ఉగాది పండుగ

ఉగాది పండుగ

" ఒరేయ్ సుధాకర్ రేపు ఉదయం నాలుగు గంటలకు అలారం పెట్టు అంటూ మంచం మీద వాలింది పార్వతమ్మ.

" అంత పొద్దున్నే ఎందుకమ్మా లేవడం అని అడిగాడు కొడుకు సుధాకర్ పార్వతమ్మ ని.

రేపు ఉగాది పండుగ కదరా. బోల్డంత పని ఉంది నాకు. ఉదయం లేచి గుమ్మాలికి తోరణాలు కట్టుకోవాలి. వంటింట్లో బోల్డు పనుంది. మీరు లేచిన దగ్గర్నుంచి ఆకలి అంటూ చంపేస్తారు. మీరు లేచిన వెంటనే కాఫీ కూడా తాగకుండా రేపు తలంటు పోసుకోవాలి. మర్చిపోకుండా అంటూ నిద్రకి ఉపక్రమించింది.

అలా మంచం మీద పడుకుoదేగాని చాలాసేపటి వరకు ఆలోచనలతో నిద్ర పట్టలేదు. పాపం రమ్య భాగ్యనగరంలో చంటి పిల్లతో ఎలా ఇబ్బంది పడుతుందో. ఉగాది పండుగకి రమ్మని ఫోన్ చేస్తే ఒక్కరోజే సెలవు అంటూ చెప్పింది. పిల్లలతో చేసుకోవడం కష్టం అనుకుంటూ ఉండగా ఇంతలో అలారం మోగింది.

పార్వతమ్మకి బద్దకంగా అనిపించిన ఇక తప్పదు అనుకుంటూ లేచి బాత్రూం లోకి వెళ్లి మొహం కడుక్కుని తలంటుకుని గుమ్మాలకు తోరణాలు కట్టుకుని పసుపు బొట్టు పెట్టుకుని వంటింట్లోకి ప్రవేశించింది. మామూలుగా ఏ స్త్రీ కైనా పండగ అంటే రోజు ఉండే పనితో పాటు కొంచెం ఎక్కువగానే పని ఉంటుంది. అందులో ఉగాది పండుగ. తొలి పండుగ. ఏది ఏమైనా ఆ కాలం ఆడవాళ్ళందరూ ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేసుకునేవారు.

అలా చక చక పనులన్నీ పూర్తి చేసుకుంటూ పిండి వంట తయారు చేసే టైంలో ఫోను మోగింది. అప్పుడు టైం చూసుకుంటే 10 గంటలు అయింది. పార్వతమ్మ ఫోన్ ఎత్తగానే కూతురు రమ్య హ్యాపీ ఉగాది అంటూ వీడియో కాల్ లో పండగ శుభాకాంక్షలు తెలిపింది. నీకు అల్లుడు గారికి మనవరాలకి కూడా నా ఉగాది శుభాకాంక్షలు అంటూ నైటీలో ఉన్న కూతుర్ని చూసి " ఇంకా స్నానం చేయలేదా అని అడిగింది పార్వతమ్మ. లేదమ్మా ఇవాళ సెలవు కదా ఇప్పుడే లేచాము అంటూ సమాధానం ఇచ్చింది రమ్య. మరి అల్లుడుగారు కనపడరేమిటి అని అడిగింది పార్వతమ్మ. ఇప్పుడే బజారుకు వెళ్లారు .

 మాకు కూకట్పల్లిలో ఈ ఏడాది నుంచే ఉగాది పచ్చడి అమ్మడం ప్రారంభించారు. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ అక్కడే తీసుకుంటున్నాం. ఆయన కూడా ఉగాది పచ్చడి కొని తీసుకురావడానికి బజారుకు వెళ్లారు అంటూ చెప్పిందిరమ్య.

 అదేమటమ్మా పచ్చడి మడిగా శుచిగా శుభ్రంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఆ బయట నుంచి తీసుకొచ్చిన పచ్చడి దేవుడికి ఎలా నైవేద్యం పెడతావమ్మా. నీకు చిన్నప్పుడు నేర్పించాను కదా. అక్కడికి వెళ్లాక పద్ధతులు అన్ని మార్చేసావా. లేదమ్మా నేర్పించావు. ఇవాళ కొంచెం ఆలస్యంగా లేచాం. ఇప్పుడు వెళ్లి అన్ని సరుకులు బజారు నుంచి తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. సరుకులు ఎప్పుడు తెచ్చుకుంటాము పచ్చడి ఎప్పుడు తయారు చేసుకుంటాం అందుకే ఉగాది పచ్చడి తీసుకురమ్మని మా ఆయనను పంపించాను అంటూ చాలా క్యాజువల్ గా చెప్పింది రమ్య. పార్వతమ్మకి ఒళ్ళు మండిపోయింది. 

పండగ పూట దీన్ని తిట్టడం ఎందుకని ఇప్పటికే 10:30 అవుతోంది మరి టిఫిన్ ఎప్పుడు చేస్తావు అంటూ అడిగింది. ఉప్మా చేస్తానంటూ వంటింట్లోకి బయలుదేరి న కూతుర్ని చూసి అదేమి టమ్మ స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్లడం ఏమిటి అంటూ ప్రశ్నించింది. అలా కూతురుతో మాట్లాడుతూనే పొయ్యి మీద మూకుడు పెట్టి బూరెలు వేయడం ప్రారంభించింది పార్వతమ్మ. 

ఇవాళ పండగ స్పెషల్ ఏమి వండుతున్నావ్ అంటూ కూతురిని ప్రశ్నించింది పార్వతమ్మ. చాలా రోజునుంచిఅనుకుంటున్నాము గాయత్రీ బ్రాహ్మణ హోటల్లో భోజనం చేయాలని. అది మాకు బాగా దగ్గర. ఒకసారి ఒక పెళ్ళిలో తిన్నాము.

 మన ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంది. కారాలు పులుపులు ఎక్కువగా లేవు.అబ్బా ఆ పులిహార రుచి ఉంది చూసావు. ఇప్పటికీ నోరు పట్టుకుని వదల్లేదు అంటూ వర్ణిస్తోంది రమ్య.
అయితే సాయంకాలం అక్కడ దగ్గర్లో ఉండే గుడికెళ్లి దర్శనం చేసుకుని పంచాంగ శ్రవణం విని రండి ఇది మన సాంప్రదాయం అంటూ చెప్పింది పార్వతమ్మ. మేము పంచాంగ శ్రవణం టీవీలో చూసిన తర్వాత అలా సరదాగా బయటకు వెళ్లి రాత్రి హోటల్లో టిఫిన్ చేసి వద్దామని ప్లాన్ అంటూ చెప్పింది రమ్య రేపటి నుంచి మళ్లీ ఆఫీసులు ఉన్నాయి కదా అంటూ మాట సాగదీసింది. సరేనమ్మా నాకు చాలా పనులు ఉన్నాయి అంటూ ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడింది పార్వతమ్మ.

కాలం ఎంత మారిపోయింది. ఎవరు మన సాంప్రదాయాలకి ఆచార వ్యవహారాలకి విలువ ఇవ్వడం మానేశారు. బహుశా మన తరం తోటి పద్ధతులన్నీ మారిపోతాయేమో. 60 ఏళ్ల వయసు వచ్చిన ఇంకా పెద్దవాళ్లు ఎలా చెప్తే అలాగా సాంప్రదాయాలు పాటిస్తున్నాం. ఒక ఇంటికి ఇల్లాలు లక్ష్మీదేవి లాంటి ది. ఎప్పుడూ లేచిన వెంటనే స్నానం చేసి ఇంత బొట్టు పెట్టుకుని ఇల్లు ఊడ్చుకుని అప్పుడే వంటింట్లోకి వెళ్లేవాళ్లు మన పూర్వీకులు. స్నానం చేయకుండా ఏది ముట్టుకునే వాళ్ళు కాదు. ఇది ఆచారం అని కాదు. శుభ్రత. పండగ వచ్చిందంటే రెండు రోజుల ముందు నుంచి ఎంత హడావిడి. ఇల్లంతా బూజులు దులుపుకోవడం ఇల్లు కడుక్కోవడం మామిడాకుల తోరణాలు కట్టుకోవడం గడపలకి పసుపు బొట్టు పెట్టుకోవడం ఇది మొదటి అంకం.
ఉగాది పండగ ముందు రోజు బజార్ నుంచి వేప పువ్వు అరటిపండు కొత్త బెల్లం చింతపండు తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకుని ఉదయం లేచిన వెంటనే తల స్నానం చేసి దేవుడు పూజకు అన్నీ సిద్ధం చేసుకుని పిండి వంటలతో సహా వంట తయారు చేసుకుని దేవుడికి మహా నైవేద్యం పెట్టి అప్పుడు గాని ఇంట్లో వాళ్లకు పెట్టేవారు కాదు.

 ఈ సాంప్రదాయాన్ని ఆ తరం వాళ్లు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఏమన్నా అంటే పిల్లలతోటి ఉద్యోగం తోటి సరిపోతుంది మరి అవన్నీ చేయడానికి మాకు ఖాళీ ఎక్కడా అంటూ సమర్ధించుకుంటున్నారు ఈ తరం.ఆ రోజుల్లో కూడా స్త్రీలు ఉద్యోగం చేసే వాళ్ళు ఉండేవారు. సంసారాలు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ సాంప్రదాయాలు పద్ధతులు పాటిస్తూ గుట్టుగా సంసారం చేసుకుంటూ ఉండేవారు. మరి ఈ తరం ఎందుకు ఇలా అయిపోతోంది. 
రాను రాను యువతరంలో శక్తి తగ్గిపోతోందా. లేదంటే చేతినిండా పుష్కలంగా డబ్బు ఉండి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కాళ్ల దగ్గరికి వచ్చే రోజులు వచ్చేయి కదా. అందుకే ఎక్కువ శ్రమపడలేకపోతున్నారా అని ఆలోచనలో పడింది పార్వతమ్మ. ఇంటి ఇల్లాలే ఇలా ఉంటేమరి రాబోయే తరాల్లో పండుగలు ఏ విధంగా చేసుకుంటారో సాంప్రదాయాలు ఏ విధంగా పాటిస్తారో అని ఆలోచిస్తే పిచ్చెక్కి పోతోంది అనుకుంటూ లేదు దీన్ని మార్చాలి దానికి కోపం వచ్చినా సరే ఈ పద్ధతులు మార్చాలి. అనుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది పార్వతమ్మ.

 ఈలోగా వంట ఎంతవరకు వచ్చింది అంటూ వంటింట్లోకి వచ్చిన భర్త ముకుందరావుతో "ఏవండీ నాలుగు రోజులు అమ్మాయి దగ్గరికి వెళ్లి వస్తాను టికెట్లు బుక్ చేయండి అంటూ చెప్పింది.

పార్వతమ్మ గారి సడన్ ప్రయాణానికి కారణమేమిటో అందరికి తెలుసు. ఏదైనా తప్పు జరిగినప్పుడు పెద్దవాళ్లు తప్పని చెప్తూనే ఉండాలి. చెప్పకుండా కూర్చుంటే ఎప్పటికీ ఎవరి పద్ధతులు మారవు. చెప్పిన తర్వాత కూడా వినకపోతే వాళ్ల ఖర్మ. నిత్యం రేడియోలు టీవీలు ప్రసారం చేసే ప్రవచనాలు విని చాలామంది తమ జీవితాలను మార్చుకున్నారు. తప్పులు సరిదిద్దుకున్నారు. తప్పులు చేయడం మానవ సహజం కదా.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట