జై వీర హనుమాన్
జై వీర హనుమాన్.
ఆంజనేయస్వామి సర్వమానవ ఆరాధ్య దైవం. రామ బంటుగా రామ భక్తుడిగా, అసాధ్యకార్యసాధకుడుగా, రాక్షస సంహారిగా మన మనసులో నిలిచిపోయిన దైవం.
భారతదేశంలో ఏ గ్రామం చూసిన ఏ రహదారి చూసిన స్వామి విగ్రహం లేని చోటు ఉండదు. దేవాలయంలో ఆంజనేయ స్వామిని చూసిన రహదారి పక్కనున్న విగ్రహాలు చూసిన ఒక రకమైన ఉత్తేజం ధైర్యం కలుగుతుంది. బహుశా ఆయన రూపం చూసి భయం తొలుగుతుంది. విశాలమైన వక్షస్థలం పొడవైన కాళ్లు చేతులు చేతిలో గధ వానర ముఖం వానరులకుండే ప్రత్యేకమైన అవయవం తోక కలిగి ఉంటారు స్వామి.
మానవ రూపంలో ఉండే ఈ దేవుడుకి వానర ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అందరికీ కలుగు తుంది. ఆంజనేయ స్వామి తల్లి అంజనీ దేవి. ఆమె వానర వనిత. ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి పూర్వ జన్మలో ఒక అప్సరస శాపం కారణంగా వానర కన్యగా పుడుతుంది. ఆమెకు కేసరితో వివాహం జరుగుతుంది. చాలా కాలo వరకు సంతానం కలగపోవడంతో శివుడుని పూజించి శివుడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది.
శివుడి యొక్క తేజమును వాయుదేవుడు పండు రూపంలో అంజనీ దేవికి ఇవ్వగా ఆ పండు తిన్న అంజనీ దేవికి ఆంజనేయ స్వామి జన్మిస్తాడు. అంజనీ దేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. శివుడి వరప్రసాది కాబట్టి ఆంజనేయస్వామిని రుద్రాంశ సంభూతుడు అంటారు. వాయు పుత్రుడు కేసరి అనే నామాలతో కూడా పిలుస్తారు.
అలా అంజనీ దేవి దగ్గర పెరుగుతున్న ఆంజనేయ స్వామికి ఒకసారి ఆకలి తీర్చడానికి పండ్లు తీసుకురావడానికి అంజనీ దేవి వనానికి వెళ్ళింది. ఆ సమయంలో ఉదయిస్తున్న సూర్యుడి ని చూసి పండు అనుకుని భ్రమపడి సూర్యుడిని మింగడానికి ఆకాశ వీధిలో ప్రయాణం చేస్తుంటే రాహువు అది చూసి ఇంద్రుడికి ఈ విషయo తెలియజేస్తాడు. ఇంద్రుడు తీవ్రమైన కోపంతో తన వజ్రాయుధంతో స్వామిని దవడ మీద కొట్టగా ఆంజనేయ స్వామి మూర్చ పోతాడు. ఈ సంగతి తెలుసుకున్న వాయుదేవుడు కోపగించి గాలిని స్తంభింప చేస్తాడు. లోకమంతా గాలి లేక అల్లలాడిపోతు ఉంటుంది. చివరికి దూరదృష్టితో ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ దేవుడు క్రిందికి దిగివచ్చి ఆంజనేయస్వామి శరీరం నిమురుతాడు. వెంటనే అతనికి తగిన గాయాలన్నీ మాయమైపోతాయి. తన వజ్రాయుధం వలన దవడ (హనువు) గాయపడిన కారణంగా హనుమంతుడని పిలవబడతాడని దీవించాడు. అలాగే అతనికి వజ్రాయుధం కారణంగా మరణం సంభవించదని వరం ఇస్తాడు .సూర్యుడు సకల విద్యలునేర్పుతానని ఆశీర్వదిస్తాడు.
అలా సూర్యుడి దగ్గర సకల విద్యలను వ్యాకరణాన్ని నేర్చుకుని మంచి పండితుడిగా పేరు సంపాదించుకున్నాడు హనుమంతుడు వరుణదేవుడు నీటి వలన స్వామికి మరణం ఉండదని వరమిచ్చి ఆశీర్వదిస్తాడు. యముడు తన కాలదండం ఏమీ చేయలేదని అతను మృత్యుంజయుడని చిరంజీవుడని వరాలిస్తాడు. ఇలా అష్టదిక్పాలకులు ఇచ్చిన వరాలతో సకల శాస్త్రాలు వ్యాకరణo సూర్యుడి దగ్గర నేర్చుకుని కిష్కిందకు చేరి వాలి తమ్ముడైన సుగ్రీవుడి దగ్గర మంత్రిగా చేరుతాడు.
వాలి సుగ్రీవుల ఇద్దరి మధ్య కలిగిన వైరం కారణంగా సుగ్రీవుడు తన ప్రాణాలను రక్షించు కోవడం కోసం అరణ్యo లోకి పారిపోయి ఆంజనేయ స్వామి తో సహా అక్కడ తల దాచుకుంటాడు. నిజానికి వాలి కంటే ఆంజనేయ స్వామి బలవంతుడు. చిన్నప్పుడు మునులు ఇచ్చిన శాపం కారణంగా ఆంజనేయ స్వామికి తన బలం ఎవరైనా గుర్తు చేస్తే తప్పితే గుర్తుకు రాదు. అందుకే సుగ్రీవుడితో సహా అరణ్యాల్లో తలదాచుకుంటాడు.
ఈలోగా రావణాసురుడు ఎత్తుకొని పోయిన సీతాదేవిని వెతుకుతూ రామలక్ష్మణులు ఇద్దరు ఋష్యశృంగ పర్వతం చేరుకుంటారు. ఆ రామలక్ష్మణుల్ని ఇద్దరిని చూసి వాలి తమను చంపడానికి ఎవరినో పంపించి ఉంటారని భావించి సుగ్రీవుడు వారి దగ్గరికి ఆంజనేయ స్వామిని పంపుతాడు.
ఆంజనేయస్వామి ఒక భిక్షువుగా రూపం మార్చుకుని రామలక్ష్మణలను ఉద్దేశించి "అయ్యా మీరు మహా పురుషులని మీ రూపం చూస్తే తెలుస్తుంది. మీరు విల్లంబులు ధరించి ఇక్కడకి ఎందుకు వచ్చారు. నేను సుగ్రీవుడి మంత్రిని. మారువేషం లో ఉన్నాను అని చెప్పగానే రామలక్ష్మణులు ఇద్దరు తమ వృత్తాంతం అంతా చెప్పి తాము సుగ్రీవుని కలుసుకోవడానికి పర్వతం దగ్గరకు వచ్చామని చెప్పగానే హనుమంతుడు సుగ్రీవుడికి రామలక్ష్మణుల ఇద్దరి వృత్తాంతం అంతా చెప్పి ఇద్దరికీ మైత్రి కుదురుస్తాడు. సుగ్రీవుడు అన్నగారి వాలిని చంపే విషయంలో రామచంద్ర మూర్తి సహాయం కోరుతాడు సుగ్రీవుడు. అందుకు రామచంద్ర మూర్తి అంగీకరిస్తాడు.
సీతాన్వేషణకు తన వానర సైన్యంతో సహాయం చేస్తానని మాట ఇస్తాడు సుగ్రీవుడు. అలా అనుకున్న ప్రకారం వాలిని చెట్టు చాటు నుంచి రామచంద్ర మూర్తి చంపడం సుగ్రీవుని కిష్కింద రాజ్యానికి పట్టాభిషిక్తున్ని చేయడం ఆ తదుపరి అనుకున్న విధంగా సీతాన్వేషణకి వానర సైన్యాన్ని నాలుగు దిక్కులకు పంపడం అందులో దక్షిణ దిక్కుగా పంపిన సైన్యానికి నాయకుడుగా అంగదుడుని నియమించగా అందులో ఆంజనేయస్వామి కూడా ఒక బృంద సభ్యుడుగా ఉంటాడు.
చివరికి ఎన్ని చోట్ల వెతికినా సీతాదేవి కనపడకపోవడంతో సంపాతి అనే పక్షిరాజు చెప్పిన మాటల ప్రకారం సీతాదేవిని రావణాసురుడు లంకలో బంధించినాడని ఆ లంక చేరుకోవాలంటే నూరు యోజనాలు గల సముద్రం దాటి లంక చేరుకోవాలని అందుకు సమర్ధుడు ఆంజనేయ స్వామి అని జాంబవంతుడు చెప్పిన మాట విని ఆంజనేయ స్వామి లంకా నగరం చేరుకుంటాడు.
లంకా నగరం చేరి ఎదురుపడిన లంఖిణి అనే రాక్షసిని వధించి సీత జాడ కనిపెట్టి రామ రావణ యుద్ధానికి లంక చేరుకోవాలంటే నూరు యోజనముల గల సముద్రం దాటాలని సముద్రం దాటడానికి వానర సైన్యం సహాయంతో వారధి నిర్మిస్తారు.
ఆ తర్వాత జరిగిన రామ రావణ యుద్ధంలో ఆంజనేయ స్వామి ముఖ్యపాత్ర వహించి రావణ సంహారంలో మహా భయంకరమైన రాక్షసులను సంహరించడం రామలక్ష్మణులు ఇద్దరికీ నమ్మిన బంటుగా సహాయం చేసి రావణాసురుని వధించి చరిత్రలో రామ బంటుగా చిరంజీవిగా ప్రజల గుండెల్లో మిగిలిపోయాడు ఆంజనేయుడు.
. జగములో కష్టమైన పని ఏదైనా సరే స్వామి అనుగ్రహం వలన పూర్తి కాగలదు . మహావీర అనే ఆంజనేయ స్వామి నామం జపిస్తే భూతప్రేత పిశాచాలు దరి చేరవుట. రోగములు నశిస్తాయి పీడలు హరించబడతాయి .
ఆంజనేయ స్వామిని గనుక పూజిస్తే శ్రీరాముడి దయ కలిగి జన్మజన్మలలో దుఃఖo నుండి విముక్తులవుతారు . వేరే దేవతను పూజించక్కర్లేదు ఒక ఆంజనేయ స్వామిని పూజిస్తే సర్వ దేవతలను పూజించినట్లే అని తులసీదాసు తన హనుమాన్ చాలీసాలో చెప్పడం జరిగింది.
తులసీదాసు గారి రామచరిత మానస్ అనే కావ్యాన్ని పఠిస్తున్నప్పుడు శ్రోతలలో ఆంజనేయ స్వామి కూడా ఉండేవారని తులసీదాస్ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది.
ఎక్కడైతే రామ భజన జరుగుతుందో అక్కడ స్వామి తప్పకుండా ఉంటాడు.
సింధూరం ధరించడం స్వామికి ప్రీతి. ఎందుకు అంటే ఒక కథ చెప్తారు. ఒకప్పుడు సీతాదేవి నుదుటిని ధరించిన సింధూరాన్ని చూసి అమ్మ ఎప్పుడు ఎందుకు నుదుట సింధూరం ధరిస్తున్నారు అని అడిగాడు స్వామి. అందుకు సీతాదేవి భర్త క్షేమం కోసం వివాహమైన ప్రతి స్త్రీ నుదుటన కుంకుమ ధరించాలని చెప్పిందిట . తన స్వామి అయిన రామచంద్ర మూర్తి క్షేమంగా ఉండడం కోసం ఆంజనేయస్వామి ఒళ్లంతా సింధూరం పూసుకుంటూ ఉంటాడు అప్పటినుండి. వజ్రాయుధము వలన దెబ్బతిన్న దవడ కారణంగా గట్టిపదార్థములు తినలేడు కాబట్టి మెత్తటి పదార్థములు అంటే స్వామికి చాలా ఇష్టం. అందుకే అప్పములు నైవేద్యముగా స్వామికి సమర్పిస్తారు.
అలాగే స్వామికి తమలపాకులు అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే సీతాదేవిని లంకలో కనిపెట్టిన తర్వాత తిరిగి వచ్చిన ఆంజనేయస్వామి వానర వీరులందరూ తమలపాకు దండ వేసి అభినందనలు తెలిపారుట.. ఈ విషయం ఇటీవల గరికపాటి వారి ప్రసంగంలో తెలిపారు.
ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి ని హనుమత్ జయంతిగా పండుగను జరుపుకుంటాము. ఆరోజున స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు చేస్తారు. అంతటి మహా మహిమాన్వితుడైన స్వామిని మన o కూడ పూజించి తరిద్దాం.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి