ఆఖరి చోటు
ఆఖరి చోటు
ప్రయాణం అంటే అందరికీ సరదాయే .
అక్కడికి చేరడం అంటే అందరికీ భయమే
కానీ చివరకు చేరేది ఆ చోటుకే
మనకు భయం తెలియకుండానే చేర్చే చోటు.
మనం ఆ చోటుకు చేరుతున్నామని తెలియకుండానే చేరే చోటు.
ప్రతి ప్రయాణానికి ముహూర్తం ఉంటుంది.
మన అంతిమ ప్రయాణం మన చేతుల్లో ఉండదు
మన చేతల్లో కూడా ఉండదు.
ఆ ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించేది ఆ దేవుడు ఒక్కడే.
ఆ చోటు అక్షయపాత్ర లాంటిది
ఎంతమంది చేరిన మరి ఎంతోమందికి చోటు ఉంటుంది.
దయాదాక్షిణ్యలు లేవు .
ఎవరి కన్నీళ్లు పట్టవు
గుండె అంతా బండరాయి.
గుండె మండుతున్న బాధ్యతను మరిచిపోని ప్రదేశం.
కావ్యాలు రచించిన కవులకి అదే పూల పాన్పు .
సుమధుర గానాలు వినిపించిన వసంత కోకిలకు అదే ఆఖరి మజిలీ.
నాడీ పట్టుకుని నలత చెప్పే వారు చివరకు చేరే చోటు
రాజు బంటు తేడాలు లేవు
ఉన్నవాడు లేనివాడు అన్నది వట్టిమాటే.
ఇంద్రుడైన ఒకటే దేవేంద్రుడైన ఒకటే
ఇహపర బేధాలు లేవు.
ఆ చోటులో అందరూ సమానులే.
నిర్జీవమై ఆ చోటుకు చేరిన మమకారం
గుప్పెడు మట్టిగా మారిపోతుంది.
తలదించిన అహంకారం ఊపిరితోపాటు ఎగిరిపోతుంది.
సంపాదించిన సొమ్ము బతికుండగా పెట్టిన సంతకంతో
రెక్కలు వచ్చే ఎగిరిపోతుంది.
మనది కాని చోటులో కట్టె కాలిపోతుంది.
ఆ చోట చేరాలంటే అందరికీ భయమే.
అయినా తప్పదు ఆ ప్రయాణం.
ఈరోజు ,రేపు, ఎల్లుండి,
ఎవరి ముహూర్తం ఎప్పుడో.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి