స్నేహం👬
స్నేహం
చూడగానే ఒక చిరునవ్వు ఆ పైన ఒక ఆత్మీయమైన పలకరింపు
ఇదే కదా స్నేహానికి మొదటి మెట్టు. స్నేహం సాధారణంగా జ్ఞానం
తెలియని వయసులో అమ్మ ఒడి నుంచి బడికి వెళ్లిన తర్వాత
బెంచ్ మీద మీద పక్కన కూర్చున్న వాడితో మొదలవుతుంది
. సాయంకాలం పూట పార్కుల్లో ఎదురింటి కుర్రాళ్ళు
పక్కింటి కుర్రాళ్ళు తో ను బలపడుతుంది స్నేహం.
ఈ జీవనయానంలో ఎంతోమంది స్నేహితులు చేతులు
కలుపుతుంటారు విడిపోతుంటా రు. కొంతమంది
బ్రతుకుదారులు వేరైనా కడదాకా కలిసి ఉంటారు. పెరిగి
పెద్దయిన తర్వాత ఒక ఇంటివాడు అయిన తర్వాత పక్కింటి
వాళ్లతోటి ఎదురింటి వాళ్ళ తోటి స్నేహం మొదలవుతుంది.
అయితే నేను చెప్పబోయే వీళ్ళిద్దరు ఒక స్కూల్లో
చదువుకోలేదు. వయసులో చాలా తేడా వృత్తుల్లో తేడా అయినా ఒకే ఊరిలో కాపురం ఉంటూతెల్లవారి లేస్తే ఎవరు వృత్తిలో వాళ్ళు బిజీగా ఉంటూ రక్తసంబంధం లేకపోయినా బావగారు అని ఆప్యాయంగా పిలుచుకుంటూ కాలక్షేపం చేసే
రామారావు విశ్వనాథ శాస్త్రి ల కథ.
రామారావు ఆ ఊర్లో ఒక ఆయుర్వేద వైద్యుడు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అవసరమైనప్పుడు సహాయం చేస్తూ ఆనందంగా కాలక్షేపం చేసే ఒక సంసారి. రామారావుకి చిన్నప్పుడే తండ్రి పోతే మతి చెడి తల చెడి పుట్టింటికి వచ్చేసిన అక్క గారిని ఉద్యోగం లేని తమ్ముడిని చేరదీసి అనువంశికంగా వచ్చిన ఒక చిన్న ఇంట్లో గుట్టుగా భార్య సీతమ్మతో కాలక్షేపం చేసేవాడు. అప్పటికే రామారావుకి నలుగురు పిల్లలు. ఇల్లు సరిపోయేది కాదు పాపం. అయినా ఏనాడు బాధపడకుండా నవ్వుతూ అందరికీ తలలో నాలికలా ఉంటూ అందరికీ మంచికి చెడ్డలకి సహాయపడే వ్యక్తి. ఎప్పటికైనా మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ. పక్కనే కాపురం ఉంటున్న విశ్వనాథ శాస్త్రి పొరుగురు లో పౌరోహిత్యం చేస్తూ ఉన్న ఊర్లో కొద్దిగా వ్యవసాయం చేసుకుంటూ లంకంత కొంపలో చుట్టూ విశాలమైన స్థలం పూల మొక్కలు పండ్ల మొక్కలు వేసుకుని పిల్లలతో భార్యతో సంతోషంగా కాలం గడిపేవాడు.
మొదటినుంచి రామారావు కుటుంబము అంటే విశ్వనాథ శాస్త్రికి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం ఏర్పడిందంటే పౌరోహిత్యం పని మీద విశ్వనాథ శాస్త్రి పొరుగురు వెళ్ళినప్పుడు ఒకసారి చద్ది అన్నం తిన్న విశ్వనాథ శాస్త్రి పిల్లలందరికీ హఠాత్తుగా జబ్బు చేసింది. కబురు తెలుసుకున్న వెంటనే రామారావు వైద్యం ప్రారంభించి ఆ పిల్లల్ని విశ్వనాథ్ శాస్త్రి వచ్చేవరకు కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇలా అనేక సందర్భాలు. అవసరానికి ఆదుకునే రామారావు కుటుంబం అంటే అప్పటినుంచి విశ్వనాధ శాస్త్రికి చాలా ఇష్టం.
ఆ ఊరి ప్రజలకు ఏ అవసరం వచ్చిన ఈ ఇద్దరు స్నేహితులు ముందుండేవారు. రామారావు గారికి మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ. శ్రావ్యమైన గొంతుతో రామాయణ మహాభారత భాగవత కథలను అరుగు మీద కూర్చున్న శ్రోతలకు ప్రతిరోజు చదివి వినిపించాడు. అందులో విశ్వనాథ శాస్త్రి కూడా ఒక శ్రోత. ఇలా ఊరి ప్రజలను ఉత్తరాది దక్షిణాది యాత్రలను దగ్గరుండి పూర్తి చేయించారు ఆ స్నేహితులిద్దరు. ఆ ఊరి ప్రజలంతా స్నేహితులంటే ఇలాగే ఉండాలని అనుకునేవారు. ఎందుకంటే ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఇద్దరు స్నేహితులు వెంటనే ఆదుకునేవారు.
ఇలా ఉండగా రామారావుకి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక రోజు రోజుకి బలపడింది. కానీ ప్రస్తుతం ఉన్న స్థలం పెద్ద ఇంటికి సరిపోదు. తన మనసులోని మాటను విశ్వనాథ శాస్త్రి తో పంచుకున్నాడు రామారావు. అయితే విశ్వనాథ శాస్త్రి మదిలో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. చూడు రామారావ్ ఈ పక్క స్థలం మీ పినతండ్రి గారి అబ్బాయి కదా. ఆ అబ్బాయి మద్రాస్ లో సెటిల్ అయిపోయాడు కదా. ఎటు తిరిగి ఇక్కడికి రాడు. అయినవాడు కదా. మనం అడిగి ఆ స్థలం కూడా కలుపుకుని ఒక పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు నువ్వు. అడిగి చూద్దాం. మనం కూడా ఊరికే తీసుకోకూడదు. ఎంత బంధుత్వం ఉన్న ఏదో ఒక రేటు కట్టి ఇచ్చేద్దాం. మనిద్దరం మద్రాస్ వెళదామని చెప్పాడు విశ్వనాథ శాస్త్రి. అయితే ఇన్నాళ్లు ఇదే ఆలోచన తన మనసులో ఉన్న అడగడానికి భయపడి మాట్లాడకుండా ఊరుకున్నాడు రామారావు.
ఇప్పుడు విశ్వనాథ్ శాస్త్రి కూడా అదే మాట చెప్పేసరికి విశ్వనాథ శాస్త్రి తో కలిసి మద్రాస్ తన పిన తండ్రి గారి అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. చాలా కాలం తర్వాత తన ఇంటికి వచ్చిన తమ్ముడిని విశ్వనాథ శాస్త్రిని ఆప్యాయంగా పలకరించాడు రామారావు పిన తండ్రి గారి అబ్బాయి సూర్యనారాయణమూర్తి. భోజనాలు అయిన తర్వాత మద్రాస్ అంతా తిప్పి చూపి మెరీనా బీచ్ చూపించడానికి తీసుకెళ్లే డు.
అప్పుడు వచ్చిన పని చెప్పాడు విశ్వనాథ్ శాస్త్రి. చూడు బాబు రామారావు ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా డు. నీకు కావలసిన వాడు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. పక్కనున్న నీ స్థలం కూడా కలిపితే రామారావుకి ఒక పెద్ద ఇల్లు అవుతుంది. నీ స్థలం ఊరికనే ఇవ్వక్కర్లేదు. ఇందులో ఏమీ మొహమాటం లేదు. నువ్వు ఏదో ఒక రేటు చెప్పు అంటూ చెప్పేసరికి సూర్యనారాయణమూర్తి వెంటనే దానికి ఏముంది కట్టుకోమనండి. నేను అక్కడికి వచ్చే ప్రసక్తే లేదు. వాడు ఇవ్వగలిగినంత ఇవ్వమనండి. ఇందులో ఏ విధమైన అభ్యంతరం లేదు అంటూ చెప్పేసరికి రామారావు విశ్వనాథ శాస్త్రి మొహాలు వెలిగిపోయే యి. అలా కాదు మీరు ఒక రేటు చెప్పండి అంటూ విశ్వనాథ శాస్త్రి అడిగేసరికి నోటికి వచ్చిన రేటు చెప్పాడు సూర్యనారాయణమూర్తి.అయినా విశ్వనాథ శాస్త్రి వెంటనే చూడు బాబు మీ శ్రీమతి తోటి మీ అబ్బాయి తోటి కూడా ఆలోచించి చెప్పు కంగారు ఏమీ లేదు రేపు వచ్చే మాఘ మాసంలో శంకుస్థాపన పెట్టుకుంటాడు. ఇంకా నెల రోజులు టైం ఉంది కదా అంటూ అనుభవం ఉన్న విశ్వనాథ్ శాస్త్రి చాదస్తంగా చెప్పాడు. అబ్బే అక్కర్లేదండి.
నా మాట ఫైనల్ అంటూ సూర్యనారాయణమూర్తి ఖరాఖండీగా చెప్పేసాడు. ఒక మంచి రోజు చూసుకుని రిజిస్ట్రేషన్ పెట్టుకోండి ఆ రోజుకు నేను వస్తాను అంటూ సూర్యనారాయణ మూర్తి ఆనందంగా చెప్పాడు. అయినా విశ్వనాథ శాస్త్రికి మనసు ఒప్పలేదు. అయినా ఈ అడ్వాన్స్ ఉంచండి అంటూ జేబులోంచి కొన్ని నోట్లు తీసి టేబుల్ మీద పెట్టాడు. నిజానికి సూర్యనారాయణ మూర్తికి డబ్బు అవసరం చాలా ఎక్కువ. సూర్యనారాయణమూర్తి నడుపుతున్న పత్రిక అప్పటికి నష్టాల్లో ఉంది. ఆ డబ్బులు లెక్కపెట్టుకుని వెంటనే జేబులో పెట్టుకున్నాడు. మరి అగ్రిమెంటు అని అడిగాడు అనుభవం ఉన్న విశ్వనాథ శాస్త్రి. సూర్యనారాయణమూర్తి మొహంలో రంగులు మారేయి. నా మాట మీద నమ్మకం లేదా అని కోపంగా అన్నాడు. విశ్వనాథ శాస్త్రి ఇంకేమీ మాట్లాడకుండా సాయంకాలం బండికి మేము వెళ్ళిపోతాం. ప్లాన్ గీయించుకోవడం వాస్తు చూపించుకోవడం శంకుస్థాపన ముహూర్తం పెట్టుకోవడం ఇంకా మాకు చాలా పనులు ఉన్నాయి అంటూ చెప్పాడు విశ్వనాథ శాస్త్రి. సాయంకాలం బండికి వాళ్ళిద్దరిని స్టేషన్ కొచ్చి సాగనంపాడు సూర్యనారాయణ మూర్తి.
ఇంటికి వచ్చిన తర్వాత స్నేహితులిద్దరూ అనేక తర్జనభర్జనలు చేసి తెలుసున్న వాస్తు పండితుడు ద్వారా ప్లాన్ గీయించుకుని శంకుస్థాపన హడావుడిలో ఉన్నారు. శంకుస్థాపనకు రమ్మని శుభలేఖ పంపిన పనులు ఒత్తిడి వల్ల రాలేకపోతున్నానని సూర్యనారాయణ మూర్తి వెంటనే సమాధానం రాశాడు.
శంకుస్థాపన ఇంకా రెండు రోజులు ఉందనగా టెలిగ్రామ్ వచ్చింది రామారావుకి. అందులో స్థలం తనకు అమ్మడానికి ఇష్టం లేదని ఎప్పటికైనా తను ఊరు వచ్చి ఇల్లు కట్టుకుంటానని సూర్యనారాయణమూర్తి వ్రాశాడు. అప్పటికే పునాదులు తీయడానికి ఆనవాళ్ళ కోసం ముగ్గులు కూడా పోశారు. పునాదులుకి మట్టి కూడా తోలించారు. ప్లాను సూర్యనారాయణమూర్తి స్థలంతో కలుపుకుని వేయించారు. ఇప్పుడు ఒక్కసారి రామారావుకి మతిపోయింది. ఏం చేయాలో తోచలేదు. ఆ రాత్రి ఎవరు ఇంట్లో అన్నం తినలేదు. ఇదేమిటి భగవంతుడు ఇలాంటి శిక్ష వేశాడు. ఏదో సరదాగా పెద్ద ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. అయినవాళ్లే ఆఖరిని ఇలా మాట మారిస్తే ఎలాగా. ఇంక బంధుత్వానికి అర్థం ఏముంది. అన్నీ తెలిసిన వాళ్ళు ఎలా చేస్తే ఎలాగా అని బాధపడుతూ వీధిలో మడత మంచం మీద పడుకున్నాడు రామారావు. అంతకుముందు రోజే విశ్వనాథ శాస్త్రి ఏదో పౌరోహిత్యం పని మీద పొరుగురు వెళ్లి రాత్రి తిరిగి వస్తూ రామారావు వీధిలో పడుకొని ఉండడం గమనించాడు. పలకరించిన సమాధానం సరిగా రాలేదు. ఇంటికి వెళ్లి భార్యని అడిగాడు విశ్వనాథ శాస్త్రి. జరిగిన విషయమంతా చెప్పింది విశ్వనాథ శాస్త్రి భార్య. ఊరికి వెళ్లొచ్చిన బట్టలు కూడా మార్చుకోకుండా స్నానం చేయకుండా గబగబ రామారావు దగ్గరికి వచ్చి జరిగిందాని గురించి బాధపడితే ప్రయోజనం లేదు. అయినా ఇలా అయినవాడు ఇలా మాట మారుస్తాడు అని నేను అనుకోలేదు. అయినా నేను నీకు ఉండగా ఎందుకు బాధపడుతున్నావు.
నీ శంకుస్థాపన ఏమీ ఆగదు.
చూడు నువ్వు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి ఉత్తరం వైపు నున్న స్థలం నీకు ఎంత కావాలో తీసుకో నువ్వు నాకు పది పైసలు ఇవ్వక్కర్లేదు. రేపే రిజిస్ట్రేషన్. దాన పట్టా కింద రాయించుకో. రేపు వెళ్లి ప్లాన్ మార్పించుకుని వద్దాం. రేపటి నుంచి నీ పనులన్నీ పూర్తయి వరకు నేను ఊర్లోనే ఉంటాను అంటూ చెప్పేసరికి రామారావు కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దేవుడు చేసిన సహాయం అంటే ఇదే కాబోలు అనుకున్నాడు.
ఆ తర్వాత ఎంత బతిమాలిన విశ్వనాథ శాస్త్రి పది పైసలు కూడా పుచ్చుకోవడానికి ఒప్పుకోకుండా దాన పట్టా వ్రాయించి ఇచ్చేసాడు. అక్కడ నుంచి ఏ పనులు ఆగలేదు. ఒక పెద్ద ఇల్లు అందంగా తయారయింది. అందులో రెండు కుటుంబాలు పిల్లలతోటి పాపలతోటి పెళ్లిళ్లు చేసి మనవళ్లతోటి హాయిగా కాలక్షేపం చేసే యి. ఆ అరుగుల మీద ఎన్నోసార్లు రామాయణ మహాభారత భాగవత పురాణాలను చదవడంతోపాటు శ్రీరామ పట్టాభిషేకం కూడా చాలాసార్లు చేశారు. ఎంతోమంది విద్యార్థులు ఆరుగుల మీద విద్య నేర్చుకునే వారు. ఊరి వాళ్ళ పెళ్లిళ్లకి విడిదిల్లుగాను ఎంతోమంది రోగులకు స్వస్థత చేకూర్చే ఆయుర్వేద నిలయంగాను పేరు తెచ్చుకుంది ఆ ఇల్లు.
ఆ ఇల్లు ని చూసినప్పుడల్లా ఆ కుటుంబ సభ్యులకి విశ్వనాథ శాస్త్రి గారు ఇప్పటికీ గుర్తుకొస్తునే ఉంటారు. స్నేహమంటే ఇదేనా.
అవసరమైనప్పుడు ఎదుట వ్యక్తి అడగకుండానే సహాయం చేసే వాడే నిజమైన స్నేహితుడు.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి