ఎవరి తప్పు లేదు
ఎవరి తప్పులేదు
"
ఇదేమిటి దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు. సాఫీగా నడుస్తున్న జీవితంలో ఒక పెద్ద పెను తుఫాన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వయసులో దీన్ని తట్టుకునేది ఎలా? ఈ ఆఖరి దశలో ఎవరు చూస్తారు. ఎవరు ఆదరణగా ఇంత ముద్ద పెడతారు. బాధ్యతలు అన్నీ అయిపోయాయి కదా. ఏదో కృష్ణ రామా అనుకుంటూ తీర్థయాత్రలకు వెళ్లి హాయిగా కాలక్షేపం చేద్దామనుకుంటే ఇలా హఠాత్తుగా వసుమతి మరణించడం నిజంగా తట్టుకోలేక పోతున్నాను అంటూ మంచం మీద పడుకుని పెద్దగా ఏడుస్తున్నాడు జగన్నాథ శర్మ.
చూసే వాళ్ళందరికీ ఆ దృశ్యం హృదయవిదారకంగా ఉంది. నిజమే ఈ వయసులో భార్య చనిపోతే మగవాడికి చాలా కష్టం
భార్య తోడు లేకుండా ఒక క్షణం కూడా గడవదు మగవాడికి
ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా లేచి భర్త కోసం ఆ గుప్పెడు మెతుకులు భార్య వండి పెడితేనే ఆ మగవాడికి తృప్తి అనుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కళ్ళు తుడుచుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు.
జగన్నాథ్ శర్మ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఆరుగురు ఆడ పిల్లలకి పెళ్లిళ్లు చేసి పురుళ్ళు పుణ్యాలు అన్ని పూర్తి చేసి సొంత ఊర్లో సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేద్దామని పట్నం నుంచి ఈ మధ్యనే ఆ ఊరికి వచ్చాడు.
జగన్నాధ శర్మ బాగా చాందస భావాలు ఉన్న వ్యక్తి. ఆచారాలకి సాంప్రదాయాలకి బాగా విలువ ఇచ్చే వాడు. ఎంత గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసిన పిలకపెట్టుకుని రోజు గాయత్రీ జపం చేస్తే గాని పచ్చి మంచినీళ్లు ముట్టుకునేవాడు కాదు. ముహూర్తాలకి జాతకాలికి బాగా విలువ ఇచ్చే వ్యక్తి.
బాధ్యతలు అన్నీ తీరిపోయి హాయిగా కాలక్షేపం చేద్దాం అనుకుంటే ఇదిగో ఇలా బాధపడే యోగం వచ్చింది. అలా బాధపడుతూనే భార్య కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు. ఆఖరి రోజు పిల్లలందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతూ నాన్నగారు మీరు మాతో వస్తే బాగుంటుంది అంటూ బతిమాలిన ఎవరి మాట వినకుండా " లేదమ్మా ఈ ఇంట్లో ఉంటే అమ్మ నాతోనే ఉన్నట్టుంటుంది అంటూ మొండిగా ఆ ఇంట్లోనే ఉండిపోయాడు.
అప్పుడే మొదటిసారిగా అనిపించింది ఒక మగ పిల్లవాడు ఉన్నా బాగుండేది. కష్టమో నష్టమో జీవితం వాడితోటే గడిచేది. ఇప్పుడు ఆడపిల్లలు పరాయి ఇంటికి కోడలుగా వెళ్ళిన వాళ్ళు. ఆడపిల్లలు మనకడుపున పుట్టిన వాళ్లే కానీ అల్లుడు పై వాడే కదా .అంతే కాదు వాళ్ళ అత్తమామలు బాధ్యతలు కూడా వాళ్లకు ఉంటాయి. పుట్టింటి వాళ్ళని తీసుకురావడం చాలామంది అత్త వారికి ఇష్టం ఉండదు. ఇలా బాధపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు జగన్నాథ్ శర్మ.
ఉదయం లేచేటప్పటికి 6:00 అయింది. మొహం కడుక్కొని స్నానం చేసి పూజ చేసుకుని వచ్చేటప్పటికి ఎప్పుడు టేబుల్ మీద కాఫీ రెడీగా ఉండేది. ఇవాళ ఇంకా కాఫీ ఇవ్వలేదేమిటి అని అనుకుంటూ వంటింట్లోకి తొంగి చూసిన జగన్నాథ శర్మ కు అప్పుడు గుర్తుకొచ్చింది అసలు విషయం. ఇంకేముంది కన్నీళ్లు తుడుచుకుంటూ స్టవ్ వెలిగించుకుని అతి కష్టం మీద కాఫీ తయారు చేసుకున్నాడు. కాఫీ నోట్లో పెట్టుకోగానే తాగాలని అనిపించలేదు. నీళ్ళ కాఫీ లా ఉంది. ఎప్పుడూ అలవాటు లేని పని. వంటింట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇంతవరకు అవసరం కూడా రాలేదు.
కాఫీ అయింది అనిపించి స్నానం చేసి టిఫిన్ చేయడానికి హోటలుకి బయలుదేరాడు. హోటల్ దగ్గర టిఫిన్ చేస్తుంటే పల్లెటూరు కదా అందరూ విచిత్రంగా చూడడం ప్రారంభించారు. భార్య బతికున్న రోజుల్లో ఏ ఒక్కరోజు సరదాగా కూడా బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్న రోజులు లేవు. అంత చాందస భావాలు ఉన్న ఈ పెద్దమనిషి ఆ కాకా హోటల్లో టిఫిన్ చేయడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది.
జీవితంలో వచ్చి కొత్త మార్పులు అన్నిటిని మనం సాదరంగా ఆహ్వానించవలసిందే పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు అనుకుంటూ ఇంటికి వచ్చి పెద్ద కూతురుకి ఫోన్ చేస్తే కుక్కర్ ఎలా పెట్టాలో వీడియో కాల్ లో అన్ని చెప్పితే వంట పూర్తి చేసుకుని టీవీ ముందు కూర్చున్నా డు. టీవీ ఎంత సేపు చూసినా కాలం కదలడం లేదు.
బొమ్మ చూస్తున్నాడే కాని ఏవో ఆలోచనలన్నీ చుట్టుముట్టే యి.
భార్య ఉంటే ఈ పాటికి వంట అంతా పూర్తి చేసుకుని హాల్లో సోఫాలో తనతో పాటు కబుర్లు చెబుతూ కూర్చునేది. ఇప్పుడు ఒంటరి జీవితం. ఎలా గడుస్తుందో జీవితం . ఏమీ తోచడం లేదు అనుకుంటూ అలా సోఫాలో కళ్ళు మూసి పడుకున్నాడు. లేచేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ఆకలి దంచేస్తోంది.
ఎప్పుడు రెండు కూరలు రెండు పచ్చళ్ళు తో భోజనం పెట్టే భార్య లేకపోవడం తో చేతకాని వంటతో పప్పు అన్నం తోటీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈలోగా పనిమనిషి వచ్చి గిన్నెలు తోమి ఇల్లు తుడిచి వీధి గుమ్మం కడిగి. వెళ్ళిపోయింది. వసుమతి ఉన్నప్పుడు ఉదయం సాయంకాలం పనిమనిషి రాకపోతే ఒప్పుకునేది కాదు. పనిమనిషి ఉదయం రాలేదు.కుక్కర్ అంత మాడిపోయిందండి అయ్యగారు అంటూ పనిమనిషి విసుక్కోవడం జగన్నాథ్ శర్మ చెవిన పడింది.
ఇంట్లో బాధ్యత కలిగిన గృహిణి లేకపోతే పని వాళ్లకు కూడా లోకువే. పనిమనిషి వెళ్లిన తర్వాత వాకింగ్ వెళ్లి వచ్చేటప్పుడు టిఫిన్ తెచ్చుకుని స్నానం చేసి మందులు వేసుకుని కాసేపు టీవీ చూసి పడక గదిలోకి వెళ్ళిపోయాడు జగన్నాథ్ శర్మ. పడక గదిలోకి చేరగానే మళ్ళీ ఏవేవో ఆలోచనలు. ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది.
ఉదయం సాయంకాలం దేవుడి గదిలో పూజలు ఇల్లంతా సాంబ్రాణి పొగలు మధ్య మధ్యలో ఫోన్లో పిల్లలకు సలహాలు మనవళ్ళతో ముచ్చట్లు ఉదయం టిఫిన్ దగ్గర్నుంచి రాత్రి టిఫిన్ వరకు ఇష్టమైనవి వండి పెట్టడం వయసు పెరుగుతున్న ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం ఎంత బాగుండేవి ఆ రోజులు. అదంతా ఒక స్వర్గం.
వయసు పెరిగిన తర్వాతే నిజంగా తోడు అవసరం. ఎందుకంటే బాధ్యతలు తీరిపోతాయి. బంధాలన్నీ రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. ఇక మిగిలేది ఎవరు? సంసారం ప్రారంభించినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్లే.
కానీ మధ్యలో ఈ కాలం పెట్టే పరీక్ష తట్టుకోవడమే పెద్ద పరీక్ష అనే ఆలోచనలు రోజు చుట్టుముట్టి ఏడుస్తూ తనకు తానే సముదాయించుకుంటూ ఏడాది గడిపేసాడు జగన్నాథ శర్మ. మధ్యలో ఆడపిల్లలు ఎవరికి వీలున్నప్పుడల్లా వాళ్లు వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్లేవారు. పిల్లలకు తండ్రిని చూసినప్పుడల్లా తండ్రి రోజురోజుకీ నీరసంగా అయిపోతున్నాడనే విషయం గ్రహించారు. ఎన్నిసార్లు అడిగినా ఏడ్చి మొత్తుకున్నా జగన్నాథ్ శర్మ గుమ్మం కదలడానికి ఒప్పుకోలేదు.
వసుమతి సంవత్సరీకాలకి పిల్లలు బంధువులు అందరూ వచ్చారు. జగన్నాశర్మ యధావిధిగా కార్యక్రమాలు పూర్తి చేశాడు.
ఆఖరి రోజున పిల్లలు అందరూ వెళ్ళిపోతూ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా జగన్నాధ శర్మ వచ్చి పిల్లలతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. "చూడండి మీకు అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పాలి. నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ భార్య లేని లోటు రోజు రోజుకి నన్ను కృంగదీస్తోంది. ఒంటరిగా జీవితం గడపలేకపోతున్నాను. తెల్లవారి లేస్తే భయం. అన్ని బాధ్యతలే. ఎప్పుడూ గరిట పట్టుకోవడం చేతకాని నాకు ఇటువంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు పెళ్లి అనేది నాకు ఏమి అవసరమని మీరు అనుకోవచ్చు. పెళ్లంటే కేవలం శారీరిక అవసరాలకే కాదు .
ఆఖరి దశలో ఒక తోడు. ఆడదిలేని మగవాడి జీవితం నరకం. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ను. ఈ మాట మీ అందరికీ నచ్చకపోవచ్చు అంటూ జగన్నాథ్ శర్మ చెప్పిన మాటలకు పిల్లలు అందరు ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. అయినా ఈ వయసులో నాన్నకు పెళ్ళి ఏమిటి ఎవరికైనా చెప్తే నవ్వుతారు.అత్తవారి ఇళ్లల్లో తలెత్తుకుని తిరగగలమా అంటూ పిల్లలు ఎవరి మనసులో వాళ్లు బాధపడసాగారు. మగవాళ్ళందరూ భార్య పోతే వెంటనే రెండో పెళ్ళికి రెడీ అయిపోతారు. పోయిన భార్య మీద ప్రేమ అంతా వట్టిదే అనుకుంటూపిల్లలు ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఏమి సమాధానం చెప్పకుండా ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు.
వసుమతి బతికున్న రోజుల్లోనే పరాయి ఆడవారి విషయంలో జగన్నాశర్మకి మంచి పేరు లేదు.ఈ విషయం పిల్లలకి తెలుసు అందుకే ఈ వయసులో జగన్నాథ్ శర్మ కి పెళ్లి అవసరం ఎందుకు వచ్చిందో అనే విషయంపై వాళ్లు వేరే విధంగా ఆలోచించారు. ఒక్కసారి తండ్రి మీద అసహ్యం వేసి ఏ నిర్ణయం చెప్పలేదు. అంతేకాదు తల్లి స్థానంలో పరాయి స్త్రీని ఊహించుకోలేకపోయారు. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ రెండు మూడేళ్ల తేడా ఉన్న ఆడది దొరకాలి. ఈ వయసులో ఆమెకి జగన్నాథ శర్మకు వండిపెట్టి బాగోగులు చూసి బాధ్యతలు పంచుకునే ఓపిక ఉన్న మనిషి దొరకాలి. అది కూడా కష్టం. ఇవి పిల్లల ఆలోచనలు.
ఇలా ఆరు నెలలు గడిచింది. రోజు రెండు మూడు సార్లు ఫోన్ చేసే పిల్లలు క్రమేపి రోజుకు ఒకసారి ఫోన్ చేస్తే ముక్తసరిగా మాట్లాడి ఫోన్ పెట్టేసేవారు.పిల్లలకు పెళ్లి చేయనంతసేపు వాళ్లకి సంబంధించిన ఏ నిర్ణయమైనా తండ్రి తీసుకోగలడు. ఇప్పుడు తనకు సంబంధించిన నిర్ణయం స్వతంత్రంగా తీసుకునే అధికారం తనకు లేదు ఈ విషయంలో . కడుపున పుట్టిన పిల్లల అంగీకారంతోటే ఈ పని చేయగలడు. ప్రస్తుతం పరిస్థితి అటువంటిది. ఇది చాలా సున్నితమైన విషయం. తొందరపడి తీసుకుంటే రేపు చివరి దశలో పిల్లలు ఎవరూ దగ్గరికి రారు అలా బాధపడుతూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు.
కాలం చాలా బలీయమైనది. ఎప్పుడు ఎవరి జీవితంలో ఏ మార్పు తీసుకొస్తుందో చెప్పలేం. కొంతమంది జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పుతుంది. మనం ఏదో ఊహించుకుంటాం. ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. కానీ తలరాతని మటుకు మార్చలేము.
బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత జీవిత భాగస్వామితో హాయిగా కాలిక్షేపం చేద్దామనుకున్న జగన్నాథ శర్మ జీవితం ఒక్కసారి మలుపు తిరిగింది. భార్య లేని జీవితం మగవాడికి ఎడారి లాంటిది. ఒక్కరోజు కూడా సరిగా గడవదు ఆమె లేకపోతే. తన సమస్యను తానే పరిష్కారం చేసుకోవాలని నిర్ణయించుకుని ఉన్న ఆస్తిపాస్తులు అన్ని అమ్మేసి పిల్లలందరికీ సమానంగా పంచి వృద్ధాశ్రమానికి ఆనందంగా వెళ్లిపోయాడు జగన్నాధ శర్మ.
తల్లిదండ్రులని బలవంతంగా వృద్ధాశ్రమంలో చేర్పించే పిల్లల్ని చాలామంది గురించి వింటున్నాము. పరిస్థితుల ప్రభావంతో తనకు తానే వృద్ధాశ్రమంలో చేరిన జగన్నాధ శర్మ లాంటి వాళ్ల జీవితం ఎవరికి రాకూడదని కోరుకుందాం. ఇందులో ఎవరి తప్పులేదు. ఆలోచన విధానమే తప్పు. మన కడుపున పుట్టిన ఆడపిల్లని పెళ్లి చేసి పంపిన తర్వాత మన పిల్ల కాదు అనే ఆలోచన ధోరణి తరతరాలుగా మన సమాజంలో నాటుకొని పోయి ఉంది.
అయితే పాత తరం ఆడపిల్లలకి స్వతంత్ర నిర్ణయాలు లేవు. భర్త నిర్ణయం మీద ఆధారపడి ఉండేవారు. ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు పరిస్థితి అంతా అటు అత్తవారికి ఇటు భర్తకి చెప్పి వాళ్లను ఒప్పించి తల్లిదండ్రులను చూస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ జగన్నాథ్ శర్మ ఆ పాత తరం వ్యక్తి. అందుకే వియ్యాల వారు ఆదరించరు అని ఉద్దేశంతో కూతుర్ల దగ్గరికి వెళ్ళలేదు. సరే ఒక తోడు కోసం ప్రయత్నం చేసినప్పుడు పిల్లలు ఉద్దేశం అందుకు వ్యతిరేకంగా ఉంది.
పెద్దయిన తర్వాత పిల్లల ఆలోచన ధోరణికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రస్తుతం ఆరోగ్యరీత్యా ఏ సమస్యలు లేవు కాబట్టి వృద్ధాశ్రమానికి తాత్కాలికంగా వెళ్లిన రేపు కాలు చెయ్యి వంగిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్లక తప్పదు కదా ఇది జగన్నాధ శర్మ ఆలోచన. యిప్పటి నుంచి వాళ్ళనెత్తిమీద కూర్చుని చాకిరి చేయించుకోవడం ఎందుకు అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాడు జగన్నాధశర్మ. మన నిర్ణయాలతో పని ఏముంది. కాలం ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. ఇందులో ఎవరి తప్పులేదు.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి