ఆ స్వరం
ఆ స్వరం దేవుడిచ్చిన వరo. అన్నమయ్య పద కవితా వైభవాన్ని ఆ గొంతులో వినడం యావత్ ప్రజానీకం చేసుకున్న అదృష్టం. మనం అన్నమయ్య పద సాహిత్యం లోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నాం కానీ అన్నమయ్య గొంతు మనకు తెలియదు.
చేతిలో తంబురా పట్టుకుని కర్ణాటక సంగీత స్వరాలు ఆధారంగా చేసుకుని జీవితమంతా అన్నమయ్య పద స్వరార్చన చేస్తూ కాలం గడిపిన మహా గాయకుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. అన్నమయ్య కీర్తనలు అందరూ పాడతారు. కానీ ఈ స్వరము వినగానే ఏదో భక్తి భావం మనలో పుట్టి ఏదో లోకంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. మనసుని ఆనందపరుస్తుంది. పదే పదే ఆ పాట వినాలనిపిస్తుంది. విష్ణు కథ వినడం మన భాగ్యమని అన్నమయ్య గారు అంటే ఆ పాట ఈ గొంతులో వినడం మనమందరం చేసుకున్న అదృష్టం
" నారాయణ నీ నామమే గతి మాకు అని అన్నమయ్య చెబితే ఈ బాలకృష్ణుడు గొంతులో ఆ పాట యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించడం మనకి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరప్రసాదంగా భావించాలి.
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అనే అన్నమయ్య పాట గరిమెళ్ళ వారి గొంతులో వినగానే ఒక్కసారి ఆ కోనేటి రాయుడుమన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు అనడంలో సందేహం లేదు. ఆయన సంగీత స్వర బాణీ అటువంటిది. పలికే గొంతు అటువంటిది.
సాక్షాత్తు ఆ దేవదేవుడిది బ్రహ్మ కడిగిన పాదం అయితే ఆ కీర్తన రచించడం అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామి వరమైతే సుమధురంగా శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులో వినడం యావత్ ప్రపంచం చేసుకున్న అదృష్టం.
ఆకాశంలో మెరిసే తారల రాశులను ఆధారంగా చేసుకుని అన్నమయ్య ఇన్ని రాశుల ఉనికి అని అంటే బాలకృష్ణ ప్రసాద్ ఆ కీర్తన పాడి సంగీత స్వర వినీల ఆకాశంలో ఒక ధ్రువతారగా వెలిగిపోయాడు.
పెళ్లికూతురుని పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురుగా వర్ణిస్తున్న అన్నమయ్య గారి పాట పాడుతున్నప్పుడు ఎందుకో నాకు పెళ్లికూతురు సిగ్గు ఆయన గొంతులో వినిపిస్తుంది.
ఇన్ని మంత్రములు ఇందే ఆవహించెను అనే అన్నమయ్య గారి కీర్తన బాలకృష్ణ ప్రసాద్ గొంతులో వింటున్నప్పుడు భక్తి భావం పొంగి పొర్లుతుంది.
తిరువీధుల మెరిసే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి స్వరార్చనలో నిత్యం తరించిపోయేది ఆయన స్వరం. అది ఆయన చేసుకున్న అదృష్టం. 600 కీర్తనలు పైగా స్వరపరిచే అదృష్టం గరిమెళ్ళ వారి కే దక్కింది. భగవంతుడు తనని కీర్తించిన వారిని ఎలా అనుగ్రహిస్తాడు అనడానికి ఉదాహరణ తిరుపతి దేవస్థానంలోని అన్నమయ్య ప్రాజెక్టులో గరిమెళ్ళ వారిని చేర్చుకోవడం టీటీడీ ఆస్థాన విద్వాంసుడుగా నియమించడం ఉదాహరణలుగా చెప్పవచ్చు.
ముద్దుగారే యశోద ఇంట ముత్యము వీడే అని పాడుతున్నప్పుడు బాలకృష్ణుడు బాల్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. పవిత్ర గోదావరి నది తీరంలో రాజమహేంద్రవరం లో పుట్టిన అన్నమయ్య స్వరార్చకుడు మనవాడే అని తెలిసిన ప్రతి తెలుగు వాడి గుండె ఉప్పొంగిపోతుంది.
ఈ భూమండలానంతటిని పాలించే ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ఒక్క అన్నమయ్య జోలపాటతో నిద్రపోతాడు . ఈ పాట బాలకృష్ణ ప్రసాద్ స్వరంలో వింటున్నప్పుడు బాధపడుతున్న మన మనసును నిద్రపుచ్చుతుంది. ఆ స్వరానికి అంత శక్తి ఉంది. అది నాదస్వరమై మన మనసును ఆనంద లోకాల్లో ఆడిస్తుంది .
భావములోనా భాగ్యములోనా గోవిందా గోవిందా అని కొలువరే అంటాడు అన్నమయ్య . నిత్యము అన్నమయ్య స్వరార్చన లో జీవితం గడపడం నిజంగాఆ అన్నమయ్య కృప వెంకటేశ్వర స్వామి దయ అని చెప్పవచ్చు బాలకృష్ణ ప్రసాద్ గారికి
నిత్యము బాలకృష్ణ ప్రసాద్ గళం విప్పి మాధవ కేశవ మధుసూదన అంటూ ఆ కేశవుడు నామాలతోటే స్వరార్చన చేస్తున్నప్పుడు ఆ గానానికి మనం శ్రోతలవడం మనకి అది అదృష్టం గాను మనము చేసుకున్న పుణ్యం గాను మనం భావించవచ్చు.
ఏ కీర్తనకి గొంతులో ఏ భావం పలికించాలో ఏ రసభావం వినిపించాలో బాలకృష్ణ ప్రసాద్ కి బాగా తెలుసు. అన్నమయ్య కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద శృంగారతత్వం శరణాగతి తత్వం భక్తితత్వం ఆధ్యాత్మికతత్వం ధోరణిలో రచనలు కొనసాగించాడు.
ఆ కీర్తన ఏ రకమైన తత్వ ధోరణిలో అన్నమయ్య వ్రాశాడో ఆ రకమైన భావం గొంతులో పలికించిన గాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వాడు బాలకృష్ణ ప్రసాద్
సంగీతమంటే వినోదానికి మాత్రమే పరిమితమని భావించే వారికి, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరం విన్న వెంటనే ఆ అభిప్రాయం మారిపోతుంది. ఆయన గొంతు కేవలం రాగాల సమాహారం కాదు, భక్తి ప్రవాహం. అన్నమయ్య కీర్తనల మాధుర్యాన్ని, సంగీత స్వరబాణీలో కరిగించి, ఆధ్యాత్మికతతో అలంకరించి భక్తుల హృదయాల్లో భగవత్ప్రేమను నింపిన మహా గాయకుడు
"నారాయణ నీ నామమే గతి మాకు" – ఈ పాట వింటే, మమకారం, ఆత్మ సమర్పణ, పరమాత్మ ప్రేమ అన్నీ ఒక్కసారిగా మనసును కదిలిస్తాయి
"ఇన్ని మంత్రములు ఇందే ఆవహించెను" – వింటుంటే మనమే ఆలయ ప్రాంగణంలో నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది.
ఈ పాటలు కేవలం గాత్రసిద్ధితో పాడినవి కావు. భగవత్ప్రేమతో నిండిన హృదయంతో పాడినవి. అందుకే, ఆయన పాటల్లో మనసుకు అర్థమయ్యే సంగీత మాధుర్యం మాత్రమే కాదు, ఆత్మను తడిపేసే దైవానుభూతి కూడా ఉంటుంది.
ఆయన గాత్రంలో "పలికే శబ్దము – పరమపదము" అనే అన్నమయ్య మాట నిజమైపోయింది. ఆయన గొంతు భక్తి స్వరూపం, ఆయన సంగీతం ఆరాధనా గానం.
గరిమెళ్ళ గారి సంగీత ప్రస్థానం శాశ్వతంగా నిలిచిపోయే మహా సంకల్పం. ఆయన పాడిన అన్నమయ్య కీర్తనలు యుగయుగాలు భక్తుల హృదయాల్లో నూతనోత్సాహాన్ని నింపుతూనే ఉంటాయి. సంగీత వినీలాకాశంలో ఆయన ఒక ధ్రువతారలా వెలుగొందుతూనే ఉంటారు.
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులో అన్నమయ్య కీర్తనలు వింటే, మానవత్వం, భక్తి, ఆనందం అన్నీ కలిసిన ఒక అపూర్వ అనుభూతిని పొందినట్టు అనిపిస్తుంది. తిరుమల శ్రీవారి పదసాహిత్యాన్ని ఆలపించేందుకు ఆయనను ఉపయోగించడం భగవంతుడి అనుగ్రహం.
భగవంతుని స్వరార్చనలో మునిగిపోయిన ఆయన స్వరానికి వచ్చిన అవార్డులు రివార్డులు ఎన్నో లెక్క తెలియదు. అన్నిటికన్నా మించిన వరం అందరికీ దొరకని వరం భగవంతుడు కొందరికి మాత్రమే ఇచ్చే సుస్వరం ఆయనకు దక్కింది.
ఎన్నో రాగాలతో అన్నమయ్య స్వరార్చన చేసి మనల్ని ఆనందపరవశులను చేసి భగవంతుడు లో ఐక్యమైపోయిన ఆ గాయకుడుకి ఇది అక్షర నీరాజనం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి