మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు
మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు
సృష్టిలో తీయనైనది స్నేహం అంటారు. కానీ నా దృష్టిలో అత్యంత మధురమైనది అమ్మతనం. ఈ భూ ప్రపంచంలో
అమ్మ జన్మకు మించిన జన్మ లేదు. అమ్మకు సరిసాటి ఏదీ లేదు. మానవ జన్మలోనే కాదు పశుపక్షాదులలో కూడా అమ్మ జన్మ అమృత తుల్యమైనది. ప్రతి స్త్రీకి మాతృత్వం తోనే పరిపూర్ణత సిద్ధిస్తుంది.
సహజ సిద్ధంగానే స్త్రీ సహనశీలి. దయామయురాలు. అందుకే
బిడ్డలు కనే అధికారం ఆమెకి ఇచ్చాడు దేవుడు. అన్నం పెట్టే అన్నపూర్ణ అంటారు
నవమాసాలు కడుపులో దాచుకుని నరకం తాను అనుభవిస్తూ
జన్మనిచ్చిన బిడ్డకు అమృతమిస్తూ మలమూత్రాలను రాత్రి పగలు తేడా లేకుండా శుభ్రం చేస్తూ బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతూ మాట నేర్పి అక్షరాలు నేర్పి బతుకు నేర్పి బిడ్డ ఎదుగుదలకు తోడ్పడేది అమ్మ.
అందుకే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అమ్మ గురించి చెబుతూ నవ మాసాలు కడుపులోనూ మూడేళ్ల వయసు వరకు ఒడిలోనూ తాను బ్రతికున్నంత కాలము బిడ్డను గుండెల్లోనే ఉంచుకునేది అమ్మ అంటారు.
గుడిలో ఉండే దేవుడు తన బదులుగా అమ్మని మన ఇంటిలో ఉంచాడంటాడు ఒక మహాకవి. అందుకే మాతృదేవోభవ అని చెప్పింది వేదం
అమ్మ గురించి ఇంతకన్నా నిర్వచనం ఏం కావాలి.
ఆకాశంలో సుదూర తీరాలకు ఎగిరి వెళ్లి ఆహారం సంపాదించి
గూటిలోని బిడ్డలకు రెక్కలు వచ్చే వరకు పెంచి పోషించే
ఆ తల్లి రుణం ఎవరి తీర్చగలరు.
బిడ్డ పొదుగు కుమ్ముతున్న ప్రేమగా నాకుతూ తన రక్తాన్ని క్షీరధారలుగా మార్చి మరొక మాతృమూర్తిని ప్రపంచానికి అందించే గోమాత రుణం ఎవరు తీర్చగలరు.
అందుకే మాతృ ఋణo తీర్చుకోలేనిది . తీర్చలేనిది. రుణం తీర్చుకోవడం అంటే బ్రతికున్నంత కాలం బాధ పెట్టకుండా ఉండడమే. గుడులు గోపరాలు కట్టక్కర్లేదు. మంచిగా మాట్లాడితే చాలు. మనిషిగా చూస్తే చాలు. ప్రేమ ఆప్యాయత అభిమానం చూపిస్తే చాలు అమ్మ పొంగిపోతుంది.
ఆధునిక కాలంలో అమ్మ గుండెల్లో ఎన్నో సమస్యలు. ఎన్నో బాధలు. పరదేశంలో బిడ్డలు పల్లెటూర్లో అమ్మ . ఎవరికి వారే యమునా తీరే.
నాన్న ఉన్నంతకాలం అమ్మకి బెంగ లేదు. ధీమాగా ఉంటుంది.
నాన్న ప్రపంచం నుండి వెళ్లిపోయిన తర్వాత అమ్మను బాధ్యతగా ఎవరు చూస్తారు అనే ప్రశ్న నాన్న బతికినంత కాలం నాన్న మనసులో వేధిస్తుంది. బాధ్యత అనేది ఒకరు చెప్పేది కాదు
ఆస్తిపాస్తులు లాగా పంచి ఇవ్వడానికి. అమ్మలాంటి త్యాగబుద్ధి
బిడ్డలకు వస్తే అమ్మ బతుకు బాగుంటుంది. లేకపోతే అమ్మ పరిస్థితి ఏమిటి?
అనాధ శరణాలయాల వైపు పరుగులు తీస్తుంది. అమ్మ చేసిన త్యాగానికి ఈ పరిస్థితి ఏమిటి.
ఇందులో బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు. ఈ ప్రశ్న ఎవరికి వారే వేసుకుంటే సమాధానం వారి ప్రశ్నలోనే దొరుకుతుంది.
చాగంటి వారు ఒకసారి వృద్ధుల ఆలయానికి వెళ్ళినప్పుడు కలిగిన అనుభవం గురించి విన్నప్పుడు కన్నీరు వరదలై ప్రవహిస్తుంది. ఒక కొడుకు తన తల్లికి ఏమి చెప్పకుండా అనాధ శరణాలయంలో వదిలి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు ఆ తల్లి బ్యాగ్ పట్టుకుని కొడుకు గురించి వీధిలోఎదురు చూస్తూ ఉంటుంది. ఇటువంటి సంఘటన ఏ తల్లికి జరగకూడదు. సమాజం సిగ్గుపడే సంఘటన .చిన్నప్పుడు అబద్దాలు చెప్తే చెంప చెళ్లుమనిపించే తల్లి పెరిగి పెద్దవాడైన పిల్లవాడికి బుద్ధి ఎలా చెప్పగలదు. ఎవరికి వారే నేర్చుకోవాలి. పెద్దలు పిల్ల వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. లేకపోతే ఇదే పరిస్థితి మనకు కూడా వస్తుంది. అమ్మకి ఎప్పుడూ కష్టాలే లేనా. బిడ్డ ఎదిగే వరకు ఒక కష్టం. ఎదిగిన తర్వాత చెప్పుకోలేని కష్టం. ఈ కష్టాలన్నీ తీరిపోయేటప్పటికి జన్మ అయిపోతుంది. అందరి కడుపు నింపి గిన్నె లో మిగిలిన ఆఖరి ముద్దతో కడుపు నింపుకునే తల్లి ఎప్పుడూ అలాగే జీవిస్తోంది. గుండెల్లో కష్టం ఎవరికీ చెప్పకుండా
గుట్టుగా సంసారం లాగించే అమ్మ జన్మ ఎంత పవిత్రమైనది.
ఈ ప్రపంచంలో సహనం నేర్చుకోవాల్సింది తల్లి దగ్గర నుండే.
సహనం ఉంటే ఎంత కష్టమైనా దూరం పారిపోతుంది.
అమ్మ కూడా స్వార్థం నేర్చుకుంటే ప్రపంచంలో త్యాగం అనే మాట ఉండదు. సమాజం అధోగతి పాలవుతుంది. వెర్రి తలలు వేస్తుంది.
అమ్మ నిత్య పూజనీయురాలు. మాతృ దినోత్సవo ఆర్భాటంగా
చేస్తే చాలదు. నిత్యం అమ్మ బాగోగులు కడుపున పుట్టిన బిడ్డలు
చూడవలసిందే. ఏ న్యాయస్థానానికి వెళ్లిన ఇదే అంతిమ తీర్పు.
అమ్మను అమ్మగా చూడవలసిందే. ఇది సభ్య సమాజం నేర్చుకోవాల్సిన విషయం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
అక్షర సత్యం .
రిప్లయితొలగించండి