ఆ రోజుల్లో ఆదివారం
ఆ రోజుల్లో ఆదివారం
ఆదివారం మిట్ట మధ్యాహ్నం అయిందంటే చాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి అతుక్కుపోయి మైమరిచిపోయి ఆ గళం లో గాథలన్నీ విని తమ బాధలన్నీ ఆ సమయంలో మరిచిపోయి అయ్యో అప్పుడే అయిపోయిందా అని నిట్టూర్చి వచ్చే ఆదివారం
కోసం ఎదురుచూపులు చూసే అభిమానులు కోకొల్లలు ఆ గళానికి .ఆ గళంలో సుమధుర స్వరం ఉంది. అది నాదస్వరమై బుసలు కొట్టే వారిని కూడా బుద్ధిమంతులుగా చేసింది. యావత్ ప్రపంచాన్ని ఆ గళానికి అభిమానులుగా చేసింది. ఈ మాయా లోకంలో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి ఏది మంచి ఏది చెడు చెప్పే ఆ స్వరం కొంతమందికి తమ అనుకరణ విద్యలో భాగంగా చేరిపోయింది.
ఆయన ఇంటి పేరు పురాణపండ. పేరు సూర్య ప్రకాశ దీక్షితులు. నమ్ముకున్న సాహిత్యం చదువుకున్న సంస్కృతo వారసత్వంగా వచ్చిన పాండిత్యం, భగవంతుడిచ్చిన గళం ఆయనని తన వృత్తిలో సూర్యుడిలా ప్రకాశింపజేసింది. రామాయణ మహాభాగవత భారత గాధలను ప్రజలకు తనదైన శైలిలో వినిపించడం ఆయనకి ఒక దీక్ష .ఎప్పుడో త్రేతా యుగంలో జరిగిన రాముడి కథ ద్వాపర యుగంలో పుట్టిన ఆ నీ ల మేఘశ్యాముడు లీలలు , కౌ రవ పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా చెప్పడo ఆయన ప్రత్యేకత.
మనం చూసిన సినిమాని ఇంటికి వచ్చిన తర్వాత కథగా చెప్పడం పెద్ద కష్టం కాదు.కానీ ఎప్పుడో జరిగిన ఆ పౌరాణిక వృత్తాంతాలను చూసినట్లుగా చెప్పడం చాలా కష్టం.
ఎవరికైనా అనారోగ్యం వస్తే సంబంధిత డాక్టర్ గారి దగ్గరికి వెళతాం. ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకుంటాం. ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలకి వకీల్ గారినీ ఆశ్రయిస్తాం. దైనందిన జీవితంలో ఎన్నో సందేహాలు చిక్కు సమస్యలు అవి ధర్మసందేహమై ఆ గళాన్ని ప్రశ్నిస్తే క్షణాల్లో సందేహ నివృత్తి చేయగల సత్తా శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా శ్రోతల గుండెల్లో నిలిచిపోయిన మహా వ్యక్తి ఉషశ్రీ గారు.
మామూలుగా శుభకార్యాలకి ఆహ్వానం లేకపోతే ఎవరు హాజరు కారు. దేవుడి కల్యాణానికి ఎవరు పిలుస్తారు. కానీ ఆ భద్రాద్రి కొండ మీద జరిగే సీతారాముల కళ్యాణ వ్యాఖ్యానం శ్రోతలందరినీ ఆ నడవలో ఉన్న రేడియో ముందు భౌతికంగా కూర్చోబెట్టి మానసికంగా ఆ భద్రాద్రి కొండమీదకి తీసుకుపోయింది. ఎంతమంది శ్రోతలను పుణ్యాత్ములుగా చేసిందో లెక్కా పత్రం లేదు.
ఆ భద్రాద్రి రాముడు తన కళ్యాణ వ్యాఖ్యానానికి మురిసిపోయి తన రామాయణ కథని ప్రతివారం ఆసక్తిగా ఉంటూ ఇప్పుడు బాలరాముడై అయోధ్య వస్తున్న తరుణంలో ఉషశ్రీ గారి గొంతులోని రామాయణ గాధ ఆలయ పరిసర ప్రాంతంలో వినిపించేలా ఏర్పాట్లు జరగడం నిజంగా ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఇది మన అందరి అదృష్టం. తెలుగుజాతి గర్వించదగ్గ విషయం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి