెట్టేస్తుంది. ఆకలి లేకా,లేదంటే తిన్నది అరగదని భయమా మాటిమాటికి కూతుర్ని బాధ పెట్టాలని ఆలోచిస్తుందా! ఏమీ అర్థం కాకుండా ఉంది సీతకి. చిన్నప్పుడు పిల్లలు తినకపోతే చాలా బెంగపెట్టుకునేది వసంత. కనీసం పాలు అయినా తాగండ్రా అంటూ బతిమా లేది.
పండగ వచ్చేసరికల్లా రకరకాల పిండి వంటలు డబ్బాలతో చేసి పెట్టే తల్లి ఇప్పుడు ఇవాళ ఉగాది పండుగ కనీసం ఇంట్లో చేసుకున్న బూరెముక్కైనా ఒకటి కూడా తినకుండా మూతి పక్కకు తిప్పేసింది. ఏమిటో అప్పుడు అలా ఇప్పుడు ఇలా.
ప్రతి పండుగకి పిల్లలందరికీ బజార్లో రకరకాల డ్రస్సులు కొని తొడిగి మురిసిపోయే అమ్మ అప్పుడు ఇస్త్రీ చీర కట్టుకుని ఆనంద పడుతూ ఉండేది. ఎప్పుడైనా నైటీ వేసుకోమని అడిగితే సిగ్గుపడే అమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు తగిలించుకుని అది కూడా బరువుగా ఉంది అంటుంది. ఎన్ని బరువులు మోసింది జీవితం అంతా ఆ శరీరం అనుకుంది సీత
నాన్న ఉన్నంతకాలం ఎప్పుడు వీధి గుమ్మం కూడా చూడలేదు. ఎప్పుడైనా పది రోజులు పిల్లల దగ్గరికి వచ్చి ఉండలేదు. అప్పుడు ఇల్లు కదిలి రావడం లేదని బెంగపెట్టుకునేదాన్ని
ఇప్పుడు తల్లి ఇల్లు వదిలేసి వచ్చిన మంచం దిగితే ఏనుగు ఎక్కినంత ఆనందం అనుకుంది సీత.
పిల్లలందరికీ పంచభక్ష పరమాన్నాలతో కడుపు నింపి తను మాత్రం పచ్చడి మెతుకులతోనే అందరికన్నా ఆఖరిగా తినే అమ్మ ఇప్పుడు కనీసం కడుపునిండా మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితి వచ్చింది.
వసంత సీత ఇంటికి తీసుకువచ్చిన రెండు సంవత్సరాల వరకు ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్లే ముందు పలకరిస్తూ ఉండేవాడు వసంతని సీత భర్త రామారావు. అయితే ఎందుకో ఈమధ్య భర్తలో మార్పు గమనించింది సీత. వసంతని పలకరించడం మానేశాడు. దానికి తోడు ఎక్కువసేపు వసంత తోటే సీత గడుపుతూ ఉండడంతో ఒకరోజు" ఎన్నాళ్ళు ఇలా మనం మీ అమ్మగారిని అoటు మాట పూర్తి చేయకుండా మౌనంగా ఉండిపోయాడు.
ఆ మాటలోనే అంతరార్థం సీత గమనించిన ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే ఉండిపోయింది. దానికి తోడు సీత చెల్లెళ్లు కుటుంబాలతో కలిసి తల్లిని చూడడానికి రావడంతో కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయాయి సీతకి. బహుశా భర్త కోపానికి అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు అనుకొంది సీత.
రోజురోజుకీ తల్లి ఆరోగ్యం క్షీణించడం బొమ్మల మంచానికి అంటుకుపోయి ఉండడం చూసి సీతకి చిన్నప్పుడు ఆడుకున్న తాటాకు బొమ్మలు గుర్తుకొచ్చేయి. మనిషి జీవితానికి తాటాకు బొమ్మలకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. పిల్లలు తాటాకు బొమ్మలకి అలంకరణ చేసి బట్టలు కట్టి పెళ్లిళ్లు చేసి విందు భోజనాలు తిని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మనిషి కూడా దేవుడి చేతిలో అంతే. మనతో రకరకాల ఆటలు ఆడిస్తాడు. మళ్లీ మురిపిస్తాడు మరిపిస్తాడు ఏదో ఒక రోజున మాయం చేస్తాడు.
ఇలా తల్లి గురించి ఆలోచిస్తా ఆ రోజు పడకగది లో " చూడండి ఇటువంటి సమయంలో అమ్మని వదిలేయడం ఎంతవరకు భావ్యం . నవ మాసాలు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని ఒక బొమ్మలాగా వీధిలోకి విసిరేయడం లేదంటే అనాధాశ్రమాలలోకి చేర్చడం కన్న బిడ్డలకు మంచిది కాదు. నాది రక్తసంబంధం మీది కలుపుకున్న బంధం. మీకు కూడా అంతో ఇంతో బాధ్యత కూడా ఉంది.
రేపొద్దున్న మీ తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత పూర్తిగా నాదే. అప్పుడు కూడా మీరు ఇదే మాట అంటారా! ఖర్చులు పెరిగిన మాట నిజమే. కానీ మా అమ్మ మన దగ్గర ఊరికే ఉండటం లేదండి. తను దాచుకున్న సొమ్ము మీద వచ్చే వడ్డీ అంతా మనకే ఇస్తోంది. కేవలం నేను చాకిరి మాత్రమే చేస్తున్నాను. అది కూడా ఇంటి బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే అమ్మను చూస్తున్నాను.నేను మిమ్మల్ని చేయమని అడగడం లేదు అంటూ ఏడుస్తూ తన కడుపులో ఉన్న మాటలు చెప్పేసింది సీత.
ఆ మరునాడు వసంత గదిలోకి వెళ్లిన సరికి సీత రెండు చేతులు వసంత పట్టుకుని "నన్ను అనాధాశ్రమంలో చేర్పించెయ్యి అమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వసంత. ఆ మాటలు నూతిలో నుంచి వచ్చినట్లుగా ఉన్నాయి . "లేదమ్మా ఆ మాటలు నువ్వు ఎప్పటికీ అనకు. నేనుండగా నీకేమీ భయం లేదు. తన భర్త రామారావు గురించి గమనించి ఆ మాటలు అమ్మ మాట్లాడుతుందా! అనుకుని సిగ్గు పడింది సీత.
అలా నాలుగు రోజులు అయ్యే సరికి వసంత గదిలోకి వెళ్లిన సీతకి వసంత ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడం
గమనించింది." అమ్మ జీవితం ఆనందంగా నా చేతిలోనే వెళ్ళిపోయింది. నేను ఆడపిల్లను కదా! కుటుంబ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కన్న తల్లిదండ్రులను కూడా ఇంట్లో ఉంచుకోవాలంటే ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలో ఒక ఆడపిల్ల. అటువంటి పరిస్థితులు మారాలి. ఇంటి పరిస్థితులు ఇంకా ముదరక ముందే అమ్మ గుమ్మం దాటేసింది అని ఏడుస్తూ కూర్చుంది సీత.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి