పావురం కోసం ప్రాణ త్యాగం



ప్రతిరోజు మనం దానధర్మాలు అనే పదజాలాన్నిచాలా సార్లు వింటూ ఉంటాం. ఈ రెండు వేరువేరు పదాలైనప్పటికీ మన జీవితాలతో అవి పరస్పరంగా కలిసిపోయాయి. దానం అంటే మన దగ్గరున్న దానిని అవసరమైన వారికి ఇవ్వడం. ఈ దానం అనేది ధన రూపంలో గానీ వస్తు రూపంలో కానీ వస్త్ర రూపంలో గాని చెయ్యవచ్చు . ధర్మం అంటే మంచి పనులు చేయడం. మన ధర్మాన్ని పాటించడం. ధర్మం అంటే మన పాత్రను నిస్వార్ధంగా, న్యాయంగా పోషించడం అని అర్థం

భారతదేశంలో అనేకమంది దానగుణం కలిగిన వాళ్లు అన్నారు. కానీ ఇప్పటికీ ఎప్పటికీ మనం చెప్పుకునే వాళ్ళు ఒకరు కుంతీదేవి కుమారుడైన కర్ణుడు, రెండవది శిబి చక్రవర్తి. 

అయితే శిబి చక్రవర్తి గొప్ప దాత. దయాగుణం గల చక్రవర్తి. అతను ఒకసారి యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞానికి అనేకమంది చక్రవర్తులు మహారాజులు మహర్షులు అతిథులుగా వస్తారు. శిబి చక్రవర్తి వారందరినీ భారీ ఎత్తున సత్కరిస్తాడు. పెద్ద ఎత్తున దానాలు చేస్తాడు. అతని త్యాగనిరతిని ఎంతోమంది కొనియాడుతారు. ఈ విషయం ఇంద్రుడు వద్దకు వెళుతుంది. 

యజ్ఞశాలలో కూర్చున్న శిబి చక్రవర్తి తొడ మీద ఒక పావురం వచ్చి వాలి "మహారాజా నన్ను ఒక డేగ తరుముకుంటూ వస్తున్నది. కాబట్టి దాని నుండి నన్ను కాపాడవలసింది అని ప్రార్థిస్తుంది. 

దయాగుణంగల శిబి చక్రవర్తి ఆ పావురానికి తప్పకుండా ప్రాణాలు కాపాడుతానని హామీ ఇస్తాడు. శిబి చక్రవర్తి ఇచ్చిన హామీతో పావురం మనసుకు పడుతుంది. ఇంతలో డేగ పావురాన్ని వెతుక్కుంటూ వచ్చి శిబి చక్రవర్తి తో ఇలా అంటుంది. " మహారాజా ఈ పావురం నాకు ఆహారం. దీని వెతుక్కుంటూ వచ్చాను. దయచేసి దీనిని వదిలిపెట్టండి అని మానవ భాషలో చెప్పింది. 

అప్పుడు మహారాజు ఈ పావురానికి నేను ప్రాణం కాపాడతానని హామీ ఇచ్చాను. ఆడిన మాట తప్పడం మా వంశంలో లేదు. కానీ దీనికి బదులుగా వేరే ఆహారం గురించి అడుగు తప్పకుండా నేను ఇస్తాను అన్నాడు శిబి చక్రవర్తి. అప్పుడు డేగ లేదు మహారాజా పావురాలను డేగ వేటాడడం సహజం. నా నోటి దగ్గరకు వచ్చిన ఆహారాన్ని పాడుచేయడం ఇది రాజధర్మం కాదు . అయినా వేరే ఆహారం ఏది అడిగినా ఇస్తారా అని అడిగింది డేగ. తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చాడు శిబి చక్రవర్తి. 

   అయితే పావురం బరువుతో సమానమైన మాంసపు ముక్క నీ శరీరం నుంచి కోసి ఇవ్వు అని అడిగింది డేగ. వెంటనే శిబి చక్రవర్తి తన తొడలోంచి మాంసపు ముక్క కోసి ఒక త్రాసులో వేస్తాడు. అది పావురం బరువుకు సరిపోలేదు. మరొక ముక్క కోసి వేస్తాడు. అయినప్పటికీ పరిస్థితి మామూలే. ఇలా చాలాసార్లు ప్రయత్నించి చివరికి తానే త్రాసులో కూర్చుంటాడు.
తనకు తానే దానంగా సమర్పించుకుంటాడు. 
 శిబి చక్రవర్తి శరీరం నుండి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఘోర దృశ్యాన్ని సభలో ఉన్న వాళ్ళు చూడలేక పోతారు. శిబి చక్రవర్తి దాన గుణానికి సంకల్ప బలానికి ఆశ్చర్యపోతారు.

ఇంతలో ఇంద్రుడు, అగ్నిదేవుడు ప్రత్యక్షమై నీ దాన గుణాన్ని పరీక్షించడానికి మేము ఈ అవతారాలు ఎత్తాము. నీ దాన గుణం నిరూపమానమైనది. నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు.

"శిబి చక్రవర్తి కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది – మన మాట మీద నిలవడం, ధర్మాన్ని త్యాగంతో పాటించటం అనేవి నిజమైన నాయకత్వ లక్షణాలు. ఈ రోజుల్లో మనం ఇదే త్యాగశీలత, అదే దయాగుణాన్ని అలవరచుకోవాలని ఈ పురాణగాథ మనల్ని ప్రేరేపిస్తుంది."

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట