ఒక సూర్యోదయం_ గోదావరి తీరం
ప్రతి ఉదయం ఒక కొత్త ఆశ. ఒక కొత్త ఊపిరి. కొత్త ఆశయాలు కొత్త కోరికలు, ప్రారంభమవుతాయి.అది ఏ కాలం అయినా సూర్యుడు తూర్పు కొండల పైనుంచి తళతళలాడుతూ ఉదయిస్తాడు. ఆరు నూరైనా తన డ్యూటీని మరిచిపోకుండా చేస్తాడు. అది మనం జీవితం మీద నమ్మకాన్ని నింపుకునే క్షణం.
ఉదయిస్తున్న సూర్యుని అరుగు మీద కూర్చుని చూసిన చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఆ క్షణం గోదావరి తీరంలో ఎలా ఉంటుందో చెప్పడానికి పదాలు చాలవు. కనులు చూసే దృశ్యం, మనసు తేలికపడే అనుభూతి, శ్వాసలో పరిమళించే తడి నేల వాసన – ఇవన్నీ కలిసే గోదావరి ఒడ్డున ఒక సూర్యోదయం.
" ఉదయిస్తున్న సూర్యుడు ఉల్లి పువ్వు ఛాయ అన్నట్టు ఉదయిస్తున్న సూర్యుడు లేలేత కిరణాలు గోదావరి నది నీటి మీద పడిన దృశ్యం చూడడానికి కన్నుల ముచ్చటగా ఉంటుంది. ప్రవహిస్తున్న గోదావరి నదితో పాటు కిరణాలు కూడా ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆనందం ,ఈ అనుభూతి కూడా మనం స్వయంగా చూస్తేనే తెలుస్తుంది.
సూర్యుడుతోపాటుగా నిద్ర లేచి పశువులను తోలుకుంటూ పొలం వెళ్లే రైతులు, సైకిల్ మీద లుంగీ పంచ కట్టుకుని నోట్లో చుట్ట పెట్టుకుని సైకిల్ కి పాల తప్పేలా తగిలించుకుని పొలం వెళ్లే పెద్ద రైతు గోదావరి గట్టుమీద ప్రతి ఉదయం కనిపించే ఒక దృశ్యం.
గోదావరి తల్లి మీద బతికే జాలర్లు నైలాన్ వల భుజానికి తగిలించుకొని ఒడ్డున తాళ్లతో క ట్టేసి ఉన్న నాటు పడవల్ని తీసుకుని తన జీవనయానం ప్రారంభించే దృశ్యం మనోహరం. ఇదే దృశ్యం ఒక చిత్రకారుడు చూస్తే అందమైన చిత్రంగా మారిపోతుంది.ఒక చాయాగ్రహకుడు తలుచుకుంటే కొన్ని వందల ఫోటోలు తన కెమెరాలో బంధిస్తాడు.
సూర్యోదయం కాకముందే అంగవస్త్రం కట్టుకొని ఆ చల్లని గోదావరి తల్లి ఒడిలో జలకాలాడి గట్టుమీదకు వచ్చి పంచ కట్టుకుని విభూది పిండి కట్లు పెట్టుకొని గాయత్రీ మంత్ర జపం, వేద పారాయణ చేస్తున్న బ్రాహ్మణులు ప్రతిరోజు అక్కడ దర్శనమిస్తారు.
మరొక పక్కకి నిత్య విధులు పూర్తి చేసుకుని తమను ఎవరైనా పూజాదికాలు నిర్వహించడానికి పిలుస్తారేమోనని చూసే బ్రాహ్మణులు ఆ గోదావరి గట్టుమీద ఆశగా ఎదురు చూస్తుంటారు.
ఎక్కడ పుట్టారో ,ఎక్కడ పెరిగారో తెలియదు కానీతమ ఆఖరి యాత్ర గోదావరి తల్లి ఒడిలో జరగాలని తమ చివరి కోరికగా చెప్పిన వారి సూచన ప్రకారం సుదూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పార్థివ దేహాలకు అంతిమ సంస్కారం చేసే కుటుంబీకులు, అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఎంతోమంది గోదావరి తల్లి ఒడ్డున కనిపిస్తారు. ఇన్నాళ్లు తమతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు ఇలా గుప్పెడు బూడిదైపోయి నీళ్లలో కలిసిపోతుంటే కన్నీళ్లు కార్చే రక్తసంబంధీకులు ఎంతోమంది అక్కడ కనిపిస్తారు.
స్వచ్ఛమైన నీటితో ప్రవహించే గోదావరి ను చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. కానీ గోదావరి నది ఒడ్డు మీద ఇలాంటి దృశ్యం చూసినప్పుడు మనకు కూడా ఆవేదన కలుగుతుంది. ఇంతే కదా జీవితం అనిపిస్తుంది.
మన దేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయులు మనకి కొన్ని మంచి పనులు చేశారని అనిపిస్తుంది. అది ఈ గోదావరి నది మీద రాజమండ్రి వద్ద నిర్మించిన రోడ్ కం రైల్వే బ్రిడ్జి. లేదంటే గోదావరి నది దాటాలంటే పడవలే శరణ్యం.
గోదావరి ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డు వరకు వేసిన పొడవైన బ్రిడ్జి మూలంగా ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఎగుమతి దిగుమతి సరుకుల రవాణాకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇది పరోక్షంగా దేశ ఆర్థిక అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతో మేలు చేస్తోంది.
ప్రతిరోజు కొన్ని వందల రైళ్లు ఈ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. గోదావరి తల్లి కనపడగానే రైలు కిటికీలోంచి బయటకు తొంగి చూసి ప్రయాణికులు దండం పెట్టుకుని చేతిలోంచి ఒక నాణెం గోదావరి తల్లికి సమర్పిస్తారు. అది వాళ్ళు భక్తి కోసం చేస్తే అది కొంతమందికి అన్నం పెడుతుంది అని చెప్పడాలను సందేహం లేదు. గోదావరి నది ఒడ్డున కొంతమంది పిల్లలు జారిపోతున్న లాగు కట్టుకుని పైన చొక్కా లేకుండా గోదావరి లో విసిరిన నాణెం కోసం గోదావరిలో మూడు మునకలు వేస్తున్న దృశ్యం కన్నులకి ఎంతో భయంకరంగా ఉంటుంది. గోదారి బ్రిడ్జి మీద నడుస్తున్న రైలు చూసి గట్టుమీద ఉన్న పిల్లలు ప్రయాణికులకు చేతులు ఊపుతూ టాటా చెప్పడం ఆనందకరంగా ఉంటుంది .
గోదావరి నది మీద ఒడ్డు మీద ఉన్న ఆలయాల్లో సుప్రభాతం వినిపిస్తూ ఉంటుంది. మైకులో పూజారి గారి గొంతు శ్రావ్యంగా మంత్రాలు చదువుతూ గోదావరి అలల మీద వచ్చే గాలిలో అవి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.
భక్తులు కొట్టిన గంటల చప్పుడికి చెట్ల మీద ఉన్న పక్షులు ఒక్కసారిగా ఆకాశంలో రివ్వున ఎగిరిపోతున్న దృశ్యం చూస్తే మనోహరంగా ఉంటుంది. ఒడ్డు మీదకు కొట్టుకొచ్చిన చేప పిల్లల్ని తినడానికి గట్టుమీదకు వచ్చిన కొంగల గుంపును చూస్తే మనసు పులకరించిపోతుంది. వేపచెట్టు కింద కూర్చొని పూజ కోసం పసుపు, కుంకుమను కలిపే ముసలమ్మ చేతుల్లో దైవభక్తి కనిపిస్తుంది.
గోదారి గట్టు మీద పెట్టిన కాకా హోటల్ లో నుంచి సర్వర్ అరుపులు గ్లాసులు ప్లేట్లు చప్పుళ్ళు కస్టమర్ కోరికలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే దింపిన ఇడ్లీ పాత్రలోంచి వచ్చే వేడి వేడి ఇడ్లీ వాసన, నూనెలో వేగుతున్న పూరి, మైసూరు బజ్జి, పెనం మీద కాలుతున్న పెసరట్టు, మినపట్టు వాసనలు గోదావరి గట్టున దంత దావనం పూర్తిచేసుకుని ఉన్న వాళ్ళని ఆ కాకా హోటల్ వైపుకి పరుగులు తీసేలా చేస్తాయి. చల్లని గోదావరి ఒడ్డున పగలకొక్కుతున్న కాఫీ కప్పు నోట్లో పెట్టుకుని ఒక్కొక్క చుక్క తాగుతుంటే ఆ అనుభూతి వర్ణించలేము. ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న పిల్లల కోరిక తీర్చడానికి ప్యాకింగ్ చేయించుకుని ఇంటికి తిరిగి ముఖం పట్టేవాళ్ళు ఎంతోమంది.
తెల్లవారుజామునే గోదావరి నది ఒడ్డున ఒంటికి చెమట పట్టే వరకు నడిచి వచ్చిన ఆయాసం తీర్చుకోవడానికి పక్కనున్న కాకా హోటల్ బల్ల మీద కూలబడి ఒక కప్పు టీ రుచి చూసే వాళ్లు నిత్యం ఎంతోమంది.
ఒకవైపు స్వచ్ఛభారత్ అని గోల పెడుతున్న చేతిలో చెంబు పట్టుకుని సిగ్గుపడుతూ గోదావరి గట్టుమీద పిల్లల్ని కూడా తీసుకుని నడుచుకుంటూ వెళ్లే ఎంతోమంది జనం. దాంతో సరిపెట్టడం లేదు. తమతో పాటు తమ పెంపుడు జంతువుల కాలకృత్యాలు తీర్పించడానికి తీసుకొచ్చే వాళ్లు కూడా ప్రతిరోజు కనబడతారు
తెల్లవారింది అంటే ఎవరు హడావుడి వాళ్లది. సైకిల్ కి బాల బిందెలు కట్టుకుని ప్రయాణం చేసే పాలవాళ్లు, తాజా కూరగాయలు సంచిపెట్టుకుని సైకిల్ మీద ప్రయాణం చేసే కూరగాయ వ్యాపారులు, నోట్లో చుట్ట, తలకు తలపాగా, భుజం మీద నల్ల కంబళి, శరీరానికి పంచ కట్టుకుని చేతిలో కర్ర పట్టుకుని వెనకాల ఒక పెంపుడు కుక్క నడుస్తూ ఉంటే ముందు గొర్రెల మందని మేకల మందని అదిలిస్తూ ముందుకు సాగే గొర్రెల కాపర్లు ప్రతిరోజు అక్కడ దర్శనం ఇస్తారు.మానవ జీవితం అలా ప్రకృతి గడియారానికి అనుగుణంగా సాగుతుంది.
ఇంతమందికి ఇన్ని రకాల ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తున్న గోదావరి తల్లికి మనం ఏమి ఇస్తున్నాం. నిజం చెప్పాలంటే పాడు చేస్తున్నాము. ఆ గోదావరి తల్లిని పరీక్షగా చూస్తే ఆ నీటి మీద తేలియాడే నల్లటి చెత్త, గోదావరిలోకి వదులుతున్న పారిశుద్ధ్య కాలుష్యం, పరిశ్రమల చెత్తాచెదారం ఇవన్నీ గోదావరి తల్లిని పాడు చేస్తున్నాయి.
మౌనంగా ఉంది కదా అని ప్రకృతి ప్రసాదించిన ఇంత అందమైన గోదావరి తల్లిని పాడు చేయడం ఎంతవరకు సబబు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఎవరికి వారే ప్రతిజ్ఞ చేసుకోవాలి . గోదావరి తల్లి మనకు అన్నపూర్ణ లాంటిది. ఎన్నో లక్షలమంది రైతుల భూములకు గొంతు తడిపి బంగారు పంటలను పండించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తోంది. అలాంటి తల్లిని మనం పూజించాలి కానీ ఇలా కాలుష్య పరం చేయడం కన్నతల్లిని కి అన్యాయం చేసినట్లు అవుతుంది.
ఈ గోదావరి తీరంలా జీవితం కూడా. ప్రతిరోజూ ఒక సూర్యోదయం, ఒక అవకాశమే. నిన్నటి చీకటిని పక్కన పెట్టి కొత్త వెలుతుర్లో నడిచే ధైర్యం ఇచ్చేది ప్రకృతే. ఆ తీరంలో ఉండే అమాయకత్వం, ఆత్మీయత మనిషికి మనుషులవైపు మళ్లీ నడిపిస్తుంది.
---
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి