బామ్మ కోరిక
" ఒరేయ్ రాజు బజార్ నుంచి వచ్చేటప్పుడు ఆ మెయిన్ రోడ్ లో ఉన్న కోటయ్య కాజా తీసుకురారా. చాలా రోజులైంది తిని. మీ నాన్న బ్రతికున్న రోజుల్లో వారానికి ఒకసారైనా తీసుకొచ్చేవారు అంటూ బయటికి వెళ్లబోతున్న కొడుకు రాజారావు గారితో హాల్లో మంచం మీద కూర్చున్న 75 ఏళ్ల కామేశ్వరమ్మ గారు చెప్పారు. మీరు ఏమి తీసుకురాకండి ఆవిడకి అసలే షుగర్ . ఏదైనా రోగం వస్తే నేను చేయలేక చావాలి అంటూ కోడలు వసంత వంటింట్లోంచి గట్టిగా అరిచింది.
"ఒరేయ్ కోడలు మాటలకి ఏమి లేరా! ఏదో నామీద ప్రేమ కొద్ది అలా చెప్తుంది. నేను ఇవాళ ఎలాగైనా ఆ కోటయ్య కాజా తినవలసిందే .అబ్బా తలుచుకుంటేనే నోరూరిపోతోంది. పొట్ట నిండా పాకంతో పొట్టిగా చూడముచ్చటగా ఉంటుంది. ఎక్కువ పట్టరాకు. పిల్లలు ఎవరూ తినరు. కోడలుకి స్వీట్ ఇష్టం ఉండదు. ఇంట్లో మనిద్దరమే స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళం. అంటూ కొడుకుతో చెప్పింది కామేశ్వరమ్మ గారు. అలాగే అమ్మ పట్టుకొస్తానంటూ బయటకు వెళ్ళిపోయాడు రాజారావు గారు.
ఇదేమిటి అమ్మ ఇలా రోజుకో తినుబండారం అడుగుతోంది. మొన్న ఆఫీస్ పని మీద సామర్లకోట వెళ్తున్నాను అమ్మ అంటే ఒరేయ్ అక్కడ గవ్వలు ప్రసిద్ధి రా కాసిని పట్టుకొద్దు అంటూ షాప్ అడ్రసు కూడా చెప్పింది.
ఆవిడ అడిగిందల్లా కొని పట్టికెళ్లొచ్చు కానీ ఆరోగ్యం పాడవుతుందని భయం రాజారావు గారికి. మంచాన్ని పడితే ఎలాగా అని ఆలోచన తప్పితే ఖర్చు గురించి కాదు. గంట తర్వాత ఇంటికి వచ్చిన రాజారావు గారిని ఏమీ అడగలేదు. మౌనంగానే ఉండి పోయారు. ప్రతిసారి ఇ లాగే చేస్తున్నారు. అమ్మకు మతిమరుపు లేదే . పాత విషయాలు అన్ని గుర్తు చేసుకుని మరీ చెప్తుంది. మరి ఎందుకు అడగటం లేదు అని తనలో తానే అనుకుంటున్నాడు రాజారావు. మరి పాపం ఆవిడకి తినాలని ఉందేమో. ఆవిడ కోరిక తీర్చడం ఎలాగా అని మదన పడసాగాడు రాజారావు గారు.
కామేశ్వరం గారి వయసు 75 ఏళ్లు. షుగరు బిపి అన్ని ఉన్నాయి. పైగా నల్లమందు అలవాటు ఒకటి. ఆ నల్ల మందు వేళకి వేసుకోకపోతే కాళ్లు చేతులు లాగేస్తున్నాయని ఒకటే గోల.మంచం పట్టలేదు గాని ఏదో కర్ర పట్టుకుని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆవిడ నోరు కట్టదు. పిల్లలతో సమానంగా పోటీపడి చిరుతిళ్లు అడుగుతుంది. ఆదివారం నాడు పిల్లలు ముచ్చటపడి గాంధీనగర్ పార్క్ దగ్గర ఉన్న భాషా బాయి దగ్గర పిడత కందిపప్పు తెచ్చుకుంటే వాళ్లతో దెబ్బలాడి వాటా అడిగింది.
ఏదో మాయ చేసి బయట వస్తువులేమీ పెట్టకుండా కాల క్షేపం చేస్తున్నారా కుటుంబ సభ్యులు. కామేశ్వరమ్మ గారి తల్లికి ఎనిమిది మంది సంతానం. కామేశ్వరమ్మ గారి తండ్రి ఆయుర్వేద వైద్యం చేసేవారు ఆ ఊర్లో . బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి.
రోగుల దగ్గర్నుంచి డబ్బులు పుచ్చుకునే వాడు కాదు. ఎవరింట్లో అయినా శుభకార్యం జరిగితే స్వీట్లు వేసవికాలంలో మామిడి పండ్లు తేగలు అరటి పళ్ళు జామకాయలు అటుకులు తెచ్చి ఇస్తుండేవారు. కామేశ్వరమ్మ గారి తల్లికి పిల్లలు అంటే అమితమైన ప్రేమ.
అందుచేత రాత్రి 10 గంటలయినా పిల్లల్ని లేపి ఈ చిరుతిళ్లు పెడుతూ ఉండేది. అలా అలవాటయింది. దానికి తోడు కామేశ్వరమ్మ గారి భర్త కూడా అదే గ్రామంలో ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఇంకేముంది కథ మామూలే.
సాయంకాలం 6 గంటలకి కామేశ్వరమ్మ గారు అన్నం తినేసి వెంటనే పడుకుంటారు . రాత్రి పది గంటలు అయింది అప్పుడే అందరూ భోజనాలు చేసి టీవీలు చూ స్తున్నారు.ఇంతలో హాల్లో నుంచి ఒరేయ్ రాజు కాస్త బెల్లం ముక్క ఉంటే పెట్టరా. ఆకలేస్తుంది. అంటూ కామేశ్వరమ్మ గారి అరుస్తున్నారు గట్టిగా. ఇది రోజు మామూలే. అలా నాలుగు మూడు సార్లు అరిచి పడుకుంటారు. కానీ ఈసారి హాల్లో నుంచి ఏవో చిన్నగా మాటలు వినబడుతున్నాయి. రాజారావు గారికి హాల్లోకి వచ్చేటప్పటికి లైట్లన్నీ ఆర్పేసి ఉన్నాయి. లైట్ వేసి చూసేటప్పటికి రాజారావు గారి పెద్దబ్బాయి నిశాంత్ మామ్మగారి చేతిలో ఏదో పెడుతున్నాడు. ఏమిట్రా అది బెల్లం ముక్క అమ్మ పెట్టమంది అని లోపలకు వెళ్లిపోయాడు నిశాంత్. ఇంతలో వెనకవైపు నుంచి రాజారావు భార్య వసంత వచ్చింది.
వసంత ఏమిటిది ఆవిడకి ఆరోగ్యం పాడవుతుంది ఏమి తీసుకురావద్దు అని నాకు చెప్పావుగా మళ్లీ ఎందుకు పెడుతున్నావు అని కోపడ్డాడు రాజారావు.
చూడండి మొన్న మా అమ్మని చూద్దామని మా ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ పరిస్థితి కూడా ఇదే. అన్ని కోరికలే. మా అన్నయ్య బయటకు వస్తువులేమీ పెట్టొద్దని రోజు కోప్పడుతున్నాడు. పాపం పెద్దవాళ్ళు అయిన తర్వాత తిరిగి చంటి పిల్లలు అయిపోతారు అందరూ. ఆరోగ్యం సహకరించదు కానీ తినాలని కోరిక ఉంటుంది కొంతమందికి. వాళ్లకు బయటకు వెళ్లి తెచ్చుకునే ఓపిక ఉండదు. మంచం దిగలేరు. మనం కాకపోతే ఇంకెవరు పెడతారు. ఆరోగ్యం బాగాలేదని పదేపదే సార్లు చెప్తే వాళ్లకి మనసు బాధపడుతుంది. వాళ్లు బతికినన్నాళ్లు బతకరు. ఏదైనా జీవితాన్ని బతికున్నప్పుడే అనుభవించాలి. చనిపోయిన తర్వాత ఎన్ని పెడితే ఏం లాభం. వాళ్లు మహా అయితే ఒకటో రెండో తినగలరు. అంతకుమించి తినడానికి వాళ్లకు కూడా భయమే. ఈ మాత్రానికి పెద్ద రభస చేయడం ఎందుకు అంటూ మా వదిన మా అమ్మ అడిగిన వస్తువులన్నీ ఇంట్లోనే తయారు చేసి బజార్ నుంచి తీసుకువచ్చినట్లుగా చెబుతోంది. ఆవిడ పాపం తృప్తిగా ఒకటో రెండో తిని హాయిగా కాలక్షేపం చేస్తోంది మా అన్నయ్య దగ్గర అంటూ అసలు విషయం చెప్పింది వసంత.
నేను కూడా అంతకుముందు భయపడేదాన్ని అండి. ఏమి పెట్టేదాన్ని కాదు. కానీ మా ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి నాలో ఈ మార్పు వచ్చిందండి అంటూ ఆనందంగా చెప్పింది వసంత.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి