సతులార
సతులారా చూడరే
సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమిl
సకలాయ నడిరేయ కలిగే శ్రీకృష్ణుడు
అంటూ అన్నమయ్య తన కీర్తనల్లో శ్రీకృష్ణుడి పుట్టుక గురించి స్తుతించారు.
శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజుగా
పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పండుగను మనం కృష్ణాష్టమి గా జరుపుకుంటాం.
చెరసాలలో దేవకి వసుదేవుల కుమారుడుగా జన్మించి రేపల్లెలో నందుని ఇంటిలో యశోదమ్మ ఒడిలో పెరిగి నంద కుమారుడుగా చలామణి అయ్యాడు
పోతన్న గారు ఆంధ్ర మహాభాగవతంలో శ్రీకృష్ణుని రూపం గురించి చెప్తూ నల్లని వాడు పద్మనయనములు కలవాడిగా వర్ణించారు.
అన్నమయ్య ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అంటూ స్తుతించాడు.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణ అవతారం ఎత్తిన విష్ణుమూర్తి పసిప్రాయం నుండి తన లీలలు చూపించి రేపల్లెవాసుల్ని ఆశ్చర్యపరిచాడు.
పాలు తాగే వయసులో కృష్ణుడిని చంపడానికి మేనమామ కంసుడు పంపించిన పూతన అనే రాక్షసిని రొమ్ము పీల్చి సంహరించాడు. ఇక్కడ భగవంతుడు మాయ మనం గమనించాలి. సాధారణంగా చంటి పిల్లలకి తల్లి దగ్గర తప్పితే ఇతర స్త్రీల దగ్గర ఎవరూ పాలు ఇప్పించడానికి ఇష్టపడరు.
ఆ రాక్షస సంహారం జరగాలి కాబట్టి పరమాత్మ తన మాయతో అందరి కళ్ళు కప్పి ఆ అపరిచిత స్త్రీకి పాలు ఇవ్వడానికి యశోదకు ఆ ఆలోచన పుట్టించాడని చెప్పవచ్చు.
ఆ అల్లరి కృష్ణయ్య ఆగడాలు భరించలేక తల్లి యశోద ఆ బాలకృష్ణున్ని ఒక రోలుకి కట్టిపడేసింది. ఎవరికి సాధ్యo పరమాత్మ ని కట్టిపడేయడం. చివరికా రోలు లాగుకుంటూ ఆ అల్లరి కృష్ణుడు మద్ది చెట్ల మధ్యలోకి దూరి శాపం కారణంగా చెట్ల రూపంలోఉన్న గంధర్వులకి శాప విమోచనం కలిగిస్తాడు.
పసిప్రాయంలో శ్రీకృష్ణ లీలలు వినడానికి మనకు చాలా ఆనందంగా ఉంటాయి. అవి మనకి అల్లరి కృష్ణుడి ఆగడాలుగా అనిపించిన దాని వెనుక ఉన్న అంతరార్థం ఆ పరమాత్మ ఒక్కడికే తెలుసు. సాధారణంగా చిన్నపిల్లలు పసిప్రాయంలో మట్టి తింటుంటారు. అలాగే కృష్ణుడిని యశోద నోరు తెరిచి చూపించమని అడగగా తన నోటిలో విశ్వమంతా చూపించి తల్లిని చరితార్ధరాలు ని చేశాడు.
శ్రీకృష్ణ పరమాత్మకు వేణుగానం అంటే చాలా ఇష్టం. ఎల్లప్పుడూ వేణు గానం చేస్తూ గోవులను మేపుకుంటూ ఆ రేపల్లె వాసులని ఆనందపరిచేవాడు.
శ్రీకృష్ణుడుని నందనందనుడు దేవకి నందనుడు యశోద కృష్ణుడునల్లనయ్య రకరకాల పేర్లతో పిలిచేవారు. కాళింది మడుగులో కాళీయుడు అనే విష సర్పం మీద నృత్యం చేసి గర్వమణి చి తాండవ కృష్ణుడు అయ్యాడు.
ప్రళయ కాల సమయంలో గోవర్ధనగిరి ని చిటికెన వేలుతో పైకెత్తి రేపల్లెవాసులందరినీ దాని కిందకు చేర్చి కాపాడి గోవర్ధనగిరిధారిగా పేరుగాంచాడు.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడి రథసారథి గా నిలిచిచింతాక్రాంతుడు యుద్ధవిముకుడైన అర్జునునికి భగవద్గీతనుబోధించి జగత్తుకి గురువు అయ్యాడు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి