మనిషి ఎప్పుడూ బలహీనుడే
ఉదయం 6:00 అయింది.
గదిలో మంచం మీద పడుకున్న సుమతికి వీధిలో గట్టిగా మాటలు అరుపులు వినపడడంతో ఒక్కసారి మెలకువ వచ్చింది.
బయటి నుంచి ఏవో శబ్దాలు. బహుశా వర్షం పడు తోంది అనుకుంటూ కాళ్లు కిందపెట్టేటప్పటికీ చల్లగా తగిలింది.
ఏంటి నీళ్లు ఒలికి పోయాయా! అనుకుంటూ లైట్ వేసింది. లైట్ వెలగలేదు. కరెంట్ లేదనుకుంటా మరి ఇన్వర్టర్ పనిచేయట్లేదా అనుకుంటూ బ్యాటరీ లైట్ వేసి గది అంతా చూసింది
గదినిండా నీళ్లు. అలాగే నడుచుకుంటూ హాల్లోకి వచ్చేటప్పటికి హా లు రెండో బెడ్ రూమ్ కిచెన్ డైనింగ్ హాలు కూడా నీళ్లతోటి మునిగిపోయి ఉన్నాయి. ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది సుమతికి.
ఏం చేయాలో తోచలేదు. పనిమనిషి రాలేదు. ఇంత నీరు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ గదిలోకి వచ్చి భర్త రామారావు నీ లేపింది. సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పని ఉంటే గాని భర్తని ఆ సమయంలో నిద్ర లేపని సుమతిని ఏమైంది అని ఆందోళనగా అడిగాడు రామారావు.
" మన ఇంట్లో నీళ్లు వచ్చేసేయండి అని సుమతి మాటలు ఒక్కసారి వినేసరికి రామారావు గబుక్కుని హాల్లోకి వచ్చి వీధి తలుపు తీశాడు. బయట హోరున వర్షం కురుస్తోంది. కారు సగం వరకు మునిగిపోయింది. పెరడు నిండా నీళ్లు. అప్పటికే రోడ్డుమీద మోకాళ్ళ లోతు నీళ్లలో పడవలు తిరుగుతు కనబడ్డాయి. ఇది మామూలు వర్షం కాదు. ఏదో జలప్రళయమే. మనం వాగు పక్కనే ఇల్లు కట్టుకున్నాము. ఆ గట్టు తెగిందా మన పరిస్థితి గోవిందా అనుకున్నాడు రామారావు.
ఆ దృశ్యం చూసేటప్పటికి ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది రామారావుకి. "సుమతి గబగబా పిల్లల్ని లేపు ముఖ్యమైన సామాన్లు బ్యాగులో పెట్టు. మనం పై వాటాలోకి వెళ్ళిపోదాం అంటూ హడావుడి పెట్టాడు.
అలా రెండు బ్యాగులు పట్టుకుని పిల్లల్ని ఇద్దరినీ గట్టిగా పట్టుకుని రామారావు ఇంటికి తాళం వేసి సుమతిని తీసుకునీ మెట్లు ఎక్కుతుంటే సగం వరకు మెట్లు నీళ్లతో నిండిపోయాయి. అడుగు వేస్తే జారిపోతోంది. ఉన్నవి పది మెట్లు అయిన అతి కష్టం మీద పై వాటా లోకి చేరుకున్నాడు. లోపలికి వెళ్ళగానే పిల్లలు ఇద్దరు మంచం మీద పడుకుని నిద్రపోయారు. రామారావు ,సుమతి ఇద్దరు మొహం కడుక్కుని వచ్చి కుర్చీలో కూలబడి ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ఎనిమిది గంటలు అయింది. లేచి లేవగానే కాఫీ తాగడం అలవాటు. బయట వర్షం లోపల అంతా నీళ్ళు. ఏం చేయడానికి తోచడం లేదు. భయం భయంగా ఉంది పరిస్థితి. పిల్లలు లేస్తే ఏం చేయాలి.
బయట ఎక్కడ హోటల్ ఉండదు. జొమాటో ప్రసక్తి లే నే లేదు. పనిమనిషి రాలేదు. ఏం చేయాలి రా భగవంతుడా. బీరువాలో డబ్బులు ఉండిపోయాయి. ఇప్పుడు డబ్బులు ఉండి ఏం ప్రయోజనం. ఎక్కడ బయట సరుకు అమ్మే వాళ్ళు లేరు. ఎకౌంట్లో కూడా డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తాం. అంతవరకు జీవితంలో దేనికి భయపడనీ రామారావుకి ఒక్కసారిగా భయం పట్టుకుంది. డబ్బుంటే దేనినైనా సాధించవచ్చు అని అనుకుంటాం. ఆ డబ్బు కూడా పరిగెడతాం.
అలా పరిగెట్టి పరిగెట్టి జీవితంలో కాంట్రాక్టులు చేసి కోట్లు సంపాదించాను. అయినా ఈ రోజు పరిస్థితి ఏమిటి. ఆ పరుగు పందెంలో పక్కనున్న వాళ్ళు ఎవరో కూడా పట్టించుకోకుండా ఖరీదైన కార్లలో అద్దాలు దించేసుకుని బయటకు వెళ్లి ఇంట్లోకి వెళ్లిపోయే వాడిని. ఎక్కడలేని నిర్లక్ష్యం. రెండు రోజులు ముందు నుంచి భారీ వర్షాలు అని చెప్తున్నా కనీసం పాల ప్యాకెట్లు కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకోలేదు. అంటే అంత బాధ్యత లేకుండా స్పృహ లేకుండా కేవలం డబ్బు కూడా పరిగెత్తాను అనుకుంటూ బాధపడుతున్నాడు రామారావు. రామారావు పరిస్థితి అటువంటిది. ఇంతలో పిల్లలు లేచి అమ్మ ఆకలేస్తుంది అంటూ ఏడుపు మొదలుపెట్టారు. పిల్లలు ఆకలి అని అడగకుండానే ఇంట్లో అన్నీ వండి పెట్టే సుమతికి వాళ్ళని చూస్తే దుఃఖం ఆగలేదు.
ఇంతలో సుమతి ఆంటీ అంటూ ఎవరో పిలవడంతో తలుపు తీసింది సుమతి .నమస్తే అండి పక్కనున్న కామేశ్వరరావు గారి పిల్లలo మా అమ్మగారు మీకు ఇచ్చి రమ్మన్నారంటూ ఒక ఫ్లాస్కు క్యారేజీ చేతిలో పెట్టాడు. ఇందులో ఇడ్లీ కాఫీ పట్టుకొచ్చాను ఆంటీ అంటూ చెప్పారు.
"ఎందుకమ్మా అని మొహమాటపడుతూ మీకు పాల ప్యాకెట్లు వచ్చాయా అని అడిగింది సుమతి. లేదు ఆంటీ మా నాన్నగారు నిన్న టీవీలో భారీ వర్షాలు అని చెప్పిన తర్వాత పాల ప్యాకెట్లు కూరలు స్వీట్లు హాట్లు బిస్కట్లు ఇంట్లో తెచ్చి పెట్టేరు. ఆయనకి వర్షం అంటే భయం. ఎప్పుడు వర్షాకాలం ఇంతే . అని ఆ పిల్లలు చెప్పిన మాటలకు రామారావు కి చంప మీద చెళ్ళున కొట్టినట్లు అయింది. మధ్యాహ్నం లంచ్ కూడా పట్టుకొచ్చి ఇస్తాను. దాని గురించి వర్రీ అవ్వద్దు అంటూ చెప్పి ఆ యువకులు వెళ్లిపోయారు.ఇంత వర్షం లో కూడా పట్టుకొచ్చి ఇచ్చారు చాలా థాంక్స్ అమ్మ అంటూ యువకులనీ పంపించి తలుపు వేసి అందరికీ టిఫిన్ పెట్టి కాఫీలు ఇచ్చింది సుమతి.
ఒక్కసారిగా పిల్లల వైపు చూశాడు రామారావు. పిల్లలు ఏమీ మాట్లాడకుండా ప్లేట్ లో ఉన్న ఇడ్లీ పొదుపుగా తినడం ప్రారంభించారు. కోరుకున్నది క్షణాల్లో ఇచ్చేస్తే దాని విలువ తెలియదు ఎవరికీ. అడిగినప్పుడల్లా ఖరీదైన హోటలుకి తీసుకువెళ్లి అడిగినవన్నీ ఆర్డర్ ఇచ్చి తెప్పించి పెడితే కొంచెం రుచి చూసి వదిలేసి బాగోలేదని ప్లేటు దూరంగా జరిపి ఇంకో వంటకం ఆర్డర్ చేసే ఈ పిల్లలేనా అని అనిపించింది రామారావుకి.
నిజానికి ఇలా ఎంత ఆహారం వేస్ట్ చేశారో ఈ పిల్లలు. వీళ్ళు వేస్ట్ చేసిన ఆహారంతో కనీసం ఇద్దరికి ఆకలి తీరుతుంది.వాళ్లకి ఆకలి విలువ ఇప్పటికి తెలిసింది. ఒక రెండు గంటలసేపు బ్రేక్ ఫాస్ట్ లేకపోతే విలవిల లాడిపోయారు ఈ పిల్లలు. ఇది కూడా ఉండకపోను. ఆ పక్కింటి వాళ్ళు దయ తలచకపోతే. ఎప్పుడు పక్కింటి వాళ్ళని నవ్వుతూ పలకరించలేదు. పక్కింటి వాళ్లు పేరంటానికి పిలిస్తే సుమతి వెళ్ళలేదు. కేవలం మానవత్వంతో వాళ్లు సహాయం చేశారు అని అనుకున్నాడు రామారావు. ఇంతలో ఎవరో పుణ్యాత్ములు మంచినీళ్ల బాటిళ్లు బిస్కెట్ ప్యాకెట్లు పులిహార పొట్లాలు పడవలో వేసి అందరికీ పంచుతూ కనబడ్డారు. ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్ని రోజులు ఇలా ఉంటుందో అనుకొని రామారావు మెట్లు దిగి అందరిలాగే పడవ దగ్గరికి వెళ్లి తెచ్చుకున్నాడు.
అలా నాలుగు రోజులు కానీ పరిస్థితి సద్దుమణగ లేదు. పాపం కామేశ్వర రావు గారు పిల్లలు చేత క్యారేజీ పంపించడంతో ఆ గండం నుండి బ్రతికి బయటపడ్డారు రామారావు కుటుంబం.
ప్రతి మనిషికి డబ్బు అవసరమే. డబ్బుంటే అన్ని పనులు సాధించవచ్చునని అనుకోవడం శుద్ధ పొరపాటు. ఇలాంటి ప్రకృతి ప్రకోపాలు వచ్చినప్పుడు జేబులో ఎంత డబ్బు ఉన్నా ఏమి ఉపయోగం ఉండదు. ప్రకృతి ముందు మనిషి ఎప్పుడూ బలహీనుడే. తలవంచవలసిందే.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి