అభ్యుదయ కవిత్వం లో ఆణి ముత్యం
ఒక దశాబ్దం పాటు ఆంధ్ర సాహిత్య లోకాన్ని ఉత్తేజపరిచిన అభ్యుదయ కవిత్వానికి మూలవిరాట్ శ్రీశ్రీ. పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ రచనలలో వ్యక్తికి సంఘ చైతన్యానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. బహుశా ఆనాడు సమాజంలో ఉండే సమస్యలకి తన కవిత్వం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి పరిష్కార దిశగా అడుగులు వేయించాడని అర్థమవుతుంది. శ్రీ శ్రీ అభ్యుదయ కవి. అసలు ఈ అభ్యుదయ కవిత్వానికి నిర్వచనం ఏమిటి సాధారణ మానవుడి సంక్షేమమే అభ్యుదయం.
శ్రామికుల్లో చైతన్యం కలిగిస్తూ వారి జీవిత సమస్యలను చిత్రించే సాహిత్యమే అభ్యుదయమంటాడు శ్రీ శ్రీ. కమ్యూనిస్టు భావాలు ఉన్నవాడు. మహాప్రస్థానం లాంటి ఎన్నో మహాకావ్యాలు రచించి జనంలో వేడి పుట్టించి సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్షరాల అక్షరాల్లో చూపించాడు. జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి ప్రజల్లో ఉత్సాహం పెంచాడు.అంతవరకు భావ కవిత్వపు ధో రణిలో రచనలు సాగుతున్న కాలంలో ఒక్కసారిగా సమాజాన్ని జాగృతం చేసే రచనలు రావడంతో శ్రీశ్రీ ఒక అభ్యుదయ కవి విప్లవ కవి అని పేరుగాంచాడు.
అందుకే శ్రీశ్రీ కవిత్వంలోని పదాలన్నీ వాడిగా వేడిగా రక్తాన్ని మరిగించేటట్లుగా ఉంటాయి. అంతవరకు సాహిత్యంలో ప్రాముఖ్యత లేని శ్రామికుడిని ఒక హీరోని చేసాడు
ఒక సందర్భంలో ఒక కవితలో అబద్ధం గురించి అందమైన మాట చెప్పాడు శ్రీశ్రీ. ఒకరోజు నువ్వు అందమైన అబద్ధం చెబితే అది రోజు నువ్వు అబద్ధాలు చెప్పవలసిన పరిస్థితికి తీసుకొస్తుంది అంటాడు. అంటే పరోక్షంగా సత్యమే పలక వలెను అనే మాటను బలపరిచాడు.
నిజంగా నిజజీవితంలో అనేకమంది రోజు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. ఒకసారి మనల్ని విమర్శిస్తారు మళ్ళీ అదే నోటితో మమ్మల్ని పొగుడుతారు. దానికి సమాధానంగా నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్తే గమ్యాన్ని ఎప్పటికీ చేరలేవంటాడు శ్రీశ్రీ. ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ కాలానికి ఈ కవితను అన్వయించుకుంటే నిత్యం అనేకమంది అనేక మాటలు మాట్లాడతారు. మన నిజాయితీని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కాలమే దానికి సమాధానం చెబుతుంది. ఎవరికి సమాధానం చెప్పకుండా మన పని మౌనంగా చేసుకుంటూ పోతే ఏ ఇబ్బంది ఉండదు. దాని మూలంగా ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఒక్కొక్కసారి మనము అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది హేళనగా మాట్లాడతారు. వందమంది చేయలేని పనిని ఒక హేళన చేస్తుంది అంటాడు శ్రీశ్రీ. హేళన అనుభవించిన వాడి లో కసి పెరుగుతుంది. కష్టపడి ఫలితం సాధించే గుణం పెరుగుతుంది. అప్పుడే మనిషి మానసికంగా గట్టిగా తయారవుతాడు.
ఒకపక్క అభ్యుదయ వాదిగా రచనలు చేస్తూనే సినిమా పాటల్లో భక్తి గీతాలు కూడా రాశాడు శ్రీ శ్రీ. అలాగే తన కవితలో పతితులార బాధ సర్పద్రస్టు లార ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అంటాడు శ్రీశ్రీ.
అలాగే పేదలు అనే కవితలో *అంతేలే పేదల గుండెలు అశ్రువులే నిండిన కుండలు * గుండెలను పిండేసే మాటలు. ఈ కవితలో పేదవాడి గురించి వర్ణించిన తీరు అమోఘం.
సంధ్యా సమస్యలనే కవితలో సమాజంలోని రకరకాల మనుషులు ఒక సాయంత్రం వేళలో ఉండే సమస్య గురించి చెబుతూ అందులో ఒక సంసారి గురించి ఇలా చెప్పుకుంటూ వస్తాడు. అటు చూస్తే అప్పుల వాళ్ళు ఇటు చూస్తే బిడ్డల ఆకలి అవి ఆ సంసారి సమస్యలు. అప్పుడు సముద్రంలో పడిపోవడమా ఉరేసుకుని చనిపోవడమా ఈ రెండిట్లో ఏది మంచిది అని సాగుతున్నాయి సంసారి ఆలోచనలు. మరి ఆ సాయం సమయంలో ఉద్యోగి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే బాదం హల్వా తిందామా , సేమ్యా ఇడ్లీ తిందామా అనేది తేల్చుకోలేకపోతున్నాడుట.
ఒక ప క్క తన కవిత్వం ద్వారా శ్రామికుల్లో వేడిని పుట్టిస్తూ ఉత్సాహాన్ని పెంచి ఉద్యమం వైపు అడుగులు వేసే విధంగా ముందుకు నడిపించిన సమాజాన్ని మరొక పక్క తన సినిమా పాటలతో కూడా ఉత్తేజపరిచాడు. మనసును కూడ ఆనందపరిచాడు. జీవితంలో ఒక తోడుంటే ఎలా ఉంటుందో తన మాటల్లో చాలా అర్థవంతంగా చెప్పాడు. జీవితానికి తోడు ఎవరు ఒక జీవిత భాగస్వామి. ఆ పాట వింటూ ఉంటే మనసు ఆనందమయం అవుతుంది. శ్రీ శ్రీ గారు తన కలంలో రెండు సిరాలు వాడతారేమో. ఒకటి ఎర్ర సిరా తో వ్రాసిన కావ్యాలతో సమాజం మత్తు వదిలించాడు. రెండవది నీలిరంగు సిరా. నీలిరంగు సముద్రాన్ని చూస్తే మనసు ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అలాగే శ్రీశ్రీ గారి డాక్టర్ చక్రవర్తి సినిమాలోని *మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండి నా అదే భాగ్యము *ఆ పాట మనసుని ఎక్కడకో తీసుకెళ్లిపోతుంది. *జీవితంలో తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము* అంటాడు శ్రీశ్రీ ఒక విప్లవ కవి కలలో నుంచి ఇటువంటి మాటలు వస్తాయని ఎవరు ఊహించగలరు.
* ఆశలు తీరని ఆవేశంలో ఆశయాలలో ఆవేదనలో చీకటి ముసిరిన ఏకాంతములో అంటూ మొదటి చరణం సాగుతుంది. నిజమే ఎన్నో ఆశలు పెంచుకుంటాం. అవి తీరకపోతే నిరాశ పడతాం. అటువంటి సందర్భంలో ఓదార్పు కోరుకుంటాం. అంటే మనసులోని మాటని పంచుకునే తోడు ప్రతి వ్యక్తి యొక్క జీవితానికి చాలా అవసరం. గుండెల్లో ఉన్న బాధను ఒకరితో పంచుకుంటే మనసు భారం తగ్గుతుంది అంటారు.
కానీ అన్ని బాధలు అందరితోటి పంచుకోలేం. ఎవరు మనసుకు దగ్గరగా ఉంటే వారితోటే. జీవిత భాగస్వామి తప్పితే మనసుకు దగ్గరగా ఉండేది ఇంకొకళ్ళు ఎవరు. చీకటి మూసిన ఏకాంతము ఎంత మంచి మాట.
జీవితంలో ఒక తోడు అవసరం గురించి చెబుతూ నిన్ను ప్రేమించే వాళ్ళు నీకోసం బాధపడేవాళ్లు నీ గుండెల్లో నీ బాధకి బాసటగా నిలిచే వాళ్ళు ఒకళ్ళు ఉంటే జీవితం స్వర్గంలా ఉంటుందంటూ తన పాటతో మనసుని ఆనందపరిచాడు శ్రీ శ్రీ .
ఈ పాట అలా ఉంచితే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన సినిమాలోని *తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా* అంటూ పల్లవి తో సాగిన ఈ పాట ఎవరో రాశారో వెతక నక్కర్లేదు. ఆ పదాలు చూస్తేనే అర్థం అయిపోతుంది ఇంకెవరు శ్రీ శ్రీ గారని చిన్నపిల్లవాడిని అడిగిన ఇట్టే చెబుతారు.
అవి తెల్ల దొరలు మనం దేశాన్ని పరిపాలించే రోజులు. ముఖ్యంగా ప్రజల్ని బానిసలుగా వాడుకునేవారు. అరాచకాలు సృష్టించే వారు. అటువంటి సందర్భంలో ఎంతోమంది దేశభక్తి గల యువకులు తెల్లవారిని ఎదిరించి పోరాడేవారు. దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని కలలు కనేవారు. అటువంటి సమయంలో మన మన్యo వీరుడు అల్లూరి సీతారామరాజు అలుపెరుగని పోరాటం సాగిస్తూ ప్రజలని విప్లవ పోరాటయోధులుగా చేశాడు.
* నిదుర వద్దు బెదుర వద్దు నింగి నీకు హద్దురా* అంటూ అలుపెరగకుండా పోరాటం సాగించాలని ప్రజలను ఉత్తేజపరిచాడు. అల్లూరి సీతారామరాజు పాత్రధారి కృష్ణ గారు అద్భుతమైన నటనతో పాత్రకు న్యాయం చేకూర్చారు. నిజంగా ఈ సినిమా చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఒక భాగం కళ్ళకు కట్టినట్లుగా మనకి తెలుస్తుంది. ఇది జరిగిన కథ . ఈ కథను ఆధారంగా చేసుకుని సినిమాలు తీయడం, అలాగే అందులో పాటలు రాయడం అంటే చాలా కష్టమైన పని. సందర్భానుసారంగా రాసిన ఈ పాట మన్యం వీరులకి దిశా నిర్దేశం చేసినట్లుగా ఉంది.
ఎక్కడో విదేశాల నుండి మన దేశానికి వచ్చి మన మీద జులుం చలాయించే ఆ ఆంగ్లేయులను తరిమి తరిమి కొట్టాలని మనo సింహం లా గర్జించాలని తన పాటల ద్వారా ఆనాటి ప్రజల కర్తవ్యం గుర్తు చేశాడు శ్రీశ్రీ .తన సాహిత్యం ద్వారా సమాజంలోని ప్రజల కర్తవ్యం తెలియజేయడం శ్రీశ్రీ గారికి వెన్నతో పెట్టిన విద్య.
అందుకే ఈ పాట అవార్డును కైవసం చేసుకుంది.
అలాగే ఇల్లు వదిలి వెళ్లిన బాటసారి కష్టాల గురించి కన్నీళ్లు తెప్పించే విధంగా బాటసారి కవిత రాశాడు. తన ప్రయాణంలో ఎన్ని కష్టాలు వస్తాయో తల్లి అతను గురించి ఏ విధంగా బాధపడుతుందో అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే కవి ఎప్పుడు ప్రతిపాత్రలోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. అప్పుడు గాని హృదయ రమ్యంగా కవిత రాదు. ఒక విషయం గురించి లోతుగా అధ్యయనం చేస్తాడు.
ఇలా అటు కవిత్వం ఇటు సినిమా పాటలు తోటి సమాజాన్ని ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి ఉద్రేకపరచి కర్తవ్యం నిర్వహణ చెప్పి సమాజం కలకాలం గుర్తుండేలా రచనలు చేసి కవిత్వంలో తనదంటూ ముద్ర వేసుకుని చలికి ముడుచుకుని కూర్చునే ముసలి వాళ్ళలా ఉన్న సమాజాన్ని ఎముకల్లో వేడి పుట్టించి సమస్య వైపు దృష్టి మరలించి ప్రజల గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోయిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఏ కవి నైనా పుట్టినరోజు నాడు వర్ధంతి నాడు తలుచుకోవడం కాకుండా నిత్యం విద్యార్థులు స్మరించుకునేలా పాఠ్యాంశాల్లో వారి జీవిత చరిత్ర వారి కవిత్వం చోటు చేసుకున్నప్పుడే వారికి మనం సమర్పించే నిజమైన నివాళి. ఎందుకంటే వాళ్ల గురించి తెలుసుకోవాల్సింది ఇప్పుడు విద్యార్థులే.
ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విద్య తప్పితే మరో విద్య వైపు దృష్టి మరల్చని యువతకి నిర్బంధంగా పాఠ్యాంశాల్లో ఇటుకంటి కవుల రచనలు పెట్టాలి. ఆ మహా మనిషికి మనస్ఫూర్తిగా నివాళి సమర్పిస్తూ.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి