మా నాన్న
నాన్నంటే కుటుంబానికి అభయహస్తం.
నాన్నంటే ఒక నిస్వార్థo.
నాన్నంటే ఒక మార్గదర్శి.
నాన్న – ఈ మాటలోనే ఓ ఆత్మీయత, ఓ అర్థవంతమైన అనుబంధం దాగి ఉంటుంది.పిలిచినప్పుడు హృదయం హర్షిస్తే, గుర్తొచ్చినప్పుడు కన్నీళ్లు వర్షిస్తాయి
జీవితాన్ని నిర్మించే పునాది, ఆరంభ మౌనపు ప్రేమకు నిదర్శనం – నాన్న.
నాన్న…
ఈ ఒక్క పదమే ఎన్నో అర్థాలు, అనుబంధాలు, బాధ్యతలు, త్యాగాలను తనలో లీనమయ్యే అద్భుత భావన. పిల్లల కోసమో, కుటుంబం కోసమో, తన అవసరాలు పక్కకు నెట్టి, జీవితాన్ని నిశ్శబ్దంగా నిర్మించే ఒక మనిషి – ఆయనే నాన్న.
నా బాల్యం గుర్తొస్తే –
అమ్మ చూపించిన ప్రేమ, నాన్నది మౌనంగా మార్గం చూపించే బుద్ధి.
అమ్మ చేతిలో ఆహారం, నాన్న చేతిలో ఆశయం.
అమ్మ ఓ తపన, నాన్న ఓ త్యాగం.
నాన్నతో మాటలూ తక్కువే, కానీ అనుబంధం ఎంతో లోతుగా.
మన పరోక్షంలో బిడ్డ గొప్పతనాన్ని పదిమందికి గర్వంగా చెప్పి బిడ్డ ఎదుట మాత్రం ఆ మాటే ఎత్తడు.
ఆ ప్రశంసలు మన చెవుల్లో కాదు, మన వెనుక నిలబడి మన విజయాన్ని నిశ్శబ్దంగా చూసే చూపుల్లో ఉన్నాయి.
నాన్న హాయిగా ఉండే వయసులో శ్రమించాడు,
మనకోసం కొత్త చెప్పులు కొనిపెట్టాలన్నదే గమ్యం,
ఆయన పాదాలు పగిలినా పట్టించుకోడు –
మన పాదాలు తడవకుండా ఉండాలని చూస్తాడు.
నా జ్ఞాపకాల పందిరిలో
నా చిటికిన వేలు పట్టుకుని నాన్న నేర్పిన అడుగులు,
ఆయన మాటల్లో దాగిన అభిమానం
ఆయన నిశ్శబ్దపు ఉలిక్కిపాటుల్లో దాగిన ప్రేమ – ఇవన్నీ నా జీవిత పాఠశాలలో ముఖ్య పాఠాలు.
నేటి కాలంలో “నాన్న” అనేది ఒక పాత్ర కాదు,
ఒక జీవన మార్గం.
ఆయన చెబుతున్నది లౌకిక తత్వశాస్త్రం,
ఆయన చూపించే నీతి విలువలు,తన జీవితాన్ని గీతగా మార్చుకుని మన కోసం బలంగా నిలబడిన ధృడత – ఇవన్నీ మన కీర్తిలో కలిసిపోతాయి.
ఒక మాటలో చెప్పాలంటే –
నాన్న అనేది మాట కాదు –
ఒక మౌన ప్రేమ, ఒక మనస్సు తృప్తి, ఒక జీవన గాధ.
ఇంకేం కావాలి నాన్న గురించి చెప్పడానికి.
.గంపెడు సంసారం అయినా గుండెల్లో చెరగని ధైర్యం. సహాయం అడిగిన వాళ్ళకి అడగనివాళ్ళకి ఎప్పుడూ రెడీగా చేతులు. ఎప్పుడు గుప్తదానాలే. వృత్తి ఆయుర్వేద వైద్యులు.రోగం వస్తే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు పరుగు పరుగున వెళ్లి రోగికి స్వస్థత చేకూర్చి హాయిగా ఊపిరిపీల్చుకునే మనస్తత్వం.
వైద్యో నారాయణ హరి అంటారు కదా. ఈ లోకంలో ఒక ప్రాణిని తీసుకొచ్చేందుకు అష్ట కష్టాలు పడుతున్న ఒక తల్లి విషయంలో సమయం ఆసన్నమైంది బాబు అంటూ చెప్పే ఎరుకలి మాటలు విని ఒక సూది మంది ఇచ్చి ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సహాయపడిన సంఘటనలు ఎన్నెన్నో. పరలోకానికి వెళ్లిపోయిన వారిని కడదాకా సాగనంపేందుకు ఎంతో మందికి కొమ్ము కాసిన మహాసేవా తత్పరుడు.
ఆయనే కీర్తిశేషులు మధునా పంతుల వెంకట చలపతిరావు గారు కాకినాడ తాలూకా పల్లిపాలెం గ్రామ కాపురస్తులు. ఆరడుగుల పొడవు నల్లటి కళ్ళజోడు కోల మొహం నుదుటన బొట్టు తెల్లటి డ్రస్సు నోట్లో పొగాకు చుట్ట పంటి కింద వక్కపొడి పెళ్లిళ్లు సంతర్పణలు అంటే పొరుగు వారికి సహాయం పురాణ పఠనo. ముక్కుకు సూటిగా పోయే మనస్తత్వం. ముక్కు మీద కోపం. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరితో కలిసి పోయే మనస్తత్వం. చతుర్ముఖ పారాయణం అంటే ఎనలేని మక్కువ.రాజకీయాలంటే మక్కువ. ఆయన పదవులు ఇతరులకు ఇప్పించడానికి సహాయపడేవాడు. రాజకీయ ప్రణాళికల్లో చెయ్యి తిరిగిన మనిషి.
ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకుని వసారాలో మూలనున్న పొగాకు డబ్బా తీసి కావలసినన్ని చుట్టలు చుట్టుకుని స్నానం చేసి మందులు సంచి సైకిల్ కి తగిలించుకుని ఆ గ్రామంలో అవసరమైన వారికి వైద్యం చేసి ఇచ్చినది పుచ్చుకొని పెద్దలతో పిచ్చాపాటి మాట్లాడుకుని మధ్యాహ్నం ఇంటికి చేరి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని పురాణ కాలక్షేపం చేయడం మళ్లీ వృత్తికి సంబంధించిన కార్యక్రమాలు ఇది ఆయన దినచర్య. సహజంగా గొంతు చాలా శ్రావ్యంగా ఉండేది. రాగాలు తీస్తూ పాడే ఆ పద్యాలు ఎప్పటికీ మర్చిపోలేము. పరిశుభ్రతకి ప్రాధాన్యం. ఎప్పుడు తెల్లటి మల్లె పువ్వు లాంటి బట్టలతో చూడగానే ఆకర్షణీయమైన రూపం.
కొంతమంది కొన్ని మంచి పనులు చేసి ఒక సంఘానికి ఆదర్శమూర్తి అవుతారు. మా ఊరిలో కరణం గారు ఒకరు ఉండేవారు. ఆయనని చిన్న కరణం గారు అనేవారు. వారి ఇంటిపేరు తటవర్తి వారు. ఆయన రోజు కచేరి చావడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక చిన్న పొట్లం పంచదార కొనుక్కుని వచ్చే దారిలో రోడ్డుమీద కనబడిన చీమలకి ఆ పంచదార కొద్ది కొద్దిగా వేస్తూ ఇంటి వరకు వచ్చేవారు. ఇది ఆయన దినచర్య.
అలాగే ఆ ఊరిలో మా నాన్నగారు కూడా ఇంట్లోఎక్కడైనా అరటిపండు తొక్క కనబడితే ఆ తొక్కను తీసుకొని పాకలో ఉన్న పశువుకి పెట్టేవారు.
ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే మనుషులు చేసిన మంచి పనులు మనం పదేపదే స్మరిస్తూ ఆచరిస్తుండాలి. అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. ఆ పెద్దలు అందరూ మనకు ఆదర్శమూర్తులు.
ఆ రోజుల్లో చిన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చుట్ట తాగడం అలవాటు చేసేవారట. పొగాకు పీల్చేటప్పుడు స్వర్గం చూపిస్తుంది. గొంతు దిగిన తర్వాత కాలం గడిచిన తర్వాత బతుకు నరకప్రాయం చేస్తుంది. అలా గొంతు క్యాన్సర్ వచ్చి బ్రతుకుతూ పోరాడి 5 నవంబర్ 1984 సంవత్సరం ఈ లోకం నుండి వెళ్లిపోయిన మహా మనిషి.
ఆ రోజు క్షీరాబ్ది ద్వాదశి. ఈ లోకoనుండి వెళ్ళిపోయి 41 సంవత్సరాలు అయింది. అయినా ఎప్పుడూ ఆ ఊరు వెళ్లినా ఆ మహా మనిషిని తలుచుకోని వారు ఉండరు. ఎవరైనా సంఘంతో వ్యవహరించిన తీరుతెన్నులను బట్టే వారు ఈ లోకం విడిచి వెళ్లిపోయిన తర్వాత కూడా వారి మర్యాద చిరకాలం నిలబడి ఉంటుంది.
నా వయసు అప్పటికి 21 సంవత్సరాలు. అటు పెద్దవాడిని కాదు చిన్న వాడిని కాదు. జ్ఞానం వచ్చిన తర్వాత కొద్దికాలం మాత్రమే నాన్న గారితో అనుబంధం ఉన్న ఒక దురదృష్టవంతుడిని. ఆ కొద్దిపాటి అనుబంధం తోటి నాకు తెలిసిన నాలుగు ముక్కల మా నాన్న గురించి ఇలా మనసు విప్పి చెప్పా. ఆ మహా మనిషికి శతకోటి నమస్కారాలు తో
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి