కబ్జా
కబ్జా
" చూడ్డానికి చాలా విశాలంగా ఉంది. మూడు బెడ్ రూములు హాలు, కిచెన్ ,డైనింగ్ హాలు ,రెండు బాల్కనీలు, రెండు బాత్రూములు మనకి శుభ్రంగా సరిపోతుంది. మనం ఆ బిల్డర్ తో మాట్లాడి ఏదో విధంగా తీసుకుందాం. మంచి గాలి వేస్తోంది. మంజీరా వాటర్ వస్తుందిట. మార్కెట్ కూడా చాలా దగ్గర. పైగా ఆ ఏరియా కు దగ్గర్లో మెట్రో స్టేషన్ కూడా వస్తుంది ట. బిల్డర్ కూడా చాలా మంచి వాడ నీ పైన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ఈరోజు మార్కెట్ రేట్లు ని బట్టి ఆ రేటు ఏమి ఎక్కువ కాదు. మొదటి అంతస్తు అయితే మనకి లిఫ్ట్ పని చేయకపోయినా ప్రాబ్లం లేదు అంటూ చెప్పిన భార్య శాంత మాటలుకి ఆలోచనలో పడ్డాడు రామారావు.
రామారావు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటాడు.చాలా రోజుల నుంచి అద్దె ఇంట్లో ఉంటూ పిల్లలతో సరిపోక ఇబ్బంది పడుతుంటాడు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తుంటే భయం. వాళ్లకు పడుకోవడానికి ఇల్లు సరిపోదు. దానికి తోడు ప్రతి ఏటా అద్దె పెంచడంతో ఎన్నో ఇళ్ళు మారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి ఆ నగరంలో. ఇప్పటివరకు రామారావు ఆ నగరంలో ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాడు. కొన్ని ధర ఎక్కువగా ఉండి కొన లేకపోతే, మరికొన్ని ఆ ప్రదేశం నచ్చక ,ఇంటి ప్లాను నచ్చక ,వాస్తు సరిపోక ఇలా ఏదో వంకతో ఇల్లు కొనలేకపోయాడు. ఈసారి చూసిన ఈ ఫ్లాట్ అన్ని రకాలుగాను బాగుంది.
ముఖ్యంగా ఇల్లు కొనేటప్పుడు భార్యలకు అన్ని రకాలుగా నచ్చాలి. అప్పుడే రంగంలోకి దిగాలి. లేదంటే వాళ్లు సంతృప్తిగా లేకపోతే రోజు మనకు నరకమే. సరే ఎలాగైనా ఆ బిల్డర్ తో మాట్లాడాలని నిర్ణయించుకుని ఒక మంచి రోజు చూసుకుని భార్యతో సహా అపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు రామారావు.అపార్ట్మెంటు సెల్లార్లోనే బిల్డర్ ఆఫీస్ ఉంది. ఆ బిల్డర్ పేరు ముకుందరావు. ఆ బిల్డర్ ఇంజనీరింగ్ చదువుకుని తర్వాత బోల్డు డిగ్రీలు తెచ్చుకుని ఆ సిటీలో చాలాచోట్ల అపార్ట్మెంట్లు చాలా మంచి అనుభవం ఉన్న వ్యక్తి.ముందు హాల్ విజిటర్స్ రూమ్ తర్వాత ఆఫీస్ రూమ్ ఆ తర్వాత బిల్డర్ రూము. చూడ్డానికి ఆఫీసు చాలా బాగుంది. ఆఫీసులోకి అడుగుపెట్టిన తర్వాత "ముకుంద రావు గారి కోసం వచ్చామండి అంటూ అక్కడున్న రిసెప్షనిస్ట్ కి చెప్పగానే ఇంటర్ కమ్ లో మాట్లాడి లోపలికి వెళ్ళండి అంటూ చెప్పింది రిసెప్షనిస్ట్.
లోపలికి వెళ్ళగానే ముకుందరావు కుర్చీలోంచి లేచి సాదరంగా ఆహ్వానించాడు.
ఆ తర్వాత వచ్చిన విషయం మేము చెప్పగానే డెస్క్ లోంచి ఒక ఫైల్ తీసి మా ముందు పెట్టి చెప్పడం ప్రారంభించాడు. తనకి నిర్మాణ రంగంలో పది సంవత్సరాల అనుభవం ఉందని, నగరంలో ఎన్నో చోట్ల ప్రాజెక్టులు చేశానని, వాటి ఫోటోలు చూపిస్తూ ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ లన్ని పక్కా వాస్తు ప్రకారం కట్టామని స్థలాన్ని కూడా వాస్తు చూసి కొంటానని ఈ స్థలం అమ్మిన వాళ్లు కూడా తనకి ప్రాణ స్నేహితులు అని కాబట్టి ఆ స్థలం గురించి దిగులు పడవలసిన అవసరం లేదని చెప్పాడు.
పైగా ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ ఉంటుందని కింద ఆఫీసు రూమ్ కూడా అన్ని ఫ్లాట్లు అమ్మేసిన తర్వాత ఫ్లాట్ ఓనర్స్ కి వదిలేస్తానని బ్యాంకు లోన్ కూడా తానే ఇప్పిస్తానని కేవలం సంతకాలు చేయడానికి వస్తే సరిపోతుంది అడ్వాన్స్ గా ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుందని తర్వాత రెండు నెలలలో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు ముకుందరావు. అపార్ట్మెంట్ కు సంబంధించిన డాక్యుమెంట్ల జిరాక్స్లు బిల్డింగ్ ప్లాన్ మున్సిపల్ అప్రూవల్ అన్ని ఇచ్చి మీరు కూడా లాయర్ కు చూపించుకోండి అని చెప్పాడు ముకుందరావు. పైగా బ్యాంకు లోను కి కావాల్సిన కాగితాలు లిస్ట్ కూడా ఇచ్చాడు.
రామారావు దంపతులకు ముకుందరావు మాటల్లో ఎంతో నిజాయితీ కనిపించింది. పైగా బ్యాంకు లోను ఇప్పిస్తానంటున్నాడు. అని తనే చూసుకుంటాను అంటున్నాడు. మనం తిరగవలసిన పనిలేదు. అన్ని రకాలుగాను ఈ ప్రాజెక్టు బావుంది అనుకుంటూ మంచి రోజు చూసుకుని అడ్వాన్స్ ఇస్తామండి అని చెప్పి బయటపడ్డారు రామారావు దంపతులు.
ఒక శుభముహూర్తాలు అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రామారావు దంపతులు. ఒకరోజు ఆఫీసులో అందరూ లంచ్ చేస్తుండగా ఈ సంతోషకరమైన వార్తని స్నేహితులు అందరితోటి పంచుకున్నాడు రామారావు. బిల్డర్ ఎవరు? అని అడిగాడు రామారావు ప్రాణ స్నేహితుడు రాజేష్.
ఆయన పేరు ముకుందరావు అని సమాధానం ఇచ్చాడు రామారావు. ముకుంద రావు గారా! చాలా మంచి బిల్డర్ మా అపార్ట్మెంట్ కూడా ఆయనే కట్టాడు. అనుకున్న టైం కి రిజిస్ట్రేషన్ చేస్తాడు. కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. చాలా అనుభవం ఉంది అంటూ చెప్పడంతో రామారావు ఉప్పొంగిపోయాడు.
అలా ఒక నెల గడిచింది. బ్యాంకు లోన్ కు సంబంధించిన పనులన్నీ ముకుంద రావు గారు చూసుకుంటూ ఉండగా ఒకటి రెండు సార్లు మాత్రమే బ్యాంకుకు వెళ్లి వచ్చాడు రామారావు. ఒక రోజున బ్యాంకు లోను శాంక్షన్ అయింది అని చెప్పి ఫోన్ వచ్చింది ముకుందరావు దగ్గర నుంచి. ఆ తర్వాత అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఫ్లాట్ ని అప్పగించాడు ముకుందరావు. రామారావు దంపతులుగా ఆనందానికి హద్దు లేదు. ఇన్నాళ్ళకి తమ కల నిజం అవుతున్నందుకు ఆనందపడిపోయారు రామారావు దంపతులు.
ఒక శుభముహూర్తoల్లో బంధువులందరినీ పిలుచుకుని గృహప్రవేశం భారీ ఎత్తున చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టి ఆనందంగా సొంత ఇంట్లోకి మారిపోయారు. ఏదైనా వస్తువు నాది అనుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అందులో సొంత ఇంట్లో ఉన్న మజాయే వేరు.అదే అద్దె ఇంట్లో అయితే భయం భయం గా కాలం గడపవలసి వస్తుంది. కొద్ది రోజులకి ఇద్దరు పిల్లలకి చదువులు అయిపోయి ఉద్యోగాలు రావడం పెళ్లిళ్లు అయిపోవడం అన్ని జరిగిపోయేయి.
బ్యాంకు లోన్ వాయిదాలు కట్టడం రామారావుకి కొంచెం కష్టమైనా సొంతిల్లు అనే ఆనందంలో ఆ బరువును మర్చిపోయాడు. ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకునే వాడు. ఈ ఇల్లు నా కష్టార్జితం అని మురిసిపోయేవాడు. ఈ ఇల్లు అన్ని విధాల బాగుంది. రేపు రిటైర్ అయిన ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు. ఇక్కడే కాలక్షేపం చేయచ్చని అనుకునేవాడు రామారావు.
అలా పది సంవత్సరాలు గడిచేయి. ఒక రోజు ఉదయం అపార్ట్మెంట్ బయట ఏదో గొడవ అవుతుంటే ఉంటే మెలుకు వచ్చింది రామారావుకి. ఏమిటా అని కిటికీలోంచి తొంగి చూసాడు. ఎదురుగుండా రెండు బుల్డోజర్లు ,టోపీలు పెట్టుకుని ఎవరో ఆఫీసర్లు అనుకుంటా అపార్ట్మెంట్ ఓనర్స్ కమిటీ ప్రెసిడెంట్ గారి తో గొడవ పడుతున్నారు. పక్కనే వాచ్ మెన్ నిలబడి ఉన్నాడు.
" ఏం జరుగుతోందని చెప్పి వెంటనే కిందకి దిగి వెళ్లి చూసేటప్పటికి ఈ అపార్ట్మెంట్ కట్టిన స్థలంలో ఒకప్పుడు చెరువు ఉండేదని అది గవర్నమెంట్ వారిదని ఆ చెరువు మట్టితో కప్పి ఈ అపార్ట్మెంట్ కట్టారని ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ పడగొట్టమని గవర్నమెంట్ వారి ఉత్తర్వులని వచ్చినవాళ్లు చెప్పగానే రామారావుకి కాళ్ళ కింద ఉన్న భూమి కదులుతున్నట్లు అనిపించింది. "అదేమిటి మరి పర్మిషన్ ఎలా ఇచ్చారు అని అడుగుతున్నారు ప్రెసెంట్ గా రు.
"పర్మిషన్ ఎవరు ఇచ్చారండి అంటూ గట్టిగా అరిచారు అధికారులు. మా దగ్గర కాగితాలు ఉన్నాయండి అని అన్నారు ప్రెసిడెంట్ గారు. కాగితాలు ఉన్న మాట వాస్తవమే ఆ క్రింది సంతకాలు అసలైన అధికారివి కాదు అంటూ చెప్తున్న అధికారుల మాటలకి కళ్ళు తిరిగిపోయాయి రామారావుకి.
రామారావు వెంటనే తేరుకుని బిల్డర్ ముకుందరావుకి ఫోన్ చేశాడు. ముకుందరావు ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు ఎవరిని అడగాలి? రామారావుకి ఏం చేయాలో తోచలేదు. ఒక్కసారి బ్యాంకు కట్టవలసిన లోను గుర్తుకొచ్చింది. ఆ ఫ్లాట్ తో పెంచుకున్న అనుబంధం గుర్తుకొచ్చింది. ఎన్నో మధురానుభూతులు మిగిల్చిన ఆ ఇల్లు ఇప్పుడు ఇలా అనుకుంటూ మదనపడిపోసాగాడు. కాసేపటికి ఒళ్లంతా చెమటలు పట్టే యి. ఇన్ని లక్షలు అప్పుచేసి కొన్న ఫ్లాటు మట్టి పాలు అవుతోందంటే ఎవరికి బాధగా ఉండదు. ఈ ప్రదేశంలో చెరువు ఉందని ఎలా తెలుస్తుంది ?చెరువు మీద అపార్ట్మెంట్ కట్టారని ఎలా తెలుస్తుంది?
ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన అధికారిక పత్రం మీద అధికారి సంతకం నిజమైందా కాదా అని తనిఖీ చేసుకోవాల్సిన అవసరం నిజంగా ఉందా! ఇలాంటి నగరంలో ఏది అసలు ఏది నకిలీ ఎలా తెలుస్తుంది?
ఆ మహానగరంలో గవర్నమెంట్ భూమి ఎక్కడుంది ?చెరువు ఎక్కడ ఉంది? అనే విషయం సామాన్యుడికి ఎలా తెలుస్తుంది. ఎవరో చేసిన మోసానికి మనం బలైపోయాం అనుకుంటూ ఏడుస్తూ రామారావు కుప్ప కూలిపోయాడు. ఆ మహా మాయ నగరంలో రామారావు లాంటి వాళ్లు ఎందరో.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి