బామ్మ ఉంటే

బామ్మ ఉంటే 

"
అవును అమ్మ ఉంటే ఎంత బాగుండేది. ఇంట్లో ముఖ్యంగా పిల్లలకి మంచి చెడ్డ చెప్పేది. రామాయణం ,భారతం, భాగవతం కథలు రాత్రి కూర్చోబెట్టుకుని చెప్పేది. ఏది మంచి ఏది చెడు ప్రతిరోజు ప్రతి పనిలోనూ గుర్తు చేసేది. నా బాల్యంలో మా బామ్మ ఉండేది అలాగే బామ్మ క్రమశిక్షణలో గడిచిపోయింది మా బాల్యం. ఈ పిల్లల బాల్యం చూస్తుంటే భయమేస్తుంది. ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేరు. వీళ్ళ జీవితం ఎలా నడుస్తుందో ఏమిటో అంటూ తన బాల్యం గుర్తు చేసుకో సాగాడు ముప్పైఏళ్ల రాజారావు. 

రాజారావు కామేశ్వరరావు గారికి ఆరో సంతానం. కామేశ్వరరావు గారి పిల్లలు అందరి బాల్యం కామేశ్వరావు గారి తల్లి సుందరమ్మ గారి పెంపకoల్లో గడిచిపోయింది. మరి అంత క్రమశిక్షణ కాదు గాని సుందరమ్మని చూస్తే పిల్లలకు హడలు. ఉదయం లేస్తూనే అందరూ స్నానాలు చేయాలి. దేవుడికి దండం పెట్టుకోవాలి. అప్పుడు గాని పాలు తాగడానికి వీల్లేదు. కాఫీ టీల ప్రసక్తే లేదు. చిన్నపిల్లలు పాలు తాగాలి రా. ఎముకలు బలంగా ఉంటాయి అoటు సైంటిఫిక్ రీజన్ చెప్పేది. అప్పట్లో ఉదయం పూట టిఫిన్ కూడా లేదు. చక్కగా చద్దన్నం పెరుగు వేసి పెట్టేది.

 మళ్లీ మధ్యాహ్నం పూట స్కూల్ నుంచి వచ్చి బట్టలు మార్చుకుని కాళ్లు చేతులు కడుక్కొని మధ్యాహ్నం అన్నం పెట్టేది. బట్టలు మార్చుకోవడం అనేది ఆరోగ్యం కోసం. మడి, తడి కాదు అని చెప్పేది.

ఇంకా సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన తర్వాత చక్కగా స్నానాలు చేయించి ఉతికిన బట్టలు తేలికపాటి బట్టలు వేసి చక్కగా తల దువ్వి కారప్పూస జంతికలు తీపి మిఠాయి కొమ్ములు కోవా బిళ్ళలు అటుకులు ఇవే అల్పాహారం. మళ్లీ ఇంట్లో తయారు చేసినవే. బజారు సరుకులు ప్రసక్తే లేదు. ఆడపిల్లలకు మటుకు అధునాతన వస్త్రధారణ ఏదీ లేదు. మళ్లీ రాత్రి పెందరాలే భోజనాలు కానిచ్చి మామ్మ చుట్టూ చేరే వాళ్ళం. మా మ్మ కాశీ మజిలీ కథలు విక్రమార్కుడు కథలు పరమానందయ్య శిష్యులు కథలు రామాయణం భారతం భాగవతం కథలు కథలుగా చెబుతూ మమ్మల్ని నిద్రపుచ్చేది. గదిలో అద్దాల బీరువాలో ఉన్న కథల పుస్తకాలు తీసుకుని చదువుకోమనేది పెద్ద పిల్లల్ని. అలా అలవాటయింది సాహిత్యం మీద అభిమానం మా ఇంట్లో అందరికీ.

 ఇంటి పని అంతా మా అమ్మ చూసుకుంటూ ఉంటే మా బామ్మ పిల్లల్ని చూసుకునేది. పిల్లలతో గడపడం ఆవిడకి సరదా. ప్రతి కదలిక గమనిస్తూ ఉండేది. ఎవరైనా గుమ్మంలోకి అడుగుపెట్టినప్పుడు పలకరించకపోతే చెవులు మెలుపెట్టేది. అందరి తోటి కలివిడిగా ఉండాలి. మన ఇంటికి ఎందుకు వస్తారు చెప్పు. అంటూ పిల్లలకి అందరితోటి మాట్లాడడం నేర్పింది

ఎప్పుడూ నాన్న చేత చందమామ బాలమిత్ర పుస్తకాలు తెప్పించేది. కథలు బాగుంటాయి పిల్లలు చదువుకోండి అని. నాన్న కి పేపర్ చదవడం బాగా అలవాటు. 

బామ్మ కూడా మొదటి పేజీ మొదటి అక్షరం నుండి ఆఖరి పేజీ ఆఖరి అక్షరం వరకు శ్రద్ధగా చదివేది ప్రతిరోజు. అలా మాకు కూడా వార్తాపత్రిక అలవాటయింది.పిల్లలు పెద్దలకి ప్రతిరూపాలు. పిల్లలు ఎక్కడ నుంచి నేర్చుకుంటారు. మా అక్కలకి వంటింట్లో పనులన్నీ అలవాటు చేసేది పనిగట్టుకుని. వాళ్లు అలా బామ్మ దగ్గర అన్ని వంటలు నేర్చుకున్నారు. చేయవలసినప్పుడు ఎంత గారం చేసినా చదువు విషయంలో చాలా గట్టిగా ఉండేది. ఆ రోజుల్లో మా తాతయ్య బిఏ పాసై ఎన్నో పుస్తకాలు కూడా వ్రా శాడుట. స్కూల్ హెడ్మాస్టర్ గా పని చేశాడట. బామ్మ గారు ఎక్కువగా చదువుకోలేదు కానీ లోకజ్ఞానం ఎక్కువ.
 తన కడుపున పుట్టిన పిల్లలందరినీ బాగా చదివించుకుంది. ఆవిడకి చదువు అంటే ఇష్టం. ఇంట్లో ఉన్న బామ్మలు మూలంగా పిల్లల మానసిక శారీరిక ఆరోగ్య పరిస్థితి చాలా చక్కగా తయారవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఆరోగ్యానికి మంచి ఆహారం, మానసిక వికాసానికి మంచి మంచి నీతి కథలు, శారీరిక ఆరోగ్యానికి ఆటలు ఇవి ఆవిడ ఆయుధాలు పిల్లల పెంపకానికి ఆ వీధిలో పిల్లలందరినీ పోగేసి అందరి చేత ఆటలాడించేది. అందులో కబడి దొంగ పోలీస్ ఆటలు ఇవన్నీ శారీరక వ్యాయామo కోసమే.
వీధిలో ఎవరైనా ముష్టి వాళ్ళు వస్తే కసిరి కొట్టకూడదని చెబుతూ పిల్లల చేత బియ్యం పెట్టించేది. ప్రతిరోజు అన్నం తినేముందు ఒక ఆకులో కొద్దిగా అన్నం పెట్టి గోడ మీద పెట్టేది. మేము ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఎందుకు మామ్మ అలా పెడుతున్నావ్ అంటే ఆ గోడ మీద వాలే కాకులు పక్షులు ఉడతలు ఏవో ఒకటి ఆ అన్నం తింటాయి రా.

 వాటికి కడుపు ఎలా నిండుతుంది చెప్పు. ఆకలేస్తే అది ఎవరినడుగుతాయి. మనిషి జన్మ ఎత్తునందుకు మనం ఎంతోకొంత దానం చేయాలి రా అంటూ చెప్పేది. నేను పెరిగి పెద్దయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది పంచ మహా యజ్ఞాలలో భూత యజ్ఞం అని తెలిసింది. అరటిపండు ఎవరైనా తింటే ఆ తొక్క తీసుకెళ్లి పశువుల పాకలో ఉన్న ఆవుకి పెట్టేది. ఏమో ఆ పెద్ద వాళ్ళ ఆలోచనలో చేసే పనులలో వెనుక ఏదో ఒక కారణం కచ్చితంగా ఉంటుంది. రోడ్డుమీద నడుస్తున్నప్పుడు చేతిలో పంచదార పొట్లం పట్టుకుని కనబడిన చీమల పుట్టలో పోసేది. ఒక ప్రతి వేసవికాలంలోనే గోడ మీద ఒక గిన్నెలో మంచినీళ్లు పోసి పెట్టేది. 

ఇక పంటల కాలం వచ్చింది అంటే వరి కుచ్చులు ప్రత్యేకంగా పొలం నుండి తీసుకొచ్చి వాటిని వీధిలో చూరుకు వెళ్ళాడ కట్టేది. నిజంగానే పక్షులు పిచ్చుకలు రోజు వచ్చి ఆ ధాన్యం తిని వెళుతూ ఉండేవి. 

పిల్లల్ని వెంట పట్టుకుని రోజు గుడిలోకి గోపురాలకి తీసుకెళ్లేది. దేవాలయంలో అనుసరించవలసిన పద్ధతులు అన్ని విపులంగా చెప్పేది. ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి సోమవారం మాకు ఉపవాసాలే. 

ఒకరోజు కడుపు మాడిస్తే ఆరోగ్యానికి మంచిది అంటూ చెప్పేది. పదేళ్లు వచ్చేటప్పటికి అందరికీ వారాలు పేర్లు తిధుల పేర్లు పండగల పేర్లు తెలిసిపోయేవి. అంటే ఆవిడ ఒక క్రమబద్ధంగా పిల్లలకు నేర్పవలసిన విషయాలన్నీ నేర్పుకుంటూ వచ్చేది.

మా ఇంట్లో ఏ నిర్ణయమైనా వాళ్ళ అమ్మ తోటి ,మా అమ్మ తోటి ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు మా నాన్న. వాళ్లు కూడా మా నాన్న ఆర్థిక పరిస్థితికి మించి ఖర్చులు చేసేవారు కాదు. అలా పొదుపుగా జీవితం గడపడం అక్కడినుంచి నేర్చుకున్నదే
పిల్లల అవసరాల విషయంలో ఏమీ లోటు చేయకుండా కాలక్షేపం చేసే వారు.

ఎవరికైనా ఒళ్ళు వెచ్చగా ఉంటే అన్నీ చిట్కా వైద్యాలే. అయిందానికి కాని దానికి కంగారుపడేది కాదు. చాలా నిదానంగా పనులు చక్కగా చేసేది. ఆ పెద్దవాళ్ళు నేర్పిన లేదా వాళ్లను చూసి మనం నేర్చుకున్న పద్ధతులు మన జీవితాలు సుఖవంతంగా అయిపోయాయి. మరి పిల్లలు ఎలా ఉంటారో ఏమిటో అనుకుంటూ తనలో తాను మధన పడసాగాడు.

ఆ రోజుల్లో ఇంట్లో ముసలి వాళ్లు ఉంటే అన్ని వాళ్ళ సలహా తీసుకుని సంసారాలు నడుపుకునేవారు. ఆ పెద్దలు చెప్పే మాటలలో ఎంతో అంతరార్థం చేసే పనులు ఎంతో పొదుపు ఆర్థిక విషయాల్లో అంత మదుపు చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో
కాలం మారిపోయింది ఇంట్లో ముసలి వాళ్ళయిన తల్లిదండ్రులు ఉంటేనే ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇది తప్పు అని చెప్పడానికి అవతలి ఇంట్లో కూడా ముసలి వాళ్లు ఉండట్లేదు. 

పిల్లల్ని కనీ పెంచి విద్యార్థులు నేర్పించి పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసిన పాపానికి శరణాలయాలకి వెళ్ళిపోతున్నారు. కాదు కాదు చిన్నపిల్లల్ని కాన్వెంట్లో చేర్పిస్తున్నట్లుగా పెద్దలను కూడా శరణాలయాల్లో చేర్పించడం మన దేశంలో కూడా మామూలు అయిపోయింది. మనం మన తల్లిదండ్రులని చూసిన విధానాన్ని బట్టి మన ఆఖరి జీవితం కూడా నడుస్తుంది. 

 ఇలా ఆలోచించుకుంటూ కొడుకులు చూడకుండా శరణాలయంలో ఉంటున్న తన తల్లి చెల్లెలి ని ఇంటికి తీసుకొచ్చాడు రాజారావు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట