ఆడజన్మ

ఆడజన్మ 

సరోజ గారు ఎవరండీ మేడం గారు మిమ్మల్ని పిలుస్తున్నారంటూ డాక్టర్ గారి గదిలోంచి బయటికి వచ్చిన 
నర్సు గట్టిగా పిలిచింది.

నేనేనండి ఒక సుమారు 30 సంవత్సరముల వయస్సు గల యువతి చేతిలో ఒక ఫైల్ తో డాక్టర్ గారు గదిలోకి అడుగు పెట్టింది.

అది ఒక ప్రసూతి ఆసుపత్రి. డాక్టర్ శ్వేత గైనకాలజిస్ట్ గా చాలా మంచి పేరుంది. వచ్చిన పేషెంట్లను చాలా మంచి హృదయంతో గౌరవంగా ట్రీట్మెంట్ ఇస్తుంది. పేషంట్ల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతుంది. పైగా నార్మల్ డెలివరీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే హాస్పటల్ ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది.

పురుడు అంటే పునర్జన్మంటారు. ఆడపిల్ల నెలతప్పిన రోజు దగ్గరనుంచి ఈ రోజుల్లో ప్రతి నెల డాక్టర్ చెకప్ కి తిరగడం స్కానింగ్లు తిరగడం తప్పనిసరి. రోజులు అలా ఉన్నాయి

నమస్తే మేడం అంటూ రెండు చేతులు జోడించి డాక్టర్ గారికి నమస్కారం చేసింది సరోజ. చెప్పండి అంటూ డాక్టర్ గారు తలపైకి ఎత్తి చూశారు.
నా పేరు సరోజ మాది పక్క ఊరు మా ఆయన ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా రు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మళ్లీ ఇప్పుడు నేను అంటూ చేతుల్లోని ఫైలు డాక్టర్ గారు చేతిలో పెట్టింది. డాక్టర్ గారు ఫైల్ అంతా చూసి సరోజ కేసి ప్రశ్నార్ధకంగా చూశారు.

నాకు ఇంకా ఈ పిల్లల్ని పెంచే స్తోమత లేదు. మా ఆయన సంపాదనతో మా ఇల్లు గడవడం కష్టం అయిపోతోంది.మళ్లీ ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుంది అని స్కానిం కగ్ లో వచ్చింది. మగ పిల్లాడు అయితే అప్పో సొప్పో చేసి పెంచుకుందామని అనుకున్నాము.అందుకని మీరు ఎలాగైనా నాకు అబార్షన్ చేయాలి అంటూ పర్సులోంచి ఓ నోట్లకట్ట తీసి టేబుల్ మీద పెట్టింది.

అమ్మా మీరు చాలా బలహీనంగా ఉన్నారు. రక్తం చాలా తక్కువగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే, ఆడపిల్ల పుడుతుంది అనే కారణంగా అబార్షన్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. అది నీకు నాకు కూడా సమస్య తెచ్చిపెడుతుంది. అంతే కాదు నీ ప్రాణాలకి ప్రమాదం. మీరు మరొకసారి ఆలోచించండి. ఒక్కసారి ఫోటో చూడండి అంటూ స్కానింగ్ ఫోటో నా చేతిలో పెట్టింది. అందులో లీలగా ఒక చిత్రం కనబడింది . రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నట్టుగా
ఒక బొమ్మ కనబడుతోంది.

. నా మనసు ఎటో పోయింది. నన్ను చంపొద్దు మహాప్రభో. రక్షించండి అంటూ ప్రార్ధించినట్లుగా ఉంది.నాకు గుండెల్లో నుంచి దుఃఖం వచ్చింది. 
అటు చూస్తే చాలీచాలని సంపాదన. ఇటు చూస్తే ఈ శిశు హత్య ఎటు తోచక చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయాను. డాక్టర్ గారు ఇలా చెప్పడం ప్రారంభించారు.

ఒక స్త్రీకి సంతానం కలగడం అనేది ఒక అదృష్టం ఒక వరం.
మాతృత్వంలో ఒక తీయని అనుభూతి ఉంది. అది అనుభవిస్తే కానీ అది ఎంత గొప్పదో మనం చెప్పలేం, చాలామందికి పిల్లలు పుట్టక గుడులు గోపురాలు పుట్టలు గుట్టలు తిరుగుతున్న వాళ్లను చూస్తున్నాం. డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. పిల్లలు పుట్టించడానికి ప్రత్యేకమైన ఆసుపత్రులు వెలిసాయి. ప్రత్యేకమైన పరిశోధనలు జరుగుతున్నాయి. టెస్ట్ ట్యూబ్ బేబీలు సంగతి రోజు వింటూనే ఉన్నాం. 
సహజంగానే పుడుతున్న పిల్లల్ని మధ్యలోనే ఇలా చంపేయడం ఎంతవరకు సమంజసం. కానీ కుదరదు మేడం పరిస్థితి అంటూ
చెప్పిన సరోజ సమాధానం విని డాక్టర్ గారు అయితే నువ్వు నా మాట ఒకటి విను. నీకు ఉచితంగా వైద్యం చేస్తాను మందులు కూడా ఉచితంగా ఇస్తాను. ఆహారం కూడా మా హాస్పిటల్ లో పెడతారు.
అయితే నువ్వు పుట్టబోయే బిడ్డని ఒకరికి దత్తత ఇవ్వాలి. వాళ్లు చాలా రోజుల నుంచి నా దగ్గరికి పిల్లల కోసం తిరుగుతున్నారు. వాళ్లు చాలా ధనవంతులు. బిడ్డకి లోటు రాకుండా చూసుకుంటారు. 
పైగా వాళ్ళు మాకు దగ్గర బంధువులు కూడా. ఆవిడకి ఉన్న లోపం కారణంగా ఆవిడకి ఎప్పటికీ పుల్లలు పుట్టారు. వాళ్లకి ఆడపిల్ల మగపిల్లలనీ తేడా లేదు. ఎవరో ఒకరు సంతానం కావాలి. 
దత్తత కూడా రిజిస్టర్ చేసుకుంటారు. ఆర్థికంగా కూడా ఆ పిల్లకి భరోసా ఇస్తారు. ఒకవేళ పిల్ల పుట్టిన తర్వాత నువ్వు మనసు మార్చుకుంటే వాళ్లకి ఏమీ అభ్యంతరం లేదు. ఆ విషయం కూడా వాళ్ళు డాక్యుమెంట్ పరంగా రాసిస్తారు.నువ్వు మీ భర్త తోటి ఆలోచించి నిర్ణయం రేపు చెప్పు అని చెప్పి డాక్టర్ గారు ఫైలు చేతికి ఇచ్చేశారు.

ఆటోలో ఇంటికి బయలు దేరిన సరోజ ఆలోచనలో పడింది. భర్తకి ఈ విషయం ఎలా చెప్పాలి . ఆయన ఏ రకంగా తీసుకుంటాడో. అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ దత్తత అంటే ఏమంటాడో అనీ ఆలోచించుకుంటూ ఉండగా ఇంటి ముందు ఆటో దిగి గుమ్మం లోకి అడుగుపెట్టింది.
భర్త ఎదురు వచ్చి చేతిలోని స్కానింగ్ ఫైల్ అందుకుని మంచినీళ్లు గ్లాసు చేతులో పెట్టాడు. అన్నం తిన్నారా అని ప్రశ్నించింది. లేదు నువ్వు వచ్చాక ఇద్దరం కలిపి తిందాం అని ఊరుకున్నాను అన్నాడు భర్త రామారావు.

భార్య భర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేసి వంటిల్లు సర్దుకుని మంచం మీద నడుం వాల్చారు. పిల్లల అప్పటికే మంచం మీద నిద్రపోతున్నారు. సరోజ డాక్టర్ గారు ఏమన్నారు? అబార్షన్ కి డేట్ ఫిక్స్ చేశారా? అంటూ భార్యని ప్రశ్నించాడు రామారావు. డాక్టర్ గారు చెప్పిన విషయం అంత విపులంగా చెప్పింది భర్తకి సరోజ

రామారావు మౌనంగా ఆలోచనలో పడిపోయాడు. అబార్షన్ అంటే ఒక ప్రాణిని హత్య చేయడమే. మరి దత్తత ఇవ్వడం అంటే మనకి ఆ పాపతోటి ఏ సంబంధం ఉండదు. మన ప్రాణం ఎవరో తీసుకుపోతున్నట్లు అనిపిస్తుంది. ఆడపిల్లకు పెళ్లి చేసి వేరొకరింటికి పంపితేనే తండ్రి తల్లడిల్లిపోతాడు. దత్తత ఇచ్చేస్తే మనం కడుపున పుట్టిన పిల్లలకి మనం తల్లిదండ్రులం కాము. మన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు వేరొకరిని అమ్మానాన్న అని పిలుస్తారు. మన పేర్లు ఎక్కడ రికార్డుల్లో ఉండవు. ఇది కూడా ఒక నరకమే. అయినా పరిస్థితులు ఎటువంటి త్యాగానికైనా మనుషుల్ని తయారు చేస్తాయి. భార్య సరోజ కూడా చాలా బలహీనంగా ఉంది. పురుడొచ్చే వరకు మంచి పోషకాహారం మందులు ఇప్పించే పరిస్థితి లేదు. అందుకేనేమో దేవుడు ఇలా మార్గం చూపించాడు అనుకుంటూ సరే మంచి రోజు చూసుకుని హాస్పిటల్లో జాయిన్ అవుదువు గాని అంటూ భార్యకు చెప్పి కళ్ళు మూసుకుని నిద్రలోకి ఉపక్రమించాడు.

మర్నాడు ఉదయమే రామారావు పంతులు గారి దగ్గరికి పోయి
ఆదివారం నాడు ముహూర్తం నిర్ణయించి పక్క ఊరు నుంచి అత్తగారిని రప్పించి మూట ముల్లె సర్దుకుని హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ గారితో విపులంగా మాట్లాడి సరోజినీ జాయిన్ చేసి కంపెనీకి వెళ్ళిపోయాడు రామారావు.

సరోజినీకి జనరల్ వార్డులో పదో నంబరు బెడ్ కేటాయించారు
పొద్దున్న సాయంకాలం డాక్టర్ గారు వచ్చి పరీక్షలు చేసి మందులు ఇచ్చి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. డాక్టర్ గారే ప్రత్యేకత చూపిస్తుంటే మిగతా హాస్పిటల్ సిబ్బంది కూడా టైంకి అన్ని అందిస్తున్నారు. ఇది ఏ జన్మల బంధమో. ఏ పూర్వ పుణ్యఫలమో . ఈ కలికాలంలో కూడా ఇటువంటి డాక్టర్ గారు దొరకడం చాలా అదృష్టం. ఆహార విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ. ఇంటి దగ్గర ఉంటే అటువంటి ఆహారం దొరకదు అనుకుంటూ ఉండగా రామారావు వచ్చి ఎలా ఉన్నావ్ అని భార్యను ప్రశ్నించాడు. భార్యకు సహాయంగా రాత్రి హాస్పిటల్ లో వరండాలో బల్లమీద రామారావు పడుకుంటాడు. తెల్లవారి ఇంటికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ తిని కంపెనీకి వెళ్ళిపోతాడు

ఇలా నాలుగు నెలలు గడిచిపోయాయి. పురిటి సమయం కూడా దగ్గర పడుతోంది. సరోజలో టెన్షన్ మొదలైంది. ఈలోగా పిల్లని దత్తత చేసుకునే వాళ్లు వచ్చి అగ్రిమెంట్ మీద భార్యాభర్తలు ఇద్దరు చేత సంతకం చేయించుకుని రామారావుకి సరోజ అిదుకి చదివి వినిపించి వెళ్లిపోయారు. ఆ దంపతులిద్దరూ బాగా డబ్బున్న వాళ్ళు అనుకుంటా. మెడలకి చేతులకి అంతా బంగారమే. ఆయన కూడా దొరబాబులా ఉన్నాడు. ముందుగానే డాక్టర్ గారు చెప్పిన ప్రకారం పురుడు వచ్చిన తర్వాత సరోజ రామారావు దంపతులకు దత్తత ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ అగ్రిమెంట్ చెల్లదు అని వ్రాసి సంతకాలు పెట్టి ఇచ్చారు దంపతులిద్దరూ .
ఇంత దయామయులు ఎక్కడ దొరుకుతారు అనీ సరోజ ఆలోచిస్తుండగా కడుపులో నొప్పి ప్రారంభమైంది. నొప్పులు తొందర తొందరగా వస్తున్నా యి. నర్సు డాక్టర్ గారి ఆజ్ఞ ప్రకారం
సరోజిని లేబర్ రూమ్ లోకి తీసుకువెళ్లింది. పెద్ద పెద్ద కళ్ళు నల్లటి జుట్టు పొడుగాటి కాళ్లు చేతులు మంచి తెల్లటి రంగు తో ఆడపిల్ల పుట్టింది. రామారావుకి ఫోన్ చేసి చెప్పారు.

రామారావు హాస్పిటల్ కి వచ్చేటప్పటికి సరోజిని బెడ్ మీద, చంటిపిల్ల ఉయ్యాలోను నిద్రపోతున్నారు. పిల్లల్ని చూడగానే రామారావు మనసంతా ఎటో పోయింది. పిల్ల దిష్టి తగిలేలా ఉంది. ఈ పిల్లను వదిలేసి మనం ఉండగలమా. అసలు చంటి పిల్ల ఉన్న ఇల్లు ఎంత సందడిగా ఉంటుంది . టైమంతా దాంతోటే గడిచిపోతుంది. ఇలాంటి పిల్లల్ని ఎవరికి ఇవ్వగలం. అసలు ఆడపిల్ల గురించి తన ఆలోచన విధానం అంతా తప్పు. ఆడపిల్లలంటే ఖర్చు అని కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేయాలని భార్యని అబార్షన్కి ఒప్పించాడు. అసలీ పిల్ల ఎదిగేటప్పటికీ దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో . ఇప్పటికే ఆడపిల్లలు దొరకడం లేదు అనీ ఆలోచించుంటూ రామారావు మనసంతా కకావికలం అయిపోయింది.

ఇంతలో సరోజ కళ్ళు తెరిచింది. ఎలా ఉంది ఒంట్లో అని ప్రశ్నించాడు. బాగానే ఉంది అని పిల్లని చూసారా అని ప్రశ్నించింది సరోజ భర్తని. దానికే చందమామలా ఉందని భార్యకు సమాధానం చెప్పి భార్యతో చాలాసేపు మాట్లాడి
ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసాడు.

సరోజ కు డెలివరీ అయ్యి నాలుగు రోజులు అయ్యింది. నార్మల్ డెలివరీ మూలంగా ఐదో రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేసారు. రామారావు తల్లి పిల్ల తో సహా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పి వస్తుండగా మీరు వచ్చే నెలలో రెడీగా ఉండండి. వాళ్లు దత్తత ముహూర్తం పెట్టించుకుని కబురు చేస్తారు అంటూ చెప్పారు రామారావు తోటి డాక్టర్ గారు. సరే మేడం అంటూ బయటికి వచ్చేసి తల్లినీ పిల్లని తీసుకుని ఆటోలో ఇంటికి వచ్చేసాడు రామారావు.

రోజులు గడుస్తున్నా యి. చంటి పిల్ల తోటి సమయం తెలియడం లేదు. పిల్ల కూడా ఒళ్ళు చేసి నుదుటిన అగరబొట్టు , బుగ్గన చుక్కతో పిల్ల మెరిసిపోతోంది.సరోజ ఆరోగ్యం రోజురోజుకీ మెరుగుపడు తోంది. కానీ సరోజ దిగులుగా ఉంటోంది. 
ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలాగా ఆలోచిస్తూ ఉంటోంది సరోజ.సరోజ మనసు అర్థం చేసుకున్నాడు రామారావు.దత్తత ముహూర్తం కూడా పెట్టించి వాళ్లు కబురు చేశారు . ఉన్నట్టుండి రామారావు ఒకరోజు మధ్యాహ్నం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి పద డాక్టర్ గారికి దగ్గరకు వెళ్దాం పిల్లని తయారు చేయి అంటూ బ్యాగ్ పట్టుకుని బ్యాగ్ లో కాగితాలు పెట్టుకుని ఆటోలో ముగ్గురు బయలుదేరి వెళ్లారు హాస్పిటల్ కి.

సరోజ ఎందుకు ఏమిటి అని అడగలేదు. డాక్టర్ గారు పిలుస్తున్నారు రండి అంటూ నర్సు తీసుకెళ్ళింది. ఆ ఎలా ఉంది పిల్ల ?మీ ఆరోగ్యం ఎలా ఉంది ? అంటూ పిల్లని తల్లిని పరీక్షించింది డాక్టర్ గారు. 
ఇంతలో రామారావు బ్యాగ్ లో నుంచి మూడు వందల కట్టలు అంటే సుమారుగా మూడు లక్షల రూపాయలు డాక్టర్ గారి టేబుల్ మీద పెట్టాడు. డాక్టర్ గారు ప్రశ్నార్థకంగా చూశారు. మేడం మమ్మల్ని క్షమించాలి మేము పిల్లని దత్తత ఇవ్వడంలేదు.ఆబంగారుతల్లినిమేమువదులుకోదల్చుకోలేదు.
ఎలాగైనా కష్టపడి పిల్లల్ని పెంచుకుంటాను. అసలు ఆడపిల్లను గొంతు పిసికి చంపమని మీకు చెప్పినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. దత్తత తీసుకోబోయే వారి కూడా ఈ విషయం మేము ఇంటికి వెళ్లి చెప్తాం. క్షమాపణ కోరుకుంటాం అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు మీరు మా సరోజికి ఉచితంగా వైద్యం చేశారు. అందుకు ఫీజు ఈ మూడు లక్షలు తీసుకోండి అంటూ డాక్టర్ గారిని వేడుకున్నాడు. 

మీరిచ్చినధైర్యంవలనేఈపసిప్రాణంఈలోకంలోకివచ్చిందిఅంటూ కృతజ్ఞతలు తెలిపాడు. అందరూ కత్తులు దూసి ఆడపిల్ల పీక కోసేందుకు తయారవుతున్న ఈ కాలంలో మీ వంటి డాక్టర్ దొరకడం మాకు అదృష్టం. సాంకేతికత పెరగడం ఆడపిల్ల చావుకు వచ్చింది అంటూ రామారావు డాక్టర్ గారికి రెండు చేతులెత్తి నమస్కరించాడు.

రామారావులో వచ్చిన మార్పుకి డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపడ్డారు. కేవలం ఒక చిన్న మాటతో. తన వృత్తి పరంగా చేసిన సహాయంతో ఒక ఆడపిల్ల ఈ లోకంలోకి వచ్చింది. ఒక జీవితం నిలబడింది. ఆ హాస్పిటల్ లో ఎంతోమంది పురుడు పోసుకుని వెళ్తుంటారు. ఆడపిల్ల పుట్టిందంటేనే అంత ఉత్సాహంగా ఉండరు. ఏమిటో తేడా అని మనసులో అనుకుంటూ తృప్తిగా ఊపిరి పీల్చుకుంది . దత్తత తీసుకోబోయే వారికి కూడా ఈ విషయం అంతా చెప్పి మరోచోట ప్రయత్నిద్దాం లెండి అంటూ డాక్టర్ గారు ఫోన్ పెట్టేశారు. రామారావు డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకునిభార్యని పిల్లని తీసుకుని ఆటో ఎక్కాడు.

దారిలో భార్య సరోజ రామారావును ప్రశ్నించింది. ఏవండీ అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు. ఏమైనా అప్పు చేశారా నిజం చెప్పండి అంటూ నిలదీసింది భర్తని. లేదు సరోజ నేను ఎక్కడ అప్పు చేయలేదు. డబ్బు మీ అమ్మగారు ఇచ్చారు ఇవాళ ఉదయం. నేను మన ఇల్లు అమ్మేద్దాం అనుకున్నా. 
అదే విషయం అత్తయ్యతో చెప్పాను. అత్తయ్య వెంటనే తన ఒంటి మీద ఉన్న బంగారం యిచ్చి దీని అమ్మేసి హాస్పిటల్ ఫీజు కట్టు నాయనా ఎప్పటికైనా ఇది నీ పిల్లలకు ఇచ్చేదే. ఆ పసి ప్రాణం నిలబడిందంటే ఆ డాక్టర్ గారి మాట వల్లే. నాకు కూడా వయసు అయిపోయింది. నేను కూడా నా ఆస్తి ఒక మంచి పనికి ఇచ్చాను అని తృప్తితో చనిపోతాను అంటూ చెప్పింది. సరోజ కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. సరోజి తల్లి చిన్నప్పుడే చనిపోతే రెండో పెళ్లి చేసుకున్నాడు తండ్రి. సరోజకి ఈవిడ సవితి తల్లిఅవుతుంది

ఆడదానికి ఆడది శత్రువు అంటారు. కానీ ఒకరు కాదు ఇద్దరు స్త్రీలు చేసిన సహాయం ఒక ప్రాణం నిలబడింది.దేవుడు ఎక్కడో ఉండడు. మనుషుల్లోనే ఉంటాడు అంటూ రామారావు పిల్లకి నామకరణ మహోత్సవం ఏర్పాటు చేసుకుని డాక్టర్ గారి పేరు సరోజ సవితి తల్లి పేరు కలిపి వచ్చేలా శ్వేత ప్రసూన అనీ పేరు పెట్టాడు. ముగ్గురు ఆడపిల్లలను చూసి నాకు ముగ్గురు మహాలక్ష్మిలు అంటూ ఆనందంగా కాలం గడపసాగాడు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
           కాకినాడ 949179279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం