జరిగిన కథ
మధ్యాహ్నం రెండు గంటలు అయింది
అదొక ప్రభుత్వ ఆఫీసు కార్యాలయం లంచ్ రూమ్ అంత హడావుడిగా ఉంది. లంచ్ చేసే సమయమే ఆటవిడుపు సమయం. ఆ అరగంటసేపు ఆ ఉద్యోగస్తులు అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజు ఏవో ఓ టాపిక్ లు. అది కాలేజీలు స్కూళ్లు తెరిచిన సమయం. ఇంకేముంది చదువులు గురించి అడ్మిషన్ గురించి మొదలైంది కబుర్లపర్వం.
" మీ వాడు ఎందులో జాయిన్ అయ్యాడు? అని అడిగాడు ప్రభాకర్ తను స్నేహితుడు కుమార్ ని. మావాడు బీకాంలో జాయిన్ అయ్యాడు రా! అన్నాడు కుమార్. బీకాం ఏమిటిరా! ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూప్ తీసుకుని అన్నాడు ప్రభాకర్.
ఒక్కసారి కుమార్ మనసుకి బాధగా అనిపించింది. ఈ రోజుల్లో బీకాంలు , బిఏలు ఎవరు చదువుతున్నారు రా! అన్నట్టు అనిపించింది.
మా వాడు బీటెక్ లో జాయిన్ అయ్యాడు అన్నాడు గొప్పగా ప్రభాకర్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చాలా బాగుందిరా! నాలుగో సంవత్సరంలో ఉండగానే జాబ్ వచ్చేస్తుంది అంటూ ఆ కాలేజీ గురించి చదువు గురించి ఒక పావు గంట సేపు చెప్పాడు.
కుమార్ , ప్రభాకర్ ఇద్దరు ఒక ప్రభుత్వ కార్యాలయంలో కలిసి పని చేస్తూ ఉంటారు. విచిత్రంగా వాళ్ళిద్దరి పిల్లలు కుమార్ కొడుకు ప్రవీణ్ ప్రభాకర్ కొడుకు ప్రదీప్ ఇద్దరూ ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసిన ర్యాంకు రాకపోవడంతో డొనేషన్లు కట్టి చదువుకోడానికి ప్రవీణ్ ని ఇష్టపడలేదు. ప్రదీప్ కూడా అదే దృష్టిలో ఉన్న తండ్రి బలవంతంగా కొడుకును డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదువుకి ఓ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేసాడు. " కేవలం మా నాన్న బలవంతం మీద జాయిన్ అవుతున్నాను రా! నాకు చదువు అంటే భయంగా ఉంది అని చెప్పేవాడు ప్రదీప్ ప్రవీణ్ తో .
ఆఫీసులో కుమార్ తో ప్రభాకర్ మాట్లాడినట్టుగానే ప్రవీణ్ స్నేహితులు కూడా బీకాం గురించి తక్కువగా మాట్లాడుతుండేవారు.
"ప్రవీణ్ని బీకాంలో జాయిన్ చేసి తప్పుడు పని చేశానా?" అని ఒక క్షణం అనిపించింది కుమార్ కి. అయినా ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎలా చెప్పగలం. మనం ప్రయత్నం చేయడమే మన విధి. ఏ చదువు అయితేనేమి. ఫలానా చదువు అయితే ఉద్యోగాలు వస్తాయని గ్యారెంటీ అని ఉందా! బీటెక్ చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయా!
ఏమిటో తల్లిదండ్రులు సమాజంలో గొప్పలు చెప్పుకోవడానికి పిల్లల్ని ఇష్టం లేని చదువులు చదివిస్తున్నారు. ఇది ముఖ్యంగా ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా ఉంది. అంటే చదువుకున్న వాళ్లలోనే ఇది ఎక్కువగా ఉంది. అన్నిటికీ తమ పిల్లలు ముందుండాలని వాళ్ళ ఆకాంక్ష. పిల్లల శక్తి సామర్థ్యాలు కూడా తెలుసుకోవాలి కదా అనుకుని కాలాన్ని నమ్ముకుని ముందుకు సాగిపోయాడు కుమార్.
అలా మూడు సంవత్సరాలు జరిగేయి. ఆరోజు కుమార్ కు చాలా ఆనందంగా ఉంది. లంచ్ రూమ్ లో అందరికీ స్వీట్లు పంచుతూ మా పిల్లవాడికి బీకాంలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. రేపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో గోల్డ్ మెడలు ఇస్తారు అంటూ ఆనందంగా చెప్పాడు. ఆ మాటలకి ప్రభాకర్ కి నోట మాట రాలేదు. కారణం ప్రదీప్ లక్షల ఖర్చు పెట్టి బీటెక్లో జాయిన్ చేసిన మూడు సంవత్సరాలు కూడా పాస్ అవ్వలేదు.
తోటి ఉద్యోగులందరూ అభినందించిన ప్రభాకర్ మాత్రం ముక్తసరిగా కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు వాడిపోయిన మొహంతో. ఆ తర్వాత ఏం చేస్తాడు ? అని అడిగిన తోటి ఉద్యోగుల ప్రశ్నకి ఎంబీఏ ఎంట్రన్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు ఎక్కడ సీట్ వస్తే అక్కడ జాయిన్ అవుతాడు అన్నాడు కుమార్.
ఆ తర్వాత ప్రవీణ్ కి జేఎన్టీయూ కాకినాడలో ఎంబీఏ లో సీటు వచ్చిందని జాయిన్ అయ్యాడనిచెప్పి మళ్లీ స్వీట్లు పంచాడు లంచ్ రూమ్ లో కుమార్. అలా రెండు సంవత్సరాలు గడిచేయి. ఎంబీఏ లో కూడా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సంపాదించిన ప్రవీణ్ కి క్యాంపస్ లో ఒక చిన్న కంపెనీలో హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మూడు కంపెనీలు మారి ఒక ఇంటివాడు అయ్యాడు
కుమార్ కొడుకు ప్రవీణ్.
ఇష్టం లేని చదువు లో తండ్రి బలవంతం మీద జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయాడు ప్రభాకర్ కొడుకు. చదువు పూర్తి చేయలేని కొడుకుని ఏం చేయాలో తోచక ప్రతిరోజు సాధిస్తూ ఉండేవాడు. ప్రదీప్ కి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా చదువు గట్టెక్కలేకపోయాడు.
దానికి తోడు తన స్నేహితులందరూ ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగాల్లో స్థిరపడి పోవడం, దానికి తోడు తండ్రి టెన్షన్ పడుతుండడం చూసి స్నేహితుల ప్రోద్బలంతో ఒకరోజు ధైర్యం చేసి తండ్రిని "నాన్న నాకు మూడు లక్షల రూపాయలు కావాలి! అని అడిగాడు ప్రదీప్. ఎందుకు మూడు లక్షలు? ఏం చేస్తావు అని ప్రశ్నించాడు తండ్రి ప్రభాకర్. "నేను టీ టైం షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను మా కాలేజీ దగ్గర! అని సమాధానం ఇచ్చాడు ప్రదీప్. ప్రభాకర్ కి కొడుకు మాటలు చిన్నతనంగా అనిపించేయి.
ఇప్పటికే నా పరువు పోయింది ఇంకా టీ కొట్టు కూడా పెడతావా! అని గట్టిగా కసిరాడు ప్రభాకర్ కొడుకుని. తప్పు ఏముంది నాన్న! బ్రతకడానికి ఏదో ఒకటి అన్నాడు ప్రదీప్.
"చాలు చాలు నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి ఎంత చిన్న ఉద్యోగం వచ్చినా జాయిన్ అయిపో! అని గట్టిగా అరిచాడు ప్రభాకర్. ఆ తర్వాత బయటకు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరిన ప్రదీప్ మళ్లీ ఇంటికి రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితంగా కనిపించలేదు.
పిల్లల చదువులు గురించి కలలు కనకండి . మనం చదువు చెప్పించడం వరకే. వాళ్ల మీద ఒత్తిడి పెంచకండి. ఆశలు పెంచుకోకండి. ఎవరి జీవితాలు ఎలా మారుతాయో ఎవరికి తెలియదు. అందరం కూడా మంచి చదువులు చెప్పించాలని చూస్తాం. అక్కడ పిల్లవాడిలో సహజంగా ఉండే తెలివితేటలు లేకపోతే మనం ఏం చేస్తాం. చదువును కించపరచకండి. చిన్న చూపు చూడకండి. ఎవరి జీవితాలతోటి పోల్చకండి. ఎవరిది వారిదే.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి