సాయం
సాయం
మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ఎప్పుడు సాయంత్రం ఐదు గంటలకు కానీ రాని పనిమనిషి రత్తమ్మ రావడం చూసి "ఏమిటి రత్తాలు తొందరగా వచ్చేసావు ఇవాళ అని అడిగింది .సుభద్రమ్మ. రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కదా అందుకే తొందరగా వచ్చి ఉంటుంది అనుకుంది సుభద్రమ్మ. గోదావరి మంచి పోటు మీద ఉంది. సాయంకాలానికి మన ఊళ్లో కి రావచ్చని కొంపలన్ని ఖాళీ చేయమని ప్రెసిడెంట్ గారు టముకు వేయించారు కదమ్మా. అందుకనే చీకటి పడకుండా సామాన్లు పిల్లల్ని తీసుకుని పక్కనున్న మా అత్తవారు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ము. మరి ఎలా వెళ్తారు? అని అడిగింది సుభద్రమ్మ. మన ఊర్లోకి పడవలు వచ్చాయి.వాడు అడిగినంత ఇచ్చి బయటపడదాము అనుకుంటున్నా ము అంటూ చెబుతున్న రత్తమ్మ మాటలకి ఒక్కసారి ఆలోచనలో పడింది సుభద్రమ్మ.
అది గోదావరి పక్కనున్న శుద్ధ పల్లెటూరు. ఊళ్లో అందరూ మోతుబరి రైతులే . పిల్లలంతా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో సెటిల్ అయిపోయారు.తాతల నాటి ఆస్తులు ఇల్లు వదల్లేక ఆ ఊర్లోనే కాలక్షేపం చేస్తున్నారు ఆ తరం వాళ్లు. కోనసీమ గురించి అందంగా చెప్పుకుంటాం గాని పాపం వర్షాకాలం వచ్చిందంటే వాళ్లకి ఎంతో కష్టం. గోదావరి రోజుకు ఒకసారి భయపెడుతూనే ఉంటుంది.
ఆషాడ మాసం నుంచి భాద్రపద మాసం వరకు కొన్ని ఊర్లకి వరద గండమే. వరద వచ్చిందంటే వాళ్ళ కష్టాలు నిజానికి దేవుడికే ఎరుక. ప్రాణ భయంతో అటు ఇటు పరిగెడతారు. గవర్నమెంట్ వారికి ఇచ్చే సహాయం తప్పితే తిండి తిప్పలు వేళకి ఉండవు. దానికి తోడు చలి. ఇటువంటి కష్టాలు పగవాడు కూడా వద్దు అనుకుంటా రు ఆ ఊరి జనం. ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరించింది సుభద్రమ్మకి. పాపం ఈ వర్షం లో ఆ పిల్లలను పట్టుకుని చేతికి అందిన సామాను పట్టుకుని ఆ పక్క ఊరికి పోతే వాళ్లది కూడా గుడిసె. నించోడానికి కూర్చోడానికి కూడా చోటు ఉండదు పాపం వీళ్ళకి అని ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది సుభద్రమ్మ.
ఒసేయ్ రత్తమ్మ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన అవుట్ హౌస్ ఖాళీ చేయిస్తా. అందులో పిల్లల్ని పెట్టుకుని ఉండండి. ఎక్కడికో ఎందుకు పోవడo. గదులకు తాళాలు వేసుకుంటాం. హాలును ఆ వంటిల్లు వాడుకుందురుగాని బయట స్నా నాలు గది మరుగుదొడ్డి ఉంది కదా మీకు ఏ ఇబ్బంది లేదు నువ్వు సామాన్లు తీసుకుని పిల్లల్ని తీసుకుని వచ్చేయి నాకేమీ ఇబ్బంది లేదు అంటూ చెప్పిన సుభద్రమ్మ లో దేవుడు కనిపించడు రత్తమ్మకి. ఇంకేమీ మాట్లాడకుండా గబగబా ఇంటికి వెళ్లి ముఖ్యమైన సామాన్లు పక్క బట్టలు తీసుకుని భర్తని పిల్లల్ని తీసుకుని అవుట్ హౌస్ లో వచ్చేసింది రత్తమ్మ.
హాల్లోకి రాగానే ప్రాణం చాలా హాయిగా అనిపించింది. బయట అసలే చలిగా ఉందేమో లోపలికి రాగానే వెచ్చగా అనిపించింది. అప్పటికే నాలుగు తాటాకు చాపలు నేల మీద వేసి ఉన్నాయి. పిల్లలందరికీ దుప్పటి కప్పి పడుకోబెట్టింది. వర్షం బాగా పెరిగింది. పశువులకు మేత వేసి వస్తాను అని చెప్పి అవుట్ హౌస్ వెనుకనున్న పాకలోకి వెళ్ళాడు రాములు. సరే తలదాచుకోవడానికి చోటు దొరికింది. మరి పిల్లల ఆకలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంది రత్తమ్మ. ఇంతలో "ఒసేయ్ రత్తమ్మ అంటూ సుభద్రమ్మ గారి గొంతు వినపడేసరికి గొడుగు వేసుకుని ఆ పెద్దింట్లోకి వెళ్ళింది. చూడు ఈ క్యారేజీలో అన్నం పప్పు పులుసు ఆవకాయ మజ్జిగ ఉంది పిల్లలకు పెట్టి మీరు తినండి అంటూ చెప్పిన సుభద్రమ్మ మాటలకి రత్తమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. క్యారేజీ తీసుకుని అవుట్ హౌస్ లోకి వచ్చేటప్పటికి రాములు కూడా నీరసంగా అలా చాప మీద పడుకుని ఉన్నాడు. ఎప్పుడో మధ్యాహ్నం తిన్న అన్నం. దానికి తోడు వరద టెన్షన్. అందరికీ నీరసాలు వచ్చేసేయ్. సుభద్రమ్మ గారు ఇచ్చిన క్యారేజీ ఐదు నిమిషాల్లో ఖాళీ అయిపోయింది.
అమ్మో ఈ వర్షంలో పక్క ఊరిలో ఉన్న అత్తారింటికి వెళ్తే కడుపునిండా కూడా తిండి ఉండేది కాదు. పడుకోడానికి చోటు ఉండదు. వాళ్లది పూరిపాక. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ప్యాకెట్ల కోసం ఎదురు చూడటo తప్పితే వేరే దిక్కు లేదు. పోనీ ఊర్లో ఉన్న హై స్కూల్లో తలదాచుకుందాo అంటే ఊరంతా అక్కడే ఉంటారు. ఉన్నది ఒకటే మరుగుదొడ్డి. అందరికీ అదే ఆధారం. పిల్లలతోటి ఉన్నాం కదా ఏ రోగాలు వస్తాయని భయం
అక్కడ రకరకాల మనుషులు ఉంటారు.
అందరూ ఆరోగ్యవంతులే ఉండరు. ఒకే గదిలో ఇరవై మంది ఉంటారు. ఒక్కసారి గవర్నమెంట్ వారి అన్నం ప్యాకెట్లు వ్యాన్ వచ్చిందంటే అందరూ కుక్కల్లా దెబ్బలాడుకుంటారు. ఎవరి ఆకలి వారిది. అందరినీ కూర్చోబెట్టి బంతి భోజనాలు పెట్టే నాధుడు ఎవరు ఉంటారు. అంతా అరణ్య రోదన. ఇదే సందు దొరికిందని దోచుకునే వాళ్లు ఎంతమందో. శవాల మీద జల్లే డబ్బులు ఏరుకునే జనం ఎంతమందో ఈ లోకంలో. ఏ దేవుడు కరుణించాడో తెలియదు గాని అమ్మగారు రూపంలో సాయం చేశాడని మనసులోనే కనిపించని దేవుడు దండం పెట్టుకుని పడుకుంది రత్తమ్మ
రత్తమ్మ భర్త రాములు కూడా సుభద్రమ్మ పొలంలోనే పనిచేస్తాడు
పైగా డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ దంపతులు ఇద్దరినీ రాములే తీసుకెళ్తుంటాడు. ఇలా నాలుగు రోజులు గడిచే యి. ఆ నాలుగు రోజులు ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంది సుభద్రమ్మ. ఈలోగా విదేశాల్లో ఉన్న సుభద్రమ్మ కొడుకులిద్దరూ వరద వివరాలు తెలుసుకుంటూ తమ ఇద్దరికీ గ్రీన్ కార్డు వచ్చిందని ఇండియా వచ్చే ప్రసక్తే లేదని అక్కడున్న పొలంపుట్రా అమ్మేసి ఇక్కడికి వచ్చేయoడని అంటూ గట్టిగా చెప్పారు. సుభద్రమ్మ ఏమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. ఏదో చుట్టపు చూపుగా మూడు నెలలు వెళ్తేనే అక్కడ ఏమీ తోచేదికాదు. ఇప్పుడు నిజంగా అక్కడికి వెళ్తే పిచ్చెక్కిపోతోంది. పైగా కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలు. ఇంట్లో ఎవరూ ఉండరు.
పైగా ఇక్కడ ఉండిపోతే రేపొద్దున కాలు చేయి వంగితే ఎవరు చూస్తారు. అది కూడా ఒక సమస్య. ఈ వయసులో ఎవరో ఒక సహాయం ఉండాలి. ఊరు నిండా చుట్టాలు ఉంటారు కానీ కనిపించినప్పుడు నవ్వుతూ మాట్లాడతారు కానీ అడిగితే కానీ ఏ పని చేసి పెట్టరు. దేశం కానీ దేశంలో ఎవరు ఖాళీగా కూడా కనిపించరు. అందుకే మనకంటూ చేతి కింద ఒక మనిషిని పెట్టుకుంటే ఏ సమస్య ఉండదు. ఈ వయసులో అదే మంచిది.
ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటూ ఆ విషయం ఆ రాత్రి భర్త శ్రీనివాస్ కి చెప్పింది. సుభద్రమ్మ మాటకి శ్రీనివాస్ కూడా అంగీకారం తెలిపాడు.
ఈలోగా వరద తగ్గుముఖం పట్టింది. గోదావరి తల్లి శాంతించింది. "అవును వరద తగ్గిపోయింది కదా రాములు కుటుంబం ఇంకా మన ఇంట్లోనే ఉన్నారు ఏమిటి అంటూ భర్త అడిగిన ప్రశ్నకి ఉండనివ్వండి మన ఇల్లేనా అరిగిపోతుందా కరిగిపోతుందా పాపం మన మీద ఆధారపడి ఉన్నవాళ్లు మనం కాకపోతే ఎవరు చూస్తారు? అయినా ప్రతి ఏ ట వరద వస్తూనే ఉంది . పిల్లలతో వాళ్ళు ఎలా ఇబ్బంది పెడతారు అందుకే వాళ్లని పెర్మనెంట్ గా మన అవుట్ హౌస్ లో ఉండిపొమ్మని చెప్పుతాను అంటూ సమాధానం చెప్పిన సుభద్రమ్మ మాటల్లో అంతరార్థం అర్థం కాలేదు శ్రీనివాసుకి చూడండి మనకి వయసు మీరి పోతో oది. పిల్లలు ఇద్దరు అమెరికా నుంచి ఇక్కడికి రానని చెప్పేశారు. మనము అక్కడికి వెళ్లి ఉండలేం. మనకంటూ ఒక సాయం ఉండాలి. అర్ధరాత్రో అపరాత్రో ఏ అవసరం వస్తుందో ఎవరికి తెలుసు?
అందుకే సాయంగా వాళ్లని ఉంచుకుందామండి . వాళ్లు మనకు సహాయం మనం వాళ్లకు సాయం. రేపటి నుంచి మనం ఏమి పెట్టక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళ వంట వాళ్ళు వండుకు తింటారు. ఏదో కష్టం వచ్చినప్పుడు కదా సాయం చేయవలసింది అంటూ చెప్పిన సుభద్రమ్మ మాటల్లో నిజాన్ని గ్రహించాడు శ్రీనివాసు.
"అమ్మ వరద తగ్గిపోయింది మా ఇంటికి మేము వెళ్ళిపోతాం అటు పొద్దున్నే చెప్పిన రత్తాలు మాటలకి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అది మీ సొంత గుడిసె కూడా కాదు గవర్నమెంట్ స్థలం రేపు మా పో వాళ్లు ఖాళీ చేసే మంటారు.
అందుకుని మీరు ఈ అవుట్ హౌస్ లోనే ఉండి పొండి. ఎలాగు మీరిద్దరూ మా దగ్గరే పని చేస్తున్నారు కదా అని చెప్తున్న సుభద్రమ్మ మాటలకి రాములు రత్తమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుని కాళ్ళ మీద పడ్డారు.
ఈ కథలో సుభద్రమ్మ స్వార్థంతో ఈ పని చేసిందని అందరూ అనుకుంటాం. సుభద్రమ్మ శ్రీనివాస్ దంపతులకు కావలసినంత ఆస్తి ఉంది. రెండు అంతస్తుల ఇల్లు ఉంది . కానీ వయసు ముదిరే కొద్ది ఆ దంపతుల్ని ఒంటరితనం వయసు ప్రభావంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం పట్టుకుంది.
ఇప్పుడు కావాల్సింది ఒక మనిషి సహాయం. అది ఎవరైతే ఏంటి అవసరానికి ఆదుకునే మనిషి కావాలి. పిలిస్తే పలికే మనిషి ఎంత డబ్బున్న మనం ఆత్మీయంగా ఎవరినైనా దగ్గరికి తీసుకుపోతే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళు అయినా మన కేసి చూడరు . ఈ వయసులో. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని సామెత ఉంది అది సుభద్రమ్మ ఆలోచన.ఎవరికైనా కావలసిన సహాయం చేసి మనం వాళ్ల దగ్గర నుండి సహాయం తీసుకోవడంలో తప్పు లేదని ఆమె అభిప్రాయం.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి