ఆ అరుగు _ ఆత్మీయ నిలయం


పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి. ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి. కానీ మా తరం వారికి అవి మాత్రం హంసతూలికా తల్పాలు.


తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెంలో గల మా నాన్నగారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల ద్వారపాలకులులా రెండు అరుగులు ఉండేవి. దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్రగచ్చుతో చేసిన వసార ఉంది. సుమారు 70 సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతిరావుగారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం అది.


చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నానంటే—ఎంతో మంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది.


మొదటి రోజుల్లో మా ఇంటి మెట్లకిఎడమ పక్కన ఉండే గదిలో (దాన్ని కొట్టు గది అంటాం) పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది. మా పినతాతగారు శ్రీ మధునాపంతుల కామరాజుగారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా పని చేసేవారు. నిత్యం ఎంతో మంది ప్రజలు ఆ ఆఫీస్‌కి వచ్చి అరుగు మీద కూర్చునేవారు. ఎప్పుడూ రెండు అరుగులమీద తాటాకులతో చేసిన చాపలు ఉండేవి.


మా తాతగారికి సంఘసేవ మీద ఎక్కువ మక్కువ ఉండేది. ప్రజల సమస్యలను అలవోకగా తీర్చేవారు. అందుచేత ఆయన హయాంలో పల్లిపాలెం గ్రామాభివృద్ధి ఎంతగానో జరిగింది. ప్రజలు సమస్యలు తీరి ఎంతో సంతృప్తిగా ఉండేవారు. ఆయన గ్రామాభివృద్ధికి తీసుకునే ప్రతి నిర్ణయం మా అరుగులమీద కూర్చుని తీసుకునేవారు. ఆయనకి మంచి ఆలోచనలు పుట్టించిన మా అరుగు నిజంగా రాములవారి సింహాసనమే.


నిత్యం ఎంతో మంది పంచాయతీ అధికారులు వచ్చిపోతూ ఉండేవారు. వారికి అతిథి మర్యాదలన్నీ మా అరుగు మీదే. ఆ రోజుల్లో మా వాళ్లకి కొంచెం ఛాందస భావాలు ఉండేవి. బంధువులు తప్పితే మిగిలిన వారిని లోపలికి రానిచ్చేవారు కాదు. అలా ఎంతో మంది అధికారులకు ఆతిథ్యం ఇచ్చి మా అరుగు అన్నపూర్ణ అయ్యింది.


మా నాన్నగారికి రాజకీయాలంటే అమితమైన ఆసక్తి. పదవులు తీసుకునేవారు కాదు గాని పదవులు కట్టబెట్టేవారు. ఎన్నికల సమయంలో ఎన్నో గ్రూపు రాజకీయాలు, రాజకీయ సమాలోచనలు, రాజకీయ ప్రణాళికలు అన్నీ ఈ అరుగు నుండే జరిగేవి. గెలుపు–ఓటముల విశ్లేషణ, విజయోత్సవ సంబరాలు కూడా మా అరుగు మీదే. అలా మా అరుగు సంఘసేవకురాలు అయ్యింది.


మధ్యాహ్నం వేళలో అరుగుమీద పురాణపఠనం జరిగేది. మా నాన్నగారు రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. దీనికి ఓలేటి సీతన్న తాతయ్యగారు పద్యాలకు అర్థం చెప్పేవారు. పక్క ఊరు నామవాణిపాలెం గ్రామం నుండి వచ్చిన శ్రీ భూపతిరాజు చిన్న వెంకటపతిరాజుగారు మరియు మధునాపంతుల గౌరమ్మగారు, అనేక మంది రెడ్డి ప్రముఖులు నిత్య శ్రోతలుగా ఉండేవారు. ఎన్నో మార్లు శ్రీరామ పాదుకా పట్టాభిషేకం జరిగి ప్రసాదాలు పంచిపెట్టేవారు. ఇలా మా అరుగు ఎంతమందికి ఆధ్యాత్మిక ఆనందం ఇచ్చి పునీతులను చేసింది.


మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు కావడం వల్ల నిత్యం ఎంతో మంది పేషెంట్లు వచ్చిపోతూ ఉండేవారు. వారు ఈ అరుగుమీద వేచి ఉండేవారు. మా నాన్నగారు ఇచ్చే మందులు సేవించి ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్ళేవారు. మా అరుగు నిజంగా ధన్వంతరి నిలయమే.


మా ఇంట్లో మొత్తం 12 మంది పిల్లలు ఉండేవాళ్లం. అందరూ అరుగుమీద పుస్తకాలు ముందర వేసుకుని కూర్చుని నిత్యం చదువుకునే వాళ్లం. మా పెద్దన్నయ్య దగ్గర నుండి నా వరకు అందరూ ఎర్రగచ్చు మీద తెల్లటి సుద్ధ ముక్కలతో లెక్కలు చేసుకునే వాళ్లం. ఇంకా ఎంతో మంది విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాళ్లం. ఈ అరుగుమీద విద్య నేర్చుకున్న ప్రతి విద్యార్థికి లోటు లేదు. ఇలా మా అరుగు సరస్వతీ నిలయం అయ్యింది.


వేసవి సెలవుల్లో మా మేనత్తగారి పిల్లలు మద్రాస్‌ నుండి వచ్చే వాళ్లు. మేము అరుగు చివర తలగడ వేసుకుని పడుకోవడానికి పిల్లలందరం పోటీ పడేవాళ్లం—ఎందుకంటే అక్కడ వీచే చల్ల గాలి కోసం. ఇంతమంది పిల్లల మానసిక ఆనందానికి ఆలవాలమైన మా అరుగుని ఏమని పిలవగలను? డిక్షనరీలో పదాలు దొరకడం లేదు. నీకు ప్రాణం లేకపోయినా మా ప్రాణాలను ఎల్లప్పుడూ కాపాడేవు.


తెలిసీ తెలియని వయసులో మా బాబాయిగారి పిల్లలతో కలిసి మా అరుగు మీద కూర్చుని రాపాక వెంకట్రావుగారిని ఏడిపించిన పద్ధతి ఇప్పటికీ నాకు నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది.


పండుగ దినాల్లో ఈ అరుగులమీద చతుర్ముఖ పారాయణం జోరుగా సాగేది. పేకాట వ్యసనమే కానీ సంసారిక బాధలనుండి ఉపశమనం పొందడానికి ఒక సాధనంగా భావించేవాళ్లు.


రాత్రిపూట మా అగ్రహారీకులు భోజనాలు చేసి తువ్వాలు ఉండలా చుట్టుకుని మా ఎర్రగచ్చు మీద పెట్టి దాని మీద తల పెట్టుకుని అరుగు మీద నడుము వాల్చి విశ్రాంతి తీసుకునేవారు. ఇలా ఆవకాయ్ నుండి అమెరికా వరకు అన్ని విషయాలు మాట్లాడుకుని సేదతీరేవారు. అలా మనుషుల మధ్య అనుబంధం పెంచింది.


ఉద్యోగరీత్యా దూరాలు వెళ్ళవలసి వచ్చి, సొంత ఊర్లో ఉపాధి లేక మా అరుగు మీద కూర్చుని ఉండే అదృష్టం లేకపోయింది. ఎంతైనా ఇంటికి అరుగు ఉంటే ఎంతో హాయి.


✍️ రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

కాకినాడ

📞 9491792279




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట