శ్రీకృష్ణ లీలలు
నల్లటి శరీరం, కమలo వంటి కళ్ళు, ఆ కళ్ళల్లో కృపారసం చేతిలో వేణువు, తల మీద పరిసర్పిత పింఛo ,ఎప్పుడూ నవ్వుతూ విరాజిల్లే మొహం. ఇది పోతన గారి శ్రీకృష్ణుడి వర్ణన. ఆ వర్ణన చదువుతుంటేనే మన మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడి ని మనం చూడలేకపోయినా వెన్నదొంగగా ఒక రాధాకృష్ణుడిగా అల్లరి కృష్ణుడిగా చిత్రపటంలో చూసినప్పుడు మనసుకు పదేపదే ఆ ముగ్ద మోహన రూపాన్ని చూడాలని అనిపిస్తుంది . సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో సమకాలీకులుగా పెరిగిన ఆ యాదవులు ఎంతటి అదృష్టవంతులో అనిపిస్తుంది.
నిజమే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తో స్నేహితులుగా మెలిగిన యాదవులు చాలా ధన్యాత్ములు. అంటే భగవంతుని పక్కనే ఉండి తమ స్నేహితుడే భగవంతుడు అని తెలియని వాళ్లు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తుతూ వచ్చాడు. ఇలా ఒకసారి అధర్మం పెరిగినప్పుడు భూదేవి ఆ రాక్షస కృత్యాలను తట్టుకోలేక బ్రహ్మ దేవుడికి మొరపెట్టుకుంటుంది.. అప్పుడు బ్రహ్మదేవుడు భూమాతను వెంటబెట్టుకుని విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు.
రాక్షస సoహారం చేయడానికి విష్ణుమూర్తి తాను శ్రీకృష్ణుడిగా దేవకీదేవి కడుపులో పుడతానని తదుపరి యశోద పుత్రుడిగా నందుడి ఇంట్లో పెరుగుతానని నిత్యం భగవంతుని ఆరాధించే దేవతలు యాదవులుగా పుడతారాని , అలాగే అప్సరసలు యదుకులంలో గోపికలుగా అవతరిస్తారని చెబుతాడు. అలా చెరసాలలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవుడిచేత కంసుడుకి భయపడి రేపల్లెలో ఉన్న నందుడు ఇంట్లో చేర్చబడతాడు. అలా పరమాత్మ యశోదా దేవి ఒడిలో ఆ యాదవుల మధ్య గోవులను కాచుకుంటూ పెరుగుతూ ఉంటాడు
అలా యదుకులంలో పెరిగిన అందమైన శ్రీకృష్ణ పరమాత్మ ని చూడడానికి ఆ కాలంలో ప్రజలు వీధుల్లో బారులు తీరి ఉండేవారట . మనం ఈ కాలంలో అందమైన శ్రీకృష్ణుడి చిత్రపటం కానీ బొమ్మకాని రోడ్డుమీద కనబడితే ఒకసారి అటు చూడకుండా ఉండలేము. చెరసాలలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ సంకెళ్లతో మన మనసును బంధించి ఆ బొమ్మని ఎంత ఖరీదైన కొని మన ఇంటికి తీసుకువెళ్లేలా చేస్తాడు. అది శ్రీకృష్ణ పరమాత్మ సమ్మోహనాస్త్రం. ఒకళ్ళ ఇద్దరా పదహారు వేల మంది గోపికల మనసు దోచిన వాడే. మన మనసు ఒక లెక్కా.
ఆ పరమాత్మ అల్లరి కృష్ణుడిగా చేసిన పనులు చదువుతుంటే మనసు పరవశం అయిపోతుంది. నవ్వు తెప్పిస్తుంది. ప్రతి అల్లరి పని వెనుక ఒక అంతరార్థం ఉంది.
బాల్యంలో శ్రీకృష్ణుని హతమార్చడానికి కంసుడు చేత పంపబడిన పూతన అనే మహిళను రాక్షసిగా కనిపెట్టి వడిలో పడుకుని పాలు త్రాగి రాక్షస సంహారం చేస్తాడు మహానుభావుడు. నిజానికి ఎవరో తెలియని వ్యక్తి పసి పిల్లవాడికి పాలు ఇస్తానంటే ఏ తల్లి తండ్రి ఒప్పుకోరు. కానీ అదంతా కృష్ణ మాయ. ఇలాంటి లీలలు అనేకం.
ఒకసారి యశోదా దేవి పెరుగు చిలకడానికి చిలుకు స్తంభం వద్ద
కుదురు పెట్టి దానిమీద పెరుగు కుండని పెట్టి పెరుగు చిలకడం ప్రారంభించింది. ఇంతలో చిన్ని కృష్ణుడు వచ్చి యశోదా దేవి కాళ్ళకు అడ్డం పడుతూ " అమ్మ ఆకలేస్తుంది పాలు ఇయ్యవే అంటూ కొంగు లాగడం ప్రారంభించాడు. యశోద చిలుకుతున్న కవ్వాన్ని గట్టిగా పట్టుకున్నాడు. యశోదా దేవి నవ్వుకుంటూ కృష్ణుడి ని తన ఒడిలోకి తీసుకుని కొంగు కప్పి జుట్టు ప్రేమ గా నిమురుతూ పాలు ఇవ్వడం ప్రారంభించింది.
ఇంతలో పొయ్యి మీదనున్న పాలు పొంగడం చూసి గబగబా కృష్ణుడిని తన ఒడిలోంచి ఎదురుగుండా ఉన్న పీట మీద కూర్చోబెట్టి పొయ్యి మీద నుంచి పాలు దింపడానికి పరుగులు పెట్టింది. యశోదా దేవి తన ఆకలి తీరకుండానే పాలు పూర్తిగా ఇవ్వకుండానే మధ్యలో ఆపవేసినందుకు కృష్ణుడికి కోపం వచ్చి ఎదురుగుండా ఉన్న పెరుగు కుండను గట్టిగా కాలితో తన్నాడు. ఆ కుండలోంచి మీ గడను వెన్నను తీసి తినీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన యశోదాదేవి కృష్ణుడు చేసిన కొంటె పని చూసి నవ్వుకుంటూ కృష్ణుడినీ వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అలా బయలుదేరిన యశోదా దేవికి ఒక ఇంటిలో బాలకృష్ణుడు కనబడతాడు. యశోద ఇంటిలో పెరుగు కుండను బద్దలు కొట్టి వెన్నను మీ గడను తిన్నా ఆకలి తీరక ఆ ఇంటిలో రోలు బోర్లించి దాని మీద ఎక్కి ఉట్టిలో ఉన్న కుండలోంచి మీగడను వెన్నను తింటూ కనబడతాడు. అంతేకాదు ఆ మీగడ వెన్న కూడా ఒక కోతికి పెడుతూ కనిపిస్తాడు.
ఇలా శ్రీకృష్ణుడి అల్లరి రోజు రోజుకి ఎక్కువ అవ్వడం చూసి యశోదా దేవి శ్రీకృష్ణుడి ని దండించాలని నిర్ణయించుకుంటుంది. పోనీలే పసిపిల్లాడు అనుకుంటే ఇలాంటి నడవడిక పెద్దలు ఎవరికీ తెలీదు. గట్టిగా దండిద్దామనుకుంటే లేకలేక పుట్టిన ఒక్కగానొక్క పిల్లవాడు , బుద్ధిగా ఇంట్లో కూర్చోబెడదాం అనుకుంటే వీడు లేని ప్రదేశం లేదు, వీడికి అసలు భయం అనే పదం తెలియదు. రోజు రోజుకి అల్లరి పెరిగిపోతుంది . ఎందుకు లేని ఊరుకుంటుంటే భయం చెప్పకపోతే పిల్లలు చెడిపోతారు అనుకుని ఆ బాలకృష్ణుడికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది.
ఆ ఇంటిలో ఒక్కసారిగా యశోద దేవిని చూసిన శ్రీకృష్ణుడు రోలు మీద నుంచి క్రిందకు దూకి బయటకు పారిపోతాడు. యశోదా దేవి కూడా కృష్ణుడు వెంట పరిగెత్తుతూ ఉంటుంది.
చమటలు కార్చుకుంటూ కృష్ణుడి వెంట పరిగెత్తుతున్న యశోద దేవి ని చూసి గోపికా స్త్రీలు నవ్వుతారు. మహాయోగులు మునులు మనసులు పట్టుకోలేని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని పట్టుకోడానికి పరిగెత్తుతున్న యశోదాదేవి ఎంతటి అదృష్టవంతురాలు అనుకుంటారు.. అలా పరిగెత్తుతూ కృష్ణుడు వాకిట్లో ఉన్న స్తంభాల చాటుకు వెళ్లి ఏడుస్తూ" ఈ ఒక్కసారికి క్షమించమ్మా ఇంకెప్పుడూ చెయ్యను అంటూ తల్లిని క్షమించమని అడుగుతూ ఒక కంటితో తల్లిని కనిపెట్టుకుంటూ అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. చివరికి యశోదా దేవి చేతిలో చిక్కిన శ్రీకృష్ణుడితో ఇలా అంటుంది యశోద .
" ఏమిటి నాయనా నీకు దొంగతనం అంటే తెలియదా అసలు వెన్న ముద్ద కూడా నీకు తెలియదా అంటూ ఎత్తి పొడుస్తూ ఏమిటి పట్టుకుందామంటే నువ్వు ఎవరికి చిక్కకుండా ఉంటావా! నిన్ను పట్టుకోవడం చాలా కష్టమని అందరు అంటుంటారు. కానీ నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఎవరికీ సాధ్యం కాదురా అంటూ యశోదాదేవి అసలు తత్వం చెప్పింది. నువ్వు సర్వాంతర్యామివి. ఎక్కడో ఒకచోట కుదురుగా కూర్చోవు ఎక్కడైనా తిరుగుతూ ఉంటావు . నీళ్లలో తిరుగుతూ ఉంటావు. పెద్ద పెద్ద బండలు ఎత్తాలని చూస్తావు. పరాయి వాళ్ళ దగ్గర అల్పమైన వాటి కోసం చేతులు చాస్తావు . నీకు రాజసం ఎక్కువ ఎన్నో జగడాలు చేస్తావు నీళ్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని చూస్తావు.
దుడ్డు కర్ర పట్టుకుని నాగలి దున్నేవాడిలా నటిస్తావు. మొలకు గుడ్డ కట్టుకోకుండా దిగంబరుడి లా తిరుగుతావు అంటూ శ్రీకృష్ణ పరమాత్మతో దెబ్బలాడుతున్న యశోద దేవి మాటలలో దశావతారాల రహస్యాలతో కొడుకుని దెప్పి పొడుస్తూ ఎదురుగుండా కనబడిన రోలుకి శ్రీకృష్ణుడినీ తాడుతో కట్టివేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమి భయపడకుండా బిక్క మొహం వేయకుండా కట్టుకొయ్యకు కట్టబడి న గున్న ఏనుగు
వలే ఉన్నాడుట. ఇంట్లో ఉన్న ఎన్ని త్రాళ్లు తీసుకువచ్చిన ఆ పరమాత్మను కట్టి వేయడానికి సరిపోలేదు. తల్లి పడుతున్న శ్రమను చూడలేక జాలిపడి చివరికి కృష్ణ పరమాత్మ అలా త్రాడుకి కట్టబడిపోయాడు. పరమాత్మ ఆప్తులైన వారికి ఆత్మబంధువు కదా. భగవంతుడు దయామయుడు. భక్తుల కష్టాలు చూసి లొంగిపోతాడు. వరాలిస్తాడు. కరుణ చూపిస్తాడు. యశోదా దేవికి కలిగిన అదృష్టం శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుడైన శంకరుడుకి కానీ లక్ష్మీదేవికి గాని దక్కలేదు.
అలా రోలుకి కట్టి వేయబడిన పరమాత్మ రోలు దొర్లించుకుంటూ పెరడులో ఉన్న మద్ది చెట్లు దగ్గరికి వెళ్తాడు. ఆ మద్ది చెట్లు పూర్వజన్మలో ఇద్దరు యక్షులు. నారదుడు శాపం వల్ల అలా మద్ది చెట్లు గా పడి ఉంటారు. అలా రోలు దొర్లించుకుంటూ మద్ది చెట్ల నడుమ వెళ్ళగా ఆ జంట మద్ది చెట్లు రెండు కూలిపోయి ఆ యక్షులకి శాప విమోచనం కలిగిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ.
బాలకృష్ణుడుగా ఆ పరమాత్మ చేసే అల్లరి వెనుక ఇంత అంతరార్థం ఉంది. ఆ యక్షులకు శాప విమోచనం చేయడానికి పరమాత్మ ఎన్ని లీలలు చేశాడో కదా. ఆ అల్లరి కృష్ణుడు చేసే లీలలు చదువుతుంటే నిజంగా నవ్వొస్తుంది. భాగవతంలో ప్రతి ఘట్టాన్ని అత్యంత అద్భుతంగా రచించిన మహాకవి పోతన నిజంగా మహనీయుడు కదా. అటువంటి మహా భాగవతాన్ని తెలుసుకున్న వారి జన్మ నిజంగా ధన్యము.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి