ఒక్క క్షణం ఆలోచించండి

కథ పేరు: ఒక్క క్షణం ఆలోచించండి.

రచన: మధు నా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు. 
కాకినాడ 9491792279

" ఏరా ఎలాగైనా సరే అమెరికాలో ఎమ్మెస్ చదవాలి. మా చుట్టాలు పిల్లలు అందరూ అక్కడ చదువుకుంటున్నారు. మా అన్నయ్య గారి అబ్బాయి కూడా అక్కడే. ఒకసారి నువ్వు సెటిల్ అయిపోతే మాకు బెంగలేదు అంటూ తల్లి , తండ్రి చెప్పిన మాటలకి కొడుకు శరత్ బుర్ర తిరిగిపోయింది. 

 "లేదు అమ్మా ఇప్పటికే నాన్న ఆఫీసులో పిఎఫ్ అంతా వాడేసారు. బ్యాంకులో నాలుగు లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని బీటెక్ చదివించారు. నాకు క్యాంపస్ లో జాబ్ వస్తుంది అనుకుంటే అది కూడా రాకుండా పోయింది. ఏదో ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తున్నాయి కానీ అంత పెద్ద చదువు చదవలే ను అంటూ చెప్పాడు శరత్

"లేదు చదువుతావు.. ఇప్పుడు నువ్వు కనక అమెరికా వెళ్లి చదువుకోకపోతే ఆ పిల్లలందరి ముందు చిన్నతనంగా ఉంటుంది.

 వాళ్లందరూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉంటే నీకు ఇండియాలో యాభై వేలు సంపాదిస్తే మన అప్పులు ఏమి తీరుతాయి. నా పేరు మీద ఉన్న ఈ బిల్డింగ్ ఉంది కదా తాకట్టుపెట్టి చదివిద్దాం .రేపే బ్యాంకు కి వెళ్దాం అంటూ ఖచ్చితంగా చెప్పేసింది శాంత. 

"వద్దు మమ్మీ నేను అమెరికా వెళ్ళను. ఇక్కడ ఏదో ఉద్యోగం చూసుకొని సెటిలైపోతాను. అమెరికా వెళ్ళిన వాళ్ళ బాధలు చూస్తున్నాము కదా!. తల్లిదండ్రులకు దూరంగా ఉండటమే కాదు. అక్కడ సరైన ఉద్యోగం రాక పెట్రోల్ బంకుల్లో కూడా పనిచేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ల అన్నయ్యలు అంటూ కొడుకు శరత్ చెప్పిన మాటలు అసలు వినిపించుకోలేదు తల్లి శాంత. ఇది మా ఒక్క కోరిక తీర్చరా! అంటూ కొడుకుని గడ్డం పట్టుకుని బతిమాలారు తల్లి శాంత,తండ్రి రంగనాథ్.

శరత్ తెలివైన పిల్లవాడే గాని తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు.ఇండియాలోనే ఉండి ఏదో ఉద్యోగం సంపాదించుకుని తల్లిదండ్రులని సుఖ పెట్టాలని శరత్ ఉద్దేశ్యo. కానీ తల్లిదండ్రులు కొడుకుని అమెరికాలో ఎమ్మెస్ చేయించాలని వాళ్ల సంకల్పం.

చదువు అనేది దేవుడిచ్చిన వరం. బజారులో దొరికే వస్తువు కాదు. తల్లిదండ్రులు అందరికీ పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆశలుంటా యి. 

మంచి చదువులు చదవాలని ఆశలుంటాయి. కానీ ఆ పిల్లలకి ఆ శక్తి ,కోరిక, ఆశయం ఉందో లేదో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సమాజంలో తమకు గౌరవం పెరుగుతుంద ని, తమ పిల్లల గురించి గొప్పగా చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో పిల్లల అభిప్రాయాలకు భిన్నంగా ఇలా మొండిపట్టు పట్టిన తల్లిదండ్రులు మాట కాదనలేక అయిష్టంగానే అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో ఎమ్మెస్ చేయడానికి ఒప్పుకున్నాడు శరత్.

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలంటే గ్రాడ్యుయేట్ రికార్డింగ్ ఎగ్జామినేషన్ స్కోరింగ్ అనేది తప్పనిసరి. అమెరికాలో ఉండే యూనివర్సిటీలలో ఈ పరీక్షలో వచ్చిన స్కోరును బట్టి మంచి మంచి కాలేజీల్లో అడ్మిషన్ దొరుకుతుంది. కానీ ఈ పరీక్షలో స్కోరింగ్ సంపాదించడమే కష్టం. దీనికోసం ప్రత్యేకమైన కోచింగ్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా తగినంత స్థిరాస్తిని తనఖా పెట్టుకుని చదువుకోడానికి అప్పులు ఇస్తున్నాయి. 

అందుకే మన దేశం నుండి మధ్యతరగతి కుటుంబ విద్యార్థులు ఎంతోమంది అమెరికాలో చదువుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇలా ఎన్నో లక్షల మంది విదేశాల్లో చదువుకోడానికి వెళ్లిపోయి చదువు పూర్తి చేసుకు ని సరైన ఉద్యోగo లభించక అక్కడే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు.

 ఈ భయం శరత్ కూడా ఉంది. చాలామంది స్నేహితుల అనుభవాలు విని భయపడిపోయాడు. సరే ముందు జి ఆర్ ఈ ఎగ్జామ్ రాయాలి కదా. స్కోరు సంపాదించాలి కదా. మంచి స్కోరు రాకపోతే ఎక్కడ సీటు రాదు అనుకుంటూ జి ఆర్ ఈ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవడం మొదలుపెట్టాడు శరత్ హైదరాబాదులో. రోజు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు కోచింగ్ క్లాస్సెస్ అక్కడి నుండి ఒక గంట రెస్ట్ తీసుకుని మళ్లీ ప్రిపరేషన్ రాత్రి 10 గంటల వరకు. ఇలా సాగిపోతోంది శరత్ జీవితం. సెలవు రోజుల్లో ఇంటికి వెళ్ళడం కూడా మానేశా డు. 

పాపం తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం కష్టపడి చదువుకుంటున్నాడు శరత్. తల్లిదండ్రులకు ఫోన్ చేసినప్పుడల్ల ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో అని అడుగుతున్నారు తప్పితే ఏమి తింటున్నావు? వేళకి తింటున్నావా లేదా అని కూడా అడగడం లేదు. భోజనం బాగుంటుందా అని కూడా అడగడం లేదు. 
కనీసం ఆదివారం పూటైనా ఇంటికి వచ్చి వెళ్ళు అని చెప్పడం లేదు. ఇంటికి వస్తే చదువు పాడైపోతుందని వారి అభిప్రాయం. అయినా ఇంత డబ్బు ఖర్చుపెట్టి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ల కోరికలు తీర్చడం తమ బాధ్యత అనుకున్నా డు శరత్ . అందుకే మనసుపెట్టి చదవడం ప్రారంభించాడు. ఎంత కష్టపడి నా మన అదృష్టం కూడా కలిసి రావాలి.

 అలా రెండుసార్లు జి ఆర్ ఈ పరీక్ష రాసిన మూడోసారి కానీ మంచి మార్కులు సంపాదించలేకపోయాడు శరత్. అయినా తల్లిదండ్రులు ఓపిగ్గా ఫీజులు కడుతూ శరత్ ని ప్రోత్సహించారు. శరత్ తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేదు. పిల్లవాడు ఎమ్మెస్ చేసినంత ఆనందపడ్డారు. 

ఇక అమెరికాలోని యూనివర్సిటీలో మాస్టర్స్ లో సీట్ సంపాదించడమే తరువాయి. విద్యార్థిగా విదేశాలకు వెళ్తున్న సరే వీసాలు పాస్పోర్టులు తప్పనిసరి . వీసా సంపాదించాలంటే ఒక్కొక్కసారి చుక్కలు కనిపిస్తాయి. కాని దైవం అనుకూలించి తేలికగానే వీసా ,మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించాడు శరత్.

కలిసొచ్చే కాలం ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అనే సామెత ఉంది కదా అలాగే ఎక్కువ కష్టపడకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషన్ లోను కూడా శాంక్షన్ చేశారు. అన్ని పనులు సక్రమంగా జరిగి తాము కోరుకున్నది జరగడంతో తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకుని శరత్ ని అమెరికా ఫ్లైట్ ఎక్కించారు తల్లిదండ్రులు ఆనందంతో.

మన జీవితంలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరిగిపోతుంది మనం ఎంత కాదనుకున్నా, అలాగే శరత్ ఎమ్మెస్ కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అయిపోయాడు. కొత్త వాతావరణం కొత్త ఊరు అంతా కొత్త కొత్తగా ఉంది. 
కలలో కూడా ఎప్పుడు చూస్తాను అనుకున్న ప్రదేశం కాదు. ఒక్కోసారి ఇష్టం లేని పని కూడా అక్కడకు చేరిన తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి వాతావరణం బట్టి వాటి మీద శ్రద్ధ కలుగుతుంది.

 అలాగే అక్కడ చేరిన ఇతర విద్యార్థుల స్ఫూర్తి చూసి శరత్ కూడా ఉత్సాహం కలిగి చదువు మీద శ్రద్ధ పెరిగింది. ఎంతో కష్టపడి క్లాసులు కి అటెండ్ అవ్వడం పాఠాలు శ్రద్ధగా చదువుకోవడం వీకెండ్స్ లో టూర్లు ,స్నేహితులతో పార్టీలు, ఇలా రెండు సంవత్సరాలు కంప్యూటర్స్లో ఎమ్మెస్ పూర్తి చేయలేకపోయాడు శరత్. తల్లిదండ్రులు బాధపడతారని పరీక్ష పాస్ అయ్యాన ని అబద్దాలు చెబుతాడు.ఇంక శరత్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దు లేదు.

ఇంకా అక్కడినుంచి శరత్ ఉద్యోగాలు వేట మొదలుపెట్టాడు. బీటెక్ డిగ్రీ చేతిలో ఉంది కదా. . ఎంత ప్రయత్నించినా ఎక్కడ ఉద్యోగం దొరికే పరిస్థితి కనపడలేదు శరత్ కి. 
అన్ని రంగాల్లోనూ తీవ్ర స్తబ్దత ఏర్పడింది. ఎటు చూసినా అయోమయ పరిస్థితి. ఈ సమయంలో ఉద్యోగం ఇచ్చే వాళ్ళు ఎవరుంటారు. రోజులు గడవడం కష్టంగా ఉంది శరత్ కి. డబ్బులు లేకపోతే రోజు గడవదు. చదువు అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం శరత్ కి ఇష్టం లేదు. అయినా అంత డబ్బు పంపించడం అంటే తండ్రికి చాలా కష్టం. 

బ్యాంకు లోన్ వాయిదాలు కట్టవలసిన సమయం కూడా దగ్గరకొచ్చింది. రెండు సంవత్సరాల చదువుకి మొత్తం నలభై లక్షలు ఖర్చయింది. అంతా బ్యాంకు లోనే. నెలకు వచ్చి యాభై వేల రూపాయలు వాయిదా కి కట్టాలి. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది శరత్ కి. 

ముందుగానే ఈ విషయాన్ని ఊహించి తల్లికి చెప్పిన తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎవరూ ఒప్పుకోలేదు. ఇప్పుడు పీకల మీదకు వచ్చింది పరిస్థితి. లోను వాయిదాలు కట్టకపోతే ఇల్లు వేలo వేసే పరిస్థితి వస్తుంది. దాంతో ఉండడానికి ఇల్లు లేకపోవడం సరి కదా పరువు కూడా పోతుంది. శరత్.ఇలా రోజులు భారంగా గడుస్తున్నాయి శరత్ కి.

ఒకవేళ ఇంటికి వెళ్ళిపోతే ఈ ఖర్చు లు కలిసి వస్తాయి అని ఆలోచించి తల్లికి తండ్రికి ఫోన్ చేశాడు. తల్లి అయితే "ఏమిటి నువ్వు వచ్చేస్తావా! మేము ఇక్కడ అందరికీ ఏమి సమాధానం చెప్పుకోవాలి. నువ్వేదో పెద్ద ఉద్యోగం సంపాదించి లక్షల సంపాదిస్తావనుకున్నాం. ఇలా తుస్సుమనిపిస్తే మా పరువు ఏం కావాలి. బ్యాంకు లోన్ అన్ని ఎలా కట్టాలి ? మేము ఎలా బతకాలి?నీ మీద లక్షల కట్నం సంపాదించవచ్చునని ఆశ పెట్టుకుని ఉన్నాము. 

'నువ్వు ఆరు నూరైనా నూరు ఆరైన అక్కడి నుంచి రావడానికి వీల్లేదు. కనీసం పెట్రోల్ బంక్ లో జాయిన్ అయ్యి అక్కడే కాలక్షేపం చెయ్. మేము ఈ లోగా మంచి పెళ్లి సంబంధం చూసి అమెరికాలో ఉన్నాడని చెప్పి లక్షల కట్నం సంపాదిస్తాం అటు తల్లి చెప్పిన మాటలు తీవ్ర మనస్థాపానికి గురి చేసేయి శరత్ ని. రోడ్డుమీద పిచ్చివాడిలా అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. చేయడానికి పని లేదు. చేతిలో డబ్బు లేదు. కాలేజీలో సీనియర్ ఒక అతని ద్వారా తల్లి చెప్పినట్టుగానే పెట్రోల్ బంక్ లో పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయిపోతాడు శరత్. 

అలా రోజులు భారంగా గడుస్తున్నాయి శరత్ కి. తను చదువు కొన్న చదివేమిటి ?చేస్తున్న ఉద్యోగం ఏమిటి ? అని రోజు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని అమెరికన్ పోలీసులు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది శరత్ తల్లిదండ్రులకి. జేబులో దొరికిన ఉత్తరాన్ని వాట్సాప్ లో పెట్టారు అమెరికన్ పోలీసులు శరత్ తల్లిదండ్రులకి అందులో సారాంశం .

ప్రియమైన అమ్మకి నాన్నకి గత మూడు సంవత్సరాల నుంచి నేను ఎన్నో బాధలు పడుతూ ఇక్కడ అమెరికాలోనే ఉండిపోయాను మీ కోరిక ప్రకారం. కానీ ఉద్యోగం మటుకు సంపాదించలేకపోయాను. చివరికి అమెరికాలోనే బూడిదగా మారిపోతున్నాను. పిల్లల మాట కూడా కొంచెం గౌరవించండి. పిల్లల మాట కూడా కొంచెం విలువ ఇవ్వండి. తల్లిదండ్రులుగా మీరు కూడా ఒక క్షణం ఆలోచించండి. మీ పరువు కోసం మా ప్రాణాలతో ఆడుకోకండి.

 ఇట్లు అసమర్ధుడైన మీ కొడుకు శరత్.

ఈ ఉత్తరం చదివిన వాళ్ళందరికీ కన్నీళ్లు వచ్చే యి. ఇంక సరే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించగలం.

                            -----–

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట