తప్పు ఎవరిది?
అవును నది జాలిగా చూస్తోంది
ఏరు దాటి తెప్ప తగలేసే వాడిని చూసి
గలగల పారుతూ పంట పొలాల్లో
పచ్చటి మొలకకు జీవమై
బంగారు పంటలు పండించి
రైతన్నకు నేస్తమై
భూమాత దాహార్తి తీర్చే
నది జాలిగా చూస్తోంది
మనిషి ఇంత స్వార్థపరుడా అని
జాలరికి జీవన ఆధారమై
నదిలో నడిచే నావకు ఆధారమైన
నదీమ తల్లి జాలిగా చూస్తోంది
ఏరు దాటి తెప్ప తగలేసే వాడిని చూసి.
గుప్పెడు బూడిదని తనలో కలుపుకుని
ఎన్ని కోట్ల మందిని పుణ్యలోకాలకు మోసుకు పోయిందో ఈ తల్లి
ఊపిరి ఉన్నన్నాళ్ళు నదిలో మూడుమునకలేస్తే
ఎంతమందికి పుణ్యం పంచి ఇచ్చిందో
దూసుకుపోతున్న పొగ బండి లోంచి
పడేసిన సత్తు రూపాయలను దాచి
కన్నతల్లి లా పోరగాడి కడుపు నింపే
నదీమ తల్లి జాలిగా చూస్తోంది.
అయినా మనిషి గుండె కరగలేదు
కూసంత భక్తి లేదు.
రోజు నగరం మురికితో స్నానం చేయిస్తోంది నదిని.
కాలుష్యంతో కౌగిలించుకుంటున్నాయి పరిశ్రమలు.
దారిన పోయే దానయ్య తను వ్యర్థం అంతా
గంగపాలు చేసి బరువు దించేసుకుంటున్నాడు.
పున్నమి వెలుగులో ఉండే నదినీ
కారు మబ్బులా మంది మార్చేస్తుంటే
నోరులేని మూగజీవిలా
జాలిగా చూస్తోంది నది.
ఎవరిని నిందిస్తాం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి