కర్తవ్యం
కర్తవ్యం
"
రోజంతా మీకు చాకిరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఏమి వినపడదు కనపడదు. చెప్పిన మాట అర్థం చేసుకోరు. నాకు వయసు అయిపోతుంది అంటూ పొద్దున్నే అత్తగారి మీద గట్టి గట్టిగా కేకలు వేస్తున్న పార్వతమ్మ మాటలకి మెలకువ వచ్చింది కోడలు రాజ్యలక్ష్మి కి. పార్వతమ్మ అత్తగారు సుందరమ్మ గారు మంచం పట్టి చాలా రోజులైంది. పాపంఈలోగా పార్వతమ్మ గారి భర్త కూడా చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకు రాజేష్ కి రాజ్యలక్ష్మి ఇచ్చి పెళ్లి చేసి కొత్త కోడల్ని కాపురానికి తీసుకొచ్చి రెండు నెలలు అయింది. ప్రతిరోజు పొద్దున్న ఇదే వరుస. సుందరమ్మ గారిని చూస్తే జాలేస్తోంది రాజ్యలక్ష్మి కి.
ఆ లంక అంత కొంపలో ఆ మూల గదిలో ఒక నులక మంచం. ఆ నులక మంచ o మీద సరి అయిన దుప్పటి ఉండదు. సుందరమ్మ శుభ్రమైన బట్ట కట్టుకుని ఎన్ని రోజులైందో. సుందరమ్మ గారి నీ ఆదరించిఅన్నం పెట్టడం చూడలేదు రాజ్యలక్ష్మి. నిజానికి ఆర్థికంగా సుందరమ్మకి లోటు లేదు. ఇంట్లో అందరూ వెండి కంచాలలో భోజనం చేస్తారు. కానీ ఆ సుందరమ్మ కి సత్తు కంచంలో అన్నం కలిపి పెడుతుంది
పార్వత మ్మ.
ఆ తరం వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉండేవి . అంటే ఆ ముసలి వాళ్లు పోయిన తర్వాత వాళ్లు ఉపయోగించిన వస్తువులన్నీ ఇచ్చేయాలి ,అందుకోసమే ఖరీదైన వస్తువులేవి చివరి దశలో వాళ్ళ కోసం ఉపయోగించేవారు కాదు. ముసలి వాళ్ళకి అన్నిటికన్నా ముఖ్యం ఆదరణ ప్రేమ, ఆప్యాయత . ఒకప్పుడు ముసలి వాళ్ళని చాలా బాధ్యతగా ప్రేమగా చూసేవారు.
మనుషుల్లో సహనం తగ్గిపోయింది. ఎవరికి శారీరకంగా శక్తి ఉండడం లేదు. అయితే మటుకు ముసలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. పార్వతమ్మ గారికి కొంచెం నోరు ఎక్కువ. సుందరమ్మగారంటే కొంచెం చిన్న చూపు.
దానికి తోడు పార్వతమ్మ గారి వయసు కూడా పెరుగు తోంది కాబట్టి చాకిరి చేయలేకపోతోంది. "ఒక మనిషిని పెట్టుకో మామ్మని చూడడానికి అని ఎన్నిసార్లు రాజేష్ చెప్పినా పార్వతమ్మ గారు ఎందుకురా! అనవసరం డబ్బు ఖర్చు అని రాజేష్ మాట కొట్టి పడేసింది.
రాజ్యలక్ష్మి కాపురానికి వచ్చినప్పటి నుంచి ఇంటి పనులన్నీ పూర్తయిన తర్వాత సుందరమ్మ గారి తోటి కబుర్లు చెప్పడం ప్రారంభించింది. ఎందుకంటే రాజ్యలక్ష్మి కి పుట్టింట్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్లతోటి బాగా అలవాటు. చదువు అయిపోయిన తర్వాత వాళ్ల అవసరాలు తీరుస్తూ కాలక్షేపం చేస్తుండేది.
ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆడపిల్లని అంత సాంప్రదాయంగా పెంచారు రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు. రాజ్యలక్ష్మి తండ్రి రామారావు గారు రాజ్యలక్ష్మి కాపరానికి పంపేటప్పుడు ఒకే మాట చెప్పాడు. "ఇంతవరకు మా పిల్లవి. ఇప్పుడు వాళ్ళింట్లో ఉండవలసిన దానివి. వాళ్ల పద్ధతులన్నీ నేర్చుకొని జాగ్రత్తగా కాలక్షేపం చెయ్యి అంటూ సాగనంపాడు . రాజ్యలక్ష్మి కాపురానికి వచ్చిన తర్వాత పార్వతమ్మ గారు సుందరమ్మ గారిని చూస్తున్న విధానం నచ్చలేదు. అలా అని అత్తగారికి ఏవి చెప్పలేదు. ఇంట్లో ఏదో మార్పు తీసుకురావాలని చాలా ఆలోచించింది రాజ్యలక్ష్మి.
సమయం దొరికినప్పుడల్లా భర్త లేని సమయంలో సుందరమ్మ గారి తోటి ఎక్కువ గడపడం ప్రారంభించింది రాజ్యలక్ష్మి. ఇది చూసి ఏమిటి అంతసేపు మామ్మగారి దగ్గర ఏం చేస్తున్నావ్ అని పార్వతమ్మ అడిగేసరికి మన ఇంటి పద్ధతులు నేర్చుకుంటున్నాను మామ్మ గారి దగ్గర అంటూ సమాధానం ఇచ్చేసరికి పార్వతమ్మ ముఖంలో రంగులు మారిపోయాయి.
ఒకరోజు రాజేష్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు నులక మంచం ఒకటి కొని తీసుకొచ్చి వెనకవైపు షెడ్ లో పెట్టాడు. ఇది ఎందుకురా కొన్నావని పార్వతమ్మ అడిగేసరికి వెనకాల నుంచి ముసలి వాళ్లకి నులక మంచమే పడుకోడానికి సౌకర్యంగా ఉంటుంది కదా అంటూ సమాధానం ఇచ్చింది రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి సమాధానం లోని ఆంతర్యం పార్వతమ్మకి వెంటనే అర్థమైంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు రాజ్యలక్ష్మి పార్వతమ్మ ఇద్దరు కలిసి బట్టల బీరువా సర్దుకోవడం ప్రారంభించారు. అందులో ఒక అరనిండా సుందరమ్మ గారి పట్టుచీరలు ఖరీదైన చీరలు కనబడ్డా యి రాజ్యలక్ష్మి కి. ఆ బీరువాలో కనబడడం పాత దుప్పట్లు నైటీలు అన్నీ తీసి ఒకపక్కగా పేర్చడం ప్రారంభించింది రాజ్యలక్ష్మి. ఎందుకమ్మా అవన్నీ లోపల పెడతావ్ ఎవరికైనా ఇచ్చేద్దాం అనీ పార్వతమ్మ అనేసరికి ఇవన్నీ ముసలి వాళ్లకి కట్టుకోవడానికి తేలిగ్గా ఉంటాయి. అరిగిపోయి ఉంటాయి కదా బరువు ఎక్కువ ఉండవు . అందుకనే దాస్తున్నానంటూ ఒక మూలగా కలరా ఉండలు వేసి దాచి పెట్టింది. ఒక్కసారి పార్వతమ్మ కి కోపం ముంచుకొచ్చింది. కొత్త కోడలు కదా ఏమీ అనలేక పని అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది.
రాజ్యలక్ష్మి ఒకసారి భర్తతో బజారుకు వెళ్లి జర్మన్ సిల్వర్ కంచం కొనుక్కొని వచ్చింది. ఇంట్లో ఇన్ని వెండికంచాలు ఉండగా ఇవి ఎందుకే అంటూ పార్వతమ్మ గట్టిగా అరిచేసరికి ఇంట్లో పెద్ద ఆవిడ సత్తు కంచంలో తింటోంది.
ముసలి వాళ్ళందరూ ఇలాంటి కంచాల్లోనే తినాలి ఏమో అని అనుకున్నాను అనేసరికి పార్వతమ్మకి మొత్తం విషయం అర్థం అయిపోయింది.
ఇవన్నీ తన కోసమే రెడీ చేస్తోందని తెలివైన పార్వతమ్మ అనుకుని సుందరమ్మ గారిని నులక మంచం మీద నుంచి మధ్య గదిలో ఉన్న మంచం మీదకు మార్చేసింది. అప్పటినుంచి అది సుందరమ్మ గారి గది అయింది. అసలే ఎముకల గూడు లాంటి శరీరంతో ఉన్న సుందరమ్మ శరీరానికి పరుపు హాయిగా అనిపించింది. మర్నాడు తెల్లవారే సరికి ఎప్పటిలాగా కాకుండా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సుందరమ్మ గారి అవసరాలన్నీ తీర్చడానికి నర్స్ కొత్తగా ఇంట్లోకి చేరింది. బీరువాలో ఉన్న ఆవిడ చీరలు అన్ని చూపించి ఆవిడకి ఇష్టమైన చీరలు పైన కప్పడం ప్రారంభించింది పార్వతమ్మ. సత్తు కంచం మాయమైపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత రాజ్యలక్ష్మి సుందరమ్మ కళ్ళల్లో వెలుగు చూసింది. ఆరోజు నుంచి రాజ్యలక్ష్మి పార్వతమ్మనీ ఇంటి బాధ్యతల నుండి తప్పించింది.
ముసలి వాళ్లకి ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పులేదు. మిగతా వాటి అన్ని విషయాలలోను వాళ్లు వయసులో ఉన్న వాళ్ళతో సమానమే. ఆఖరి శ్వాస ఉన్నంత వరకు వాళ్ళని ఆంక్షలు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఆఖరి జీవితం హాయిగా ఆనందంగా గడపనివ్వడమే.
అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. చాద స్తాలు పెట్టుకుని వాళ్లకి మానసికంగా అధైర్యం పెంచకూడదు. ఆనందపడే వాతావరణం కలగజేయడమే మన కర్తవ్యం.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి