టెలిగ్రామ్



సుమారు 50 ఏళ్ళు ఉంటాయేమో ఒక పాత కళ్ళజోడు పెట్టుకుని పళ్ళు ఎత్తుగా ఉండి వదులుగా ఉన్న బట్టలు తొడుక్కుని ఒక పాత సైకిల్ మీద చెమటలు కక్కుతూ ఒక సంచి సైకిల్ కి తగిలించుకుని వచ్చే ఆ మనిషిని చూస్తే అందరికీ భయo వేసేది ఆ ఊర్లో. దూరం నుంచి చూసి మన ఇంటికి కాదు కదా అని భయపడేవారు. అందరికీ ఆ మనిషిని చూసేటప్పటికి ఒంట్లో ఒక రకమైన వణుకు వచ్చేది. దానికి తోడు ఆయన ఆకారం కూడా అలాగే ఉండేది. ఆ మనిషిని చూడగానే పాత అనుభవాలన్నీ గుర్తు చేసుకుని బాధపడేవారు.

ఇంతకీ ఎవరు ఆ పెద్దమనిషి సుమారు 5 కిలోమీటర్ల దూరం నుంచి ఆ ఊరికి అప్పట్లో టెలిగ్రామ్ పట్టుకొచ్చే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఆయన పేరు ఇస్మాయిల్. ఒక వార్త తొందరగా చేరవేయాలి అంటే టెలిగ్రాములు పంపించేవారు ఆ రోజుల్లో. 

ఏదైనా సరే ఆ మనిషిని చూడగానే అందరికీ చెడుతలంపులే వచ్చేవి. దూరాన్ని ఉన్న తమ బంధువులు ఎలా ఉన్నారో అని భయం పట్టుకునేది. ఎవరి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో అని చింతపడేవారు. వీళ్ళ భయంగాని మంచి వార్త కూడా ఉండొచ్చు కదా.

అప్పుడు బంధుప్రీతి ఎక్కువగా ఉండేది. ఇంట్లో జరిగే మంచి విషయమైనా చెడు విషయమైనా బంధువులందరికీ తొందరగా తెలియజేసేవారు. కనీసం ఆఖరి చూపు అయినా అయినవాళ్లకు దక్కుతుందని వాళ్ళు ఉద్దేశ్యం .

అలా ఆయాస పడుతూ సైకిల్ తొక్కుకుంటూ రామారావు గారి ఇంటి ముందు సైకిల్ ఆపి టెలిగ్రామ్ అండి అంటూ గట్టిగా అరిచాడు ఇస్మాయిల్. 

"అమ్మాయి సీత టెలిగ్రామ్ వచ్చింది అంటూ కంగారుపడుతూ వీధి అరుగు మీద కూర్చున్న రామారావు గారి తల్లి కామేశ్వరమ్మ గట్టిగా అరిచింది.

" ఎక్కడినుంచి వచ్చిందండి టెలిగ్రామ్ అంటూ కుర్చీలోంచి లేచి మెట్లు దిగారు రామారావు తండ్రి అచ్యుతరామయ్య . ఇద్దరు ముసలి వాళ్ళ కళ్ళల్లో ఏడుపు ఒకటే తరువాయి. "ఆయన ఇంట్లో లేరు పొలం వెళ్లారు అంటూ హాల్లోంచి వీధిలోకి వచ్చింది రామారావు భార్య సీతాదేవి. ఆయన లేకపోతే ఏంటి మీరు సంతకం పెట్టుకుని తీసుకోండి అటు పెన్ను చేతికి అందించాడు ఆ టెలిగ్రామ్ మెసెంజర్ సీతాదేవికి . ఏదో వానాకాలం చదువు నేర్చుకున్న సీతాదేవి తెలుగులో సంతకం చేసి టెలిగ్రామ్ పట్టుకుని భర్త కోసం ఎదురు చూడ సాగింది.

 ఎవరి చేతనో చదివిస్తే తప్పు చదువుతారేమో ఏ వార్త వినవలసి వస్తుందో అసలే ఊరగాయల కాలం ఊరగాయలన్నీ ఎండబెట్టాం . సంవత్సరానికి ఒకసారి తెచ్చుకుని పప్పులు కూడా ఎండలో ఉన్నాయి. ఏదైనా వినకూడని వార్త వింటే ఇవన్నీ మైల పడిపోతాయి. ఈ పది రోజులు ముసలి వాళ్ళ తోటి పిల్లలతోటి ఎలాగా ? సామాన్లన్నీ ముట్టుకుంటే అవన్నీ పనికిరావు ఏమిటో ఈ టెలిగ్రాములు అనుకుని ఆలోచిస్తూ పక్కింటికి టెలిగ్రామ్ పట్టుకెళ్ళడం మానేసింది. ఈలోగా టెలిగ్రామ్ వచ్చిందని పక్కింటి వాళ్ళు చూసి ఏమైందమ్మా అంటూ వీధిలోకి వచ్చారు. ఏమోనండి విషయం తెలియలేదు.

మా ఆయన ఇప్పుడే కాకినాడ కోర్ట్ నుంచి వచ్చిపొలం వెళ్లారు అంటూ చెప్పింది సీతమ్మ. కావాలంటే మా అబ్బాయి చదువుతాడు అంటూ పక్కింటి ఆవిడ పదేపదే చంపుతుంటే వద్దులెండి ఎవరి చేతనైనా చదివిస్తే ఆయన తిడతారు. ఆయనకు వచ్చినవి మేము ముట్టుకోము అంటూ మాట దాటేసింది.

రామారావు పేరు మోసిన వకీలు. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని కోర్టులు తిరుగుతుంటాడు. సొంత ఊర్లోనే కుటుంబాన్ని ఉంచి సొంత వ్యవసాయం చేసుకుంటూ కాకినాడలో ఆఫీస్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. 

రామారావు గారి భార్య సీతమ్మకి మనసు మనసులో లేదు . దూర ప్రదేశాల్లో ఉన్న తమ చుట్టాలు అందరూ ఎవరు ఎలా ఉన్నారో అని కంగారు పడసాగింది. 
మంచం మీద ఉన్న తండ్రి ఒక్కసారిగా గుర్తొచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుంది సీతమ్మ. పొలం వెళ్ళిన రామారావు ఎప్పుడు వస్తారో ఈ వేళలో ఏ ఊరు బయలుదేరి వెళ్లా లో ఈ ముసలి వాళ్ళని ఏం చేయాలి అనుకుంటూ తనలో తాను మధన పడసాగింది. 

 రామారావు తల్లిదండ్రులు విషయం ఏమిటో అర్థం కాక అయోమయంగా అలా కుర్చీలో కూలబడిపోయారు. సీతమ్మ పిల్లల్ని ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా వీధి అరుగు మీద పెట్టుకుని కూర్చుంది. పిల్లలు ఆకలి అని ఒకటే గోల . ఏం చేయాలో అర్థం కాలేదు సీతమ్మ కి. 

ఇంతలో పొలం నుంచి వస్తూ రామారావు గారు కనపడ్డారు. వీధిలోకి రాగానే కుటుంబ సభ్యులంతా వీధిలో కూర్చున్నారు ఏమిటని కంగారు పడిపోయారు. ఎప్పుడు అలా కూర్చోరు. సీతమ్మ రామారావు గారు సరాసరి ఇంట్లోకి వెళ్లిపోతారేమో అని కంగారుగా ఇంట్లోకి వెళ్ళకండి అంటూ చెప్పి టెలిగ్రామ్ చేతిలో పెట్టింది. ఏమైంది అంటూ ఆందోళనగా అడిగారు రామారావు
"
 ఏమోనండి మీ పేరు మీద వచ్చింది కదా మేము చదివించలేదు. భయపడి అంటూ చెప్పేసరికి రామారావుకి ఒళ్లంతా చెమటలు పట్టింది. మంచినీళ్లు తాగుదామంటే టెలిగ్రామ్ లో ఉన్న పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు. అందుకే ధైర్యం చేసి ఒక్కసారి టెలిగ్రామ్ లోని విషయం చదివే డు. 
రామారావు గారు మొహంలో నవ్వొచ్చింది. విషయo ఏంటండీ అని అడిగింది సీతమ్మ. ఏమిట్రా రాము విషయం తొందరగా చెప్పు అంటూ తల్లిదండ్రులు ఆందోళనగా అడిగారు. కంగారు ఏమీ లేదు. 

రేపు కోర్టు వాయిదాకి నేను ఏలూరు వెళ్ళాలి. కానీ అది వాయిదా పడిందిట మన కోర్టు గుమస్తా టెలిగ్రామ్ ఇచ్చాడు. అంతకంటే ఏమీ లేదు.అయినా గాని టెలిగ్రామ్ గురించి అంత కంగారు పడిపోతే ఎలాగ ? అందులోని విషయం చెడ్డది అని ఊహించుకుంటే ఎలాగా! మీ కంగారు పాడుగాను. మీరు భయపడితే మటుకు అందులోని విషయం మారిపోదు కదా. పక్కింటి అబ్బాయి చేత చదివించుకో వచ్చు కదా అంటూ చివాట్లు పెట్టాడు.

ఆ తర్వాత ఎన్నో టెలిగ్రాములు వచ్చిన సీతమ్మ అంత కంగారు పడలేదు. వెంటనే ఎవరు ఉంటే వాళ్ళ చేత చదివించుకోవడం అలవాటు చేసుకున్నారు.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు. 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట