మామిడి తోట

మామిడి తోట

వేసవికాలం సాయంకాలం నాలుగు గంటలు అయింది. అయినా ఇంకా ఎండ ప్రతాపం తగ్గలేదు. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతంఅయింది. ఈదురు గాలులు." గాలి దుమ్ము వచ్చేలా ఉంది పిల్లలు అందరూ తోటలోకి వెళ్దాం పదండి తట్టలు పట్టుకుని రండి ఉన్న కాయలు రాలిపోతాయి కాబోలు అనిచలపతిరావు గారు తోటలోకి పరిగెత్తారు పిల్లలతో సహా. బలంగా వీస్తున్న గాలులకి కొమ్మలు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి.అప్పటికే తోటలో కాయలు కొద్దికొద్దిగా గాలికి కింద పడిపోయిఉన్నాయి. 

పిల్లలందరూ మామిడికాయలు ఏరి ఆ తట్టలో పడేసారు. అలా తట్టతో తీసుకొచ్చిన కాయలు ముక్కలుగా మారి కుండలో మరునాడు మాగాయిగా మారిపోయేది .అది చిన్ననాటి మామిడి తోట అనుభవం.

ఆ మామిడి తోటకు సుమారు అప్పటికి 60 సంవత్సరాల సంవత్సరాల వయసు ఉంటుంది. ఎప్పుడో మా తాతగారు అన్నదమ్ములు అందరూ కలిసి నాటిన మొక్కలు. వాళ్లు బ్రతికున్న రోజుల్లో వాటి ఫలాలు తిన్నారా లేదో తెలియదు గాని అంటే మనవలం శుభ్రంగా ఆనందంగా ఆ మామిడి తోట లో కాసిన మధుర ఫలాలు అన్ని శుభ్రంగా తిన్న వాళ్ళమే. ఆ తోట చూసినప్పుడల్లా నాకు రాజుగారు ముసలివాడు కథ గుర్తుకొస్తుంది. ఆ తరం వాళ్లకి ఎంత ముందుచూపు. అంత పెద్ద తోటను పెంచడానికి వాళ్ళు ఎంత కృషి చేసి ఉంటారో కదా.

 అందుకనే ప్రతి ఏటా వేసవికాలంలో తన పెద్దల పేర్లు చెప్పి బ్రాహ్మలకి పండు పెట్టి నమస్కారం చేసేవారు మా నాన్నగారు. అంతవరకు ఆయన పండ్లు ముట్టుకునే వారు కాదు. బహుశా అది కృతజ్ఞత కాబోలు.ఆ తోటలో సుమారు అన్ని రకాల మామిడికాయలు కాసే చెట్లు ఉండేవి.ఆ కాలంనాటి మామిడికాయ రకాలు ఈ కాలం పిల్లలకి అసలు తెలియవు. పాపయ్య రాజు గోవా, చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసం బుడతల చెట్టు, కలెక్టర్ కాయలు, నీలం కాయలు, బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి ఇవన్నీ మామిడి కాయల పేర్లు. కొన్ని ఊరగాయలకు పనికొచ్చేవి. మరికొన్ని పండు కోసం. 

అందంగా ఉన్న మనిషిని చూస్తే అబ్బా పండు లా ఉన్నాడు అoటూ పండుతో పోలుస్తారు. మనుషులు పండు తింటే పండులా అయిపోతారు. ఇక వేసవికాలం సీజన్ కి మామిడి పండే మహారాజు.

అన్ని రుచులు తెలిపే ఉగాది పచ్చడి తయారు చేయడంతో మామిడి కాయ వాడకం మొదలవుతుంది. చిన్న చిన్న మామిడి పిందెలు ఇంకా జీడి కారుతూనే ఉంటాయి. అయినా ఆ వగరు రుచి ఉగాది పచ్చడి కి మరింత రుచిని చేకూరుస్తుంది. కొంచెం కాయ ముదిరితే మన తెలుగు ప్రజలందరూ ముఖ్యంగా చేసుకునే వంటకం మెంతి బద్దలు. పచ్చడి బద్దలు అంటారు. ఆ రుచి తలుచుకుంటే ఇప్పటికీ నోరు ఊరిపోతోంది.

కాయ కాస్తంత ముదిరి పెరిగి పెద్దయితే ఇంకేముంది రోజు పప్పు మామిడికాయ అందులో కాసిన్ని వెల్లుల్లిపాయ పోపు పెడితే ఇంక చూసుకోండి నా సామిరంగా కంచాలు ఖాళీ అయిపోయేవి.ఆ కాలం వంటలు వేరు. రుచులు వేరు. 

కమ్మగా వేయించిన కందిపప్పులోకి పుల్లగా ఉండే మామిడికాయ ముక్కలు వేసి వండిన వంటకం. పప్పు కి కాంబినేషన్ పులుసు. ఇది ముక్కల పులుసు కాదు. మామిడికాయ ముక్కల పులుసు. మామిడికాయ ముక్కలు ఉడకబెట్టి కాస్తంత బెల్లం జోడించి ఇంగువ పోపు పెడితే చూసుకోండి అమ్మ వంతు వచ్చేటప్పటికి గిన్ని ఖాళీ అయిపోయేది. అలా ఉండేది మా అమ్మ చేతి మామిడికాయ పులుసు. మధ్యలో మామిడికాయల్ని ముక్కలుగా నరికేసి రోటిలో వేసి పచ్చడి పచ్చడి చేసి పోపు పెడితే అదే మామిడికాయ పచ్చడి. అబ్బో నేను చెప్పడం కాదు మీరు చేసుకుని చూడండి.

ఇలా పప్పు ,పులుసు ,మెంతి బద్దలు, తోటి మామిడికాయని వదులుతామా లేదండి మామిడికాయ తోటి అసలు కథ ముందుంది. ఎండలు తగ్గిపోతున్నాయి. బజార్లోకి వెళ్లి మంచి మిరపకాయలు కుదిరితే గొల్లప్రోలు మిరపకాయలు పట్టుకు రండి అంటూ అమ్మ రోజు నాన్నను సతాయిస్తూ ఉండేది. మామిడి కాయలు కొనుక్కోక్కర్లేదు కానీ ఆయన జేబుకేసి చూసుకునే వారు. 

ఎందుకంటే మిగిలిన ముఖ్యమైన సరుకులు కొనాలి కదా. ఏడాదంతా సరిపోయే ఊరగాయ పెట్టుకోవాలి. అందరికీ ఆవకాయ అంటే ఇష్టమే. పెద్ద పెద్ద సంసారాలు. చుట్టాలు ఊళ్లో వాళ్ళు పత్యం కోసం అడుగుతుంటారు. ఇది అమ్మ టార్గెట్. నాన్న అందుకు సంసిద్ధుడై మోయలేని భారం మోసి సరుకు తెచ్చి ఇంట్లో పడేసేవారు. అవన్నీ ఎండలో పెట్టుకుని మళ్లీ సాయంకాలం లోపల పెట్టుకోవడం ఒక పెద్ద పని. ఆ రోజుల్లో కారాలు ఆడించేవారు కాదు.

రోళ్లు రోకళ్ళు పెట్టి కారాలు దంచేవారు. దీనికి ప్రత్యేకమైన పని వాళ్ళు ఉండేవారు.ఆ మండుటెండలో చెమటలు కక్కుతూ కారాలు కొడుతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు వచ్చేవి. పాపo ఆ కారం దంచే వాళ్ళకి ఎలా ఉండేదో ఏమిటో.

అలా కారాలు సిద్ధం చేసుకున్న తర్వాత మర్నాడు ఉదయమే ఆవకాయ పెట్టడానికి నిర్ణయించుకుని తోటలోకి పరిగెత్తి చిక్కానికి చిక్కిన మామిడికాయలు అన్నింటిని కోసి గుండిగ నిండా నీళ్లు పోసి అందులో ఈ కాయలు వేసి పిల్లలందరం కలిసి గుడ్డలతో కాయలు శుభ్రంగా తుడిచి అప్పటికే కత్తి పీట మీద కాయలు తరగడానికి కూర్చున్న మా బాబాయ్ గారికి అందిస్తే ఆయన నిర్దయగా ముక్కలు కింద నరికి పోగులు పెట్టే వారు.

ఆ ముక్కల నుంచి జీడి తీసి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేవాళ్ళం. ప్రతి ఏటా ఆవకాయ పెట్టేటప్పుడు పిల్లలు అందరూ కలిసి ఈ పని చేసేవాళ్లం. పిల్లలకి బృందంతో కలిసి పనిచేయడం పెద్దలు నేర్పిన విద్య.
 అలా శుభ్రంగా తుడిచిన ముక్కల్ని మా అమ్మగారు శుభ్రంగా స్నానం చేసి మడి కట్టుకుని తూర్పుగా తిరిగి దండం పెట్టి కారం తో జత చేసి నూనెతో తడిపి కుండలో పెట్టి పైన గుడ్డ కట్టి కింద చుట్ట కుదురు పెట్టి దేవుడి గదిలో ఉన్న ఊరగాయల బల్లమీద జాగ్రత్త చేసేవారు. ఆనాటి పెద్దలు అలా శుచి శుభ్రంగా ఏ పనైనా చేసేవారు.

 స్నానం చేయకుండా పొయ్యి వెలిగించేవారు కాదు. ఒక రకం కాదు రకరకాల ఊరగాయలు మామూలు ఊరగాయ, బెల్లం ఆవకాయ, పచ్చ ఆవకాయి, మాగాయి, తొక్కుడు పచ్చడి, ఏడాదికి సరిపడేలా పెట్టేవారు. ఊరగాయ కుండలోంచి ఆవకాయ తీయాలంటే మడి కట్టుకునే తీసేవారు. అలా ఉండేవి ఆనాటి సాంప్రదాయాలు పద్ధతులు. చెరువులోని ఎర్రకలువ పువ్వులా ఉండేది కుండలోని ఆవకాయ. ఆవకాయ పెట్టిన మూడో రోజు నుంచి కాదు కాదు మరునాడు నుంచి కొత్త ఆవకాయ తినడం మొదలుపెట్టి అలా రెండు మూడు రోజులు వరుసగా తిని మూడో రోజు రాత్రి నిద్ర పట్టలేదు అని కాళ్లు లాగుతున్నాయని వేడి చేసిందని అటు ఒక రోజు మానేసి మరునాటి నుంచి మామూలే. అంత క్రేజ్ ఉంది మన ఆంధ్రులకి ఆవకాయ అంటే. వేసవి అయ్యేసరికి సగం కుండ ఖాళీ. అంతా ఆవకాయ గురించే చెప్పాను ఎందుకంటే మాగాయే మహా పచ్చడని వేటూరి గారు ఎప్పుడో చెప్పేసారు. 

పిల్లలందరికీ వేసవి సెలవులు. సాయంకాలం కూడా చల్లగాలికి తోటలోకి వెళ్లి చెట్టు కింద రాలిన మామిడికాయలను ఉప్పు కారం నంజుకుని తినేవాళ్ళం. అదో మజా. అందులో బంగినపల్లి మామిడికాయ అంటే కొద్దిగా తియ్యగా ఉండేది. ఇంక ఇంటికి వచ్చి బెల్లపు ఆవకాయ మధ్యాహ్నం వండిన అన్నంలో కలుపుకుని కాస్తంత నూనె వేసుకుని ఉల్లిపాయ నంజుకుని తలో ముద్ద పంచుకుని తింటే ఆ ఆనందం ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతుంది. 

ఆవకాయల ప్రహసనం అయిపోయిందనే సరికి చిటారు కొమ్మన చిలకకొట్టిన మామిడిపండు కింద రాలిపడి ఉండేది. అంటే మామిడిపండ్లు ముగ్గపెట్టే కాలం వచ్చిందని అర్థం. 

తోటలో ముదర కాయలన్నీ కోసి గదిలో గడ్డి వేసి దానిమీద కాయలు పేర్చి పైన గోనె గుడ్డ కప్పి మూడు రోజులు ఎదురు చూస్తే నాలుగో రోజు గదిలోంచి గుప్పుమని వాసన. బుడ్డి దానికి బుడతల పండు, అన్నయ్యకి పాపయ్య రాజు గోవా, చెల్లెలికి చెరుకు రసం, నాన్నకి నాలుగు రకాల ఇష్టం, అమ్మ మిగిలిన దాంతో సంతృప్తి పడేది. మామిడిపండ్ల సీజన్ అయిపోయేసరికి ఆఖరున నీలం కాయ, కలెక్టర్ కాయ సంతృప్తి నిచ్చేవి. మామిడిపండ్ల సీజన్ అయిపోయేసరికి మ్యాంగో జల్లి మార్కెట్లో కి వచ్చేసేది. ఇలా మామిడికాయలతో మామిడిపళ్ళతో ఊరగాయలతో వేసవికాలం గడిచిపోయేది.

కాలం మారిపోయింది. మధ్యలో వచ్చిన తుఫానులు గాలి దుమ్ములు మామిడి చెట్లు పొట్ట కొట్టేసి తలుపు చెక్కలు అయిపోయాయి. గత వైభవానికి గుర్తుగా కొన్ని చెట్లు ఉన్న మాకు వృద్ధాప్యం వచ్చిందంటూ వాడిపోయాయి. చేతులు మారిపోయిన చెరగని ప్రేమతో కొన్ని చెట్లు ఇంకా మధుర ఫలాలను ఇస్తున్నాయి.

సుమారు 50 సంవత్సరాలు పైగా మధుర ఫలాలను అందించిన ఆ మామిడి చెట్లని వేసవికాలం వచ్చిందంటే తలుచుకొని రోజు ఉండదు. ఈనాడు మందు తిని పచ్చగా మెరిసిపోయే బజారులో దొరికే కాయలను చూసి కళ్ళు చమరుస్తాయి. అంత చక్కగా ఎంతో దూర దృష్టితో మామిడి తోటలను పెంచిన ఆ పెద్దలందరికీ మరొక్కసారి నమస్కారములు పెట్టడం కన్నా చేయగలిగింది ఏమీ లేదు. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట