తస్మాత్! ఆరోగ్యం జాగ్రత్త



ప్రతి జీవికి నిత్యవసరాలలో ముఖ్యమైనది ఆహారం.
బ్రతుకు బండి సాగాలంటే శక్తి కావాలి. మనిషికి ఆ శక్తి తినే ఆహారం నుంచి పుడుతుంది. మనిషి శరీరము ఒక నడిచే కారు లాంటిది. కారు నడవాలంటే పెట్రోల్ పోయాలి. అలాగే మనిషి శరీరానికి కూడా సమతుల ఆహారం అందించాలి.

విటమిన్లు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు — ఇవన్నీ శరీరానికి కావలసిన రక్షణను, శక్తిని ఇస్తాయి. శాఖాహారులు బియ్యం, ఆకులు, పండ్లు, కాయలు, గింజలు ఆహారంగా స్వీకరిస్తారు. మాంసాహారులు వీటితో పాటు జంతువుల మాంసాన్ని కూడా ఆహారంగా తీసుకుంటారు.

అయితే తీసుకునే ఆహారాన్ని పరిమితంగా తినడం, పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పదార్థం తినడం, వేళకు తినడం వంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిలో ఏ నియమం తప్పినా ఆహారం విషతుల్యమవుతుంది. అది మన శరీరానికి మంచి బదులు చెడు చేస్తుంది.

పూర్వకాలంలో తొలి రోజున వండిన ఆహార పదార్థాలను ముట్టుకునేవారు కాదు. అది మడి కాదు, ఆచారం కాదు — ఆరోగ్యం కోసం తీసుకున్న జాగ్రత్త.
ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్లలో వండిన ఆహార పదార్థాలు దాచుకుని రెండు మూడు రోజుల వరకు ఉంచి తింటున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదో వారికే వదిలేయాలి.

బజారు నుండి తీసుకుని వచ్చిన కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడుక్కొని, ఆరబెట్టుకుని అప్పుడు దాచుకోవాలి. కారణం, ఈ రోజుల్లో పంటలన్నీ రసాయన ఎరువులతో పండిస్తున్నాయి. సహజసిద్ధమైన పంటలు కావు. కాబట్టి ఒకటికి రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి.

ఆ మధ్య కాలంలో కరోనా సమయంలో, ముఖ్యంగా బయట నుండి ఇంటికి చేరే ప్రతి వస్తువు విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించేవారు. కానీ ఆధునిక కాలంలో మహిళలు కూడా ఉద్యోగస్తులు కావడం చేత ఇటువంటి జాగ్రత్తల విషయంలో కొంత అలసత్వం కనబడుతోంది. దాని మూలంగా పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారు.

వంట చేయడమనేది ఒక పూజ లాంటిదే.
పూర్వీకులు కట్టెల పొయ్యి మీద వంట చేసేటప్పుడు, శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని, ఇత్తడి పాత్ర పొయ్యి మీద పెట్టి దైవాన్ని తలుచుకుని కడిగిన బియ్యాన్ని ఆ అగ్నిలో వేస్తారు. అది అగ్నిదేవుడికి సమర్పించినట్లుగా భావించేవారు.
ఇది నేను మా అమ్మగారు వంట చేసేటప్పుడు గమనించేవాడిని.
ఆహార పదార్థాల మీద వేసే మూతల విషయంలో కూడా అతి జాగ్రత్తలు తీసుకునేవారు.

ఇక తినే ఆహార విషయంలో పూర్వీకులు తీసుకున్న జాగ్రత్తలు మనం తీసుకోవడం లేదని చెప్పాలి. వారు మనిషి పరిస్థితిని, వయసును బట్టి తగిన ఆహారం ఇచ్చేవారు. చంటి పిల్లలకి ముద్దపప్పు నెయ్యితో చారు కలిపి పెట్టేవారు. వేడి చేసిన శరీరం ఉంటే సగ్గు జావలిచ్చేవారు. ఆహార పదార్థాలలో ముఖ్యంగా చారు ప్రతిరోజు ఉండేది. ఆరోగ్యరీత్యా చారు ఎంతో మేలు చేస్తుంది.

ఆధునిక కాలంలో యువత సరైన ఆహారం తీసుకోవడం లేదని చెప్పాలి. ముఖ్యంగా వేళ కాని వేళలో తినడం, బజార్లో ఏది పడితే అది తినడం — ఇవి అలవాటుగా మారాయి. నేటి యువత షిఫ్ట్ డ్యూటీలలో పనిచేయడం కూడా అనారోగ్యానికి కారణమైంది.

బంధువులు ఇంటికి వస్తే వారిని తీసుకుని బయట హోటల్‌లో తినడం అలవాటుగా మారింది. అదొక రకమైన ఆనందం. కాని ఆ ఆనందం వెనుక శరీరానికి జరిగే చెడు చాలా ఉంది — ఒకటి అనవసరపు ఖర్చు, రెండవది అనారోగ్యం.
బయట తినే హోటల్‌లో పరిశుభ్రత ఎంతవరకు ఉందని మనం అంచనా వేయలేము. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసే ప్రభుత్వ విభాగాల పనితీరు ఎలా ఉందో దేవుడికే తెలియాలి.

అందమైన టేబుళ్లు, స్పూన్లు, పింగాణీ ప్లేట్లు, నీలి బల్బుల వెలుగులు మనల్ని ఆకర్షించి జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఖర్చులు బడ్జెట్‌కి మించి పోతున్నాయి. పుట్టినరోజో, పెళ్లిరోజో సరదాగా వెళ్లి రావచ్చు. కానీ ప్రతి ఆదివారం ఇదే నోముగా చేస్తే ఫలితం తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది.

రంగులు వేసిన స్వీట్లు, మసాలా తగిలించిన హాట్లు — ఇవే ఆధునిక వంటలు. బజార్లో రంగురంగుల డబ్బాల్లో కనబడే ఆహారాలు మనల్ని ఆకర్షిస్తున్నాయి. దానికి తోడు రకరకాల ఫుడ్ వెబ్‌సైట్లు విపరీతంగా పెరిగి, కొత్త వంటలు పుట్టుకొచ్చి ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. ఇటీవల కాలంలో యువతను ఈ వెబ్‌సైట్లు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.

మా చిన్నతనంలో మినప సున్నుండలు, జంతికలు, కారప్పూస, మినప రొట్టె పిల్లలకు చిరుతిళ్లుగా పెట్టేవారు. మినుము ఇనువంత బలం చేస్తుంది, ఎముకలకు గట్టి దృఢత్వం చేకూరుస్తుంది. అలాగే పల్లెటూర్లలో దొరికే నేరేడు పళ్ళు, జామకాయలు, సీమచింతకాయలు, మొక్కజొన్న పొత్తులు, అటుకులు, చింతకాయలు, రేగు పళ్ళు, సీతాఫలాలు, తేగలు, అరటిపళ్ళు — ఇవన్నీ ఆ కాలం పిల్లలు ఎక్కువగా తినేవారు. ఏ వస్తువులో ఏ ఔషధ గుణం ఉందో తెలియకపోయినా అందరూ ఆరోగ్యంగా ఉండేవారు.

దానికి తోడు ప్రతి ఇంట్లోనూ పశువులు ఉండేవి. పాలు తీసిన వెంటనే పిల్లలకు తాగించేవారు — వాటిని “గుమ్మ పాలు” అంటారు. నేడు గుమ్మ పాలు పోయి బొమ్మ పాలు మనకు దిక్కయ్యాయి.
ఏ కాలంలో లభించే వస్తువు ఆ కాలంలో తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నేటి పిల్లలకు వీటి గురించి తెలియదు. యువత అంతా చాట్ బండ్ల చుట్టూ చేరుతున్నారు. అంత చిన్న వయసులో ఆ మసాలా దినుసులు శరీరానికి ఎంతవరకు మేలు చేస్తాయి అనే విషయం ఆలోచించుకోవాలి.
పిల్లలకు ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. వీధి బండ్ల దగ్గర తినే అలవాటు మాన్పించాలి. చక్కగా ఇంటిలో రుచికరంగా, పరిశుభ్రంగా చేసి పెట్టాలి. ఆధునిక వంటకాలను అలవాటు చేయకుండా, శరీరానికి మేలు చేసే పదార్థాలను బలవంతంగా అయినా అలవాటు చేయాలి.

రోజులను బట్టి ఏదైనా మితంగా తింటే తప్పు లేదు. కానీ ప్రతిరోజూ అదే పనిగా తింటే మూల్యం చెల్లించక తప్పదు.

పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు మంచి నడవడికతో పాటు, మంచి ఆహారపు అలవాట్లు కూడా నేర్పవలసినది తల్లిదండ్రులే. జ్ఞానం లేని పిల్లలు దేనికి పడితే దానికి ఆకర్షింపబడతారు. దానికి తోడు హాస్టల్లో చదివించే విద్యార్థుల పరిస్థితి కూడా అంతే.

ఆరోగ్యమే మహాభాగ్యం.
ఆరోగ్యం అంటేనే ఆహారపు అలవాట్లు. భావి భారత పౌరులందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వానిదీ కూడా. విపరీతంగా పుట్టుకొస్తున్న హోటల్స్‌లో, రోడ్డు పక్కన ఉన్న బండ్లపై అమ్మే ఆహార పదార్థాలపై ఖచ్చితమైన తనిఖీ చేయాలి. తనిఖీ లేకపోతే భయం ఉండదు. భయం ఉంటేనే నాణ్యత ఉంటుంది.

ప్రజలు కూడా పరిసరాలను గమనిస్తూ, పరిశుభ్రంగా ఉండే చోటే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అవసరమైన చోట ప్రశ్నించాలి. పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదు. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.

తస్మాత్ ఆరోగ్యం జాగ్రత్త!


---

✍️ రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
📍 కాకినాడ
📞 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం