జై జవాన్
జై జవాన్.
ఉద్యోగం పురుషలక్షణం అంటారు. కొన్ని ఉద్యోగాలు అందమైన కార్యాలయాల్లో చల్లని రాతి గదులలో కూర్చుని బుద్ధి బలంతో చేసేవి. మరికొన్ని శారీరిక శ్రమతో చేసేవి. మరికొన్ని కొలువులకి దేశ సరిహద్దులే కార్యాలయాలు . కొండ కోనల్లో ఎండ వానల్లో మంచు తుఫానులో ఇరవై నాలుగు గంటలు దేశ రక్షణ ప్రధాన కర్తవ్యం.
ఆ విధంగా పనిచేసే వారికి జీతభత్యాలు ఇచ్చినప్పటికీ వారిని ఎప్పటికీ మనం త్యాగమూర్తులుగానే గుర్తించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీరిది దేశ రక్షణ ప్రధాన కర్తవ్యం. ప్రాణాలను పణంగా పెట్టి ఎప్పుడు దేశ రక్షణ చేస్తూ ఉండాలి. కన్నతల్లిని ఉన్న ఊరుని మరిచిపోయి దేశ రక్షణ ప్రధాన కర్తవ్యం గా పనిచేసే ఈ సైనికులు నిజంగా చిరస్మరణీయులు.
దేశ ప్రజల ఆకలి తీరాలంటే రైతు పంట పండించాలి. దేశ పౌరుడు నిశ్చింతగా నిర్భయంగా తిరగాలంటే సైనికుడు తుపాకీ గురి పెట్టుకుని ఉండాలి ఎప్పుడు. దేశంలో అనేక రకాల ఉపాధిలు ఉన్నప్పటికీ అందుకే ఈ వృత్తులకి అంత గౌరవం. జై జవాన్ జై కిసాన్ అంటారు.
దేశ రక్షణే కాకుండా ప్రకృతి విపత్తులు లో ఆదుకునే పరమాత్ముడు సైనికుడు.యుద్ధమంటే ఎప్పుడు ముందుకు దూసుకు పోయేది సైనికులు.ఆర్మీ అంటే అన్నదమ్ముల్లా ఆదుకునేది.అందుకే భద్రంగా చూస్తున్నాడు భారతదేశాన్ని.
ఎందరో మహావీరుల త్యాగ ఫలితం ఈ దేశ స్వాతంత్రం. మరి ఎందరో జవాన్ల అవిరామ త్యాగం ఈనాటి మన భద్రత. ప్రభుత్వం వారు పెట్టిన డ్రెస్ కోడ్ చూడగానే ఈ జవాన్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. భుజానికి తగిలించుకున్న గన్ను చూడగానే జవాన్ లో వీరత్వం పొంగుతుంది. నిరంతరం క్రమశిక్షణ జవాన్ లో కఠినత్వం.
పెంచుతుంది.
డిగ్రీలు చదువుకున్న ఉద్యోగాలు రాని ఈ పరిస్థితుల్లో కొంతమంది ఉపాధి కోసం మరి కొంతమంది ఆశయం కోసం యువతకి ఆర్మీ పై మోజు పెరిగింది. ఒక్కగా నొక్క కొడుకు ఏడాదికి ఒకసారి చూడడానికి వచ్చిన ప్రతిరోజు అందమైన మిలటరీ డ్రెస్ లో మెరిసిపోతున్న కొడుకు ఫోటో చూసి ఆనంద పడిపోతూ ఉంటుంది తల్లి. టీవీ వార్తల్లో బాంబులు అనే మాట విని తల్లడిల్లి పోతుంది.
ఎప్పుడు యుద్ధమేఘాలు క మ్ముకుంటాయో తెలియదు. ఇది అత్యవసర సర్వీసు కదా . తప్పనిసరిగా సెలవులో ఉన్నా సరే దేశభద్రతకి వెళ్ళవలసిందే. ఎప్పుడూ సరిహద్దుల్లో ఉండే ఈ జవాన్లు సెలవు పెట్టుకుని వచ్చిన అత్యవసర పరిస్థితి సమయంలో వెళ్లవలసి వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించగలం. అయినా తప్పదు. వెళ్లేది ఆఫీసుకు కాదు
యుద్ధంలోకి.
నిత్యం దేశ సరిహద్దుల్లో ఉద్యోగం, ఒకవైపు ఉగ్రవాదం మరోవైపు శత్రుదేశం అలుపెరగని శ్రమ మానసిక ఒత్తిడి తో అనారోగ్యం. తల మీద ఇనుప టోపీ, చేతికి వేలాడుతున్న బరువైన గన్ను, కాళ్ళకి బూట్లు, ఒంటి మీద ఉండే డ్రెస్సు నడిచేది రహదారి కాదు కొండలు గుట్టలు రాళ్లు మంచు
ము క్కలు. అయినా కొలువు చేస్తూనే ఉన్నాడు మన జవాన్.
ఏ రోజు ఏ సరిహద్దులో ఉంటారో తెలియదు. కొన్ని సందర్భాల్లో ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఒకరి మెప్పు కోసం పథకాల కోసం పనిచేయడు జవాను. దేశభక్తితో పాటు అతని కుటుంబ సభ్యులను పిల్లలను పెంచి పోషించేది ఈ కొలువు. మనం దీపావళి తుపాకుల శబ్దానికే భయపడిపోతాం. మరి నిరంతరం ఈ తుపాకుల శబ్దాల మధ్య కాపురం. వాతావరణం ఎప్పుడూ భయానకమే. అయినా సాగిస్తున్నాడు జీవన ప్రయాణం. . నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అనేది ఒక సామెత నాకెందుకో వీరి జీవితాల నుంచి పుట్టింది అనిపిస్తుంది. అందుకే సైనిక జీవితం మనకు ఆదర్శం.
రక్తసంబంధాలకి, బంధాలకి దూరంగా పండగల్ని ఆర్మీ ల క్యాంపుల్లో చేసుకుంటా డు ఈ జవాన్. మతాలు ఉండవు కులాలు ఉండవు సైనికులందరూ భాయి భాయి . అందుకే భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశపు ఆర్మీ అందుకు నిదర్శనం. ఎంతో కలిసికట్టుగా ఇంతకు పూర్వం ఎన్నో విపత్తుల నుండి యుద్ధాల నుండి దేశాన్ని కాపాడిన మన సైనిక వీరుల త్యాగాలు దేశభక్తి వీరత్వం అందుకు నిదర్శనం.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక్కొక్కసారి అనుకోని ప్రమాదం , శత్రు దేశాల దొంగ దెబ్బ, పక్కలో బల్లెo లా ఉన్న ఉగ్రవాదంతో సైనికులు వీరమరణం పొందుతూ ఉంటారు. వీరి సేవలకు గుర్తింపుగా జాతీయ పతాకం తన బిడ్డని ఆఖరిసారిగా కౌగిలించుకుంటుంది. ఇన్నాళ్లు తుపాకీ మోతలతో శత్రుదేశాన్ని భయపెట్టిన ఈ వీర జవాన్ కి తుపాకీ గౌరవ వందనం చేస్తుంది. ప్రభుత్వం భార్యాబిడ్డలకు జీవనాధారం కల్పిస్తుంది. తను బ్రతికుండగా దేశ రక్షణలో ప్రదర్శించిన వీరత్వానికి గుర్తుగా వీర చక్రాలను వారసులు అందుకుంటారు .
దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టి నిలిచే ప్రతి జవానుకు, ప్రతి రోజు మన హృదయపు నమస్కారమే నిజమైన గౌరవం.
సైనికుని త్యాగం వర్ణించడానికి మాటలు చాలవు; అతని ధైర్యం, దేశభక్తి మనందరికీ జీవనదీపమై నిలవాలి.
వీర జవాన్ల రక్తంతో నిండి ఉన్న ఈ స్వేచ్ఛను మనం గౌరవించుకుంటూ, వారిని నిత్యం స్మరిస్తూ ఉండాలి.
జై జవాన్... జై భారత్...! అనేది మన హృదయపు మంత్రంలా మారాలి, ఎందుకంటే వారి త్యాగమే మన భద్రతకి పునాది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి