అంతిమ యాత్ర

అంతిమ యాత్ర

హలో ప్రసాద్ గారు నేను ప్లాట్ నెంబర్ 425నుంచి
 మాట్లాడుతున్నాను . ఉదయం నుంచి మా ఇంట్లో కరెంట్ లేదు.
కాస్త ఎలక్ట్రీషియన్ ని పంపించండి.సరే అండి రామారావు గారు ఎలక్ట్రీషియన్ 9 గంటలకు వస్తాడు .థాంక్స్ అండి అంటూ ఫోన్ పెట్టేసాడు రామారావు గారు. 

వివరాలన్నీ నోట్ చేసుకుని ఎలక్ట్రీషియన్ కి ఫోన్ చేసే అంతలో మళ్లీ మొబైల్ రింగ్ అయ్యింది. నేనండి ప్రశాంత్ ని ప్లాట్ నెంబర్ 530 నుంచి మాట్లాడుతున్నాను. మా బాత్రూంలో నల్లాలు లీక్
 అవుతున్నాయి కాస్త రిపేర్ చేయించి పెట్టండి సార్.
 అలాగేనండి అంటూ ఫోన్ పెట్టేసారు ప్రసాద్ గారు. 

ప్రశాంత్ గారితో మాట్లాడుతుండగానే ఫ్లాట్ నెంబర్ 525లో కాపురం ఉంటున్న రాఘవయ్య గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.
ప్రశాంత్ గారు ఫోన్ పెట్టేసిన తర్వాత రాఘవయ్య గారి కి మళ్ళీ కాల్ చేశాడు ప్రసాద్. రాఘవయ్య గారు ఫోన్ ఎత్తి నాయనా ప్రసాదు కాస్త నా మందులు అయిపోయాయి తెప్పించ పెడుదూ అంటూ నెమ్మదిగా మాట్లాడాడు. సరేనండి ఇప్పుడే పంపిస్తాను
ఫోన్ పెట్టేసాడు ప్రసాద్.

ఇలా ఉదయం నుంచి సాయంకాలం వరకు అందరి సమస్యలు తీర్చేఆపద్బాంధవుడు సదరు ప్రసాద్ గారు కూడా ప్లాట్ నెంబర్ 401ఇంటి యజమాని. MAY I HELP YOU అనే సంస్థకి యజమాని కూడా. సుమారు 100 ప్లాట్లు ఉన్న ప్రగతి నగర్ లోని ఆ రామచంద్ర రెసిడెన్సి అపార్ట్మెంట్లో ఏ సహాయం కావాలన్నా చేస్తూ అందరి సమస్యలు తీరుస్తూ సర్వీస్ చార్జెస్ ఆదాయంగా చేసుకుని తను బ్రతుకుతూ పదిమందికి బ్రతుకడానికి అవకాశం కల్పిస్తూ ఒంటరిగా జీవితం సాగిస్తున్నాడు ప్రసాదు. 

నల్ల కోటేసుకొని కోర్టు మెట్లు ఎక్కుదాం అనుకున్న ప్రసాద్ గోదావరి జిల్లాల నుంచి ఈ మహా నగరానికి వచ్చి కనీసం చెట్టు కింద ప్లీడర్ అయినా అవుదాం అనుకున్నా ఎవరూ పలకరించే నాధుడు లేక ఉన్న ఊరిలోనీ ఎకరం భూమి అమ్మేసి ఈ రామచంద్ర రెసిడెన్సీ ప్లాటులో కొనుక్కుని ఏదో అలా జీవితం సాగిస్తున్నాడు.
ఆ ప్లాట్ ఓనర్ లందరికీ తలలో నాలుకలా ఉండి అపార్ట్మెంట్లో ఉండే వారి రోజువారి సమస్యలు,పెళ్లిళ్లకి కళ్యాణ మండపాలు దగ్గర్నుంచి క్యాటరింగ్ వరకు పురోహితుడు దగ్గర్నుంచి ఫోటోగ్రాఫర్ల వరకు అన్ని బుక్ చేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి చూసుకుంటాడు. ఎవరైనా చనిపోతే దగ్గరుండి అన్ని పనులు చేస్తాడు. ఒక చావుకు తప్ప మిగిలిన వాటికి సర్వీస్ చార్జెస్ వసూలు చేస్తాడు లెండి.అత్యవసర సమయంలో ఆపద్బాంధవుడులాఆదుకుంటాడు.ఇలాప్లాటుఓనర్లందరికీ
వరప్రసాదయ్యాడు.
 ఇ న్నాళ్ళు అందరి సమస్యలు తీరుస్తున్న ప్రసాద్ కి ఒక ముఖ్య సమస్య ఎదురైంది .ప్లాట్ నెంబర్ 426 లో ఉంటున్న రాఘవయ్య గారు సడన్ గా హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది 

రాఘవయ్య గారు పిల్లలు అమెరికాలోసెటిల్ అయిపోయారు
రాఘవయ్య గారు ప్రసాదు మంచి స్నేహితులు.
. ఏం సహాయం కావాలన్నా రాఘవయ్య గారు ప్రసాద్ గారికి ఫోన్ చేసి అడుగుతుంటారు. ఎంత అర్ధరాత్రి అయినా ప్రసాద్ గారు మందులు అవి తెచ్చిస్తుంటారు. ప్రసాద్ గారికి రాఘవయ్య గారు అంటే అభిమానం. బాబాయ్ గారు అంటూ పిలుస్తాడు.

 వాళ్ళ మంచి చెడులన్నీ సుమారుగా 10 సంవత్సరాల నుంచి అంటే రాఘవయ్య గారు పదవీ విరమణ చేసిన దగ్గర నుంచి ప్రసాదు చూస్తుంటాడు. ఇంట్లో మనిషిలా ఉంటాడు. హాస్పిటల్ కి తీసుకెళ్లడం దగ్గరనుంచి మార్కెట్ పనులు అన్ని ప్రసాదు చూస్తుంటాడు.
అమెరికాలో ఉన్న పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల క్షేమం గురించి ఎక్కువగా ప్రసాద్ గారికి ఫోన్ చేస్తుంటారు. ఎందుకంటే రాఘవయ్య గారికి భార్యకి ఇద్దరికీ చెముడు . పాపం పిల్లలతో మాట్లాడాలంటే కష్టం. 
వాట్సాప్ మెసేజ్ ల మీద ఆధారపడ్డారు.నిన్ననే కదా హాస్పిటల్ కి వెళ్లి వచ్చాము బాగానే ఉన్నాడు కదా అనుకుంటూ రాఘవయ్య గారి ప్లాట్ లోకి వెళ్ళాడు ప్రసాదు .
అక్కడ రాఘవయ్య గారి భార్య ఒకత్తే ఏడుస్తూ కూర్చుంది. అపార్ట్మెంట్ లలో ఎవరు ముందుకు రారు అందరికీ తెలిసిన విషయమే.. రాఘవయ్య గారి పిల్లలకే విషయం ఫోన్ చేసి తెలియజేశాడు ప్రసాద్ గారు. మేము వచ్చేటప్పటికి మూడు రోజులు పడుతుంది అంతవరకు మరి ఈ శవ o అంటూ మాట మధ్యలోనే ఆపేశారు రాఘవయ్య గారి పిల్లలు. పోనీ రాఘవయ్య గారు భార్యని సలహా అడుగుదామంటే ఆమె ఏమీ చెప్పే స్థితిలో లేదు. కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు కూడా లేదు.
అదేమిటి బాధ్యత తీసుకోవాల్సిన పిల్లలు అలా మాట మధ్యలోనే ఆపేశారు ఏమిటి? ఒకవేళ ఐస్ బాక్సులో మూడు రోజులు శవం ఉంటుందా. ప్లాట్ లో ఉండేవాళ్ళు ఊరుకుంటారా? రాఘవయ్య గారు భార్య కూడా పెద్ద వయసే ఎన్నాళ్ళని తిండి తిప్పలు లేకుండా ఉంటుంది. ఆవిడ బాగోగులు ఎవరు చూస్తారు?  

ఏం చేయాలో తోచక దిగాలుగా శూన్యంలోకి చూస్తూ ఎందుకైనా మంచిది మరొక్కసారి పిల్లలకి ఇక్కడ పరిస్థితి వివరిద్దాం అనుకుంటూ రాఘవయ్య గారి పెద్దబ్బాయికి ఫోన్ చేసాడు. అబ్బాయి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు ప్రసాద్.

 చూడండి ప్రసాద్ గారు మాకు ఇండియాలో ఎవరు బంధువులు లేరు. బంధువులు ఉన్నా చాలా దూరంలో ఉన్నారు. మీరు ఒక్కరే మాకు దిక్కు. మీరు ఏ నిర్ణయం తీసుకున్న మాకు ఏమీ అభ్యంతరం లేదు గబగబా నాలుగు మాటలు చెప్పి ఫోన్ పెట్టేసాడు రాఘవయ్య గారి పెద్దబ్బాయి.
నిజమే ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఎక్కడో విదేశాల్లో ఉన్నవాళ్లు అర్జెంటుగా రావాలంటే ఎలా వస్తారు. అంతా అయోమయంగా ఉంది. వాళ్ల పరిస్థితిని బట్టి అబ్బాయి అలా మాట్లాడి ఉండొచ్చు. ఇంతలో అపార్ట్మెంట్లోని ప్లాట్ ఓనర్లు నలుగురు కలిసి వచ్చి ప్రసాద్ గారిని పక్కకు పిలిచి అంత్యక్రియలు ఎప్పుడు అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు.
ప్రసాద్ ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండి పోయాడు.

అప్పటికే సమయం మధ్యాహ్నం రెండు గంటలు అయింది. రాఘవయ్య గారి భార్య పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు.
అలా ఉదయం నుంచి ఏడుస్తూనే ఉంది. ఇలా ఏడిస్తే ఆమె ఆరోగ్యం ఎలా ఉంటుందో ? ఇప్పుడు ఏం చేయాలి .? ఇలా ఆలోచించుకుంటూ కూర్చున్నాడు ప్రసాదు. రాఘవయ్య గారి భార్య తల పైకెత్తి ఒక్కసారి గడియారం కేసి చూసి మళ్లీ ప్రసాద్ వైపు తిరిగి రెండు చేతులు పెట్టి ఎత్తి నమస్కారం చేసింది.

ప్రసాద్ కి పరిస్థితి అంతా అర్థమైంది. చేయవలసిన ఏర్పాట్లు చకచకా వాచ్ మెన్ సహాయం తీసుకుని ప్రారంభించాడు. మనుషులు ఎక్కడికి కదలక్కర్లేదు అన్ని ఫోన్ల మీదే కదా. అంతిమ యాత్రకి అన్ని రెడీగా ఉన్నాయి. ఇంక ప్రారంభించడమే
తరువాయి. రాఘవయ్య గారి పిల్లలు ఇక్కడ లేరు అంటున్నారు మరి ఎవరు చేస్తారు అనే పంతులు గారి ప్రశ్నకి నేనేనండి అంటూ ప్రసాద్ ముందుకు వచ్చాడు.మీరు అంటూ అనుమానంగా చూశారు పంతులుగారు. 
నేను ఆయన ఫ్రెండ్ ని.సరే మీరు స్నానం చేసి రండి అంటూ పంతులుగారు చెప్పడంతో స్నానానికి వెళ్ళిపోయాడు ప్రసాద్. స్నానం చేస్తున్నాడే కానీ ప్రసాద్ మనసులో చాలా తప్పు చేస్తున్నామ నే భావన ఉంది. ఒక బ్రాహ్మణుడికి ఇతర కులానికి చెందినవ్యక్తితలకొరివిపెట్టడoఎంతవరకుసబబు.అందరూఏమనుకుంటారు. వ్యాన్ వరకు తీసుకెళ్లే ఆ నలుగురు కూడా డబ్బు కోసం పని చేసే వాళ్లే.

ఏమిటో ఈ నగరంలో అన్ని కష్టాలే అంటూ ఇదే సందేహం పంతులుగారు ముందు వెళ్ళబుచ్చాడు. చూడండి ఇక్కడ కుల మతాల ప్రసక్తి లేదు. అనాధ ప్రేత సంస్కారం అనేది అశ్వమేధ యాగం తో సమానం. ఇక్కడ శాస్త్రాలు ప్రసక్తి కాదు. ముందుగా సహాయం అర్థించిన వాళ్ళకి చెయ్యి అందించడమే మానవత్వం. మీరు చేస్తున్నది ఆ కుటుంబానికి మహోపకారం. చీకటి పడితే శవదహనం చెయ్యకూడదు. కనుక ఆలోచన మాని ముందుకు అడుగు వెయ్యండి అంటూ పంతులుగారు
చెప్పుకుంటూ వచ్చారు.
పంతులుగారు మాట విని , తయారుగా ఉన్న ప్రసాద్ ని చూసి ఏమనుకున్నారో ఏమో ఆ ప్లాట్ లో ఉండే నలుగురు ఓనర్లు గబగబా తల స్నానం చేసి ఆ శవం దగ్గరకు వచ్చారు. 

రాఘవయ్య గారి ఆఖరి యాత్ర అలా ముగిసింది. ప్రసాద్ గారు చేసిన పనికి అందరూ అభినందించారు. ఏదో ఒక జన్మలో రాఘవయ్య గారి తోటి రుణం తీరలేదు అనుకుంటా అందుకునే జన్మలో ఇలా తీర్చుకోవాల్సి వచ్చింది అనుకుంటూ ప్రసాదు చితికి నిప్పంటించాడు. కొడుకులు మనవళ్లు కోడలు వచ్చేవరకు రాఘవయ్య గారి భార్య నీ కంటికి రెప్పలా చూసుకున్నారు ప్రసాద్ గారితో పాటు ఆ ప్లాట్ లో ఉండేవాళ్ళు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే శవo ఉన్నంతసేపు ఎవరూ చూడడానికి రాలేదు కానీ ఆ రుద్ర భూమికి చాలామంది తరలివచ్చారు.

ఈ దేశంలో మొదటి అడుగు వేయడానికి చాలామందికి ధైర్యం చాలదు. మొదటి అడుగు వేసిన వాళ్ళని అనుసరించే వాళ్లు చాలామంది ఉన్నారు. పరిస్థితి ఏదైనప్పటికీ ఒక మంచి పని కోసం నడుము కట్టే యువత, దూసుకుపోయే యువత మనకు చాలా అవసరం. నాకెందుకులే అని తప్పించుకుపోయే యువత మనస్తత్వాన్ని మార్చే గురువులు చాలామంది అవసరం. నాయకులు కూడా అంతకంటే ముఖ్యం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట