ఉన్న ఊరు



రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు వెంకన్న మాస్టారికి
పుట్టి పెరిగిన ఊరు .టీచర్ గా పనిచేసిన ఆ ఊరు కదలకుండా ఎంత దూరమైనా ఉద్యోగం చేసి సాయంకాలానికి ఇంటికి చేరే వారు. ఆ ఊరు అంటే ఆయనకు అంత ప్రేమ. తండ్రిగారి కట్టిన ఇల్లు అంటే ఎనలేని అభిమానం. ఇద్దరు మగ పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించేడే తప్ప ఆ ఊరు వదిలి పోలేదు.

ముప్పై సంవత్సరములు టీచర్ గా పనిచేసి రేపు పదవి విరమణ చేయబోతున్నాడు. ముందుగానే పిల్లలు ఇద్దరు చెప్పారు. రిటైర్మెంట్ అయిన వెంటనే నువ్వు అమ్మ మా దగ్గరకు వచ్చేయండి. మీకు వయసు మీరి పోతోంది. ఇక ఇక్కడ ఉండలేరు. ఇల్లు వాకిలి పొలం పుట్రా అన్ని అమ్మేసి వెళ్ళిపోదాం అంటూ పిల్లలు ఒకటే గోల. 

ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. రేపు మాపో పిల్లలు వచ్చి మళ్ళీ పట్టుబడతారు. ఇంతవరకు ఎటు నిర్ణయం చెప్పలేదు. ఊరు వదిలి వెళ్ళిపోవడం ఎలాగా అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుని తెల్లవారి ఆలస్యంగా లేచాడు.

తెల్లవారి లేచింది మొదలు యాంత్రికంగా పనులు చేస్తున్నాడు తప్ప ఆలోచనలు మళ్ళీ చుట్టుముట్టా యి. పొలం పొట్రా ఇల్లు అన్ని అమ్మేస్తాం అది పెద్ద పనేం కాదు. తట్టా బట్టా సర్దుకుని వెళ్ళిపోతాం. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత కాలక్షేపం. చేతిలో పని ఉండదు.

 పిల్లలకు సహాయం చేద్దాం అంటే వాళ్ళు చేయనివ్వరు. ఎంతసేపు టీవీ చూస్తాం. పొద్దున్న వెళ్ళిన పిల్లలు సాయంకాలం కానీ ఇంటికి చేరరు . మధ్యలో తలుపులు మూసి కూర్చోవాలి. ఎవరు ఎప్పుడు వచ్చి పీక నొక్కుతారో తెలియదు. అన్ని భయాలు వత్తిళ్లు. ఎందుకంటే అది బహుళ అంతస్తుల అపార్ట్మెంట్. పక్క వాళ్ళు కూడా తలుపులు కూడా మూసే ఉంటాయి. వాళ్లు పొద్దున లేచేటప్పటికీ అన్ని సర్దుకుని వెళ్ళిపోతారు. రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుతారు. కనబడితే నవ్వుతారు. నోట్లోంచి ముత్యాలు రాలిపోతాయేమో అని భయం పలకరించరు. మనం పలకరించిన ముక్తసరిగా జవాబు కలగొలుపు తనం ఉండదు. ఈ మహానగరం అంతా మాయ.

 పల్లెలన్నీ నుంచి వచ్చిన ప్రజలైన ఇక్కడికి వచ్చేటప్పటికి వేషం భాష పద్ధతులు అన్ని ఏమిటో మారిపోతాయి.పని అలవాటైపోయిన శరీరం. మెదడు మొద్దు మారిపోతుంది. దానికి తోడు కూర్చుని తింటే ఆరోగ్యం పాడైపోతుంది. వాకింగ్ చేద్దామంటే విపరీతమైన ట్రాఫిక్కు ఎవడు మీద నుంచి దూసుకుపోతాడో తెలియదు. అబ్బాఈ పట్టణంలో వయసు మళ్ళిన వాళ్ళు ఉండలేం.

 చుట్టాలు ఇంటికి వెళ్దామంటే వాళ్లు పట్నం వచ్చిన తర్వాత ఎలా మారిపోయారో తెలియదు. దూర దూరాన్ని ఉంటాయి వాళ్ల కొంపలు. ఆ ఏరియా పేర్లు నోరు తిరగవు. గల్లీ అంటాడు. సగం ఉర్దూలో మాట్లాడుతాడు. సగం తెలుగులో మాట్లాడుతాడు. మనకు అర్థం కాదు. తిరగేసి అడిగితే ఆంధ్రా అని పళ్ళు ఇకిలించి సీదాజావో అంటాడు. ఆ హిందీ తెలిస్తే ఈ గొడవ అంతా ఎందుకు.

 ఆ పళ్ళ సందులోంచి నములుతున్న కారా కిళ్లి ఎక్కడ మన మీద పడుతుందని భయం ఒకటి. ఏమిటో ఎదవ గోల. సుఖాన ఉన్న ప్రాణం దుఃఖాన పెట్టుకోవడం అంటే ఇదే.

ఇక మన ఇంటిలో అయితే మన అరుగు మీద ఎంతోమందికి నేను చదువు చెప్పిన విద్యార్థులు గుర్తుకొస్తారు. రోజు ఎవరో ఒకరు పలకరిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే మా నాన్నగారు వైద్యం చేసిన గది పంచాయతీ ఆఫీస్ ఉన్న గది రోజు చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మా నాన్న రోజు అక్కడ ఉన్నట్లు ఉంటుంది. ఏదో అది ఒక తృప్తి. నడవలోకి అడుగుపెడితే ఎన్నో శుభకార్యాలులో జరిగిన ముచ్చట్లు రోజు గుర్తుకొస్తాయి. గోడకి ఉన్న నిలువుటద్దంలో నన్ను నేను రోజు చూసుకోవచ్చు ,ప్రశ్నించుకోవచ్చు. మీ అమ్మకి ఆ అద్దం అంటే ఇష్టం . 

ఉయ్యాలా వసార్లో ఉయ్యాల బల్ల మీద మధ్యాహ్నం పూట నిద్రపోకపోతే నాకు తోచదు. అక్కడ పడుకుంటే ఆ మూలగా ఉన్న పొగాకు డబ్బా చూస్తే మా నాన్నగారు ఆ పక్కనే ఉన్న దేవుడిల్లు చూస్తే మా అమ్మగారు, వసారా లో నేల మీదకు చూస్తే ఎన్నో పితృ కార్యాలు రోజు గుర్తుకొస్తూనే ఉంటాయి. సాయంకాలం పూట వెనక ఉన్న గచ్చు వసార మీద కూర్చుని టీ తాగుతుంటే మా తోడబుట్టిన వాళ్లతోటి బాబాయి పిల్ల కీలతోటి రోజు కూర్చుని భోజనం చేసిన రోజులు గుర్తుకొస్తాయి. 

మా అమ్మ ఆవకాయ పెట్టిన రోజులు గుర్తుకొస్తాయి. ఆ ఇల్లు చూస్తుంటే దొడ్లో బాబాయ్ పాలేరు మీద వేసిన కేకలు పిన్ని పొయ్యి మీద అట్లు వేస్తున్నట్లు కళ్ళ ముందు కదలాడుతుంది.ఇన్ని అనుభూతులతో రోజు ఆనందంగా గడుస్తుంది .

అదే మన ఊరు అయితే చుట్టుపచ్చటి పొలాలు ఇంటికి ఎత్తైన అరుగులు లంకంత కొంప పాకలో పశువులు గంప కింద కోడి తలపైకెత్తి చూస్తే ఆకాశంలోని పక్షులు చల్లగా వీచే గోదావరి గాలి. గాలి చేసే శబ్దం తప్పితే అంతా నిశ్శబ్దం, ధ్యానం ప్రత్యేకంగా చేయక్కర్లేదు . ఆ ఇంటి అరుగుల మీద కూర్చుని ప్రశాంతంగా కూర్చుంటే తెలియకుండానే ధ్యానం చేసినట్టే.

ఇంకేంకావాలిపొద్దున్నేఉత్సాహంతెచ్చుకోవడానికి.రోజంతా హుషారుగా ఉండడానికి. పొద్దున్నే సూర్యుడితో పాటు లేచారా మాస్టారు అంటూ ఆప్యాయమైన పలకరింపులు. ఆ పలకరింపు కి ఒళ్ళు పులకరించిపోతుంది. రక్త సంబంధo లేకపోయినా బంధుత్వం కలుపుకుని ఆదరణంగా పిలుస్తారు. లేటుగా లేద్దామంటే కుదరదు గంప కింద కోడి , పాకలోని పశువు తమ పిల్లలకి ఆకలి వేస్తోంది అంటూ ఒకటే అరుపులు.అరుగు మీద కూర్చుంటే చాలు ఎవరో ఒకరు వచ్చి పక్కన కూర్చుని పిచ్చపాటి మాట్లాడుతుంటారు. ఎవరూ లేకపోతే దారిన పోయే దానయ్య ఏదో ఒక రకంగా మాట కలుపుదాం అని చూస్తాడు.

 అలా రచ్చబండ దగ్గరికి వెళ్తే కబుర్లు వరద ప్రవాహo లా సాగుతూనే ఉంటాయి. ఇంచుమించుగా అందరూ అదే వయసు ఉన్న వాళ్ళు అక్కడ చేరుతారు.మధ్య మధ్యలో ఖాళీగా ఉన్న యువకులు కూడా ఉంటారు. బాల్యంలో తమ అనుభవాలు , చేసిన చిలిపి పనులు, వీరోచిత కార్యాలు పంచాయతీ ఎలక్షన్లు, అలా అలా పార్లమెంట్ కబుర్లు వరకు సాగిపోతుంది. మధ్యలో యువకులు వేసే చిలిపి ప్రశ్నలకు కోపం తెచ్చుకునే పెద్దలు, కొంతమంది సరదాగా సమాధానం చెప్పే వృద్ధులు, ఇవన్నీ చోద్యం చూస్తూ కొంతమంది అలా రచ్చబండ మా వృద్ధులందరికీ పెద్ద కాలక్షేపం ఇస్తుంది. మధ్యలో వార్తాపత్రికలు ఇంకేం కావాలి ప్రపంచంలోని వార్తలన్నీ తెలియడానికి.

ఇంకా ఊర్లో ఉన్న దేవాలయాలు కాలినడకని కూడా చేరుకోవచ్చు. అంతా ధర్మ దర్శనమే. క్యూలు కూడా లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చు రావచ్చు. ఇంకా అమ్మవారి తీర్థాలు ఏడాదికి ఒకసారి. వేసవికాలంలో నెల రోజులు ఇదే హడావుడి. రోజు సాయంకాలం ఇంటి ముందర వచ్చిన అమ్మవారికి కాళ్లు మీద నీళ్లు పోసి ఆహ్వానించి బియ్యం ఇచ్చుకోవడం.తిరిగి ఇచ్చిన పసుపు కుంకుమల ప్రసాదం చెవికి పెట్టుకోవడం. ఇది ఒక వింత అనుభూతి. అమ్మవారి జాతర. జాతరలో అమ్మవారి ఊరేగింపు. ఎంత సందడి తారాజువ్వలు బ్యాండ్ మేళాలు సన్నాయి మేళాలు గరగ నృత్యాలు డప్పులు అబ్బా ఆ సందడే వేరు. ఆ పట్టణాల్లో ఆ ఊరేగింపు చూడలేము ఆ తలకు గుడ్డలు కట్టుకొని ఆ డాన్సులు ఏమిటో, గుడిలోకి వెళ్లలేం.

 ఇంకా దేవుడు కల్యాణాలు. పచ్చటి తాటాకుల పందిరి వేసి మామిడి ఆకుల తోరణాలు కట్టి దేవుడినిపెళ్ళికొడుకుని చేసి, పేరంటం చేసి, కళ్యాణం చేసి ,శ్రీ పుష్పయాగం వరకు హడావిడి.దేవుడి పెళ్లికి ఒకళ్ళు పిలవక్కర్లేదు కానీ ఈ నగరంలో ఎప్పుడు కళ్యాణం చేస్తారో తెలియదు. మనం ఏ మూలన ఉన్నామో. మన ఊరు మన కళ్యాణం మన అమ్మవారిని మిస్ అయిపోతాం. అందుకనే ఊరు వదలలేను.ఈ వేసవి కాలంలో ఊరగాయలు పెట్టుకోవడం ,మామిడిపళ్ళు ,అప్పడాలు, ఒడియాలు ఆరబెట్టుకోవడం ఆ అనుభూతి వేరు.ఇంత రుచికరమైన మామిడిపళ్ళు అక్కడ ఎక్కడ దొరుకుతాయి.

అంతకన్నా ముఖ్యం తాటి ముంజలు. అబ్బా నేను ఈ ఊరు వదలలేనండి. ఈ పల్లెటూర్లో ఉన్న అనుభూతి ఆ పట్టణంలో ఈ పల్లెని ఎలా తీసుకురాగలను.

వేసవికాలం అంతా ఆ పని ఈ పని చేసుకుంటూ రాబోయే కాలానికి ఊరగాయలు తయారు చేసుకుంటూ దేవుడి పెళ్లికి పెద్దలుగా వ్యవహరిస్తూ అమ్మవారి జాతరలో పాల్గొంటూ ఈలోగా మా ఊర్లో జరిగే పెళ్లిళ్లకి హాజరవుతూ కాలక్షేపం అయిపోతుంది. సాయంకాలం పూట అలా చెరువులో స్నానం చేసి చెట్లని పొలాలని పలకరించి వేసవి తాపం తీర్చుకునే లోగా
తొలకరి జల్లులు డ్యూటీలోకి వచ్చేస్తాయి.

వర్షాకాలం వచ్చిందంటే మా ఊరంతా బిజీ అయిపోతుంది ఓం. ముసలి ముతక కూడా గట్టుమీద కూర్చుని పొలం పనులు ప్రారంభం చేయిస్తారు ఆకుమడులు ఊడ్పులు ఎరువులు వేయడం నీరు పెట్టడం మందులు వేయడం అన్నీ మాకు పనులే.
వర్షాకాలం అంతా ఖాళీ ఉండదు. ఎదిగే పైరుని చూసి మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. రోజు పొలం గట్టుకు వెళ్లి కాసేపు పొలంతో మాట్లాడుకుని కుశల ప్రశ్నలు వేసి ఆనందంగా ఇంటికి చేరడంతో మాకు కాలక్షేపం అయిపోతుంది. మొక్క ఎదిగి పొట్ట పోసుకొని కాయ పెరిగి పెద్దదై కోతకు సిద్ధమయ్యేసరికి మా ఊరిని మంచు దుప్పటిలా కప్పేస్తుంది. చలిపులి మా ముసలి వాళ్ళని భయపెడుతుంది. అయినా తెల్లవారక ముందే బావి దగ్గర స్నానాలు చేసి కార్తీకదీపం వెలిగించుకుని కార్తీక సోమవారం ఉపవాసం చేసి పౌర్ణమి చంద్రుడికి చలిమిడి నివేదన చేసి లక్ష పత్రి పూజలు చేసి సంతర్పణలలో మా ఊరి జనం కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకొని హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఇలా కార్తీక మాసం బోల్డంత కాలక్షేపం ఇస్తుంది మా ఊరిలో.

అయినా మా ఊరు వదిలి రాకపోవడానికి మరో ముఖ్య కారణం. ముసలి వాళ్ళం అయ్యాం. ఎప్పుడు ఎలా ఉంటామో.
గోదావరి తీరంలో ఉన్నాం. అక్కడ అపార్ట్మెంట్లు అద్దె ఇల్లు. ఎక్కువసేపు ఇంట్లో ఉండనీరు. గట్టిగా ఏడవడానికి లేదు. మా ఊరిలోని రుద్రభూమికి నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు.
 ఆ నలుగురిని వెతుక్కోక్కర్లేదు. ఇక్కడ పిలవకుండానే వస్తారు. నలుగురు కాదు ఊరి జనం అంతా తరలివస్తారు.అక్కడ నాలుగు చక్రాలతో నడిచే బండిలో ఆఖరి ప్రయాణం. అక్కడ నువ్వు నేను తప్పితే ఎవరూ ఉండరు నీకు సాయం. అక్కడ ఒక్కళ్ళు మీరు కంగారు పడిపోతారు. ఇక్కడ ఎన్ని కాళ్ళు నడిచి వస్తాయో మనతో పాటు. నోరు తెరిచి అడిగితే ఊరి జనమంతా నీ చుట్టూనే ఉంటారు .అక్కడ మూసి ఉన్న నది. ఇక్కడ జీవనది. ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది.ఇంకేం చెప్పను నీకు విడమర్చి అని మనసులోని మాటని కొడుకుకి మెయిల్ ఇచ్చేసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట