లేగదూడ

 లేగదూడ 


ఆ లంకంత కొంపలో ఒక మూలగా ఉన్న గదిలోంచి "అమ్మా నొప్పులు భరించలేకపోతున్నాను అంటూ గట్టిగా అరుస్తున్న ఆ ఇంటి ఇల్లాలు రాజమ్మ గొంతు వింటుంటే అక్కడ హాల్లో కూర్చున్న అందరికీ మనసులో ఆందోళన పెరిగిపోతోంది. ఉదయం నుంచి ఆ ఇంటి ఇల్ల్లాలు ఒక ప్రాణిని ఈ లోకంలోనికి తీసుకురావడానికి పడుతున్న బాధను చూడలేకపోతున్నారు. ఏమీ చేయలేని పరిస్థితి. చంటి పిల్లలు అంటే అందరికీ సరదాయే. కానీ ఆ పిల్లని ఈ లోకంలోకి తీసుకురావడానికి ఆ తల్లి పడే ఆవేదన మరణయాతన ఊహించలేం. రాజమ్మ భర్త రాజారెడ్డి మాటిమాటికి ఆ గది వైపు తొంగి చూస్తూ కాలు గాలిన పిల్లిలా పచారులు చేస్తున్నాడు.


ఇంతలో చంటి పిల్ల ఏడుపు వినిపించింది. గదిలోంచి మంత్రసాని బయటకు వచ్చి అమ్మాయి పుట్టిందంటూ ఆనందంగా చెప్పింది. 

నలుగురు మగ పిల్లల తర్వాత ఆడపిల్ల. ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ పాటించడం ఒక పాపంగా భావించే వాళ్ళు. దానికి తోడు రాజారెడ్డికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. రాజారెడ్డి కోరిక ప్రకారం మహాలక్ష్మి పుట్టింది. ఆ దంపతులు ఆనందానికి అవధులు లేవు. అందరూ రాజారెడ్డిని అభినందిస్తుంటే రాజారెడ్డి ఇంకా మనసులో ఆందోళన తగ్గలేదు. ఇంటిదగ్గర సమస్య తీరింది. పొలంలో ఉన్న కర్రి ఆవుకి కూడా నెలలు నిండాయి. మాటలు వచ్చిన మనిషి అయితే మనసులో ఉన్న బాధ చెప్పగలడు. 

కానీ ఆ మూగ జీవి ముఖ్యంగా ఇటువంటి సమయంలో పడే బాధ ఎవరికి తెలియదు. మనం దగ్గరుండి చూసుకుని అర్థం చేసుకోవాలి తప్పితే వేరే దారి లేదు. అనుభవజ్ఞుడైన రైతు ఆ మూగజీవుల బాధను కూడా గమనించగలడు. అందుకే ఎంత తొందరగా పొలం వెళ్తే అంత మంచిదని అనుకున్నాడు రాజిరెడ్డి. 


ఉదయం పొలం నుండి వచ్చేటప్పుడు పెద్దపాలి కాపు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అయ్యగారు ఇవాళ తప్పకుండా మన కర్రి ఆవు ఈనుతుంది. నా అనుభవం కొద్దిగా చెప్తున్నాను. మీరు ఎక్కువ సేపు ఇంటిదగ్గర ఉండకండి అన్న మాటలు గుర్తుకొచ్చి ఇంటిదగ్గర పరిస్థితులు చక్కబడిన తర్వాత నాలుగు మెతుకులు తినేసి గబగబా పొలం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు రాజారెడ్డి. 


రాజారెడ్డికి పశువులంటే చాలా ఇష్టం. కడుపుని పుట్టిన పిల్లల్లా ప్రేమిస్తాడు. రోజు వాడితో ప్రేమగా మాట్లాడుతుంటాడు. అవి కూడా రాజారెడ్డి మాటలు వింటున్నట్లు చెవులు రెండు పైకెత్తుతాయి. రాజారెడ్డి రాగానే మెడ ఎదరకు చాపడం చూసి రాజారెడ్డి వాటి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా గుండెలకి హత్తుకుంటాడు. నిజానికి రైతుకి సొంత బిడ్డలాంటివే పొలంలోని పశువులు కూడా. ఎంత తొందర పనులు ఉన్నా రోజు పొలం వెళ్లకుండా ఆ పశువుల్ని పలకరించకుండా ఉండడు. అలా చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. 


రాజారెడ్డి పొలం చేరుకునేసరికి కర్రి ఆవు కట్రాట చుట్టూ గిరగిరా తిరుగుతూ ముక్కుతోంది. మధ్యలో ఒకసారి కింద పడుకొని మెడ దూరంగా జరిపి మళ్లీ గబుక్కున పైకి లేచిపోతోంది. పరిస్థితి అర్థం అయింది రాజారెడ్డికి. రాజారెడ్డికి మనసులో ఆందోళన పెరిగిపోయింది. కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేస్తూ అరగంటసేపు అలా ఉండిపోయాడు. ఇంతలో ఏ దేవత కరుణించిందో తెలియదు గానీ అందమైన ఎర్ర రంగులో ఉన్న పెయ్య దూడ అమ్మ కడుపులో నుంచి లోకంలోకి వచ్చింది. అయ్యగారు మహాలక్ష్మి పుట్టిందండీ అంటూ ఆనందంగా చెప్పాడు పెద్ద పాలికాపు. హమ్మయ్య అనుకున్నాడు రాజారెడ్డి


భగవంతుడు సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది. తన బిడ్డ పుట్టి పుట్టగానే అంతవరకు అనుభవించిన బాధను మర్చిపోయి ఆ గోమాత లేగదూడను ప్రేమతో నాకగానే దూడలో వేడి పుట్టి కదలిక వస్తుంది. ఆ లేగ దూడ లేచి నించునే ప్రయత్నాలు చేస్తుంది. నాలుగు రోజులు పోయేసరికి నేల మీదనున్న మట్టిని రుచి చూస్తుంటే మూతికి బుట్టని అలంకరించేసాడు పెద్ద పాలికాపు.

ఇంటిదగ్గర పసిపిల్ల ఏడుపులు, పాకలో లేగ దూడ అరుపులతో సందడిగా ఉంది. ఆ గంతులు వేసే లేగ దూడను చూసి రాజిరెడ్డి కళ్ళల్లో ఆనందం తోణికిసలాడింది. ఉదయించే సూర్యుడిలా ఉన్న రంగు కల ఆ లేగ దూడకి సురభి అని పేరు పెట్టుకున్నాడు.


 ఎందుకంటే రాజారెడ్డి పశువులు శాలలో ప్రతి పశువుని ఒక పేరుతో పిలుస్తాడు అది అలవాటు. పున్నమి చంద్రుడిలా వెలిగిపోతున్న చంటిపిల్లకి కౌముది అని నామకరణం చేశాడు.  


ఆ రెండింటినీ కంటికి రెప్పలా చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్న రాజిరెడ్డికి కాలం తెలియట్లేదు. బుడిబుడి నడకలు వచ్చిన కౌముది కాళ్ళకి మువ్వల పట్టీలు రాజమ్మ పెడుతుంటే అప్పుడు గుర్తుకొచ్చింది సురభి గాడి మెడ కూడా బోసిగా ఉందని. ఇంకేముంది అటక మీద ఉన్న మువ్వల గంటలు తీసుకెళ్లి మెడకి అలంకరించి మురిసిపోయాడు రాజిరెడ్డి. సురభి గాడు ఎగురుతుంటే ఆ మువ్వల చప్పుడు ఇంటిలో కౌముది అటు ఇటు పరిగెడుతుంటే గజ్జలచెప్పుడు గుండెలో ఆనందాన్ని రేకెత్తించేయి ఆ కుటుంబ సభ్యులకి.


అంతవరకు అమ్మ దగ్గర గుమ్మ పాలు తాగుతూ పెరిగిన ఆ ఇంటి మహాలక్ష్మిలకి కాలం పరిగెడుతూ వాటికి వయసు పెంచేసింది. ఇప్పుడు రాజమ్మ కౌముదిని చంక ఎత్తుకొని గోరుముద్దులు తినిపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది ప్రతిరోజు. సురభి మటుకు అమ్మ కూడా పొలం గట్టుకు పరిగెత్తి  

లేత పచ్చ గడ్డి నములుతూ తల్లికి పెట్టే వాటిలో వాటా అడుగుతోంది. ఇలా కాలం గడిచిపోతోంది. కౌముది అమ్మ ఒడి దాటి బడిలోకి అడుగు పెట్టింది. బంగారు తల్లిలా చదువు నేర్చుకుని ఫెడల్ మీద సైకిల్ నేర్చుకుని హై స్కూల్ చదువులోకి వచ్చేసింది. మీ కౌముది చాలా తెలివైన పిల్లని అంటూ మాస్టర్లు ఇచ్చిన కితాబు విని మురిసిపోయాడు రాజిరెడ్డి.  

నాన్న నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అంటూ కౌముది చెప్పిన మాట విని మురిసిపోయాడు రాజారెడ్డి. నాన్న నేను కూడా కాలేజీలో చేరుతాను అని పట్టు పడితే ఎందుకమ్మా మనకి దూరం పంపించడం నాకు ఇష్టం లేదు అన్నా నాన్నను బుట్టలో వేసి కాలేజీలో చేరిపోయింది కౌముది. కౌముది సురభి ఇద్దరు ఒకేసారి ఈ లోకంలోకి వచ్చిన సురభి పశువు కాబట్టి రాజారెడ్డి చెప్పిన మాటల్లా వింటూ రోజు పెట్టినవన్ని తింటూ తనకో తోడు అవసరం ఉందని తన భాషలో చెబుతూ ప్రతి ఏటా తన వారసులని రాజా రెడ్డికి పెంచుకుంటూ వచ్చింది.


తన చేతిలో డిగ్రీ పట్టా పుచ్చుకొని తండ్రిని గట్టిగా కౌగిలించుకున్న ఆ కుందనపు బొమ్మని అట్టే ఆలస్యం చేయకుండా అమెరికా అయ్య చేతిలో పెట్టేసాడు రాజారెడ్డి. అంతవరకు నాన్న గుండెల్లో ఉన్న కౌముది ఆ మోహన రెడ్డికి ప్రాణం అయిపోయింది. ఆ మోహన్ రెడ్డి చేయి పట్టుకుని విమానంలో ఎగిరిపోయింది. కౌముది అమెరికా వెళ్ళిపోయిన తర్వాత రాజారెడ్డికి ఏదో తెలియని వెలితి. అందుకనే పొలంలో ఎక్కువసేపు గడపసాగాడు. ఆ సురభి గాడికి పుట్టిన పిల్లలతో ఆడుకుంటూ. అవి సాంకేతికత బాగా పెరగని రోజులు. కబురు తెలియాలంటే టెలిగ్రామ్ లేదంటే ఉత్తరాలు అది ఆ కాలo.


ఇలా కాలం గడిచిపోతోంది . రాజారెడ్డి వయసు మీద పడి పొలం వెళ్లలేక ఇంటిదగ్గరకి పశువుల మకాం మార్పించేసుకున్నాడు. ఒక రోజు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు రాజారెడ్డి. కబురు తెలిసి కౌముది వచ్చేటప్పటికి ఆరడుగుల పొడవు ఉన్న రాజారెడ్డి గుప్పెడు బూడిదైపోయాడు. రాజారెడ్డి లోకంలో ఉన్నంతసేపు ఎంతో ప్రేమగా చూసిన సురభి గాడు రాజారెడ్డిని పుణ్యలోకాలకు పంపించడా నికి సహాయం చేశాడు. అలా సురభి గుమ్మం దాటిపోయింది. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కన్నీళ్లన్నీ కార్చేసి నాన్న జ్ఞాపకాలన్నీ మోసుకుంటూ విమానం ఎక్కేసింది కౌముది. మనం ప్రేమతో పెంచుకున్న ఆడపిల్ల వేరొకరి ఇంటికి మహాలక్ష్మి గా వెళ్లి ఆ వంశ అభివృద్ధికి కారణం అవుతుంది. కానీ సురభి గాడి వారసులు మాత్రం తరతరాలుగా ఆ కుటుంబ ఆరోగ్యానికి వ్యవసాయానికి సహాయ పడుతూనే వచ్చాయి.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట