బాపనమ్మ

బాపనమ్మ

     బాపనమ్మ అదేమీ అందమైన పేరు కాదు. ఒక సినీనటి పేరు అసలే కాదు. గ్రామ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న రాజకీయ నాయకురాలు కాదు. కానీ ఆ ఊరిలో ఈనాటికీ ఆ పేరు ప్రజలందరినోళ్ళల్లో నానుతూ ఉంటుంది. నాకు తెలుసు ఉన్నంతవరకు ఆమెకు అమ్మవారి పేరు పెట్టి ఉంటారు. 

మా ఊరి బడినీ అంటే మేము రాజులు బడి అని పిలుచుకునే వాళ్ళం . ఆ బడిలో చదువుకున్న వారు బాపనమ్మ పేరు, ఆ రూపం మర్చిపోయిన విద్యార్థులు గాని గ్రామస్తులు కానీ ఎవరూ ఉండరు. మా ఊరు పాఠశాల ని రాజులు బడి అని ఎందుకంటారు అని అందరికీ సందేహం కలగొచ్చు. కారణం ఏమిటంటే మా పాఠశాలకి సొంత భవనం లేదు. ఆ గ్రామం అప్పట్లో అది కాకినాడ తాలూకా లోని పల్లిపాలెం ఒక కుగ్రామం. ఇప్పుడు కాజులూరు మండలంలోని ఒక అభివృద్ధి చెందిన గ్రామం.ఆ గ్రామానికి అప్పట్లో సరైన రోడ్లు కానీ పాఠశాల భవనం గాని లేదు. ఆ ఊరిలో క్షత్రియ వంశానికి చెందిన సుబ్బరాజు గారు మరియు నారాయణ రాజు గారు అని ఇద్దరు అన్నదమ్ముల వసతి గృహం వెరసి మా ఊరి విద్యార్థులకు సరస్వతి నిలయం అయ్యింది. 
ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆ బడి వెనుక కాపురం ఉండేవారు. అప్పట్లో ఆ బడికి అద్దె ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఆ ఇంటిలోనే కాపురం ఉండే వారి సహనానికి మటుకు జోహార్లు చెప్పలేకుండా ఉండలేం.

 ఎందుకంటే ప్రతిరోజు 10 గంటలకు ప్రారంభమయ్యే పాఠశాల పిల్లలు ఏడుపులు అరుపులు మాస్టారు గారి కేకలు తో గందరగోళంగా ఉండేది. అయినా కుటుంబ సభ్యులు ఏనాడు విసుక్కోకుండా చాలా సంవత్సరములు పాటు తమ వసతి గృహం లోనే ప్రాథమిక పాఠశాల కి ఆశ్రయమిచ్చారు. పాఠశాలకు కావాల్సిన ప్రాథమిక వసతులు లేకపోయినప్పటికీ ఆ గ్రామస్తులు తమ పిల్లల్ని బడికి పంపుతుండేవారు. అలా మా రాజుల బడిలో చదివిన విద్యార్థులు ఎంతోమంది వివిధ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్లు ఉన్నారు. వారిలో కొంతమంది ఈ లోకం నుండి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడని వారు ఒకరు జన్మనిచ్చిన తల్లి మరొకరు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల. ఆ పాఠశాలలో మాకు ఆడుకోవడానికి స్థలం లేకపోవచ్చు కానీ అప్పటి ఉపాధ్యాయులందరూ ఆదర్శ ఉపాధ్యాయులే. విద్యార్థిని బుజ్జగించి లాలించి భయపెట్టి అక్షరం నేర్పడానికి విశేషమైన కృషి చేసిన వారే. బడికి వచ్చే పిల్లలు సంఖ్య పెంచడానికి బాగా కృషి చేసిన వారే. అలా ఎన్నో తరాల వారికి చదువు చెప్పిన ఓలేటి సూరయ్య శాస్త్రి గారు మాకు వరసకి తాత అందరికీ చదువు నేర్పే గురువుగారు. 
.అలాగే ఎల్లప్పుడూ నుదుట నామం ధరించి తెల్లటి పంచ లాల్చీ ధరించి నల్లటి రూపంతోఉండే ఆచార్యుల మాస్టారు ఆరడుగుల ఉండేవారు అని గుర్తు. 

పలక మీద వ్రాసిన అక్షరాలు గుండ్రంగా అచ్చు వేయించినట్లుగా ఉండేవి. మరి ఎప్పుడూ కుర్చీలో కూర్చుని నిద్రపోయే మా వెంకన్న మాస్టరిని ఎలా మర్చిపోగలం. కుర్చీలో కూర్చోగానే నిద్ర వచ్చిన చదువు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి 

 ఎన్నో వేలమంది విద్యార్థులకి అక్షరాలు నేర్పించిన ఆ బడి అభివృద్ధికి కృషి చేసిన వారిలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తో పాటు మరొక ముఖ్యమైన వ్యక్తి మన బాపనమ్మ.
అటు ఉపాధ్యాయులకి ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకు సంధాన కర్త గా వ్యవహరించి ఎన్నో సంవత్సరాలు ఆ పాఠశాలలో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న స్త్రీ 
బాపన మ్మ.

చేతిలో బెత్తం , కుట్లు జారిపోయినచెవులు, ఆ చెవులకు వేలాడే లోలకులు, ఎప్పుడూ తెల్లటి చీర కట్టుకొని ఎత్తుగా ఉండే బాపన్నమ్మను చూసి స్కూలుకు వెళ్ళని విద్యార్థి లాగు తడుపుకునేవాడు. అవసరమైతే రెండు దెబ్బలు వేసి స్కూలుకి లాక్కుంటూ వెళ్లిపోయేది. స్కూలుకి వెళ్లడానికి మారం చేసే పిల్లల్ని సముదాయించలేక ఆ గ్రామంలోని తల్లులు బాపనమ్మ కబురు పంపేవారు.

 అదిగో బాపనమ్మ వస్తోందంటే స్వచ్ఛందంగా స్కూల్ కి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, బలవంతంగా బాపనమ్మ చేత బడికి తీసుకు వెళ్ళ బడిన వాళ్ళు కొంతమంది. మాస్టారు గారు గట్టిగా కొట్టారని పిల్లలు ఇంటి దగ్గర కంప్లైంట్ ఇచ్చి తల్లిదండ్రులను తీసుకొని వస్తే బాపనమ్మ ఆదిలోనే అడ్డుకట్ట వేసేసేది. అలా బాపనమ్మ భయం కొద్దీ స్కూల్ కి వెళ్లి నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకున్నామని ఈనాటికి చాలామంది చెబుతుంటారు. ఆ గ్రామంలో అక్షరాస్యతా శాతం పెరిగిందంటే పరోక్షంగా బాపనమ్మే కారణం.

 పిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మరి జ్ఞానం తెలిసిన వాళ్ళు జ్ఞానం తెలియని వాళ్ళు వందల సంఖ్యలో ఉండే విద్యార్థులు అపరిశుభ్రంగా చేసే ఆ పాఠశాల గదు లను ఉదయం మే పరిశుభ్రంగా చేసి పిల్లలకి త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఆరోజు పాఠశాలకు హాజరుకాని విద్యార్థుల వివరాలు మాస్టర్ దగ్గర నుంచి తీసుకుని ఆ గ్రామంలోని వీధులన్నీ తిరిగి కుంటి సాకులు చెప్పి బడి ని ఎగ్గొట్టే విద్యార్థుల నిగ్గు తేల్చేసి ఉపాధ్యాయులకు సమాచారం అందించి లేదంటే తల్లిదండ్రులతో సహా విద్యార్థులు వెంటబెట్టుకొచ్చేది.
 అప్పట్లో మధ్యాహ్నం పూట మంచి గోధుమ నూక ఉప్మా తయారుచేసి ఒక గ్లాసుడు పాలు పిల్లలకు పెట్టేది బాపనమ్మ. ఇది అప్పట్లో ప్రతి పాఠశాలలోనూ మిడ్ డే మీల్స్ ప్రోగ్రాం అమెరికన్ గవర్నమెంట్ వారి సహాయంతో నడిచేదని చెప్పుకునేవారు. అటువంటి గోధుమ నూక ఇంతవరకు నేను చూడలేదు. ఇది ఎంతోమంది పేద విద్యార్థుల కడుపు నింపేది. ఉప్మా కూడా బాపనమ్మ ఎంత రుచికరంగా తయారు చేసేదని అప్పట్లో స్నేహితులు చెప్పుకుంటూ ఉండేవారు.

కానీ నిజానికి బాపనమ్మ స్కూల్లో నేటి స్కూళ్లలో ఉండే ఆయా లాంటిది. తనకి గవర్నమెంట్ వారి జీతం ఎంత ఇచ్చేవారో నాకు తెలియదు గానీ పండగల కానీ పబ్బాలకు కానీ ఏనాడు పిల్లల దగ్గర నుంచి సొమ్ము ఆశించేది కాదు. 

పుట్టినప్పటినుంచి అమ్మఒడి అలవాటైపోయిన పిల్లలకి పాఠశాలకు వెళ్లడం అంటే ఒక రకమైన భయం. అలాంటివారిని అందర్నీ బడికి తీసుకొచ్చి పాఠశాల అలవాటు చేసే తల్లితోపాటు బాపన మ్మ పాత్ర అమోఘం.

ఆ కాలంలో ఉద్యోగులు ఎంతో బాధ్యతగా పనిచేసేవారు. విధి నిర్వహణలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ బాధ్యతని విడిచి పెట్టేవారు కాదు. అలాంటి కోవకు చెందినదే మా బాపనమ్మ. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట