లక్ష పెన్నులతో పూజ
లక్ష పెన్నుల తో పూజ.
సాధారణంగా దేవుళ్ళని, దేవతలనినిత్యం పువ్వులతో ధూప దీప నైవేద్యాలతో పూజిస్తుంటారు. అది ప్రతి దేవాలయంలోనూ జరిగేదే. తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయితే నడిచి ఏడుకొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. తలనీలాలు సమర్పిస్తామని అనుకుంటారు. అయితే తమ కోరికలు తీరితే కొబ్బరికాయలు మ్రొక్కు తీర్చుకుంటామని ఈ స్వామిని వేడుకుంటారు . ఇది ప్రధానమైన మ్రొక్కు ఈ దేవాలయంలో.
ఇంతకీ ఆ స్వామి ఎవరు? అంటే కోనసీమ జిల్లా అయినవిల్లి గ్రామంలో ఉండే శ్రీ సిద్ధి వినాయక స్వామి. అయినవిల్లి గ్రామం కాకినాడకి 72 కిలోమీటర్ల దూరంలో అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇది అతి పురాతన దేవాలయం. ఈ దేవాలయంలో స్వామి దక్షిణాభిముఖుడై కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు.
ప్రతిరోజు జరిగే సాధారణ అర్చనలతోపాటు లక్ష్మీ గణపతి హోమం ,పర్వదినాలలో ప్రత్యేక పూజలు, జరుగుతుంటాయి. ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.
దానికి తోడు ఈ కోనసీమలో చుట్టూ అందమైన గోదావరి ,పచ్చటి చెట్లు ,పిల్ల కాలువలు, కొబ్బరి తోటలు చూడడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నదానంలో ప్రతిరోజు కొబ్బరికాయతో చేసే పచ్చడి ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది.
అయితే ఇక్కడ స్వామికి ఇంకొక ప్రత్యేకమైన పూజ కూడా జరుగుతుంది. అదేమిటంటే ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పంచమి రోజు అంటే వసంత పంచమి రోజు ఆరోజు సరస్వతీ దేవి పుట్టినరోజు కూడా ఆరోజున స్వామివారికి లక్ష పెన్నులతో పూజ జరుగుతుంది. ఇది అపురూపమైన పూజ. ఈ పెన్నులను పరీక్షలకు రాసే విద్యార్థులకు పంచి పెట్టడం జరుగుతుంది. ఇటువంటి పూజ ఎక్కడ చూడలేదు .
నా ఈ బ్లాగు ద్వారా కేవలము నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రముఖ దేవాలయాలు గురించి తెలియజేస్తూ ఉంటాను. సందేహాలు ఉంటే అడగవచ్చు. నేను తగిన సమాచారం కూడా మీకు అందజేస్తాను.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి